వంతెనపై నుంచి దూకి యువకుడి మృతి
కొవ్వూరు : వంతెనపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం నాలుగో రోడ్డు (గామన్)వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొవ్వూరు అచ్చాయమ్మకాలనీకి చెందిన చినరావూరి నాగేంద్రకుమార్(28) శుక్రవారం ఉదయం నాలుగో రోడ్డు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెనపైనుంచి దూకడంతో అతను గోదావరి పుష్కరాల కోసం కొత్తగా నిర్మించిన పుష్కర్ నగర్ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మూడు రోజుల క్రితమే అయప్ప మాల ధరించాడు. రోజూ ఉదయాన్నే గోదావరి స్నానానికి వస్తున్నాడు. యథావిధిగా శుక్రవారం తెల్లవారుజామున కూడా ఇంటి దగ్గర నుంచి సైకిల్పై వెళ్లిన కొడుకు తిరిగి రాలేదని అతని తండ్రి సుబ్బారావు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్కుమార్ తెలిపారు. నాగేంద్రకుమార్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి విభేదాల్లేవని చెబుతున్నారు.