breaking news
group polictics
-
గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్
ఆ గులాబీ ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడ్డారా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని అనుమానిస్తున్నారా? తనవెనుక ఉన్నవారే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆందోళన చెందుతున్నారా? అత్యంత ఆత్మీయుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నా ఆ ఎమ్మెల్యే మళ్ళీ పుంజుకోగలరా? గులాబీ దళపతి ఆదరణ పొంది టిక్కెట్ సంపాదించగలుగుతారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటైన చొప్పదండి ఎమ్మెల్యేగా అధికార బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ కొనసాగుతున్నారు. ప్రజల్లో, పార్టీలో ఆయనకు ఆదరణ తగ్గిందని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాదనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. స్వయంగా ఎమ్మెల్యే రవిశంకర్కే తనకు టిక్కెట్ రాదనే అనుమానం గట్టిగా పీడిస్తోందని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఆయన ఎవరినీ కలుపుకొనిపోవడంలేదన్న భావన కొందరిలో కనిపిస్తుండగా.. చొప్పదండి బీఆర్ఎస్ నేతలు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేడర్ అభిప్రాయపడుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికపరంగా ఉపయోగపడ్డ కొందరు అగ్రవర్ణాల నేతలు ఈసారి రవిశంకర్పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. కరీంనగర్ కు చెందిన ఒక కార్పోరేటర్..బోయినపల్లి ఎంపీపీ సహా మరికొందరు నేతలు చొప్పదండి సీటుపై కన్నేసినట్లుగా ప్రచారం సాగుతోంది. గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన సర్వేల్లోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రవిశంకర్ పరిస్థితిపై సానుకూలత కనిపించడంలేదని టాక్. స్థానికంగా పార్టీలో నెలకొన్న తలనొప్పులు.. ప్రస్తుత ఎమ్మెల్యేకు పోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న నేతల తీరుతో సిట్టింగ్ తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో వచ్చే ఎన్నికలకు సంసిద్ధమవుతుంటే.. చొప్పదండి సిటింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అత్యంత ఆత్మీయ సమ్మేళనాలనూ నిర్వహిస్తున్నారట. సోషల్ మీడియాలో తగ్గేదేలే.. అందులో తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలకు ఎక్కడా గండి పడకుండా మనవాళ్లంతా ప్రయత్నించాలని కోరినట్టుగా కూడా ఇప్పుడు ఓ చర్చ ప్రచారంలోకొచ్చింది. పైగా సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ అటాక్స్ కు కూడా సిద్ధం కావాలని.. ఎక్కడా గులాబీబాస్ దృష్టిలో తక్కువ కాకుండా ఉండేలా అన్నివిధాలా తమ నడవడిక ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యవహారశైలితో అటు అధిష్టానం దృష్టిలో..ఇటు స్థానిక నేతలు, కార్యకర్తల దృష్టిలో నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న సుంకె రవిశంకర్ తిరిగి ఒడ్డుకు చేరుకోగలుగుతారా? పార్టీ అధినేతతో టిక్కట్ తనకే ఇస్తామనే పరిస్థితి క్రియేట్ చేసుకోగలుగుతారా? పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకోగలరా? ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన, ఆయన భవిష్యత్ పైనా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. చదవండి: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...! -
పొలిటికల్ కారిడార్ : నిజామాబాద్ కమలం పార్టీలో కుంపట్లు
-
కలహాల కాపురం
– వర్గవిభేదాలతో టీడీపీ సతమతం – పలు నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు.. పరస్పరం ఫిర్యాదుల వెల్లువ – ఎంపీ జేసీ, ఎమ్మెల్యే చౌదరి మధ్య తారాస్థాయికి ఆధిపత్యపోరు – పరిటాల సునీత, వరదాపురం సూరి వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు – కదిరిలో ఎమ్మెల్యే చాంద్బాషా వర్సెస్ కందికుంట – నేతల మధ్య విభేదాలతో వర్గాలుగా చీలిపోయిన పార్టీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో వర్గపోరుతో ద్వితీయశ్రేణి నేతలు రెండుగా చీలిపోయారా? పార్టీ పరిస్థితి దిగజారిపోయిందా? గాడిన పెట్టాల్సిన మంత్రులే విభేదాలతో సతమతమవుతున్నారా? ఎవరికివారు ఆర్థికంగా లబ్ధిపొందడం మినహా జిల్లా ప్రయోజనాలను గాలికొదిలేశారా? ఈ వైఖరి కూడా పార్టీకి తీవ్రనష్టం చేకూరుస్తోందా? ..తాజా పరిణామాలు బేరీజు వేస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వర్గవిభేదాలు తీవ్రంగా ఉన్నాయి. కొంతమంది నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది.