breaking news
gundrampally
-
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన ‘సైనిక చర్య’తో హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్లో హైదరాబాద్ కలిసిన ‘సెప్టెంబర్ 17’కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. అది 1919 ఏప్రిల్ 13. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని నిరసించిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు పెద్దఎత్తున సాగాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన బ్రిటిష్ ప్రభుత్వం బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. ఈ తరుణంలోనే పంజాబీలకు ముఖ్యమైన పండుగ వైశాఖీ సందర్భంగా ఏడెకరాల విస్తీర్ణం గల ఓ తోటలో వేల మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ సైన్యంతో అక్కడకు వచ్చిన ఓ అధికారి ప్రవేశ మార్గాలను మూసివేసి, నిరాయుధులైన జనంపై కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాలు పాటు 1,650 రౌండ్ల కాల్పుల్లో గుళ్లవర్షం కురిపించారు. వెయ్యిమంది మరణించారు. మరో రెండువేలమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ నరమేధానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ తోట పేరు జలియన్వాలా బాగ్. నిరాయధులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన ఆ నరరూప రాక్షసుడే జనరల్ డయ్యర్. పంజాబ్కి చెందిన వ్యక్తిగా జలియన్ వాలా బాగ్ ఉదంతంపై నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ భారత చరిత్రలో గుర్తింపునకు నోచుకోని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నిరంకుశ రాజ్యమైన నాటి హైదరాబాద్ సంస్థానంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పర్చుకున్న నేను నిజాం అరాచకాలూ, రజాకార్ల అకృత్యాల గురించీ తెలుసుకున్న తర్వాత విస్మయం కలిగింది. ఒకింత ఆగ్రహం, ఆవేదనా కలిగాయి. నిజాం రాజ్యంలోని ‘జలియన్ వాలా బాగ్’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్పల్లి పక్క గ్రామం లింగాపూర్ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు. దీంతో బైరాన్ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్–జమీన్–జంగల్ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు, వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్ వాలాబాగ్ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్ పటేల్ చేపట్టిన ‘పోలీస్ యాక్షన్’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. తెలంగాణలో ఈ తరహా దుర్ఘటనలు గుర్తింపునకు నోచుకోకపోవడానికి కారణం సంతుష్టీకరణ రాజకీయాలే. నిజాంను దుష్టుడిగా చూపితే మైనార్టీ వర్గాల సెంటిమెంటు దెబ్బతింటుందన్న నెపంతో ఎందరో యోధుల త్యాగాలు, పరాక్రమాలు వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ సెంటి మెంటుతో రాజకీయాలు చేసే టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు తలొగ్గి సెప్టెంబర్ 17ను అప్రధానంగా చూడడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. తరుణ్ చుగ్ (వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్) -
స్కూటర్ ఇంజిన్తో గుంటుక యంత్రం
సాక్షి, చిట్యాల : అందుబాటులోని పాత స్కూటర్ ఇంజిన్, ఇతర విడి భాగాలను సేకరించిన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాచకొండ లింగస్వామి పత్తి చేలలో గుంటుక తీసేందుకు ఉపయోగించే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రంతో లీటర్ పెట్రోల్తో ఎకరం భూమిలో గుంటుక తీసే పనులు చేస్తున్నాడు. దీంతో అతి తక్కువ ఖర్చుతో పెద్దగా శ్రమ లేకుండా పత్తి చేలలో గుంటుకలు తీయడం సులవుతుందని ఆయన పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తనకి వ్యవసాయం ఉన్నప్పటికీ సాగుబడి చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయన తన స్నేహితుడు గాదరి లింగస్వామి కోరిక మేరకు ఈ గుంటుక యంత్రాన్ని తయారు చేసినట్లు ఆయన వివరించారు. -
చికిత్స పొందుతున్న యువతి మృతి
గుండ్రాంపల్లి(చిట్యాల) : కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతిచెందింది. వివరాలు.. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు బండ గిరిజ కుటుంబం హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసముంటోంది. ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ఆమె కూతురు నందిని(21) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. నందిని డెంగీతోనే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మంగళవారం గుండ్రాంపల్లి గ్రామంలో నందిని అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. కోమటిరెడ్డి పరామర్శ... మృతిచెందిన నందిని కుటుంబసభ్యులు ఎంపీటీసీ గిరిజ, అంజయ్యలను గుండ్రాంపల్లిలో సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పరామర్శించించారు. వారు నందిని మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ మండల, గ్రామ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, నమ్ముల విజయ్, గ్రామ సర్పంచ్ రాచకొండ లావణ్య,సింగిల్విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, నాయకులు ఉన్నారు.