-
గ్రామజ్యోతి వెలుగులేవీ?
మసకబారుతున్న పథకం పెరుగుతున్న రాజకీయ జోక్యం పంచాయతీ పాలకవర్గాల పెత్తనం తీర్మానాలను పట్టించుకోని యంత్రాంగం కమిటీల్లో కానరాని ఉత్సాహం గ్రామ స్వరాజ్యానికి బాటలు పడని దుస్థితి జోగిపేట: ప్రజలే పాలనలో భాగస్వాములు కావాలి.. కమిటీలుగా ఏర్పడి సమావేశాలు నిర్వహించాలి.. తమ సమస్యలపై గ్రామస్థులంతా చర్చించుకుని పరిష్కారమార్గం కనుగొనాలి.. అనే ఉన్నతాశయంతో చేపట్టిన గ్రామజ్యోతి పథకం మసకబారుతోంది. పెరుగుతున్న రాజకీయ జోక్యం.. పంచాయతీల పాలకవర్గం పెత్తనం.. వెరసి కమిటీల్లో ఉత్సాహం కొరవడుతోంది. కమిటీలు రూపొందించిన తీర్మానాలను సైతం యంత్రాంగం బుట్టదాఖలు చేస్తుండటంతో పథకంపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. ‘గ్రామజ్యోతి’ ప్రారంభించి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా జిల్లాలో పథకం దుస్థితిపై కథనం.. గ్రామ పంచాయతీలు బలోపేతం చేసేందుకు, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు గ్రామ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించింది. 2015 ఆగస్టు 17న వరగంల్ జిల్లా గీసుకొండ మండలం ఆదర్శగ్రామమైన గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రాజకీయ జోక్యం.. పంచాయతీ పాలకవర్గాల పెత్తనం.. ఎమ్మెల్యేలు చెప్పిందే తుది నిర్ణయం కావడం.. అధికారపక్ష కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో గ్రామ జ్యోతి వెలుగులు పంచకముందే మసకబారిపోతోంది. కార్యక్రమాన్ని గాడిలో పెట్టాలనే సంకల్పం అధికార యంత్రాంగంలో లేకపోవడం, కమిటీలు బలోపేతం అయితే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని నేతలు భావించడంతో గ్రామజ్యోతిపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం మొదట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో మొత్తం 1,077 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామజ్యోతిలో ఒక్కో గ్రామానికి ఏడు కమిటీలను నియమించింది. గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలే ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని నిర్ణయించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, విద్య, సహజ వనరులు, మౌలిక వసతులు, మద్యపానం, సాంఘిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంశాలుగా కమిటీలు వేసి ఒక్కో కమిటీకి అధ్యక్షుడు, నలుగురు సభ్యులను నియమించింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. గ్రామజ్యోతి కమిటీల ద్వారా వచ్చే తీర్మానాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొద్దిరోజుల్లోనే ఈ కమిటీలు అలంకారప్రాయంగా మారాయి. ఎలాగూ తీర్మానాలను పట్టించుకోరనే భావనతో కమిటీలోని సభ్యులు కూడా సమావేశాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి గ్రామజ్యోతి కమిటీ అంగీకారం కావాల్సి ఉన్నా దీన్ని పట్టించుకోవడం లేదు. అసలు ఈ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే సమీక్ష కరువైంది. ఏ ప్రాంతంలో కమిటీలు బలహీనంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని తీర్మానాలు అందాయి? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్న సమాచారం అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం. శిక్షణా పూర్తి గ్రామజ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కమిటీల్లోని సభ్యులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సద్వినియోగం చేసేలా చూడడమే. కమిటీల సభ్యులకు నాలుగునెలల క్రితం గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన కలగడానికి అన్ని ప్రాంతాల్లో శిక్షణ ఏర్పాటుచేశారు. తొలుత ప్రతి మండలానికి కనీసం ఇద్దరు మాస్టర్స్ ట్రైనర్స్ను గుర్తించి వీళ్లకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. శిక్షణ పొందినవారే ఒక్కో గ్రామంలో మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ప్రయోజనం శూన్యం. కొన్ని గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కమిటీల్లో ఉన్న సభ్యులకు తాము ఏ కమిటీలో ఉన్నామన్న విషయం కూడా తెలియని పరిస్థితి. గ్రామ పంచాయతీలకు సరిపడా నిధులు విడుదలవుతన్నాయని అధికారులు చెబుతున్నా, గ్రామజ్యోతి కమిటీలు చేసే తీర్మానాలు మాత్రం అమలుకావడం లేదు. కమిటీలను బలోపేతం చేసి తీర్మానాలకు ప్రాధాన్యం ఇస్తే గ్రామాభివృద్ధిలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కమిటీ సభ్యులు కనీసం నెలకోసారి సమావేశం కావాలి. కొత్త కార్యక్రమాల నిర్వహణ, గత తీర్మానాలు ఏ మేరకు అమలు చేశామని నిరంతం పరిశీలించాలి. అటు ఉన్నతాధికారులతో, ఇటు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేస్తే గ్రామస్వరాజ్యం వెల్లివిరిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. సమావేశాలు తప్ప అమలు లేకపోవడంతో కమిటీల్లోని సభ్యుల్లో ఆసక్తి లేకుండా పోతోంది. ఎక్కడా గ్రామజ్యోతి సమావేశాలు జరగడంలేదు. గ్రామజ్యోతి కమిటీ సమావేశాలపై అధికారులెవరూ సమీక్షించడంలేదు. నిధులు లేవు కమిటీల తీర్మానాల మేరకు ప్రాధాన్యాంశాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. మొదటి సమావేశంలో చేసిన తీర్మానాల పనులే ఇప్పటివరకు పూర్తి కాలేదు. తీర్మానాలు చేయడమే తప్ప పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలేదు. కమిటీలు నామమాత్రంగానే ఉన్నాయి. - సర్పంచ్ బడ్జెట్లోనే పంచాయతీలకు నిధులు కమిటీలు తీర్మానించిన పనులకు ప్రభుత్వం కేటాయించే నిధులే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామజ్యోతి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏమీ ఉండవు. 14వ ఫైనాన్స్ నిధులు పంచాయతీలకు కేటాయించారు. సర్పంచ్లు ప్రతి నెలా గ్రామాల్లో కమిటీ సమావేశాలు నిర్వహించాలి. సమావేశాలు చాలా చోట్ల నిర్వహించడంలేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకి నిధుల కొరత లేదు. - సురేష్బాబు, జిల్లా పంచాయతీ అధికారి -
గ్రామాలు.. మురికి కూపాలు
చిన్న ముల్కనూరు గ్రామజ్యోతిలో సీఎం కేసీఆర్ * ఈ పరిస్థితికి ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు సమాన బాధ్యులు * ఇకనైనా వైరుధ్యాలు, తగాదాలను వదిలి ముందుకు సాగాలి * మంత్రులు, అధికారులు ‘గ్రామజ్యోతి’ ఆరకుండా చూడాలి * గ్రామల్లో మార్పునకే ఎర్రవెల్లి, చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నా * రెండేళ్లలో ముల్కనూరును ఆదర్శ గ్రామంగా చేస్తా * రోజంతా గ్రామంలోనే గడిపి ఊరువాడా కలియ తిరిగిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఈ పరిస్థితికి ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులంతా సమాన బాధ్యులేనన్నారు. ఇకపై వైరుధ్యాలు, తగాదాలు, పిచ్చి ఆలోచనలను వదిలేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తాను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరు గ్రామానికి సీఎం వచ్చారు. ఉదయం 11 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8 గంటల వరకు అక్కడే గడిపారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్కుమార్, కలెక్టర్ నీతూ ప్రసాద్ సహా నాయకులు, అధికార యంత్రాంగంతో కలిసి వాడవాడలా తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మధ్యాహ్నం గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సాయంత్రం గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘గత 70 ఏళ్లుగా గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి సహా ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులంతా ఇందుకు సమాన బాధ్యులే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సమగ్రాభివృద్ధికి గ్రామసభల్లో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా కార్యాచరణ చేపట్టాలి. ఈ విషయంలో వైరుధ్యాలు, తగాదాలు, పిచ్చి ఆలోచనలను వదిలేసి కలిసికట్టుగా ముందుకు సాగాలి’’ అని సూచిం చారు. గ్రామాల్లో మార్పు చూపించాలనే ఉద్దేశంతోనే తాను చిన్న ముల్కనూర్, ఎర్రవెల్లి గ్రామాలను దత్తత తీసుకున్నానని చెప్పారు. రాష్ర్టంలోని గ్రామాలన్నీ మనవేనని, ఆయా గ్రామాల్లో ‘గ్రామజ్యోతి’ ఆరిపోకుండా కొనసాగించాల్సిన బాధ్యత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులదేనని స్పష్టం చేశారు. ముఠా తగాదాలు, పెత్తనం పంచాయతీలను బంద్ చేసి గ్రామజ్యోతిని నిరంతరం వెలిగేలా చూడాలని చెప్పారు. రెండేళ్లలో ఆదర్శ గ్రామం చేస్తా రెండేళ్లలో చిన్న ముల్కనూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రపం చ దేశాలన్నీ చిన్న ముల్కనూరును సందర్శిం చేలా చేస్తానని సీఎం చెప్పారు. ‘‘వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లె ఆదర్శ గ్రామం కావడానికి అక్కడి ప్రజలు 22 ఏళ్లు కష్టపడ్డారు. 77 దేశాల ప్రతినిధులు గంగదేవిపల్లెను సందర్శించారు. ఆనాడు గంగదేవిపల్లెకు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లేదు. కానీ చిన్న ముల్కనూరుకు నాతో సహా మంత్రులు, కలెక్టర్, అధికార యంత్రాంగం అంతా ఉంది. ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పనులూ రెండేళ్లలోనే పూర్తి కావాలి. రాబోయే రెండేళ్లలోనే ముల్కనూరు మారాలి. గంగదేవిపల్లె మాదిరిగా ప్రపంచ దేశాలన్నీ చిన్న మూల్కనూరు సందర్శించాలె’’ అని అన్నారు. తిడితే రూ.50 జరిమానా వేయండి చిన్న ముల్కనూర్ ప్రజలు తిట్లు బంద్ చేసి ప్రేమాభిమానాలతో కలిసి మెలసి ఉం డాలని సీఎం కోరా రు. ఇకపై ఎవరైనా తిడితే రూ.50 జరిమానా వేయాలన్నారు. గ్రామంలో ఏ ఆధారం లేని వారిని అందరూ ఆదుకోవాలని సూచిం చారు. ఇందుకు తన వద్ద బృహత్తర ప్రణాళిక ఉందన్నారు. ఊరి ప్రజలను త్వరలోనే అంకాపూర్కు తీసుకె ళ్లాలని కలెక్టర్ నీతూప్రసాద్ను ఆదేశించారు. ఇళ్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని, జాగా లేని వారికి ప్రభుత్వమే స్థలం కొని ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు స్థలం అమ్మడానికి ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, మళ్లీ 10, 15 రోజుల్లో చిన్న ముల్కనూర్ వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానన్నారు. యుద్ధప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేపట్టి ఐదు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, పలువురు దాతలు ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు రూ.2 లక్షల విరాళం సీఎం సమక్షంలో కలెక్టర్కు అందజేశారు. మరికొందరు తమ ఇళ్ల స్థలాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందరం కలిసి జిద్దుతో పనిచేస్తే ఐదారు నెలల్లో చిన్న ముల్కనూరును స్వర్గసీమను చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. 33 ఏళ్లుగా మద్యం అమ్మకాల్లేవ్ గంగదేవిపల్లె మాజీ సర్పంచ్ రాజమౌళిని ముఖ్యమంత్రి కే సీఆర్ సోమవారం చిన్న ముల్కనూర్కు తీసుకొచ్చారు. గంగదేవిపల్లెను గ్రామస్తులంతా కలిసి ఎట్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారనే అంశంపై రాజమౌళితో మాట్లాడించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘1982 నుండి ఇప్పటి వరకు గంగదేవిపల్లెలో మద్యం తయారీ, అమ్మకాల్లేకుండా చేశాం. తొలుత మద్యం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాం. వారందరినీ ఒప్పించి మద్యం వద్దు అనేలా చేశాం. 1991లో తాగునీటి కొరత ఏర్పడితే బాలవికాస సంస్థ సహకారంతో ట్యాంక్ నిర్మించి ఇంటింటికీ నీళ్లు అందించాం. నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటిని సరఫరా చేస్తున్నాం. 2000 సంవత్సరం నాటికే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించాం. 3 నెలల్లోనే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటిని గ్రామస్తులు వినియోగించేలా చేయడానికి మాత్రం మూడేళ్లు పట్టింది. 2007లో గంగదేవిపల్లెకు రాష్ట్రపతి అవార్డు లభించింది’’ అని వివరించారు. కరీంనగర్లోనే రాత్రి బస చిన్న ముల్కనూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న సీఎం రాత్రి 8 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్ సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ముచ్చటించారు. రాత్రి ఉత్తర తెలంగాణ భవన్లోనే బస చేశారు. -
