breaking news
Employees of the division of power
-
ఉద్యోగుల సమస్యకు కమిటీ
తామే ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ధర్మాసనం చెరో నలుగురి పేర్లను సిఫారసు చేయాలని ఆదేశం రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్గా సిఫారసు చేస్తామని వెల్లడి విచారణ ఈనెల 11కు వాయిదా హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం వ్యవహారంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున, ఇక సమస్య పరిష్కారానికి తామే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చెరో నలుగురి పేర్లను రెండు రోజుల్లో సిఫారసు చేయాలని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది. ఇరు రాష్ట్రాలతో సంబంధంలేని వ్యక్తిని, వీలైనంతవరకు ఓ రిటైర్డ్ న్యాయమూర్తిని తాము సిఫారసు చేస్తామని, ఆ వ్యక్తి కమిటీకి చైర్మన్గా వ్యవహరించేలా యోచన చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ తొమ్మిదిమంది కలిసి వివాద పరిష్కార బాధ్యతలను చేపడుతారని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. అలాగే రిలీవ్ అయిన ఉద్యోగులకు జీతాల చెల్లింపు వ్యవహారాన్ని కూడా శుక్రవారం తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల వాదనలు ఇలా ఉన్నాయి. ఏపీ జెన్కోలో 3,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: తెలంగాణ సీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పోస్టులను విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కోకు 9,251 పోస్టులు, టీఎస్ జెన్కోకు 7,440 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ రెండింటితో కలిపి మొత్తం 16,691 పోస్టులు ఉన్నాయి. అపాయింటెడ్ డే నాటికి మొత్తం పోస్టుల్లో 12,091 మందే పనిచేస్తున్నారు. తాత్కాలిక కేటాయింపుల కింద టీఎస్ జెన్కోకు 5,897, ఏపీ జెన్కు 6,122 మందిని కేటాయించారు. తద్వారా టీఎస్ జెన్కోలో 1,543 పోస్టులు టీఎస్ జెన్కోలో 3,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ జెన్కో కేటాయించి, బదిలీ చేసిన 512 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఖాళీగా ఉన్న 3,129 పోస్టుల్లో సులభంగా చేర్చవొచ్చు. స్థానికత ఆధారంగా మేం రిలీవ్ చేసిన 1,242 ఉద్యోగులను కొత్త పోస్టులు సృష్టించకుండానే ఖాళీగా ఉన్న 3,129 పోస్టుల్లో చేర్చవచ్చు. ఉద్యోగుల విభజన పరిష్కార బాధ్యతలను రిటైర్డ్ అధికారిణి షీలా బిడే నేతృత్వంలోని కమిటీకి అప్పగించాలన్న ఏపీ వాదన మాకు ఆమోదయోగ్యం కాదు. జనాభా ప్రాతిపదికనే జరగాలి: ఏపీ సీఎస్ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన జరగాలి. అలా జరగని పక్షంలో పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం మూసివేతకు దారి తీయవచ్చు. ఆస్తుల, అప్పుల విభజన, ఉద్యోగుల విభజన కలిపి ఒకేసారి చేయాలి. పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన పరస్పర చర్చల ద్వారానే జరగాలి తప్ప, ఏకపక్షంగా కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన విభజన మాకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. -
కొలిక్కిరాని విద్యుత్ ఉద్యోగుల విభజన
న్యాయస్థానం సూచన మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ ఎవరి వాదన వారిదే-భేటీలో పరిష్కారం కాని విభజన సమస్య హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం కొలిక్కి రాలేదు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. న్యాయస్థానం సూచన మేరకు విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఇందులో రెండు రాష్ట్రాల సీఎస్లు ఎవరి వాదనకు వారు కట్టుబడ్డారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మతో విద్యుత్ ఉద్యోగుల విభజనపై చర్చించానని, పరిష్కారం లభించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీ స్థానికత ఆధారంగా చేయాలని కోరుతోందని, ఇందుకు ఏపీ అంగీకరించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిన 1,253మంది విద్యుత్ ఉద్యోగులు రెండు నెలల నుంచి జీతాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రవిభజన చట్టంలో ఎక్కడా ఏకపక్షంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీకి ఆస్కారం కల్పించలేదని, చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు ఏ ప్రాంతం లో ఉన్నా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు వాటి సేవలను పొందాలని ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలో విభజన చట్టంలో ఎక్కడా పొందుపరచలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీతోపాటు తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీ జనాభా ప్రాతిపదికన షీలాబిడే కమిటీ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రానికి తెలియజేసినట్లు సీఎస్ పేర్కొన్నారు.