గోరఖ్పూర్లో ఆగని మరణాలు
తాజాగా ఆరుగురు చిన్నారుల దుర్మరణం
గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మెదడువాపు వ్యాధితో మరో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ బాబా రాఘవ్దాస్ వైద్య కళాశాల ఆస్పత్రి(బీఆర్డీ)లో గత నాలుగురోజుల వ్యవధిలో మరణించిన చిన్నారుల సంఖ్య 70కి చేరింది. అయితే, చిన్నారులెవరూ చనిపోలేదని, ఈ ఆరుగురు చిన్నారులు కూడా ఆగస్టు 12 నుంచి 14 మధ్యే చనిపోయిన వారేనని ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ పుష్కర్ ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం 75 మంది మెదడువాపు వ్యాధిగ్రస్తులకు బీఆర్డీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.
ఆక్సిజన్ కొరత వల్లే చిన్నారులు చనిపోయారన్న వాదనను ఆనంద్ తోసిపుచ్చారు. మరోవైపు, గోరఖ్పూర్ దుర్ఘటనపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు పదునెక్కాయి. స్వాతంత్య్ర ప్రసంగంలో ఈ మరణాలపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యూపీ ఆరోగ్యమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తన తాత లాల్బహదూర్ శాస్త్రిలా నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింథియా డిమాండ్ చేశారు.
మృతిచెందిన చిన్నారుల కుటుంబాలను యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. సుల్తాన్పూర్లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల విభాగం ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.5 కోట్లు కేటాయిస్తానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హామీ ఇచ్చారు. మరోవైపు ఈ దుర్ఘటనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చిన్నారుల మరణాలకు అధికారుల లంచగొండితనమే కారణమన్నారు.
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు విడుదల చేసినా..ఈ నెల 11 నాటికి కేవలం అధికారులు కేవలం రూ.11 లక్షలే ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. కాగా, బీఆర్డీ ఆస్పత్రి దుర్ఘటనకు బాధ్యునిగా చేస్తూ డాక్టర్ ఖఫీల్ఖాన్ను సస్పెండ్ చేయడంపై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు మండిపడ్డారు. బాధితుల కోసం మానవత్వంతో సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించిన ఖఫీల్ను బలిపశువు చేయడం సరికాదన్నారు.
ఎన్హెచ్ఆర్సీ నోటీసులు: ఒకే ఆసుపత్రిలో 70 మంది చిన్నారులు చనిపోవడంపై కేంద్ర మానవహక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. నిందితులపై తీసుకున్న చర్యలతో పాటు బాధిత కుటుం బాలకు పునరావాసం కల్పించడంపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి
సాక్షి, బెంగళూరు: గోరఖ్పూర్లోని ఆసుపత్రిలో 60 మందికి పైగా చిన్నారులు మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. అదొక ప్రమాదమనీ, ఇంత పెద్ద దేశంలో అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయనీ, ఈ తరహా ఘటన జరగడం ఇది మొదటిసారి కాదని షా వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో పార్టీ బలోపేతానికి, రానున్న శాసనసభ ఎన్నికల వ్యూహరచనకు మూడురోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన చివరిరోజు సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. నిర్దిష్ట సమయంలోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారని వెల్లడించారు. చిన్నారుల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో దేశానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పసిపిల్లల మరణంతో ఉత్తరప్రదేశ్ శోకంలో మునిగిపోయి ఉంటే క్రిష్ణాష్టమికి ‘ఘనంగా’ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వార్తలు రావడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.