breaking news
E books
-
నెట్టింట్లోకి మారిన క్లాస్రూమ్ అడ్రస్
సాక్షి, హైదరాబాద్ : చదువు కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్నటి వరకు స్కూలు నుంచి ఇంటికొచ్చాక ట్యూషన్లు, హోంవర్క్లతో చిన్నారులను తల్లిదండ్రులు బిజీగా ఉంచేవారు. కానీ ఇప్పుడు ఆ ‘బిజీ’నెస్ కాస్త రూటు మారింది. చదువులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించుకొని ‘ఆన్లైన్’గా మారిపోయాయి. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్స్కు దీటుగా.. ప్రైవేట్ వెబ్సైట్లు ఆన్లైన్ సేవలకు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా.. మొబైల్ యాప్లను రూపొందించాయి. తమ యాప్ బాగుంటుందంటే తమ యాప్ ఎక్కువ ఉపయోగకరమంటూ పోటీ పడుతున్నాయి. ఇలా పదుల సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన లెర్నింగ్ యాప్లలో దేన్ని కొనుగోలు చేయాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. పదులు, వందల రూపాయల లెవల్ దాటి.. ఒక్కో తరగతికి వేల రూపాయల డబ్బు వసూలు చేస్తున్నారు. అయినా.. పిల్లల చదువులకోసం ఏమైనా చేయాల్సిందేనంటూ తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. సాధారణ స్కూళ్లలో ఫీజుల కంటే ఎక్కువైనా భరించేందుకు సిద్ధపడుతున్నారు. పాఠాలే కాదు.. డౌట్స్ కూడా తీరుస్తారు విద్యార్థులకు ఆన్లైన్ చదువులు లక్ష్యంగా ప్రతి సంస్థ వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. త్రీడీ, యానిమేషన్ మేళవించి రూపొందించిన పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాయి. అంతేకాకుండా విద్యార్థుల పరిసరాల్లోని పరిస్థితులతో పాఠ్యాంశాలను అన్వ యించి అందించే బోధనతో కూడిన వీడియో పాఠాలను అందు బాటులోకి తెచ్చాయి. విద్యార్థులకు అర్థం కాకపోతే.. ఆన్లైన్లో నివృత్తి చేసేందుకు 24 గంటలు పనిచేసే కాలింగ్ సదుపాయం కల్పించాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా ఆన్లైన్లోనే సందేహాలను నివృత్తి చేసే చర్యలు చేపట్టాయి. విద్యార్థి తనకు అర్థంకాని ప్రాబ్లంను ఆన్లైన్లో పంపిస్తే దానికి ఆన్లైన్లోనే సమాధానం ఇచ్చేలా చర్యలు చేపట్టాయి. ప్రతి విద్యార్థి తరగతి వారీగా చూసే వీడియో పాఠశాలపై ప్రశ్నలు ఇచ్చి వారు ఏ స్థాయిలో ఉన్నారో అంచనా వేసేందుకు ‘ఇండివిజువల్ అనలిటికల్ రిపోర్టు’అందిస్తూ దానికి అనుగుణంగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టాయి. పోటీ పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచుతూ.. ప్రిపేర్ అయ్యేలా చర్యలు చేపట్టడంతోపాటు కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశాయి. ఇంకొన్ని ఈ–లెర్నింగ్ సంస్థలైతే.. గ్రూప్లను క్రియేట్ చేసి ఇతరులతో గ్రూప్ డిస్కషన్లో పాల్గొనేలా చర్యలు చేపట్టాయి. స్కూల్ ఫీజుల కంటే అత్యధికంగా