breaking news
handy caped
-
దివ్యాంగులపై టీడీపీ సర్కార్ చిన్నచూపు
సాక్షి, గుంటూరు: దివ్యాంగుల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించింది. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చి వారిని నిలువునా దగా చేశారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ సర్కార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.3 వేల పింఛన్లు, రెండు చేతులు లేని వారికి నెలకు రూ.10 వేలు అంటూ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని దివ్యాంగులు, ఆ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం చివరి బడ్జెట్లోనూ తమపై కరుణ చూపలేదని ఆవేదన చెందుతున్నారు. పత్తా లేని డిజేబుల్డ్ హోమ్లు 80 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు 2500 మోటారు, బ్యాటరీ వాహనాలు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించి రెండేళ్లయినా పట్టించుకోలేదు. దీంతో గతేడాది దివ్యాంగుల దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటిస్తామని దివ్యాంగుల జేఏసీ నాయకులు హెచ్చరించడంతో గత డిసెంబర్ 3న ప్రకటించిన విధంగా 2500 వాహనాలు కాకుండా అరకొర పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో డిజేబుల్డ్ హోమ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఒక్కటి కూడా నిర్మించలేదు. వారంలోగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని గాలికొదిలేశారు. దివ్యాంగులు.. సర్టిఫికెట్ల కోసం మీసేవా కార్యాలయాలు, సదరం క్యాంప్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇటీవల రెండు చేతులు లేని వారికి నెలకు రూ.10 వేలు ఇస్తామని సీఎం చెప్పడంతో ఈ మాటలు నమ్మి పింఛన్ కోసం వెళ్లినవారికి కేవలం రూ.3 వేలు, మరికొంతమందికి రూ.4,500 మాత్రమే ఇచ్చారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని కూడా నెరవేర్చలేదని దివ్యాంగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. దివ్యాంగుల అవస్థలు పట్టించుకోవడం లేదు వైకల్య శాతంతో సంబంధం లేకుండా పింఛన్ను మంజూరు చేయాలి. పర్సంటేజీల పేరుతో పింఛన్లో కోత పెట్టడం సమంజసం కాదు. వారంలోగా సదరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి దివ్యాంగులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. – గుణశేఖర్, దివ్యాంగ జేఏసీ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు రూ. 4,500లే ఇచ్చారు చంద్రబాబు రెండు చేతులు లేని వారికి ఫిబ్రవరిలో రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా పింఛన్ తీసుకోవడానికి వెళ్తే రూ.4,500 మాత్రమే ఇచ్చారు. – నాగేంద్ర, దివ్యాంగుడు, పశ్చిమ గోదావరి జిల్లా సీఎం, మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు ఇలా.. 2014, డిసెంబర్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు.. ►ఏటా బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తాం. ►అన్ని జిల్లాల్లో హోమ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం ►రిజర్వేషన్లు పెంచుతాం. 2015, 2016 డిసెంబర్ 3న, విజయవాడలో.. ►విజయవాడలో స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తాం. ►గుంటూరులో 2.70 కోట్లతో బ్రెయిలీ ప్రెస్ ఏర్పాటు. ►రూ.20 కోట్లు ఖర్చు చేసి బాల్యంలో అంగవైకల్యం, అనారోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ►ఏటా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ►2500 మందికి మోటారు, బ్యాటరీ వాహనాలు. ►సదరం సర్టిఫికెట్లు వారంలోగా మంజూరు. 2017, డిసెంబర్ 3న కర్నూలులో.. ►ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ►కర్నూలు జిల్లాలో రూ.6.94 కోట్లతో సెన్సార్ పార్క్ నిర్మిస్తాం. -
నడవలేని వ్యక్తిని పోలీస్స్టేషన్కు ఎలా తీసుకెళతారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ,గూడూరు: నగదు లావాదేవీలకు సంబంధించిన కేసులో నిందితుడు, నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లే యత్నం చేయడంతో అతనికి సంబంధించిన బందువులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణానికి చెందిన వినోష్ అనే యువకునికి, గూడూరు రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలు భర్త మధురెడ్డికి నగదు విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ క్రమంలో వినోష్తోపాటు అతని సోదరుడు, చిల్లకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే అఖిల్పై కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో అఖిల్ మంగళవారం ఆస్పత్రి రోడ్డులోని ఓ దుకాణం వద్ద ఉండగా ఒకటో పట్టణ పోలీసులు అతడ్ని ఎస్సై పిలుస్తున్నారని, స్టేషన్కు రావాలని కోరారు. అఖిల్ స్పందిస్తూ తనకు యాంటిసిపేటరీ బెయిల్ ఉందని, తాను స్టేషన్కు ఎందుకు రావాలని వారితో అన్నారు. దీంతో వారు ఎస్సై సుధాకర్కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని సిబ్బందితో కలిసి అఖిల్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అఖిల్ బంధువులు అడ్డుకున్నారు. అఖిల్ రోడ్డు ప్రమాదంతో నడిచే స్థితిలో కూడా లేడని, అయినా ఈ కేసు కోర్టులో ఉందని తెలిపారు. పైగా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఉందని, మీరెలా తీసుకెళతారని వాగ్వాదానికి దిగారు. ఎస్సై వినకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారే పోలీస్స్టేషన్కు వచ్చారు. అనంతరం అఖిల్ తల్లి, పిన్నమ్మ సుదర్శన, మణి మాట్లాడుతూ అధికారపార్టీ వారికి తాము రూ.17 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే రూ.12.30 లక్షలు చెల్లించి ఉన్నామని, పోతే రూ.5 లక్షలలోపే ఇవ్వాలని తెలిపారు. అయితే మరో వ్యక్తికి ఇచ్చిన మొత్తాన్ని కూడా తామే ఇవ్వాలని, లేదంటే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తామని అధికార పార్టీకి చెందినవారు కావడంతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల్ను తీసుకెళ్లేందుకు వచ్చిన ఎస్సైను అడ్డుకుంటున్న బంధువులు -
జన్మభూమిలో.. అశ్రుధార
ఈమె పేరు దాలి రమణమ్మ. ఊరు సంతకవిటి మండలం తమరాం.పుట్టుకతో అవిటితనం శాపం. కాళ్లు చేతులు సరిగా పనిచేయవు. రెండేళ్ల క్రితం వరకూ వికలాంగ పింఛను వచ్చేది. తరువాత ఆగిపోయింది. గతంలో రెండు పర్యాయాలు ఇదే జన్మభూమిలో గోడు వెళ్లబోసుకున్నా పునరుద్ధరించలేదు. సోమవారం ఊళ్లో జరిగిన జన్మభూమికి యాతన పడి చేరుకుంది. అధికారుల ముందు ఇలా కంటతడి పెడుతూ కష్టాన్ని చెప్పుకుంది. పింఛను పునరుద్ధరిస్తామని ప్రత్యేకాధికారి పి. కూర్మినాయుడు చెబుతున్నా ఈమె కంటనీరు ఆపుకోలేకపోయింది. సదరం వివరాలు సరిగ్గాలేని కారణంగా పింఛను నిలిచిపోయిందని పంచాయతీ కార్యదర్శి మౌళి సాక్షికి తెలిపారు. ఈమెకు 50 శాతం మేర వికలాంగత్వం ఉన్నట్లు వెలుగు అధికారులు తెలిపారు. నిరుపేద తండ్రే ఈమెకు తోడు. - సంతకవిటి