breaking news
gorakallu
-
గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతులకు రూ.53 కోట్లు
సాక్షి, అమరావతి: శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల్లో అంతర్భగామైన గోరకల్లు (నరసింహరాయ సాగర్) రిజర్వాయర్ మట్టికట్ట మరమ్మతులకు ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మరమ్మతు పనులు చేపట్టాలని కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈని ఆదేశిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరకల్లు వద్ద 11 టీఎంసీల సామర్థ్యంతో గోరకల్లు రిజర్వాయర్ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ మట్టికట్ట గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. రివిట్మెంట్ కుంగిపోయింది. భారీ గోతులు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ భద్రత దృష్ట్యా తక్షణం మట్టికట్ట మరమ్మతులకు రూ.58.90 కోట్లు మంజూరు చేయాలని గతేడాది డిసెంబర్ 12న కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ.. అప్పట్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టికట్ట మరింతగా దెబ్బతింది. ఇది రిజర్వాయర్ భద్రతను ప్రశ్నార్థకం చేసింది. మట్టికట్టసహా రిజర్వాయర్ భద్రతకు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది జూలై 4న కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ ప్రభుత్వానికి మరోసారి నివేదిక పంపారు. -
పెదబాబు డైరెక్షన్లో చినబాబు యాక్షన్
సాగునీటిలో అవినీతి సునామీ! అధికారులపై కీలకమంత్రి వత్తిళ్లు అదనపు చెల్లింపులు.. అందులో వాటాలు.. నాలుగు ప్రాజెక్టుల్లో రూ. 748 కోట్ల లూటీ ఏవో కుంటిసాకులు చూపించడం.. జరుగుతున్న పనులను ఆపేయడం.. కాంట్రాక్టులు రద్దు చేయడం.. ఆ తర్వాత అవే కాంట్రాక్టు పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. ఆ కాంట్రాక్టులను సొంత మనుషులకు కట్టబెట్టడం.. యథేచ్ఛగా ప్రజా ధనాన్ని లూటీ చేయడం... ఇదీ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి. పెదబాబు డైరెక్షన్లో, చినబాబు నాయకత్వంలో... కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న అధికార పార్టీ ఎంపీలు, బినామీ కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. వాటాలు పంచుకు తింటున్నారు. ఇరిగేషన్లో అవినీతిని ఏరులుగా పారిస్తున్నారు. పెదబాబు, చినబాబు, వీరికి తోడైన మంత్రి అవినీతి లీలలకు సాగునీటి శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. అవినీతి కోసం వేసిన సరికొత్త బాటలు చూసి అవాక్కవుతున్నారు. ఇరిగేషన్లో ‘బాబు’ల అవినీతి వ్యవహారాలకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రూ. 748 కోట్లు లూటీ చేసిన ఓ నాలుగు ప్రాజెక్టులను పరిశీలిద్దాం.. ‘ఘోర’కల్లులో రూ.350 కోట్లు ఓ ప్రాజెక్టు పనులు 92 శాతం పూర్తయ్యాయి. బిల్లులూ చెల్లించేశారు. మిగిలిన 8 శాతం పనులకు ఎంత ఖర్చవుతుంది? ఖర్చులు పెరిగాయనుకున్నా ఎంత ఉండవచ్చు. మహా అయితే మిగిలిన బిల్లు రెట్టింపు.. కానీ 92 శాతం పనులకు ఎంత చెల్లించారో మిగిలిన 8 శాతం పనులకు అంత చెల్లించబోతున్నారు. ఆ మేరకు అంచనా వ్యయం పెంచేసి పంచుకోబోతున్నారు. ఆ కథేమిటో చూద్దామా... ప్రాజెక్టు వివరాలివీ: గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్ఆర్బీసీ) 56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్ఆర్బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్లో నిల్వ చేసి గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది. ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు. సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి.. రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది. అవినీతి స్కెచ్ ఇలా గోరకల్లు ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ.350 కోట్లు కొట్టేసేందుకు ‘మాస్టర్’ప్లాన్ వేశారు. పెదబాబు డెరైక్షన్లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కాంట్రాక్టర్తో కలసి మాస్టర్ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఇన్ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు. పులిచింతలలో రూ. 300 కోట్లు ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాంట్రాక్టరే జాప్యం చేశాడు. ధరలు పెరిగాయి కాబట్టి అదనంగా చెల్లించాలన్నాడు. జిల్లా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు చెప్పినదానికన్నా ఇంకా అదనంగా తనకు డబ్బురావాల్సి ఉందని కాంట్రాక్టరు వాదిస్తున్నాడు. పై న్యాయస్థానానికి వెళ్లి ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన రాష్ర్టప్రభుత్వం కాంట్రాక్టరుకు అదనంగా చెల్లించడానికి సిద్ధమౌతోంది. ఇదీ ప్రాజెక్టు కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్కు 121 కి.