వసూళ్లు సాధారణ స్కూల్ ఫీజుల కంటే ఒక్కో తరగతికి అందించే ఆన్లైన్ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్కు ఈ సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. తరగతిని బట్టి ఫీజులను నిర్ణయిస్తున్నాయి. కనీసంగా ఒక్కో తరగతికి ఒక్కో విధంగా రూ.15 వేల నుంచి రూ.35 వేల వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఐఐటీ, నీట్ బేస్డ్గా అందించే చదువులకు రేటు ఎక్కువ. మరోవైపు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేదా 12వ తరగతి వరకు ప్యాకేజీల రూపంలో స్పెషల్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి. ఇలా అన్ని తరగతులకు తీసుకుంటే రూ.95వేల నుంచి దాదాపు రూ.1.20లక్షల వరకు తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తోంది. కొన్సి సంస్థలు తమ ఆన్లైన్ కోర్సులను తీసుకునే వారికి ట్యాబ్లు, వీడియో పాఠాలతో కూడిన ఎస్డీ కార్డులను అందిస్తున్నాయి. ‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో కూడా.. వీటితో పాటు పత్రికారంగంలోని ఆన్లైన్ యాప్లు కూడా విస్తృతాదరణ పొందుతున్నాయి. ఇందులో ‘సాక్షి’మీడియా గ్రూప్..www.sakshieducation.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ కంటెంట్ను, వీడియో పాఠాలను విద్యార్థులకు అందిస్తోంది. ఇక్కడే ప్రాక్టీస్ టెస్ట్లను కూడా నిర్వహిస్తోంది. నిపుణుల సలహాలు, సూచనలు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, టిప్స్ను ఉచితంగా అందిస్తోంది. బాధ్యతగా ఉండే వారికి మంచి ప్లాట్ఫారం ఆన్లైన్ లెర్నింగ్ యాప్లు సెల్ఫ్ రెస్పాన్స్బుల్గా ఉండే వారికి ఎక్కువ ఉపయోగం. ప్రస్తుతం ఆన్లైన్ లెర్నింగ్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వారిలో 20% మాత్రమే సరిగ్గా వినియోగిస్తున్నారు. మిగతావారు డబ్బులు చెల్లించి వదిలేస్తున్నారు. ఆన్లైన్ లెర్నింగ్ కంటే క్లాస్రూమ్ లెర్నింగే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంటరాక్షన్ ఇక్కడే ఉంటుంది. తరగతిలోని విద్యార్థుల స్థాయిని టీచర్లు అర్థం చేసుకుని వారికి సరిపోయే విధంగా మార్పులు చేస్తారు. గ్రూప్ డిస్కషన్కు ఇక్కడే ఎక్కువ అవకాశం ఉంది. - వెంకట్ కంచనపల్లి, సీఈవో సన్టెక్ -
‘ఆల్ ద రెబెల్ ఉమెన్’: ఫెమినిజమ్ నూరేళ్ల ప్రయాణం!
‘తక్కువ చదివి ఎక్కువ తెలుసుకున్నాం’ అని పాఠకులు భావించే రచనలు ఎలా ఉంటాయి? ‘గార్డియన్ షార్ట్స్’ పేరిట గార్డియన్ పత్రిక ప్రచురిస్తోన్న ఈబుక్స్ చూడాల్సిందే. అనేక సామాజిక అంశాలపై క్లుప్తంగా సమగ్రంగా వివరాలు అందించే వ్యాస సంపుటులను గార్డియన్ సంస్థ ‘గార్డియన్ షార్ట్స్’గా ప్రచురిస్తోంది. ఆ వరుసలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో ‘ఆల్ ద రెబెల్ ఉమెన్ : ద రైజ్ ఆఫ్ ద ఫోర్త్ వేవ్ ఆఫ్ ఫెమినిజం (తిరగబడ్డ స్త్రీలందరూ : ఫెమినిజంలో ఎగసిన నాల్గవ కెరటం)’ అనే పుస్తకాన్ని (అమెజాన్లో రూ. 