breaking news
heavy work
-
తహసీల్దార్ .. పనితో బేజార్
‘‘మీ సేవ కేంద్రాల నుంచి ఒక్క ధరణి పోర్టల్కు సంబంధించినవే వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తహసీల్దార్లు అంటున్నారు..’’ ‘‘ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించాల్సిన భూ సమస్యలు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ విచారించాల్సి రావడంతో ఆయా కేసులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చే పనిని కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు.. తహసీల్దార్లకే అప్పజెబుతున్నారు..’’ ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు బాధ్యత కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, వ్యాక్సిన్పై అవగాహన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రొటోకాల్ విధులు సాక్షి, హైదరాబాద్: ఒక్కటి కాదు, రెండు కాదు.. అనేక బాధ్యతలతో రాష్ట్రంలోని తహసీల్దార్లు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకదానిపై మరొకటిగా మీద పడుతున్న పనులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధ్యతలన్నీ సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని బాధ్యతలూ రెవెన్యూ సిబ్బందిపైనే పెట్టడంతో అన్నింటినీ సమన్వయపర్చుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రికార్డులు తనిఖీ చేసి, స్వయం అధీకృత (అటెస్టెడ్) కాపీలు తయారు చేసేందుకే ఉన్న సమయం సరిపోతోందని తహసీల్దార్లు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, కోవిడ్ బాధ్యతలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రకృతి వనాల భూసేకరణ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ప్రొటోకాల్ విధులు...ఇలా లెక్కకు మిక్కిలి పనులు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, ఆయా పనులకు తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారానికి తోడు ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లే చేయాల్సి వస్తోంది. తహసీల్దార్ విధులు నిర్వహిస్తూనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని, తమకుండే సాధారణ పని బాధ్యతలకు తోడు వీటిని సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోందనేది తహసీల్దార్ల వాదన. ఇంకా ఎన్నో... అదనంగా ప్రభుత్వం కొత్తగా మరిన్ని బాధ్యతలను తహసీల్దార్లకు అప్పజెప్పింది. ముఖ్యంగా కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఎంపిక, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్ నిర్ధారణ కేంద్రాల వద్ద జన సమ్మర్ధ నియంత్రణ బాధ్యతలను కూడా రెవెన్యూకే ఇవ్వడంతో తహసీల్దార్లు ఆయా మండలాల్లోని వీఆర్ఏలు, వీఆర్వోలతో ఈ పనులు చేయిస్తూ పర్యవేక్షించాల్సి వస్తోంది. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లు పేరుకే పౌరసరఫరాల శాఖ ద్వారా చేస్తున్నా అన్ని పనులూ రెవెన్యూ సిబ్బందే చూసుకోవాల్సి వస్తోందని, ఈ పనిని కూడా జిల్లా కలెక్టర్లు తమకే అప్పగించారని తహసీల్దార్లు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక, మద్దతు ధర అందేలా చూడడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడడం, ప్యాడీ క్లీనర్లు, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన పనులు కూడా తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. దీనికి తోడు పల్లె ప్రకృతి వనాలకు భూసేకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రొటోకాల్ విధులు వారే చేయాల్సి వస్తోంది. ఇక ధరణి ద్వారా మరిన్ని ఆప్షన్లు ఇస్తే దరఖాస్తులు ఇంకా పెరుగుతాయని, అప్పుడు ఈ రికార్డులు తయారు చేసుకోవడం తప్ప ఎలాంటి పనులూ చేయలేమని అంటున్నారు. పని భారంతో తప్పులు జరుగుతాయేమోననే ఆందోళన ఎక్కువ అవుతోందని, ముఖ్యంగా భూముల విషయంలో పొరపాట్లు జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా ఆలోచించి ధరణి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కొన్ని బాధ్యతల నుంచి తమను తప్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు. పేరుకే కలెక్టర్లు.. చేసేదంతా తహసీల్దార్లే... ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లను జిల్లాల కలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారం. ఈ పోర్టల్ ద్వారా 11 రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గత వారం రోజులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్లో తప్పులు, ఆధార్ అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పు, ఫోటో తప్పులు, లింగ నమోదులో తప్పులు, కులం తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూమి స్వభావ రికార్డు సరిచేయడం, భూ వర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల సమస్యల పరిష్కారానికి భూ యజమానులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్లకు వస్తాయి. కానీ, వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్లకు లేదు. కేవలం వీటిని తనిఖీ చేసి రిపోర్టు ఇస్తే జిల్లా కలెక్టర్లే నేరుగా ఆన్లైన్లో సరిచేస్తారు. అయితే కలెక్టర్లు కూడా పని ఒత్తిడితో భారమంతా తమపై వేసి చేతులు దులుపుకుంటున్నారని, తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం మీ సేవ నుంచి దరఖాస్తు వస్తే ఆ దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సిటిజన్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకుని, రికార్డులను పరిశీలించి, జిరాక్సులు తీసి, ప్రతి దానికి ఫార్మాట్ రూపంలో సమాధానమిస్తూ వాటిని మళ్లీ తామే అటెస్ట్ చేస్తూ ఆర్డీవోలకు ఆఫ్లైన్లో సమర్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్డీవోలు కూడా పరిశీలించి, ప్రతి సమస్యకూ ఓ ప్రొసీడింగ్ ఇచ్చి కౌంటర్ సంతకం పెట్టి వాటిని కలెక్టరేట్లో సమర్పిస్తేనే ధరణి సమస్యలను కలెక్టర్లు ఆన్లైన్లో పరిష్కరిస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు ఓకే చేసిన దరఖాస్తులు తిరిగి తమ వద్దకు వస్తే వాటికి పూర్తి బాధ్యత వహిస్తూ తహసీల్దార్లే సంతకాలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోడం లేదంటున్నారు. ఇక, ప్రభుత్వ భూముల నిర్ధారణ కోసం అయితే 1954 కంటే ముందు నుంచి రికార్డులన్నింటినీ (పహాణీలు) పరిశీలించాల్సి వస్తోందని, కలెక్టర్లు మాత్రం అన్ని బాధ్యతలూ తమపై వేసి త్వరగా పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి రాష్ట్రంలోని తహసీల్దార్లకు ఇప్పుడు 24 గంటల సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క తహసీల్దార్ ఇన్ని పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యల భారమంతా మాపై వేసి కలెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయగలం. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వంగా రవీందర్రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
చాకిరి చేయలేం!
– స్వాస్త్య విద్యావాహిని పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పని –తమ వల్ల కాదని హెల్త్ సూపర్వైజర్లు ఆవేదన కర్నూలు(హాస్పిటల్): స్వాస్త్య విద్యావాహిని పేరుతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు తమతో చాకిరి చేయించుకుంటున్నారని, అది తమకు పెనుభారమైందని పలువురు హెల్త్ సూపర్వైజర్లు తీవ్రంగా మండిపడ్డారు. స్వాస్త్య విద్యావాహిని కార్యక్రమంపై సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే పలువురు హెల్త్ సూపర్వైజర్లు కార్యక్రమం నిర్వహణపై మండిపడ్డారు. ఉదయం 7 గంటలకు విధులకు వచ్చి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లాల్సి వస్తోందన్నారు. కళాశాల విద్యార్థులను తామే దగ్గరుండి ఎంపిక చేసిన గ్రామాలకు తీసుకెళ్తున్నామన్నారు. దీనికితోడు తాము పనిచేసే పీహెచ్సీ గాకుండా ఇతర పీహెచ్సీలకు విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పీహెచ్సీల పరిధిలో సర్పంచులు తమకు సహకరించడం లేదన్నారు. తాము వెళ్లే విషయం స్థానిక పంచాయతీ కార్యదర్శులకు సమాచారాన్ని అధికారులు ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఏ పీహెచ్సీ సూపర్వైజర్లను ఆ ప్రాథమికహెల్త్సెంటర్ పరిధిలోనే స్వాస్త్య విద్యావాహిని కార్యక్రమం నిర్వహణకు పంపించాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని పీఓడీటీ, ప్రోగ్రామ్ ఇన్చార్జి డాక్టర్ సరస్వతీదేవి చెప్పారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్ఓ (ఎయిడ్స్ అండ్ లెప్రసీ) డాక్టర్ రూపశ్రీ, ఎంపీహెచ్ఈఓలు, ఎంపీహెచ్ఎస్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, పీహెచ్ఎన్లు పాల్గొన్నారు. -
