breaking news
good book
-
పగ ప్రతీకారాల ‘రెడ్ బుక్’ బదులుగా ప్రేమ, ఆప్యాయతల ‘గుడ్ బుక్’
రాజకీయాలకు.. నినాదాలకు అవినాభావ సంబంధం ఉంది. సందర్భాన్నిబట్టి రాజకీయ నేతలు చేసే నినాదాల్లో కొన్ని హిట్ కొట్టవచ్చు.. కొన్ని ఫట్ కూడా కావచ్చు. కానీ.. ఒక్కోసారి ఒక్క నినాదంతోనే క్లిష్టమైన ఎన్నికల గండం గట్టెక్కనూ వచ్చు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దేశం మొత్తం పెను సంచలనం సృష్టించిందీ నినాదం. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం తెచ్చిపెట్టింది కూడా. 1999లో బీజేపీ నేత, అప్పటి ప్రధాని ఏబీ వాజ్పేయి ‘ఇస్ బార్.. అటల్ బిహారీ వాజ్పేయి’ అన్న నినాదమూ బాగానే పనిచేసింది. ఒకే ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడంతో ప్రజల్లో ఏర్పడ్డ సానుభూతి, కార్గిల్ యుద్ధం వంటివి కూడా అప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడ్డాయి. కానీ.. 2004లో ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి అంత సానుకూల ఫలితాలు దక్కలేదన్నది తెలిసిన విషయమే.ఉమ్మడి ఆంధప్రదేశ్ విషయానికి వస్తే.. 1983లో ఎన్నికలకు ముందు ఎన్టీ రామారావు ఇచ్చిన ‘తెలుగు ఆత్మగౌరవం’ నినాదం బాగా పనిచేసింది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది. 2019లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇచ్చిన 'ఒక్క చాన్స్" పిలుపు కూడా బాగా పనిచేసింది. చంద్రబాబు పాలనతో అప్పటికే విసుగెత్తిన ప్రజలు జగన్కు సై అన్నారు. నినాదాల శక్తి గురించి ఇంకా పలు ఉదాహరణలు ఇవ్వొచ్చు. తాజాగా జగన్ ఇంకో కొత్త కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకొచ్చారు. అది.. ‘గుడ్బుక్’!ప్రస్తుతం ఆంధప్రదేశ్ ప్రజలను ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న తెలుగుదేశం ప్రభుత్వ ‘రెడ్ బుక్’కు ఇది ప్రత్యామ్నాయమన్నమాట. సహజంగానే ఇది జనాన్ని ఆకట్టుకుంటుంది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి లోకేశ్కు ఎవరు ఐడియా ఇచ్చారో కానీ.. ప్రతిపక్షంలో ఉండగా.. రెడ్బుక్ అంటూ ఒక పుస్తకాన్ని చేతపట్టుకుని ప్రభుత్వ అధికారులను ,ప్రత్యేకించి పోలీసులను బెదిరించేవారు. వైసీపీ నేతలకూ హెచ్చరికలు చేసేవారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న, వ్యాఖ్యానిస్తున్న అధికారులు, నేతల పేర్లు ఈ ‘రెడ్ బుక్’లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చాక వారందరి సంగతీ చూస్తామని బెదిరించేవారు. స్కామ్లలో చికుక్కున్న టీడీపీ అగ్రనేతల కేసులు విచారణకు వచ్చిన సందర్భంలోనూ లోకేశ్ రెడ్బుక్ పేరుతో బెదిరించడంతో అధికారులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఆ కేసు ఏమైందో తెలియదు. వీరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లు ఈ రెడ్బుక్ను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. లోకేశ్.. ఏదో అనుభవరాహిత్యంతో చేస్తున్న పనే అని సర్దుకున్నారు. పైగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు.అయితే 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఈవీఎంల మహిమే ఇది అన్నది చాలామంది నమ్మకం. అది వేరే సంగతి. అధికారం వచ్చాక టీడీపీ వారు రెడ్ బుక్ను అమలు చేయాలని నిర్ణయించుకుని చెలరేగిపోవడం మొదలైంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల కంటే ఈ రెడ్ బుక్పైనే వాళ్లు ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది. లోకేష్ రెడ్ బుక్ అంటూ రాష్ట్రంలో ఆయా చోట్ల హోర్డింగ్ లు కూడా వెలిశాయి. ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. అలాగే బాధ్యతలివ్వకుండా సుమారు పాతిక మంది ఐపీఎస్, ఐఎఎస్ అధికారులను వేధిస్తున్నారు. పలు నియోజకవర్గాలలో తమకూ రెడ్ బుక్ లు ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్థానిక అధికారులను, తమకు ఓటు వేయని ప్రజలను భయ పెట్టడమూ మొదలైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన బుక్ లో వంద మంది పేర్లు ఉన్నాయని ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ. పల్నాడు, తదితర అనేక ప్రాంతాలలో టీడీపీ వారి దౌర్జన్యాలకు అంతు లేకుండా పోయింది. అలాగే వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ వారు పోలీసుల సమక్షంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నా, ఇళ్లను ధ్వంసం చేస్తున్నా వారించే నాథుడు లేకుండా పోయాడు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం మహిమేనని జనానికి అర్థమైంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వివిధ స్కీములు అమలు చేసింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వరద సహాయ చర్యల్లోనూ బాధితులు తమ మద్దతుదారులా? వైసీపీ మద్దతుదారులా? అన్నది ఆరా తీసి మరీ తమ వారైతేనే సాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ కార్యకర్తలలో ఆత్మ విశ్వాసం నింపేందుకు, ప్రజలకు అండగా ఉండేందుకు , అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు జగన్ వ్యూహాత్మకంగా గుడ్ బుక్ కాన్సెప్ట్ తీసుకువచ్చారు.రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ అన్న పోటీ వస్తే సహజంగానే ఎవరైనా గుడ్ బుక్నే కోరుకుంటారు. రెడ్ బుక్లోని కక్షలు, కార్పణ్యాలు, పగ, ప్రతీకారం, అకృత్యాలు వంటివాటిని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు చేయలేక, రెడ్ బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి అంటే ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. వారు తమకు గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తున్న తరుణంలో గుడ్ బుక్ తెస్తామని జగన్ ప్రకటించడంతో ప్రజలలో ఆశలు చిగురించే అవకాశం ఉంది. దీంతో టీడీపీ ప్రభుత్వం అరాచకాలు కాస్త తగ్గే అవకాశం ఉండవచ్చు. పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ జగన్ రెడ్ బుక్ అన్నది పెద్ద విషయం కాదని, దానివల్ల కక్షలే తప్ప ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.తన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే, టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రెడ్ బుక్ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఇది నిజమే అని ఒప్పుకోవాలి.జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక స్కీములతో రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ప్రయోజనం పొందారు. అమ్మ ఒడి, ఆసరా, కాపు నేస్తం, చేనేత నేస్తం, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ.. ఇలా సుమారు 35 స్కీములను ఆయన వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పంపించారు.అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా స్కీమ్ అందకపోతే,మానవత్వంతో అందచేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఆగిపోయాయి. ఇళ్ల వద్దకు సేవలు నిలిచిపోయాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిన వాగ్దానాలన్ని గాలికి పోయాయి. ప్రతిదానికి ఏదో సాకు వెదుకుతున్నారు.డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. వీటన్నిటిని గుర్తు చేస్తూ జగన్ తాను గుడ్ బుక్ తీసుకు వస్తానని అన్నారు. ఈ పుస్తకంలో మంచిచేసే అధికారుల పేర్లు రాస్తామని, అలాగే పార్టీ కోసం పని చేసేవారి పేర్లు నమోదు చేసుకుంటామని ఆయన చెప్పారు. అంటే టీడీపీ, చంద్రబాబు, లోకేష్లది నెగిటివ్ ఆలోచనైతే, వైసీపీ జగన్లది పాజిటివ్ ధోరణి అన్నమాట. రెడ్ బుక్ వల్ల టీడీపీకి టీడీపీ ఇప్పటికే అప్రతిష్ట పాలైంది. జగన్ గుడ్ బుక్ గురించి ప్రకటించగానే సమావేశంలో ఉన్నవారంతా హర్షద్వానాలు చేశారు.అంటే వైసీపీ వారినే కాకుండా, ప్రజలందరికి ఈ గుడ్ బుక్ ఉపయోగపడుతుందని వారు భావించారన్నమాట. దీనిపై జనంలో సానుకూల స్పందన వస్తోంది. గుడ్ బుక్ కాన్సెప్ట్ను నిలబెట్టుకుంటూ జగన్ ప్రజలలోకి వెళితే రాజకీయంగా కూడా ఉపయోగం ఉండవచ్చు. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!
మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి. ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం. చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు. అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘హిగ్గిన్స్’ నేర్వాల్సిన పరిమళపు భాష!