199) విడుదల చేసింది. ఇప్పటికే శరవేగంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకానికి రచయిత్రి ‘కిరా కొక్రన్’. ఈమె గతంలో గార్డియన్ మహిళల పేజీ ఎడిటర్గా ఐదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఫీచర్స్ రాస్తున్నారు. ఆ అనుభవంతో నూరేళ్ల ఫెమినిజాన్ని కిరా దర్శించి ఈ చిన్ని పుస్తకంగా వెలువరించారు. అందులో మిళితమైన జాతి- మత-ప్రాంత-కుల వివక్షతల పొరలనూ, వాటిని అధిగమించి తిరగబడ్డ వివిధ దేశాల, సమూహాల మహిళలను కిరా పాఠకులకు పరిచయం చేశారు. ఇంతకూ ‘నాల్గవ కెరటం’ స్థూలంగా ఏమి చెబుతోంది? 1913 జూన్ 4. పట్టపగలు. డ ర్బీ రేస్కోర్స్. పందెపు గుర్రాలు దౌడు తీస్తున్నాయి. ఇంతలో ఒక కలకలం. ప్రేక్షకుల్లోంచి ఒక స్త్రీ హటాత్తుగా ట్రాక్ మీదకు దూసుకువచ్చింది. పందెపు గుర్రాలలో నురగలు కక్కుతూ పరుగెడుతోన్న ఐదవ కింగ్జార్జ్ గుర్రానికి ఎదురు నిలిచింది. దూసుకుపోతున్న గుర్రం. దానిని నిలువరిస్తున్న స్త్రీ. ప్రాణాలు పోతూ ఉండగా ఎట్టకేలకు ఆమె విజయం సాధించింది. గుర్రం పడిపోయింది! అది చూసిన రాజుకు మాట పడిపోయింది. ఇంతకూ ఎవరామె? ఎమిలీ విల్డింగ్ డేవిసన్! ఎందుకంత సాహసం చేసింది? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మహిళలకు ఓటు హక్కును డిమాండ్ చేసిన మిలిటెంట్ ఉద్యమకారిణి ఎమిలీ. ఆమె అంత్యక్రియల్లో ‘ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’ ఉద్భవించింది. మహిళల రాజకీయహక్కులను సాధించిన ఎమిలీ డేవిసన్ (11 అక్టోబర్ 1872- 8 జూన్ 1913) స్త్రీవాదపు తొలితరంగం! ఇలా పడిన తొలి అడుగు ఆ తర్వాత అమెరికాలో మలి అడుగయ్యింది. కుటుంబంలో, సమాజంలో, పనిచేసేచోట, సంతానం కనే అంశంలో, ఆస్తి హక్కుల్లో సమానత్వం కావాలని 1960ల్లో అమెరికా నుంచి స్త్రీవాద ఉద్యమం ఆకాశానికి అంటింది. ఒకరకంగా ఆ ఉద్యమం స్త్రీవాదంలో రెండవ కెరటం. మూడోసారి? 1990ల్లో ఆసియా, మధ్యధరా దేశాలను ప్రభావితం చేస్తూ ఉవ్వెత్తున స్త్రీవాద ఉద్యమం ఎగసింది! ఇప్పుడు? నాల్గవ తరంగం ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడుతోంది! ఢిల్లీ నిర్భయ ఉదంతం ఇందుకు ఉదాహరణ. స్త్రీలు ముఖ్యంగా యువత స్త్రీవాద చైతన్యాన్ని పరస్పరం ప్రసరింప చేసుకుంటున్నారు. ‘ఎవ్రీ డే సెక్సిజం’లాంటి ప్రాజెక్ట్ల ద్వారా ఆన్లైన్లో తక్షణం సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. ప్రదర్శనలు చేస్తున్నారు. లింగవివక్షతపై ఎదుర వుతోన్న సమస్యలను గుర్తించి, న్యాయాన్ని కోరుతూ వినూత్న చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘కెరటాలు వెనక్కు వెళ్లవని, రెట్టించిన వేగంతో ముంచుకు వస్తాయని’ ధీర వనితలు నిరూపిస్తున్నారు. - పున్నా కృష్ణమూర్తి