నేడు ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనలు
పిఠాపురం టౌన్ : ఉపాధ్యాయులపై పని ఒత్తిడి, రికార్డు వర్క్ భారం తగ్గించాలని కోరుతూ బుధవారం నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్టు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కె.వరప్రసాద్, జిల్లా కార్యదర్శులు అప్పలనాయుడు, కేవీ రమణమూర్తి, పి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రదర్శనల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పిఠాపురం, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం విద్యా డివిజన్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు ఆ¯Œæలైన్ పరీక్షను టీఎన్ఐటీని ఉపసంహరించుకోవాలని, సీసీఈ రికార్డ్ వర్క్ భారం తగ్గించాలని, ప్రాజెక్టు వర్కులు, ప్రయోగాల విషయంలో క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, ఆన్లైన్ వర్క్ భారాన్ని ఉపాధ్యాయులపై మోపరాదని, ప్రతి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ లాబ్, ఫ్యాకల్టీనివ్వాలని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, పర్యవేక్షణాధికారులకు సమాంతరంగా ఏర్పాటు చేస్తున్న మానిటరింగ్ టీమ్స్ను రద్దు చేయాలని, పదో తరగతి సిలబస్ను ముందుగానే పూర్తి చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. -
తీవ్ర ఒత్తిడిలో పోలీస్
నిరంతర పనితో ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, ప్రవర్తనపై దుష్ర్పభావం పోలీసులకు 8 గంటల షిఫ్ట్ విధానం తప్పనిసరి చేయాలి కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి పోలీసుల పనితీరుపై ‘ఆస్కి’ అధ్యయన నివేదిక సిఫారసులు సాక్షి, హైదరాబాద్: అందరికీ భద్రత కల్పించే పోలీసు తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నాడు. సెలవులు, షిఫ్టులు ఎరగని విధులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. పోలీసుల కాఠిన్యం, కరకుదనం, దుష్ర్పవర్తనలు వంటి వాటికి నిరంతర పని ఒత్తిడే ప్రధాన కారణమని ప్రఖ్యాత పరిపాలన శిక్షణ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తీవ్ర పని ఒత్తిడితో పోలీసులు ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సైతం కోల్పోతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 23 రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 12,156 మంది పోలీసులను ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. పోలీసులు ఒక్కొక్కసారి ఏకంగా 24 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని.. సెలవును సైతం దాసోహం చేసి డ్యూటీకి హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని నివేదిక తేల్చింది. డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అత్యవసర పరిస్థితి ఎదురవతుండటంతో దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తిరిగి పిలిపించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇలా ఎక్కువ గంటలపాటు పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని.. పని ఒత్తిడి చీకాకుల్లో సామాన్యులపై నోరు పారేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలో పోలీసులు రోజురోజుకూ సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని వెల్లడించింది. షిఫ్ట్ పద్ధతి పెడితే మేలు పోలీసులో మార్పు తీసుకొచ్చేందుకు షిఫ్ట్ పద్ధతి పెడితే ఎలా ఉంటుందన్న దానిపై ఆస్కి చర్చించింది. ఇప్పటికే కేరళలో అమల్లో ఉన్న ఎనిమిది గంటల డ్యూటీ వ్యవస్థ విజయవంతమైనట్లుగా వెల్లడైంది. మధ్యప్రదేశ్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పోలీసు స్టేషన్లకు వెళ్లి చేసిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేటతెల్లమైందని తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.