breaking news
Express corridors
-
మొదట రెండు
- కేబీఆర్ పార్కు, ఎల్బీ నగర్లలోనే మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్లు - మిగిలిన ప్రాంతాల్లో ఆలస్యం - నిధులు విడుదలైనా పనులు కష్టమే - సంపన్నులకే తొలి అవకాశం - సామాన్యుల బాధలు షరా మామూలే నా? - ఎస్ఆర్డీపీ పనులపై సందేహాలు సాక్షి, సిటీబ్యూరో: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా గ్రేటర్లోని 20 ప్రాంతాల్లో మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లై ఓవర్లు.. ఎక్స్ప్రెస్ కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2631 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రెండు ప్రాంతాల్లో మాత్రమే తక్షణం పనులకు అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన 20 ప్రదేశాల్లో ఎల్బీనగర్, కేబీఆర్ పార్కుల వద్ద మాత్రమే పెద్దగా ఇబ్బందులు లేవు. మిగతా ప్రాంతాల్లో మరి కొన్ని నెలలు ఆగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రెండున్నరేళ్లలో 20 ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. భూ సేకరణ పూర్తయితేనే అది సాధ్యమవుతుంది. వంద శాతం స్థలం అందుబాటులో ఉండి... ఎలాంటి ఆటంకాలు ఉండని ప్రాంతాల్లో మాత్రమే కాంట్రాక్టు పొందే సంస్థతో వెంటనే అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ లెక్కన అవకాశం ఉన్న చోటనే పనులు చేపడతారు. మిగిలిన ప్రాంతాల్లో నూరు శాతం స్థలం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి. భూ సేక‘రణమే’... ప్రాజెక్టులోని 20 ప్రదేశాల్లో 49.15 ఎకరాలు ప్రభుత్వ సంస్థల భూములే కాక మరో 581 ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు 30 ఎకరాలు. వీటి సేకరణ పెనుభారంగా మారనుంది. ఇవన్నీ ప్రధాన మార్గాల్లో... భారీ డిమాండ్ ఉన్నవి. నష్ట పరిహారం సంగతటుంచి...వీటిని కోల్పోయేందుకు ప్రైవేట్ వ్యక్తులు అంగీకరించడం అనుమానమే. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు జంక్షన్ వద్ద ఆరు లేన్లతో మల్టీ లెవెల్ స్పైరల్ ఫ్లై ఓవర్ను నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ. 170 కోట్లు. మిగతా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల ఖర్చు సగటున దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా.. రెడ్ సిగ్నళ్లు పడకుండా వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. జంక్షన్లలో అవసరాన్ని బట్టి ఫ్లై ఓవర్లు.. అండర్పాస్లు.. ఒకటి/ రెండు/ మూడు లెవెల్స్లో ఫై ్లఓవర్లు నిర్మిస్తారు. ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు మార్గానికి పైవరుసలో కానీ దిగువ వరుసలో కానీ ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీనగర్ వద్ద అండర్పాస్ హయత్నగర్-నాగోల్, హయత్నగర్-దిల్సుఖ్నగర్, దిల్సుఖ్నగర్-హయత్నగర్, నాగోల్-సాగర్ రింగ్రోడ్డు మార్గాల్లో రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో సాగర్ రింగ్ రోడ్డు నుంచి కామినేని ఆస్పత్రి వరకు దాదాపు 2 కి.మీ.లు అండర్పాస్ ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతాలపైనే అంత మోజెందుకో.. ఎస్ఆర్డీపీ పనులిలా ఉండగా... తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ (వైట్ టాపింగ్) రోడ్డును సైతం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లోని సిటీ సెంట్రల్ నుంచి జోహ్రానగర్ సెంట్రల్ వరకు వేస్తున్నట్లు శనివారం జీహెచ్ఎంసీ ప్రకటించింది. పేపర్ అండ్ మిషన్ పద్ధతిలో దీనిని నిర్మించనున్నారు. దీని ఎంపికపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత ఖర్చు అవసరమా? ఇదిలా ఉండగా... రహదారుల కోసం రూ. 