breaking news
Family News
-
దేశంలో మగాడికి కష్టమొచ్చింది!
హర్యానా కేడర్కు చెందిన సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఈనెలలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వేధించిన కస్టమ్స్, అధికారులు పేర్లు 8-పేజీల సూయిసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ముంబయిలో టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య వేధింపులతో ఆత్మాహుతి పాలయ్యాడు. ‘‘ఆడవాళ్ల బాధపై అందరూ ఉద్యమిస్తారు. పురుషుల కష్టం ఎవ్వరు చూడరు’’ అని తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక స్టార్టప్ టెకీ ఈ ఏడాది మార్చిలో మెంటల్ డిస్ట్రెస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్టార్ట్-అప్ బిజినెస్లో నష్టాలతో బెంగళూరులో 12వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడుఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వాస్తవాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది వేలాదిమంది పురుషులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. 2004లో 51,623 మంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 81,063కి పెరిగింది.అదే సమయంలో వివాహిత మహిళల సంఖ్య మాత్రం 28,045 నుండి 28,680 వరకు మాత్రమే ఉంది. అంటే వివాహిత మహిళల సంఖ్య అలాగే ఉండగా, పురుషుల సంఖ్య 50శాతం పెరిగింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యం కూలిపోతుందనడానికి సంకేతం. దీనికి కారణాలు తెలుసుకుని, పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కారణాలు తెలుసుకుందాం.1. కుటుంబ సంబంధాల ఒత్తిడిఈ మధ్య మా క్లినిక్ కు కౌన్సెలింగ్ కు వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘సర్, నా జీతం సరిపోవడంలేదని నా భార్య తిట్టింది. మరోవైపు అమ్మ, తన మాట వినడంలేదని ఎత్తిపొడుస్తోంది. ఇద్దరినీ సంతోషపెట్టాలనుకున్నా, కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. చచ్చిపోవాలనిపిస్తుంది” అని వాపోయాడు.మగాడు కుటుంబానికి ‘రక్షకుడు’ అనే భావన బలంగా ఉంది. దీంతో పిల్లల భవిష్యత్తు, ఇంటి భారం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ పురుషులు మోస్తారు. వీటిలో విఫలమైనప్పుడు తీవ్రమైన అపరాధభావనకు, నిస్సహాయతకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇంటి సమస్యలు, భార్యతో విభేదాలు, వృత్తి ఒత్తిడి... ఇవన్నీ బయటకు చెప్పుకోలేని స్థితిలో, ఆ ఒత్తిడి ఆత్మహత్యవైపు నడిపించే ప్రమాదం ఉంది.2. మానసిక సమస్యలపై మౌనంమగాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సమస్యలను తనలోనే దాచుకోవాలనే సామాజిక కట్టుబాట్లు పురుషులకు అతిపెద్ద శత్రువులు. ఈ భావనను టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. దీనివల్ల పురుషుడు తమ ఎమోషన్స్, బాధ, భయం, ఆందోళన వంటి వాటిని మనసులోనే తొక్కిపెడతాడు. డిప్రెషన్, యాంగ్జయిటీలాంటి సమస్యలున్నా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడాన్ని బలహీనతగా భావిస్తారు. ‘నేను బలహీనుడిని కాను’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అణచివేత చివరకు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి తీవ్ర నిర్ణయాలవైపుకు నెడుతుంది.3. ఆర్థిక ఒత్తిళ్లు... కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారి గుర్తింపు ఉద్యోగం, సంపాదనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందరిముందూ తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమాన భారం, భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఇటీవల బెంగళూరులో ఒక టెకీ ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్త దీనికి నిదర్శనం.4. చట్టపరమైన ఒత్తిళ్లు...