మంచి పుస్తకం ‘మెహదీపట్నం దగ్గర గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్తే ఎవరికైనా ఇలాగే ఉంటుంది కాబోలు’ అంటాడు ప్రసాదమూర్తి, పూలండోయ్పూలు కవిత పూర్తి చేసి. ‘ఈ పదాన్ని ఇలాగే పలకాలి. ఈ వాక్యాన్ని అనేపుడు బాడీలాంగ్వేజ్ ఇలాగే ఉండాలి’ అనే ప్రొఫెసర్ హిగ్గిన్స్కు మాత్రం పూలమార్కెట్ అలా ఉండదు. హిగ్గిన్స్ ఎవరు? బెర్నార్డ్ షా నాటకం ‘పిగ్మేలియన్’ (1938) ఆధారంగా 1964లో ‘మై ఫెయిర్ లేడీ’ అనే క్లాసిక్ ఫిలిం వచ్చింది. అందులో ఎలిజా అనే పూలమ్మిని హైసొసైటీ లేడీగా మార్చేందుకు శపథం పూనిన ఆచార్యుడు. ‘హిగ్గిన్స్’ తెలుగు కవుల్లోనూ ఉన్నారు. నియమం లేని వాక్యం గ్రామ్యం అన్నారు గ్రాంథికులు. చంపకమాల (సంపెంగ దండ) ఉత్పలమాల (కలువపూల దండ) అని పేర్లు పెట్టారు కాని పూల తాలూకూ వాసనలే సోకని ఛందస్సులతో పద్యాల ఇటుకలు పేర్చేశారు. కొందరు ఆధునికుల్లో ఛందస్సూ కవిత్వమూ రెండూ మృగ్యమే. ‘పూలండోయ్ పూలు’ కవితా సంకలనంలోని ప్రసాదమూర్తి కవితలు ఏ భాషలోని ‘హిగ్గిన్స్’కు అయినా పరిమళపు భాష నేర్పుతాయి. గుడిమల్కాపూర్ పూలమార్కెట్ను డాక్యుమెంటరీగా తీస్తే ఏ భాషలోని కవి అయినా తమ భాషల్లో ప్రసాదమూర్తి కవిత్వాన్నే పలుకుతాడు. ఈ సంకలనంలో కేవలం ‘పాటల పారిజాతాలు ... ఆశల సంపెంగలు’ మాత్రమే లేవు. అత్తిచెట్టు తనలోకే పుష్పిస్తూ ఫలంగా రూపొందిన విధంగా ప్రసాదమూర్తి తనలోనే దుఃఖించి పాఠకులకు కానుకగా అందించిన కవితలూ ఉన్నాయి. ‘పగలంతా సూర్యుడు రాల్చిన/ వెలుగు కలల్ని/ రాత్రిచంద్రుడు ఏరుకునే/ సన్నివేశం గుర్తొచ్చింది’ అన్న కవి ‘కొంపలు కొల్లేరైపోయాక/ఇంక ఇక్కడేముందని/ఓ పెద్ద చేప పెకైగిరి/నా కాళ్లమీద తోకతో కొట్టిపోయింది’ అలాంటి వ్యక్తీకరణే! ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధిగా పద్యంతో మొదలై, అష్టావధానాలూ చేసి, ప్రేయసీ అనే అలభ్యశతకం రాసి శ్రీశ్రీ ప్రభావంతో ఛందస్సుల నుంచి బయటపడ్డాననే ప్రసాదమూర్తి ఛందోస్ఫూర్తిని వీడలేదు. ప్రసాదమూర్తి వామపక్షభావాల నుంచి, దళిత ఉద్యమ మమేకత్వాన్నుంచి, భిన్న భావాల సంఘర్షణల నుంచి ఏ మంచినీ వదులుకోకుండా కవిగా ప్రయాణిస్తున్నాడు అనేందుకు అతడి గత పుస్తకాలు ‘నాన్నచెట్టు’, ‘కలనేత’, ‘మాట్లాడుకోవాలి’కి కొనసాగింపైన ‘పూలండోయ్ పూలు’ ఉదాహరణ! లోహపురుషుడి కోసం లోహాన్ని సమకూర్చండి అన్న నాయకుడి పిలుపు నేపథ్యంలో ‘ప్రియమైన భారతీయులారా/మీరు లోహాన్ని సమకూచ్చండి/విగ్రహం కోసం కాదు/ సంగ్రామం కోసం’ అంటాడు! ప్రపంచంలోని అన్ని సంఘర్షణసీమల్లోకి కలల విహారం చేస్తూ ‘ఇండోపాక్ బార్డర్లో / నా రెండు కనుపాపల్నీ /అటూ ఇటూ దీపాలుగా పెట్టి/ క్రాస్ బార్డర్ హ్యూమనిజానికి/హారతులు పట్టమని ఆనతిచ్చాను’ తొలికవిత ‘అమ్మ పుట్టిన రోజు’లో ‘బతుకు నొప్పినంతా భరించీ భరించీ/పురిటి నొప్పుల్ని మాత్రం/నా కోసమే తియ్యగా మార్చుకున్నావు/ అక్షరాల ప్రసవంలో/ నేనూ అదే నేర్చుకున్నాను’ అంటాడు. నిజమే సుమీ అని 38 కవితలూ బోసిగా నవ్వుతాయి! - పున్నా కృష్ణమూర్తి పూలండోయ్ పూలు: ప్రసాదమూర్తి; వినూత్న ప్రచురణలు: ప్రతులు అన్ని ముఖ్యమైన చోట్లా; వేల: 100/-