మీల దిగువన.. ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు అక్టోబర్ 15, 2004న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్ పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర జాప్యం చేసింది. ఒకానొక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత కదలిక వచ్చింది. భారీ దోపిడీకి స్కెచ్ ఇలా పెదబాబు వ్యూహం మేరకు .. 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరఫున హైకోర్టును ఆశ్రయించాల్సిన మంత్రి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి అదనపు పరిహారం చెల్లించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టరుకు మాత్రం అదనంగా చెల్లించడానికి ఉత్సాహపడుతోంది. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. పులిచింతల కాంట్రాక్టర్తో ఆది నుంచి ఉన్న సంబంధాలు.. పెదబాబు డెరైక్షన్లో వాటాలు పంచుకోవడానికి ఒప్పందం కుదరడం వల్లే మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో ధృవీకరించడం గమనార్హం. హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు నచ్చినవారి కోసం ‘జరుగుతున్న పనులు’ రద్దు చేశారు. అంచనా వ్యయం పెంచి నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. మూడొంతుల పనులకు బిల్లులూ చెల్లించేశారు. ఈ దశలో ఆ కాంట్రాక్టరును తప్పించి మరో బినామీ కాంట్రాక్టరును తెరపైకి తెచ్చారు. ఒక వంతు పనికి గాను ప్రాజెక్టు వ్యయానికన్నా రెట్టింపునకు పెంచేశారు. పెంచిన మొత్తాన్ని పంచుకోవడానికి పథకమేశారు. అదేమిటో మీరే చూడండి... ప్రాజెక్టు వివరాలివీ హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ కడపజిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఏకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత చేజిక్కించుకుంది. ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ.. 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు. దోపిడీకి స్కెచ్ ఇలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి.. నిధులు దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి సొరంగం పనులను రద్దు చేసి, ఏకేఆర్ కోస్టల్ సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా ‘నామినేషన్’పై అప్పగించేశారు.రూ.పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్పై అప్పగించవచ్చు. అంటే.. సొంత పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారన్నమాట. ఆర్కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 300 మీటర్ల పనులను మాత్రమే చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ.16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి.. అంచనాలు పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్కు అప్పగించి..దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట. అవుకులో రూ.44 కోట్ల లూటీ వాటాల వ్యవహారంలో తేడాలు రావడంతో రెండు ప్రాజెక్టులలో అదనపు దోపిడీ గురించి బైటపడింది. ఓ ఎంపీ, మంత్రి ఒకరి విషయం మరొకరు బైటపెట్టుకున్న ఉదంతమిది. ధరలేవీ పెరగకపోయినా కుంటిసాకులు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఇద్దరికీ పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ అదనపు బిల్లులను ప్రభుత్వం చెల్లించేసింది. ఈ వివరాలేమిటో చూద్దామా..? ప్రాజెక్టు వివరాలివీ గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్ఎస్ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు. జీఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్కు తరలించడానికి వీలుగా అవుకు టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్సీసీ - మేటాస్ (జాయింట్వెంచర్) సంస్థ చేజిక్కించుకుంది. దోపిడీ పథకమిదీ టన్నెల్ తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి వచ్చిందంటూ 2015 అక్టోబర్లో ఎన్సీసీ - మేటాస్ సంస్థ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి ఎలాంటి బిల్లులు చెల్లించనక్కరలేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు తగ్గాయి. సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్లో కాంట్రాక్టర్కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించేశారు. అది తనకు తెలియకుండానే జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ సమసిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది.