breaking news
Gautu shivaji
-
గౌతు శిరీష అహమే శత్రువా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తన కోపమే తన శత్రువని అంటారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు మాత్రం తన అహమే తన శత్రువవుతోంది. ప్రత్యర్థి నేతలతో పాటు స్వపక్ష నాయకులతోనూ వైరం పెంచుకుంటున్న ఆమె వింత వైఖరి అసమ్మతి సెగ రేపుతోంది. ఇంటా బయటా నాయకులు తనకంటే సీనియర్స్ కావడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. అరవై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తన కుటుంబానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న నేతలే తనకు అడ్డు తగులుతారేమో అన్న అభద్రతా భావంలో ఉన్నారు. తాతతండ్రుల చరిత్రలు చెబుతూ నిత్యం అహంతో వ్యవహరించడం తప్ప సొంత ముద్ర వేసుకోలేక సతమతమవుతున్నారు.వాస్తవానికి సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిగా పెత్తనం చెలాయించడం తప్ప గౌతు శిరీష పేరు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. గౌతు శ్యామసుందర్ శివాజీ రాజకీయంగా కనుమరుగు అవుతుండటంతో వారసత్వ రాజకీయాల్లో భాగంగా ఆమె తెరపైకి వచ్చారు. వారసత్వ రాజకీ యం సిక్కోలుకు కొత్త కాకపోయినా.. విశాఖపట్నంలో ఉండి ఇక్కడ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనే ఆమె ఆలోచన ఎవరికీ నచ్చడం లేదు. ప్రతి విషయంలో డబ్బును, బ్యాగ్రౌండ్ను చెప్పుకోవడం, ఏ మండలంలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియకపోవడం, ప్రజల మన్ననలతో కాకుండా వారసత్వం పేరుతో పెత్తనం చెలాయించాలన్న ఆలోచన ఇప్పుడామె కొంప ముంచుతోంది. ఇంతవరకు కుటుంబానికి అండగా నిలిచిన నాయకులే ఇప్పుడు ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడింది.అధికార పార్టీ నాయకులపైన విమర్శలు, ఆరోపణలు చేస్తే అది రాజకీయం అనుకోవచ్చు. కానీ ఉన్నవీ లేనివీ మాట్లాడి నోరు పారేసుకోవడం వల్ల ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె ప్రతిష్ట మసకబారిపోయింది. అది చాలదన్నట్టు సొంత పార్టీ నేతలను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రానున్న ఎన్నికల్లో ఎక్కడ టిక్కెట్కు పోటీ పడతారేమోనన్న అభద్రతా భావంతో స్వపక్షంలోనే నాయకులతో వైరం పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి తనకు తప్ప ఎవ్వరికీ ఎమ్మెల్యే సీటు దక్కకూడదనే ఉద్దేశంతో పారీ్టలో ఎదగాల్సిన నాయకులను వెనక్కు నెట్టేందుకే ప్రయ తి్నస్తున్నారు. ఇన్కంటాక్స్లో ఆఫీసర్గా పనిచేసి వచ్చిన ఉద్దాన వాసి జుత్తు తాతారావు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడంతో ఆయనతో విభేదాలు పెట్టుకుని ఆయన పారీ్టకి దూరంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. తాజాగా పలాస–కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడతారన్న ఉద్దేశంతో ఆయన్ని అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి చిన్న విషయంలో వజ్జ బాబురావు అండ్కోపై చిర్రుబుర్రులాడుతున్నారు. సొంత పార్టీ నాయకుల సీనియారిటీని సైతం విస్మరించి తన చెప్పుచేతుల్లో ఉండేలా హకుం జారీ చేస్తున్నారు. ఇటీవల శిరీష రాకుండా ఆఫ్షోర్ ప్రాజెక్టు చూసేందుకు ప్రతిపక్ష పాత్రలో వెళ్లారంటూ వజ్జపై రుసరుసలాడారు. చెప్పాలంటే వజ్జ బాబూరావును అవమాన పరిచేలా పలు సందర్భాల్లో వ్యవహరించారు. సీనియర్ అయినప్పటికీ తన వెనుక ఉండాలే గానీ తన మాట దాటొద్దంటూ ఆంక్షలు విధించారు. వజ్జ బాబూరావుకు ఏ ఒక్కరు జై కొట్టినా సహించలేకపోతున్నారు. దీంతో శిరీషకు సహజంగానే అసమ్మతి పోరు మొదలైంది. వజ్జ బాబూరావు వర్గీయులంతా ఇప్పుడామెపై గుర్రుగా ఉన్నారు. విశాఖలో ఉండి, పార్టీ పిలుపు సమయంలో ఇక్కడికొచ్చి కార్యక్రమాలు చేపట్టి, తర్వాత వెళ్లిపోయి కేడర్ను గాలికొదిలేసిన శిరీష వెంట ఎలా ఉండగలమని వ్యతిరేక వర్గమంతా బాహాటంగానే నిరసన గళం విప్పుతున్నారు. ఆ స్వరం రోజురోజుకీ ఎక్కువై నియోజకవర్గంలో టీడీపీ వర్గాలుగా చీలిపోయింది. -
శివాజీకి అవకాశం వచ్చేనా..?
ముందస్తు తర్ఫీదులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు మంత్రి పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధమవుతోంది! రేపో మాపో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు మంత్రి పదవి కోసం ఎవ్వరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే జిల్లా నుంచి కళా వెంకటరావుకు కచ్చితంగా చోటు లభిస్తుందనే ఊహాగానాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇక సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక సామాజికవర్గం కోటాలో కూన రవికుమార్, మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవి కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర సమీకరణాలతో సిక్కోలు జిల్లా రాజకీయాలతో ముడిపడి ఉండటంతో మంత్రి అచ్చెన్నాయుడికి మార్పు తప్పదనే వాదనలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్తో పాటు టీడీపీలోకి ఫిరాయించిన నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రిమండలిలో మార్పులు చేర్పులు తప్పని పరిస్థితి. మంత్రివర్గ కూర్పులో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రధానంగా సామాజికవర్గాల కోటానే కీలకం. ప్రస్తుత మంత్రి మండలిలో జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి సిక్కోలుకే చెందిన కిమిడి మృణాళిని, విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ రెండేళ్లుగా చంద్రబాబు ఊరిస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళావెంకటరావుకు ఎప్పటికైనా బెర్త్ లభిస్తుందని ఆయన అనుచరగణమంతా ఆశలు పెంచుకున్నారు. అయితే కళావెంకటరావు గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి సొంతగూటి చేరడమే మైనస్ కావడంతో ఆయన కుటుంబానికే చెందిన మృణాళినికి మంత్రి పదవి లభించింది. ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాకే చెందిన బొబ్బిలి ఫిరాయింపు ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావుకు బెర్త్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి రాజుకు చోటు ఇస్తే... తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నుంచి ఫిరాయించి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు కల్పించడంపై అప్పట్లో పచ్చపార్టీ శ్రేణులన్నీ అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. చివరకు ప్రమాణం స్వీకారం చేయించి గవర్నరు కూడా తప్పు చేశారన్నట్లుగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు అదే గవర్నరు చంద్రబాబు ప్రభుత్వంలో చేరాలనుకొని పార్టీ ఫిరాయించిన నాయకులతో మంత్రిగా ప్రమాణం చేయించాల్సిన పరిస్థితి. వాటన్నింటినీ పక్కనబెట్టేసి బొబ్బిలి రాజు సుజయ్కు మంత్రి పదవి కట్టబెడితే ఉత్తరాంధ్రలో సమీకరణాలు మారిపోనున్నాయి. ఆయన వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందినప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడులను అదే కోటాలో లెక్క గట్టేస్తున్నట్లు వినికిడి. అంటే ఉత్తరాంధ్రలో ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రి మండలిలో ఉంటారు. దీన్ని ఇద్దరికి పరిమితం చేయాలంటే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇద్దరిలో ఒకరికి పదవీత్యాగం తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నకు పదవీగండం... టీడీపీలో కింజరాపు ఎర్రన్నాయుడికి ఉన్న పలుకుబడి, ఆయన అకాల మరణం నేపథ్యంలో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి లభించింది. ఇందుకోసం చంద్రబాబు జిల్లాలో సీనియర్ నాయకులైన గౌతు శివాజీ, కళావెంకటరావులను పక్కనబెట్టేశారు. అప్పటి నుంచి వారి మధ్య సయోధ్య లేదని, గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే తమకు కేబినెట్లో బెర్త్ లభిస్తుందని శివాజీ, కళావెంకటరావు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. ఇటీవల వంశధార నిర్వాసితుల పరిహారం విషయంలో అచ్చెన్నాయుడు చంద్రబాబు ఆగ్రహానికి గురవ్వడం, జిల్లాలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం తదితర కారణాలతో ఆయనకు పదవీగండం తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో సుజయ్కు మంత్రి పదవి ఇవ్వాలంటే మృణాళిని తప్పించాల్సి ఉందని, ఆమె స్థానంలో కళా వెంకటరావుకు చోటు కల్పిస్తారనే వాదన ఉంది. అలా సుజయ్, కళావెంకటరావులకు చోటు లభిస్తే అచ్చెన్నాయుడికి పదవీ గండం తప్పదు. ఉత్తరాంధ్రలో సామాజిక కోణంలోనే సమీకరణాలు ఉంటే గంటా శ్రీనివాసరావుతో సరిపడని చింతకాయల అయ్యన్నపాత్రుడినే చంద్రబాబు తప్పిస్తారని, అచ్చెన్నాయుడి పదవికి ఇబ్బంది ఉండబోదనే ధీమా అచ్చెన్న అనుచరుల్లో కనిపిస్తోంది. ఊహల పల్లకిలో..! జిల్లాలో మరో సీనియర్ నాయకుడైన శివాజీ కూడా ఎప్పటి నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. లోకేష్తో సామాజిక కోణంలో సంబంధాలు నెరపుతున్న శివాజీ అల్లుడు ఆ దిశగా మార్గం సుగమం చేసేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్న శివాజీ అల్లుడి ప్రయత్నాలు ఎంతవరకూ నెరవేరుతాయో చూడాల్సిందే. మరోవైపు కాళింగ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మృణాళినిని తప్పిస్తే ఉత్తరాంధ్ర నుంచి మహిళా కోటాలో మంత్రి పదవి కోసం మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి కూడా ఆశిస్తున్నట్లు వినికిడి. చివరకు ఎవ్వరికి బెర్త్ లభిస్తుందో, ఎవ్వరికి పదవీ త్యాగం తప్పదో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందని టీడీపీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.