2631 కోట్లు వెచ్చించడం అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేబీఆర్ పార్కు, ఎల్బీనగర్ల వద్ద మాత్రమే తొలుత పనులు జరగనుండటంతో సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేబీఆర్ పార్కు వద్ద ఇప్పటికే మెరుగైన రహదారులు ఉన్నాయి. సంపన్నులు, వీఐపీలకు మరింత సౌకర్యం తప్ప సామాన్యులకు కాదంటున్నారు. ఇక ఎల్బీనగర్లో విశాలమైన రహదారులు ఉన్నాయి. త్వరలోనే మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏమాత్రం సదుపాయాలు లేని మార్గాల్లో తొలుత పనులు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రజామోదం ఉండాలి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికే దాదాపు రూ.15 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించారు. మరో ఏడాదిన్నరలో ఇది అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల 30 శాతం రద్దీ తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. అదలా ఉండగానే మరో రూ.2631 కోట్లతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పనులు చేపట్టడం సమంజసం కాదు. వీటిలో ఎక్కువ నిధులు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి సంపన్న ప్రాంతాలకే కేటాయించనున్నారు. నగరంలోని బస్తీల ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా ఈ పనులు చేపట్టడం కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయనేతలు, అధికారుల లబ్ధికోసమేననే అభిప్రాయం కలుగుతోంది. వీటికయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీయే చెల్లించాలి. అంటే ప్రజలు కట్టే పన్నుల నుంచే. ఈ భారం ప్రజలపైనే పడుతుంది. ప్రజలతో చర్చించకుండా... వారి ఆమోదం లేకుండా పనులు చేపట్టడం తగదు. -పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం అవసరం 20 ఫ్లైఓవర్లలో జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే 11 ప్రతిపాదించారు. నగరంలో గతంలో జరిగిన అభివృద్ధి అంతా కొన్ని వర్గాలు, ప్రాంతాలకే పరిమితమైంది. ప్రస్తుత టీఆర్ఎస్ కూడా అదే బాటలో కొనసాగుతోంది. జీహెచ్ఎంసీకి ఉన్న కొద్దిపాటి నిధులను సంపన్నుల ప్రాంతాలకే వెచ్చిస్తే... మురికివాడలు, శివారు ప్రాంతాలు, పాతబస్తీ అభివృద్ధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ఈ పనులపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. - ఎం. శ్రీనివాస్, సీపీఐ(ఎం), గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి -
తొలి అడుగు!
ఎస్ఆర్డీపీకి సిద్ధం రూ.1729 కోట్లతో ప్రణాళికలు త్వరలో టెండర్ల ఆహ్వానం విశ్వ నగరం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో హైదరాబాద్లోస్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎక్స్ప్రెస్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లై ఓవర్లు, స్కైవేల నిర్మాణానికి త్వరలో తొలి అడుగు పడనుంది. నగరంలోని వివిధ మార్గాల్లో ఈ పనులకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొం దించారు. దీనికి దాదాపు రూ. 1729 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. సీఎం ఆమోదంతో త్వరలోనే వీటికి గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. ఈ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ను అంతర్జాతీయ ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించారు. భవన నిర్మాణ అనుమతులకు లైన్ క్లియర్ ఎస్ఆర్డీపీ డిజైన్లు ఖరారు కాకపోవడంతోసుమారు నెల రోజులుగా జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదు. తాజాగా అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి అందిన 98 దరఖాస్తుల్లో 18 దరఖాస్తులకు లోతైన అధ్యయనం చేశాక అనుమతులివ్వనున్నట్లు తెలిపారు. ఆ మార్గాల్లో ఎస్ఆర్డీపీ అమలవుతున్న నేపథ్యంలో భూసేకరణ, ఆస్తుల సేకరణ, రహదారుల విస్తరణ, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టామన్నారు. సర్కిల్, జోనల్ స్థాయి కార్యాలయాల్లో మరో 590 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ఎస్ఆర్డీపీ మార్గాల్లో లేని దరఖాస్తులకుస్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 రోజుల్లో అనుమతిస్తామని ప్రకటించారు. తొలిదశ ఎస్ఆర్డీపీ పనులు నగరంలో అన్ని వైపులా ఉంటాయని చెప్పారు. జీహెచ్ఎంసీ చేతుల్లోనే... భవన నిర్మాణ అనుమతుల అధికారం జీహెచ్ఎంసీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుందనేది వాస్తవం కాదని కమిషనర్ స్పష్టం చేశారు. ఎస్ఆర్డీపీ పనులకు ఆటంకం క లుగకుండా ఉండేందుకు కొద్దిరోజుల పాటు భవన నిర్మాణ అనుమతులు నిలిపివేశామన్నారు. భవనాల