మరికొంతమంది పురుషులు వివాహ సంబంధిత చట్టాలు, కుటుంబ వివాదాలు, లేదా తప్పు ఆరోపణలు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. “నేను తప్పు చేయలేదు, కానీ ఎవరూ నమ్మలేదు” అని కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో మగాళ్ల బాధను ఎవరూ వినడం లేదనే భావనను పెంచుతున్నాయి.5. మత్తు పదార్థాలు... చాలామంది పురుషులు మద్యం లేదా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక్కరోజు సాంత్వన మాత్రమే. మరుసటి రోజు మళ్లీ అదే బాధ, అదే శూన్యత, మళ్లీ మద్యం. అలా అలా దానికి బానిసలవుతారు. ఈ విషవలయం చివరకు స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది.6. ఒంటరితనం... మహిళలకు కష్టమొస్తే వెంటనే ఎవరో ఒకరితో పంచుకుంటారు. కానీ పురుషులు మాత్రం మౌనంగా భరిస్తారు. కాఫీ లేదా స్క్రీన్తో మాట్లాడతారు. ఓసారి ఒక 42 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ‘‘నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్లు అడిగేది... జీతం ఎంత? కారు కొత్తదా? అని. నిజంగా నా మనసులో ఏముందో విన్నవాడు లేడు’’ అని చెప్పాడు. అదీ పరిస్థితి.గణాంకాలు చెబుతున్నది ఏమిటి?• భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో 70% కంటే ఎక్కువ పురుషులవి.• 18–45 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. • వివాహిత మహిళల కంటే వివాహిత పురుషులు 1.8 రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకున్నారు.• కుటుంబ సమస్యలు పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంది.పరిష్కార దిశలు1. మానసిక సమస్యల గురించి మాట్లాడాలి. పురుషుడికి కూడా సహాయం అవసరం అవుతుందని అంగీకరించాలి.2. కౌన్సెలింగ్ను మొదటి అడుగుగా చూడాలి, చివరి ప్రయత్నంగా కాదు.3. ‘మగాడు ఏడవకూడదు’ అన్న మాట మార్చాలి. ఎమోషన్స్ కు జెండర్ తో సంబంధం లేదని గుర్తించాలి. 4. తండ్రులు, భర్తలు, సోదరులు మాట్లాడుకునే సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. 5. మీడియా పురుషుల బాధను నాటకీయంగా కాకుండా, అవగాహనతో చూపించాలి.ఒక పురుషుడు చనిపోవడమంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు నిశ్శబ్దంగా మాయమవ్వడం. ఒక కుటుంబం కష్టాల్లో, దు:ఖంలో పడటం. ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత వైఫల్యాలు కాదు, అవి సామాజిక వైఫల్యాలు. పురుషులు కూడా మనుషులే, వాళ్లకు కూడా అర్థం చేసుకునే హృదయం అవసరం.-సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్-జీనియస్ మ్యాట్రిక్స్ హబ్, 8019 000066, www.psyvisesh.com -
Wah Ustad Wah: జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్
‘‘ఎంతటి కళాకారుడైనా.. ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగానే ఉండాలి’’.. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పే మాట ఇది. మూడేళ్ల వయసుకే తబలాపై చిట్టి చేతులేసి.. ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి.. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు.. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సంగీత ప్రయాణం ముగిసింది. జాకీర్ హుస్సేన్ మరణంతో.. ఆయన జ్ఞాపకాలను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఆయన నేపథ్యం, ఆయన పరిచయాలు, ఆసక్తికర ఘటనలు.. ఇలా ఎన్నింటినో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ తబలా విద్వాంసుడు.. చివరి పోస్టుగా ‘అద్భుతమైన క్షణం’ ఉంచారు. View this post on Instagram A post shared by Zakir Hussain (@zakirhq9)ఈ అక్టోబర్లో అమెరికాలో ఉన్న ఆయన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రకృతి వీడియోను స్వయంగా చిత్రీకరించి షేర్ చేశారాయన. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది.ఓ గురువు నేర్పడం కాదు.. ఓ విద్యార్థి నేర్చుకోవడం అనేది ముఖ్యం. గురువును ఆ విద్యార్థి నేర్పే విధంగా ఇన్స్పైర్ చేయాలి. అంటూ ఆయన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే.. నా మొదటి గురువు నా తండ్రే. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. ఓ కళాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు.గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామన్నారు. వారి మాటలు నాలో స్ఫూర్తినింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను.. అని జాకీర్ హుస్సేన్ మాటలు ‘‘వహ్ ఉస్తాద్ వహ్..’’ అని నెటిజన్లతో అనిపిస్తున్నాయి.క్లిక్ చేయండి: ఇక సెలవు మిత్రమా.. చితి వద్ద జాకీర్ హుస్సేన్ కన్నీళ్లు -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్ను నవంబర్ 15న హైటెక్స్లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు.


