2011లోనే పాక్ పై సర్జికల్ దాడులు
ఇరు వైపులా 13 మంది మృతి
న్యూఢిల్లీ: 2011లోనే సర్జికల్ దాడులు జరిగాయా? అవునంటున్నాయి తాజాగా వెలుగుచూసిన నిజాలు. ఈ దాడుల్లో పాక్కు భారత్ ధీటుగా బదులిచ్చిందంటూ ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక ఆదివారం తన కథనంలో పేర్కొంది. భారత ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించిందని, ఇందులో 8 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారంటూ అధికారిక ఆధారాలు, వీడియో, ఫొటోల్ని సైతం బహిర్గతం చేసింది. అత్యంత హింసాత్మకంగా భారత్, పాక్ల మధ్య పరస్పర దాడులు జరిగాయని... ఇరువైపులా మొత్తం 13 మరణించారంటూ వెల్లడించింది.
ఆ పత్రిక కథనం ప్రకా రం... ‘జూలై 30, 2011న కుప్వారా జిల్లా గుగల్దార్ పోస్టుపై పాక్ సైనికులు విరుచుకుపడ్డారు. ఐదుగురు భారతీయ సైనికులను దారుణంగా హత్యచేసి వారి తలలు నరికివేశారు. తమ వెంట హవిల్దార్ దేవేందర్ సింగ్, జైపాల్ సింగ్ల తలలు తీసుకెళ్లారు. మరో సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో భారత్ ఆగస్టు 30, 2011న ‘ఆపరేషన్ జింజర్’ పేరిట సర్జికల్ దాడులతో పాక్ భూభాగంపై విరుచుపడింది. 8 మంది పాక్ సైనికుల్ని చంపి, ముగ్గురి తలల్ని భారత సైనికులు వెంట తీసుకొచ్చారు’ అంటూ పేర్కొంది. కుప్వారాలోని 28వ విభాగం ముఖ్య నిర్వహణ అధికారి ఈ సర్జికల్ దాడికి ప్రణాళిక రచించారు.