'ఊర్లో తిట్లు బంద్ కావాలె'
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరు గ్రామంలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూములిచ్చేవారు ముందుకొస్తే నాలుగునెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అతి త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. 10 రోజుల్లో నేనే వచ్చి ఇళ్ల నిర్మాణానికి కొబ్బరికాయకొడుతా అని చెప్పారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి డాక్టర్లను తీసుకు వచ్చి హెల్త్ చెకప్ చేపిస్తామన్నారు. అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని దోమలు లేని గ్రామంగా చేసుకోవాలని సూచించారు. చిన్న ముల్కనూరు గ్రామంలో ప్రతి ఇంట్లో తిట్లు బంద్ కావాలె అని అన్నారు. ప్రతి ఇంటికి ఉపయోగ పడే చెట్లు పెంచాలన్నారు. గ్రామమంటే అందరూ సంతోషంగా బతకాలి. ఊరి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి..భూములు లేనివారికి గ్రామస్తులందరూ కలిసి పనిని కల్పించాలని సూచించారు. -
ప్రతిభ ఆధారంగానే నియామకాలు: ఈటల
కరీంనగర్: తెలంగాణలో ఉద్యోగాల నియామకం నిరంతర ప్రక్రియ అని.. ప్రతిభ ఆధారంగానే నియామకం ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఎవరు ఎలా విమర్శించినా ప్రజల ఎజెండాగానే ముందుకెళ్తామని చెప్పారు. పోటీ పరీక్షలపై మీడియా చెప్పిన వాస్తవాలకు స్పందిస్తామని తెలిపారు. రూమర్స్తో నిరుద్యోగులు అయోమయానికి గురికావద్దన్నారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరు 'గ్రామజ్యోతి' కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హరిత తెలంగాణ నిర్మించుకోవడానికి అందరు మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. -
‘దత్తత’లో... పెత్తందారీ!
అధికార పార్టీ నేతలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గ్రామజ్యోతి కార్యక్రమం పుణ్యమాని వారంతా వారం రోజులుగా ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండలానికో గ్రామాన్ని, ఎమ్మెల్సీ అయితే నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని గులాబీ దళపతి హుకుం జారీ చేశారు. ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్సీ కూడా ఉన్న చోటే చిక్కంతా వచ్చి పడింది. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్. కన్నతల్లిని, సొంతూరిని మరవకూడదన్న వాక్కును తు.చ. పాటించాలని ఓ ఎమ్మెల్సీ భావించారు. తన సొంతూరిని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ, ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీనికి మోకాలడ్డారు. తానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పేచీ పెట్టారు. చివరకు సొంతూళ్లో కూడా ఆ ఎమ్మెల్సీకి పేరు రావద్దన్నది ఆ ఎమ్మెల్యే వ్యూహం అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆదివారంతో గ్రామజ్యోతి వారోత్సవాలు ముగుస్తున్నాయి. ఇప్పటికీ ఆ గ్రామ దత్తత విషయం తేలలేదు. చివరకు తన ఊళ్లో ఏ పనీ జరగొద్దనే ఎమ్మెల్యే కిరికిరి పెడుతున్నాడని సదరు ఎమ్మెల్సీ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇది ఫక్తు రాజకీయ వ్యవహారమే.. ఆధిపత్య పోరులో భాగమే అంటున్నారు మరికొందరు ...!!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
గంటల్లోనే పరిహారం
కార్మికులకు తక్షణ పరిహారం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement