breaking news
E Pass Website
-
ఫస్ట్..ఫాస్ట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం ఫస్ట్ కమ్ ఫాస్ట్ అనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటివరకు సీనియర్ విద్యార్థుల ఫీజులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తున్నప్పటికీ అందుబాటులోని నిధులు చాలక కొన్ని కాలేజీలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీన్ని అధిగమించేందుకు నిధుల మంజూరులో సంస్కరణలు చేపట్టింది. ఇకపై ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థుల అర్జీలను పూర్తిగా పరిశీలించాక సంక్షేమ శాఖలకు ముందు సమర్పించే కాలేజీలకు తొలుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. వెబ్సైట్లో మార్పులు: ఫస్ట్ కమ్ ఫాస్ట్ విధానం కోసం ఈ–పాస్ వెబ్సైట్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. గత వారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) బృందంతో సంక్షేమ శాఖలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో నిబంధనలను ప్రస్తావించిన అధికారులు... ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని సీజీజీకి సూచించారు. ప్రస్తుతం ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ దరఖాస్తులన్నీ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల దరఖాస్తులను తొలుత కాలేజీలు పరిశీలించి ఆపై వాటిని సంక్షేమ శాఖకు ఆన్లైన్లో సమర్పించడంతోపాటు మ్యాన్యువల్ దర ఖాస్తులను సంక్షేమ శాఖకు పంపుతున్నాయి. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తోందనే ఉద్దేశంతో దరఖాస్తుల పరిశీలనపై కాలేజీ యాజమాన్యాలు శ్రద్ధ చూపట్లేదు. దీంతో కాలేజీల మధ్య పోటీ పెంచడంతోపాటు దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేసేందుకు ఫస్ట్ కమ్ ఫాస్ట్ను తీసుకొచ్చారు. దరఖాస్తులను ఏ కాలేజీ ముందు పంపించిందనే విషయం ఈ–పాస్ వెబ్సైట్లో కనిపించేలా సీజీజీ రైడర్స్ను ఏర్పాటు చేసింది. దీంతో దరఖాస్తులు సమర్పించిన కాలేజీ సమ యం క్షణాలతో సహా కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అధికారులు ఆయా కాలేజీలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేస్తారు. ముందుగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు... ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా చెల్లింపులు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు.. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 30తో దర ఖాస్తు గడువు ముగియనుంది. జనవరి నెలాఖరు వరకు పాత బకాయిల చెల్లింపుల్లో సంక్షేమ శాఖలు తలమునకలయ్యాయి. జనవరి 31 నాటికి 2013–14 నుంచి 2017–18 వరకున్న పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలు వేగం చేశారు. -
కాలేజీల నిర్వాకం... స్కాలర్షిప్లకు గండం
మరో 15 రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల గడువు ఇప్పటికీ ఈ–పాస్లో నమోదు చేసుకోని వేల కాలేజీలు లక్షల మంది ఫీజులు, ఉపకార వేతనాలకు దూరమయ్యే ప్రమాదం గతేడాది 13.67 లక్షల దరఖాస్తులు.. ఈ సారి వచ్చినవి 4.37 లక్షలే రాష్ట్రంలోని మొత్తం కాలేజీలు 7,010 ‘ఈ–పాస్’లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి 4,462 వర్సిటీలు, బోర్డులు ధ్రువీకరించినవి 2,873 ‘ఈ–పాస్’లో రిజిస్ట్రేషన్ చేసుకోనివి 2,548 సాక్షి, హైదరాబాద్ కాలేజీల నిర్లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఈ–పాస్ వెబ్సైట్లో ఇప్పటికీ వేల సంఖ్యలో కాలేజీలు నమోదు చేసుకోకపోవడంతో అందులో చదివేవారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 30తో దరఖాస్తు గడువు ముగియనుంది. కానీ ఇప్పటికీ 2,548 కాలేజీలు ఈ–పాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు చెందిన కాలేజీలు 7,010 ఉన్నాయి. ఇవన్నీ ఈ–పాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే. దరఖాస్తు సమయంలో విద్యార్థులకు కాలేజీ వివరాలు అగుపిస్తాయి. కానీ ఇప్పటివరకు కేవలం 4,462 కాలేజీలు మాత్రమే ఈ–పాస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వసతుల్లేవ్.. రెన్యూవల్ రాదు.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఏటా కాలేజీలో మౌలిక వసతులు, స్థితిగతులను పకగా పరిశీలించి పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి కాలేజీ సంబంధిత యూనివర్సిటీ/బోర్డు నుంచి అనుమతి పత్రాన్ని తీసుకోవాల్సి ఉంది. అలా అనుమతి పొందిన తర్వాతే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపునకు సంబంధించి ఈ–పాస్ వెబ్సైట్లో ఆమోదం లభిస్తుంది. ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు కళాశాల యాజమాన్యాల్లో వణుకు పుట్టిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ కాలేజీల్లో అనేక లొసుగులున్నాయి. ముఖ్యంగా బోధన సిబ్బందిని నిర్దేశిత సంఖ్యలో నిర్వహించడంలేదు. మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ లొసుగులన్నీ అనేక సందర్భాల్లో బయటపడ్డాయి. దీంతో పలు కాలేజీల గుర్తింపును సంబంధిత యూనివర్సిటీలు/బోర్డులు రెన్యూవల్ చేయడం లేదు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే కాలేజీలు గుర్తింపు పత్రాన్ని పొందాలి. కానీ కాలేజీల్లో సరైన వసతులు లేనందున వాటి ఫైళ్లన్నీ ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉండిపోతున్నాయి. కొన్ని జూనియర్ కాలేజీలు షిఫ్టింగ్(మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాకే అనుమతి ఇవ్వాలని నిర్ణయించిన అధికారులు ఆ కాలేజీలకు సంబంధించిన ఫైళ్లను పక్కనబెట్టారు. దీంతో సదరు కాలేజీలు ఈ–పాస్ వెబ్సైట్లో నమోదు కావడం లేదు. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కేవలం 2,873 కాలేజీలు మాత్రమే అర్హత సాధించడంతో అధికారులు వాటి వివరాలను మాత్రమే ఈ–పాస్ వెబ్సైట్లో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్కూ వెనుకడుగు విద్యార్థి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అతడు చదివే కాలేజీ వివరాలు ఈ–పాస్లో కనిపించాలి. అందుకు ప్రతి కాలేజీ ఈ–పాస్లో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకోకుంటే వాటిల్లో చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోలేరు. ఇప్పటిదాకా మొత్తం 7010 కాలేజీల్లో.. కేవలం 4,462 కాలేజీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ కాలేజీలకు కూడా సంబంధిత యూనివర్సిటీ/బోర్డులు ధ్రువీకరణ వస్తేనే విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాలు వస్తాయి. మరోవైపు 2,548 కాలేజీలు కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. మరో పక్షం రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. గతేడాది 13.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2017–18 విద్యా సంవత్సరంలో 13.5 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 4.37 లక్షల దరఖాస్తులే రావడంతో అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును రాష్ట్రప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది. ప్రస్తుతం విద్యార్థులు, కాలేజీల రిజిస్ట్రేషన్లు ఇంకా కొనసాగుతున్నందున చివరి అవకాశం ఇచ్చేందుకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్ పీటర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.