‘ఉత్త’ మాటలు కట్టిపెట్టు
కరీంనగర్...రా...చర్చిద్దాం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి
కరీంనగర్ సిటీ : ‘చావులకు...సారెలకు వచ్చి...ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాదు...‘ఉత్త’ మాటలు కట్టిపెట్టు... దమ్ముంటే, ధైర్యముంటే కరీంనగర్కు...రా...అభివృద్ధిపై చర్చిద్దాం’ అంటూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై ధ్వజమెత్తారు. కరీంనగర్లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పథకాలకు టీఆర్ఎస్ శంకుస్థాపనలు చేస్తున్నారనడాన్ని ఖండించారు. 2004లో కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తాగునీటి పథకాలకు రూ.360 కోట్లు పథకం తీసుకువస్తే ఆ ఫైల్ను తొక్కిపెట్టిన ఘనత కాంగ్రెస్దన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు మౌలిక సదుపాయాలైన తాగు, సాగునీరు, విద్యుత్ను ఇవ్వడానికి ఒక ఉద్యమంలా పనిచేస్తోందని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అందులో భాగమేనని, కోత లేని విద్యుత్ను ఇస్తున్నామన్నారు. పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వే లైనును 25 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి చేయడం లేదని, కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైనును త్వరితగతంగా పూర్తి చేస్తామన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ విమర్శించారు. ఇంటింటికీ నల్లా నీళ్లు అందివ్వాలనే మహాసంకల్పంతో వాటర్గ్రిడ్ను ప్రవేశపెడితే విమర్శలు చేయడం కాంగ్రెస్ నైజాన్ని తెలియజేస్తోందన్నారు. మేయర్ రవీందర్ సింగ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అశోక్, గుంజపడుగు హరిప్రసాద్, బోయినిపల్లి శ్రీనివాస్, మైకేల్ శ్రీనివాస్, జక్కం నర్సయ్య, జమీలుద్దిన్, పెండ్యాల మహేశ్ పాల్గొన్నారు.