breaking news
Hemraj
-
తల్వార్ దంపతుల ఆదాయం రోజుకు 40
ఘజియాబాద్: జంట హత్యల కేసులో జైలుపాలైన దంతవైద్య దంపతులు రాజేశ్, నూపుర్ తల్వార్లు డాస్నా కారాగారంలో రోజుకు రూ. 40 సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని సదరు కారాగారానికి చెందిన ఓ అధికారి గురువారం వెల్లడించారు. వాస్తవానికి కారాగారం పాలు కాకముందు వీరిరువురి ఆదాయం రోజుకు రూ. 4,000 పైమాటే. ఇదిలా ఉండగా ఇద్దరి బ్యారక్లు ఒకదాని పక్కన మరొకటి ఉన్నప్పటికీ ప్రతిరోజూ కలుసుకోలేకపోతున్నారు. వారానికి ఓ రోజు నలభై నిమిషాల పాటు కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరిరువురినీ 11, 13 నంబర్ బ్యారక్లలో ఉంచిన సంగతి విదితమే. రాజేశ్ తల్వార్ 9,342 నంబరు ఖైదీ కాగా నూపుర్కు 9,343 నంబరును కేటాయించారు. ఈ విషయమై డాస్నా కారాగార సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్శర్మ మాట్లాడు తూ కారాగారం ఆవరణలోని ఉద్యానవనంలో 40 నిమిషాలు మాట్లాడుకునేందుకు వారిద్దరికీ అవకాశమిచ్చామన్నారు. వారికి కారాగార నియమనిబంధనల ప్రకారం దుస్తులు ఇచ్చామన్నారు. కాగా కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో దోషులుగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించడంతో డీలాపడిపోయిన రాజేశ్, నూపుర్ తల్వార్లు ఆ రోజు కారాగారంలో భోజనం చేసేందుకు నిరాకరించారు. ఆ మరుసటి రోజు న్యాయస్థానం జీవితఖైదు శిక్ష విధించినప్పటికీ శాంతించారు. కాగా వీరివురిలో రాజేశ్ దంత వైద్యుడిగా పనిచేస్తూ కారాగారంలో దంతపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఆయనకు రోజుకు రూ. 40 చెల్లిస్తారు. ఇక నూపుర్కు ఖైదీల పిల్లలను చదివించే బాధ్యతలను అప్పగించారు. -
సంచలనాల కేసు
న్యూఢిల్లీ:తరచూ వివాదాస్పదంగా మారడం, దర్యాప్తులో వైఫల్యం, మీడియా జోక్యం తదితర అంశాల కారణంగా ఆరుషి, హేమ్రాజ్ హత్యోదంతం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ సోమవారం ప్రకటించిన తీర్పులో తల్లిదండ్రులే దోషులని ప్రకటించారు. వీరికి మంగళవారం శిక్ష ఖరారు చేస్తామని పేర్కొనడంతో పోలీసులు తల్వార్లను ఘజియాబాద్లోని దస్నా జైలుకు తరలించారు. తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి, నౌకరు హేమ్రాజ్ను (45) ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని సీబీఐ బలంగా వాదించింది. 2008, మే 16న ఈ హత్యలు జరగడం తెలిసిందే. కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం, నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు వాదించారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు మొదటి నుంచి పేర్కొన్నారు. అయితే వీళ్లు నేరం చేసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామన్న సీబీఐ వాదనతో ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. ఐదేళ్ల క్రితం.. 2008 మే 16 తెల్లవారుజామున ఆరుషి మృతదేహం వారి పడక గదిలోనే కనిపించింది. ఇంటి నౌకరు హేమ్రాజ్ కనిపించకపోవడంతో అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరునాడు హేమ్రాజ్ మృతదేహం డాబాపై కనిపించడం కేసు కీలక మలుపు తిరిగింది. అతని గొంతుపై కత్తిగాట్లు, తలపై బలమైన గాయం ఉంది. దీంతో పోలీసులు రాజేశ్ తల్వార్ను అరెస్టు చేశారు. ఇది పరువుహత్యగా భావిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పోలీసులపై దర్యాప్తుపై తీవ్ర విమర్శలు రావడంతో, అప్పటి ముఖ్యమంత్రి మాయావతి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీబీఐ మొదట రాజేశ్ను అరెస్టు చేసింది. తదనంతరం అతని