క్రమబద్ధీకరణ, ఫ్లోర్ స్పేస్ఇండెక్స్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, బిల్డర్లు, వివిధ వర్గాల ప్రజలతో చర్చించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద న్నారు. హుస్సేన్సాగర్ నీటిని ఖాళీ చేసే అంశమై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నైపుణ్యం ఉన్న ఏజెన్సీలు, ప్రభుత్వ విభాగాల నుంచి నివేదికలు అందాక, ప్రణాళిక రూపొందించి సంబంధిత విభాగాలకు బాధ్యత లు అప్పగించే అవకాశం ఉందన్నారు. ఆస్తిపన్ను చెల్లించండి ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసినందున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా స్పెషలాఫీసర్ విజ్ఞప్తి చేశారు. బకాయిల వసూలుకు337 మంది నోడల్ ఆఫీసర్లు, 24 మంది సూపర్వైజర్లు పని చేస్తున్నారని చెప్పారు. వివిధ సర్కిళ్లలో పర్యటిస్తున్న వీరు పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతుల వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నార ని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు రూ. 97 కోట్లు అధికంగా వసూలయ్యాయని చెప్పారు. దుకాణాల ముందు డంపర్ బిన్లు పెడుతున్న విషయమై స్పందిస్తూ రెడ్నోటీసులు, జప్తు వారెంట్లు ఇవ్వడం, సంస్థల సీజ్లతో బకాయిదారులు దారికి రాకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన గ్రీన్ యూరినల్స్ చాలాచోట్ల పనిచేయడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న ఇంజినీర్లు, టౌన్ప్లానర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్రెడ్డి, అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) ఎస్.హరికృష్ణ పాల్గొన్నారు. భవనాల మధ్య... ఎస్ఆర్డీపీలో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల ఆటంకాలు లేకుండా చూడటంతో పాటు భూసేకరణ వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలన్నది జీహెచ్ఎంసీ యోచన. దీనికి అనుగుణంగా అవసరమైతే గ్రేడ్ సెపరేటర్లను వాణిజ్య భవనాల్లోని ఒకటి, రెండు అంతస్తుల గుండా తీసుకువెళ్లాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఆ భవనాల్లోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఎలాంటి నిర్మాణాలు లేకుండా సంబంధిత యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వాటికి ప్రత్యేక అనుమతులు జారీ చేస్తారు. తొలిదశలో చేపట్టబోయే రాచమార్గాలలో ఒకటి, రెండు చోట్ల ఇలాంటి ఏర్పాట్లకు అవకాశం ఉందని సోమేశ్ కుమార్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోకి ఆర్ అండ్ బీ రోడ్లు.. జీహెచ్ఎంసీలోని వివిధ మార్గాల్లో ఉన్న 239 కి.మీ.ల ఆర్అండ్బీరోడ్లు త్వరలోనే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోకి రానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలోనే అమల్లోకి రానుందని ఆయన వివరించారు. తొలిదశ ఇలా... ఎస్ఆర్డీపీ తొలిదశ పనులను జీహెచ్ఎంసీ నిధులతోనే చేపట్టే అవకాశం ఉంది. ఏటా దాదాపు రూ. 500 కోట్ల వంతున ఖర్చు చేయగలరని అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖజానా పరిపుష్టంగా ఉండటంతో పాటు మెట్రో రైలు మార్గాల్లో ప్రకటనల పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో రూ.100 కోట్లు జీహెచ్ఎంసీ వాటాగా రాగలవనే ధీమాలో ఉన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ సాయం కోరనున్నారు. తాత్కాలికంగా ఎంపిక చేసిన మార్గాలు 1. దుర్గం చెరువు బ్రిడ్జి 2. ఎల్బీనగర్ వద్ద ఫ్లై ఓవర్ 3. ఉప్పల్ వద్ద ఫ్లైఓవర్ 4. బాలానగర్ వద్ద ఫ్లై ఓవర్ 5. రసూల్పురా వద్ద ఫ్లై ఓవర్ 6. కేబీఆర్ పార్కు వద్ద 6 జంక్షన్లు.. చుట్టు పక్కల రోడ్లు 7. జీవవైవిధ్య పార్కు జంక్షన్ నుంచి కూకట్పల్లి కేబీఆర్ పార్కు: గ్రేడ్ సెపరేటర్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు 1. కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం 2. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ 3. మహారాజా అగ్రసేన్ చౌక్, రోడ్డు నెం.12 4. ఫిల్మ్నగర్ రోడ్డు జంక్షన్ 5. రోడ్డునెం.45 జంక్షన్ 6. జూబ్లీహిల్స్ చెక్పోస్టు గమనిక: వీటిలో మార్పు చేర్పులకు అవకాశం ఉంది.