ప్లీజ్.. పూలు చల్లొద్దు!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు చర్చల కోసం మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఆయన నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనకు ముందు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు.ప్రమాణ స్వీకార వేడుకలను అతి హంగులుగా కాకుండా నియంత్రితంగా నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు, తన అభిమానులకు సూచించారు. ముఖ్యంగా తనపై పలు జల్లొద్దని.. పూలమాలలతో, శాలువాలతో సత్కరించకుండా ఉండాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన శివకుమార్.. పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే భారీ జనసందోహం, అతిగా జరిగే సంబరాలు తనకు అసౌకర్యాన్ని కలిగించవచ్చని పేర్కొన్నారు. అందుకే కార్యకర్తలు పరిమితుల్లోనే వేడుకలు జరపాలని, దూరం నుంచే అభినందనలు తెలిపినా తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు.తన విజ్ఞప్తికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యేనని ఆయన వెల్లడించారు. తనకు పూలమాలలపై అలర్జీ ఉందని, అందువల్ల ఎవ్వరూ వాటిని తీసుకురావద్దని స్పష్టంగా చెప్పారు. “ప్లీజ్… నాకు పూలమాలలు వద్దు. నేను వాటిని స్వీకరించలేను” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ప్లాస్టిక్ పూలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన గుర్తు చేశారు. పూలతో పాటు శాలువాలు కూడా తేవొద్దంటూ ఆయన సూచించారు.అలాగని ఈ విజ్ఞప్తితో ఆయన కార్యకర్తల ఉత్సాహాన్ని తగ్గించలేదు. కాంగ్రెస్ విజయాన్ని సాధారణ కార్యకర్తల విజయం అని అభివర్ణిస్తూ, “ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్నది నేను మాత్రమే కాదు, ప్రతి పార్టీ కార్యకర్త కూడా” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 1979–80లో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తన రాజకీయ ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దశలవారీగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నానని, ఈ ఎదుగుదల సాధారణ కార్యకర్తల కష్టం, నిబద్ధతకు ప్రతిబింబమని తెలిపారు.మొత్తంగా చూస్తే, శివకుమార్ విజ్ఞప్తి సంబరాల మధ్య కూడా నియంత్రణ అవసరాన్ని సూచిస్తోంది. వ్యక్తిగత ఆరోగ్య కారణాలు, అలాగే అతిగా ఆర్భాటం వద్దన్న తన స్వభావం ఈ నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. రాజకీయ వేడుకల్లో హంగు తగ్గించి సింపుల్గా నిర్వహించాలని ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.