ఉద్యోగితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. దర్యాప్తులో ఎటువంటి బలమైన సాక్ష్యాలూ లభించకపోవడంతో అందరూ బెయిల్పై విడుదలయ్యారు. పేలవమైన దర్యాప్తు, పలువురు జర్నలిస్టులను ఆ ఇంట్లోకి అనుమతించడంతో ఘటనాస్థలంలోని ఆధారాలు మాయమయ్యాయి. దీంతో అప్పటి సీబీఐ డెరైక్టర్ అశ్వనీకుమార్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. తల్వార్ దంపతులే హత్యలకు కారకులని ఈ బృందం స్పష్టం చేసింది. హత్య జరిగిన 19 నెలల తరువాత అంటే ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. ఆరుషి తల్లిదండ్రులే దోషులని నిరూపించడానికి సీబీఐ 90 మంది సాక్షులను ప్రవేశపెట్టింది. ఊహాజనిత కారణాలతోనే సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చిందని తల్వార్ దంపతులు మొదటి నుంచి వాదించారు. కోర్టు వద్ద భారీ భద్రత సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్ కోర్టు వద్ద సోమవారం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను కూడా కోర్టు గదిలోకి అనుమతించలేదు. పోరాటం కొనసాగిస్తాం: సీబీఐ కోర్టు తీర్పు వినగానే తల్వార్ దంపతులు కోర్టు గదిలోనే విలపించారు. తాము అమాయకులమని, న్యాయపోరాటం కొనసాగిస్తామని కాసేపటికి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నూపుర్ తల్వార్ సోదరి వందన కూడా ఇదే మాట చెప్పారు. సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టమని కోర్టు బయట విలేకరులకు స్పష్టం చేశారు. అబద్ధాలన్నింటినీ అల్లి సీబీఐ వాదనలను వినిపించిందని ఆరోపించారు. సీబీఐ న్యాయవాది ఆర్కే సైనీ స్పందిస్తూ ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగానే కోర్టు తల్వార్లను దోషులగా తేల్చిందన్నారు. తల్వార్ల న్యాయవాది రెబెక్కా మాట్లాడుతూ పైకోర్టులో తమకు తప్పక న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పడేం జరిగింది 2008, మే 16: ఆరుషి ఇంట్లోనే ఆమె మృతదేహం కనిపించింది. గొంతు కోసి ఆమెను చంపినట్టు తేలింది. నౌకరు హేమ్రాజే హంతకుడని భావించారు. మే 17: తల్వార్ భవంతి డాబాపై హేమ్రాజ్ మృతదేహం కూడా కనిపించింది. మే 18: శస్త్రచికిత్సలకు వినియోగించే కత్తులతో హత్యలు చేశారని పోలీసుల ప్రకటన. ఇంట్లోని వారిపైనే అనుమానాలున్నాయని వెల్లడి. మే 23: ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు మే 31: కేసు దర్యాప్తు సీబీఐ చేతికి జూన్ 13: తల్వార్ల కాంపౌడర్లు కృష్ణ, రాజేశ్ను సీబీఐ అరెస్టు చేసింది. తల్వార్ల పొరుగింట్లో పనిచేసే విజయ్ మండల్ను కూడా మరో పది రోజుల తరువాత అరెస్టు చేశారు. జూలై 12: సాక్ష్యాల లేమి కారణంగా ఘజియాబాద్ కోర్టు రాజేశ్కు బెయిల్ ఇచ్చింది. జనవరి 5: తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని కోర్టును సీబీఐ కోరింది. డిసెంబర్ 29: కోర్టుకు కేసు ముగింపు నివేదిక సమర్పణ. తగిన సాక్ష్యాధారాలు లేనప్పటికీ రాజేశే ప్రధాన నిందితుడని ప్రకటన 2011, జనవరి 25: ఘజియాబాద్ కోర్టు పరిసరాల్లో రాజేశ్పై దాడి జరిగింది. ఫిబ్రవరి 9: సీబీఐ ముగింపు నివేదికను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు తల్వార్ దంపతులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు కూడా తల్వార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2012, మార్చి 14: రాజేశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ వాదనలు వినిపించింది. ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు మే 3: నూపుర్ బెయిల్ను సెషన్స్కోర్టు తిరస్కరించింది మే 25: నిందితులపై ఘజియాబాద్ కోర్టు హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్ర అభియోగాలు నమోదు చేసింది. సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూపుర్కు బెయిల్ 2013, ఏప్రిల్: తల్వార్లే ఆరుషి, హేమ్రాజ్ను చంపారని సీబీఐ వాదించింది. హత్యకు ముందు ఆరుషి, హేమ్రాజ్ ‘అభ్యంతరకర స్థితి’ కనిపించారని కోర్టుకు తెలిపింది. మే 3: సీబీఐ మాజీ జేడీ అరుణ్కుమార్ సహా 14 సాక్షుల హాజరు కోసం సమన్లు జారీ చేయాలన్న డిఫెన్స్ న్యాయవాది విజ్ఞప్తిని సీబీఐ వ్యతిరేకించింది. మే 6: డిఫెన్స్ న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తల్వార్ దంపతుల వాంగ్మూలాల నమోదుకు ఆదేశించింది. అక్టోబర్ 18: సీబీఐ తన వాదనలను ముగించింది. తల్వార్లు తమను తప్పుదోవ పట్టించారని కూడా తెలిపింది. నవంబర్ 12: న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్ దోషులేనని న్యాయమూర్తి ప్రకటన. శిక్షను మంగళవారం ఖరారు చేస్తామని వెల్లడి. -
ఆరుషి హత్య కేసు తీర్పు రేపే
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు నిందితులు కావడం, దర్యాప్తులో వైఫల్యం, మీడియా జోక్యం తదితర అంశాల కారణంగా ఆరుషి, హేమ్రాజ్ హత్యోదంతం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సీబీఐ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించనుంది. తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి, నౌకరు హేమ్రాజ్ను (45) ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని సీబీఐ బలంగా వాదించింది. 2008, మే 16న ఈ హత్యలు జరగడం తెలిసిందే. కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం, నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్ ఇటీవల చెప్పాడు.తల్వార్ దంపతులు నేరం చూసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామని వివరించారు. వీరికి వ్యతిరేకంగా తగినన్ని ప్రాసంగిక సాక్ష్యాలున్నాయని, దర్యాప్తును పక్కదోవ పట్టించారని కూడా ప్రాసిక్యూటర్ ఆర్కే సైనీ వాదించారు. ఏం జరిగిందంటే.. 2008 మే 16 తెల్లవారుజామున ఆరుషి మృతదేహం వారి పడక గదిలోనే కనిపించింది. ఇంటి నౌకరు హేమ్రాజ్ కనిపించకపోవడంతో అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరునాడు హేమ్రాజ్ మృతదేహం డాబాపై కనిపించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అతని గొంతుపై కత్తిగాట్లు, తలపై బలమైన గాయం ఉంది. దీంతో పోలీసులు తల్వార్ దంపతులు, హేమ్రాజ్ స్నేహితులు ఇద్దరిని అరెస్టు చేశారు. దర్యాప్తులో ఎటువంటి బలమైన సాక్ష్యాలూ లభించకపోవడంతో అందరూ బెయిల్పై విడుదలయ్యారు. పేలవమైన దర్యాప్తు, పలువురు జర్నలిస్టులను ఆ ఇంట్లోకి అనుమతించడంతో ఘటనాస్థలంలోని ఆధారాలు మాయమయ్యాయి. చివరికి చేసేదేమీ లేక 2010లో ఈ కేసు మూసేశారు. హంతకులెవరో తమకు తెలియాలని, ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయించాలని తల్వార్లు కోర్టును ఆశ్రయించారు. రెండో దర్యాప్తులోనూ వీరే నిందితులుగా తేలారు. రెండు హత్యలు జరిగిన రాత్రి తామిద్దరం నిద్రపోయామని, తెల్లవారే ఈ ఘటన గురించి తెలిసిందన్న తల్వార్ల వాదన నమ్మశక్యంగా లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. శస్త్రచికిత్సలకు వాడే కత్తులతోనే హత్యలు జరిగాయని తెలిపింది. తల్వార్లు డాక్టర్లు కాబట్టి వారే ఈ హత్యలు చేసి ఉంటారని స్పష్టం చేసింది. తల్వార్ న్యాయవాది మాత్రం సీబీఐ వాదనతో ఏకీభవించడం లేదు. ‘ఇద్దరు మరణించాక మిగిలింది భార్యాభర్తలు కాబట్టి వారే నిందితులను వాదించడం సరికాదు. బయటివ్యక్తి పాత్రను సీబీఐ తిరస్కరిస్తోంది. ఇది పసలేని దర్యాప్తు’ అని డిఫెన్స్ న్యాయవాది రెబెక్కా జాన్ అన్నారు.