ఈ ప్రభావం ఆ పార్టీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలపైనా పడింది. కొంతమంది ద్వితీయశ్రేణి నేతలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలకు సంబంధించిన కేడర్ కూడా పూర్తిగా దూరమవుతోంది. 'అనంత'లో తారాస్థాయికి.. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో 'అనంత' అసెంబ్లీ బరిలో తనయుడు పవన్ను దింపాలని భావిస్తోన్న జేసీ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ను పూర్తిగా వదిలేసి 'అనంత'పైనే దృష్టి సారించారు. ప్లాస్టిక్ రద్దు పేరుతో నగరంలో 15రోజులుగా హడావుడి చేస్తున్నారు. మరువవంక, నడిమివంకల్లో పూడికతీత పనులకు ఉపక్రమించారు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్ను పూర్తిగా పక్కనపెట్టి స్వతంత్రంగా 'అనంత'లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే కూడా ఇటు మేయర్, అటు జేసీతో విభేదించి ఓ వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇందులో భాగంగానే స్టాండింగ్ కమిటీలో మేయర్ వర్గీయులను ఓడించారు. గెలిచిన ఎమ్మెల్యే వర్గీయులు ప్రస్తుతం మేయర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని కూడా వీరు బహిష్కరించారు. మేయర్పై కూడా జేసీ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో 'అనంత'లో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కదిరిలో రచ్చ కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మధ్య వివాదం ముదిరిపాకాన పడింది. అత్తార్ రాకను జీర్ణించుకోలేని కందికుంట, ఆయన వర్గీయులు ప్రతి అంశంలోనూ చాంద్బాషాను టార్గెట్ చేస్తున్నారు. చాంద్బాషా కూడా ఽసర్దుకుని పోలేక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకోవాలనే రీతిలో కేడర్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కదిరిలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఈ విషయం జనచైతన్యయాత్రలో మరోసారి స్పష్టమైంది. ఈ యాత్రలకు కందికుంట వర్గం పూర్తిగా గైర్హాజరవుతోంది. మునిసిపాలిటీలో కౌన్సిలర్లతో పాటు, రూరల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏ ఒక్కరూ పాల్గొనడం లేదు. కేవలం చాంద్బాషా తనవద్ద ఉన్న వారితో కార్యక్రమాన్ని లాగిస్తున్నారు. దీంతో యాత్రలు వెలవెలబోతున్నాయి. వరదాపురం వర్సెస్ పరిటాల ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల వర్గీయుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు మంత్రి సునీతతో వరదాపురం సూరి విభేదించారు. ఆగస్టు 6న ధర్మవరంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వందలాది ఫ్లెక్సీలలో ఒక్కదాంట్లో కూడా సునీత ఫొటో కన్పించలేదు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. ఇటీవల ధర్మవరంలో మరోసారి ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ధర్మవరం కుడికాలువ పనుల్లో కూడా విభేదాలు తలెత్తాయి. ఈ అంశం సీఎం దృష్టికి కూడా వెళ్లింది. సూరికి ఎలాగైనా చెక్పెట్టాలనే రీతిలో పరిటాల వర్గం వ్యూహం రచిస్తోంది. వీరి మధ్య తలెత్తిన విభేదాలు ధర్మవరం, రాప్తాడు.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చూపుతున్నాయి. ఇవి ఏస్థాయికి వెళతాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై మునిసిపల్ చైర్మన్ గంగన్న అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పుట్టపర్తిలో వర్గవిభేదాలను మంత్రి పెంచిపోషిస్తూ, పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయదుర్గంలో ప్రభుత్వ చీఫ్విప్ కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డిని పూర్తిగా పక్కనపెట్టారు. ఎన్నికల్లో సహకరించినా కాలవ తనను పూర్తిగా పక్కనపెడుతున్నారని మెట్టు కూడా అసమ్మతితో ఉన్నారు. మడకశిరలో ఎమ్మెల్యే ఈరన్నను పక్కనపెట్టి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీన్ని ఈరన్న జీర్ణించుకోలేకపోతున్నారు. విభేదాల పరిస్థితి ఇలా ఉంటే మంత్రులతో పాటు చీఫ్విప్, విప్ అంతా కలిసి జిల్లా అభివృద్ధిని విస్మరించారని 'అనంత'వాసుల్లో తీవ్రస్థాయి అసంతృప్తి ఉంది. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు, హెచ్చెల్సీ నీటి వాటా విషయంలో అలసత్వం, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరు చేయించడంలో నిర్లిప్తతతో పాటు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రమూ శ్రద్ధ లేదని ప్రజలు అంటున్నారు. నేతలు ఆర్థికంగా ఎదగడం మినహా జిల్లాను పూర్తిగా విస్మరించారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇవన్నీ టీడీపీ అత్యంత బలహీనపడేందుకు కారణమయ్యాయి.