breaking news
even worse
-
కల్వకుంట..జర భద్రం
సంగారెడ్డి మున్సిపాలిటీ:బైక్ అయిన,, కారులైన.. చివరకు స్కూల్ బస్సులైన ఈ దారిన కాస్తా చూసే వెళ్లాల్సి వస్తోంది.. లేదంటే బోల్తా కొట్టడమే.. మట్టిలో ఇరుక్కోవడం జరుగుతుంది. ఇది ఎక్కడో కాదు సాక్షత్తు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని లాల్సాబ్ గడ్డ - కల్వకుంట ప్రధాన రహదారి దుస్థితి. లాల్సాబ్ గడ్డ నుంచి కల్వకుంటకు వెళ్లే రహదారి నిర్మాణం కోసం 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజీవ్నగర్ బాట కార్యక్రమంలో భాగంగా రోడ్డు పనులను ప్రారంభించారు. అదే సమయంలో కల్వకుంట నుంచి పాత బస్టాండ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేశారు. అందుకుగాను డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయడం కోసం అధికారులు సర్వే చేసి పనులు సైతం ప్రారంభించారు. కాని పాలకుల, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికి రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయాలేకపోతున్నారు.ఈ సమస్యపై 15వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ప్రతిసారి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా ఏమాత్రం ఫలితం లేకపోయింది. గత వారం రోజులుగా వరుసగా వర్షలు కురియడంతో ఈ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మట్టి రోడ్డు కావడంతో ఎక్కడా పడితే అక్కడ వాహనాలు బోల్తా పడుతున్నాయి. రాత్రి వేళలలో అయితే ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు కిందపడి గాయాలపాలవుతున్నారు. పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సులు సైతం ఈ రోడ్డున వచ్చి మట్టీలో ఇరుక్కు పోయి పంట పొలాల్లోకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇప్పటికైన అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు తమ వార్డులో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారేమాత్రం పట్టించుకోవడంలేదు. పాలకవర్గ సమావేశంలో సైతం తాను ఈ విషయంపై ప్రస్తావించినా కమిషనర్గాని, ఇంజనీర్లు గాని స్పందించడం లేదు. దీంతో స్కూల్కు వెళ్లే పిల్లలు సైతం బురదలోనే వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. -జహినాద్బేగం, వార్డు కౌన్సిలర్ -
నరకం ... నరకం
పెద్దశంకరంపేట:గ్రామాల్లోని మట్టి రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా సిమెంటు రోడ్లకు నోచుకోవడం లేదు. చిన్నపాటి వర్షాలకే బురదమయంగా మారి నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని మాధవ నగర్కు వెళ్లే దారే ఇందుకు నిదర్శనం. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలు పడితే నడక కూడా కష్టమే. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలవడం, వాహనాల రాకపోకల వల్ల దారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో రోడ్డు పక్క ఉన్న పొలాల్లో నడవాల్సి వస్తోంది. వర్షం పడిన పది పదిహేను రోజులు తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని పాదచారులు తెలిపారు. ఈ సమస్య పంచాయతీ సిబ్బంది, అధికారులకు తెలిసినా వారు రోడ్డు బాగు కోసం కృషి చేయడం లేదని ఆరోపించారు. గతంలో సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను కోరినట్లు ప్రజలు తెలిపారు.] ప్రతి రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది ఈ మార్గంలో కాలి నడకన రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కూడా బురద కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని వివరించారు. అంతేకాకుండా బురదలో వాహనం ఇరుక్కుపోతే దాన్ని బయటికి తీయడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి రోడ్డును సీసీగా మార్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.