breaking news
Domestic car market
-
భారత్లో విక్రయాలకు జీఎం గుడ్బై!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో ‘షవర్లే’ కార్ల విక్రయాలకు స్వస్తి చెప్పనుంది. రెండు దశాబ్దాలుగా దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ సంస్థ వాటా ఒక్క శాతంలోపే ఉండిపోవడంతో, చివరికి విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దేశీయ కార్ల మార్కెట్ను దాదాపుగా జపాన్ కంపెనీలే గణనీయమైన వాటాతో శాసిస్తున్న నేపథ్యంలో జీఎం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. సమగ్ర సమీక్ష అనంతరం, ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాల పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జీఎం ప్రకటించింది. అలాగే, రష్యా, యూరోప్ సహా నాలుగు ఇతర మార్కెట్ల నుంచి కూడా వైదొలిగింది. ఇకపై ‘జీఎం మోటార్స్ ఇండియా’ భారత్ నుంచి ఎగుమతులకే పరిమితం కానుంది. కంపెనీకి మహారాష్ట్రలోని తాలెగాన్, గుజరాత్లోని హాలోల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హాలోల్ ప్లాంట్లో ఉత్పత్తిని గత నెలలోనే జీఎం నిలిపివేసింది. ఈ ప్లాంట్ను తన చైనా భాగస్వామి ఎస్ఏఐసీ మోటార్కు విక్రయించేందుకు చర్చలు జరుపుతోంది. తాలేగాన్ ప్లాంట్ను మాత్రం ఎగుమతుల కోసం వినియోగించుకుంటుంది. జీఎం కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 21% క్షీణించి 25,823కు పరిమితం కాగా, అదే సమయంలో కంపెనీ ఉత్పత్తి చేసిన కార్ల సంఖ్య 83,368. వీటిలో ఎక్కువ భాగాన్ని కంపెనీ ఎగుమతి చేసింది. రేసులో గెలవలేక... భారత్లో తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకుగాను బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు జీఎం 2015లో ప్రకటించింది. భారత మార్కెట్లో స్థానికంగానే తయారు చేసిన 10 మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలిపింది. అయితే, ఇక్కడి మార్కెట్లో కంపెనీ అమ్మకాలు పుంజుకోకపోవడంతో తన ప్రణాళికలను పక్కన పెట్టేసింది. ‘‘ఈ నిర్ణయానికి రావడం కష్టంగానే అనిపించినా, మా ప్రపంచవ్యాప్త విధానానికి మద్దతుగా నిలిచేందుకు, మా వాటాదారులకు తగినంత లాభాలను అందించేందుకు ఇది సరైన నిర్ణయమే అవుతుంది’’అని జీఎం మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టీఫన్జాకొబి పేర్కొన్నారు. ఎన్నో అవకాశాలను పరిశీలించిన అనంతరం భారత్లో పెట్టుబడులు పెంచుకోవడం వల్ల ఆశించిన మేర రాబడులు రావని గుర్తించినట్టు చెప్పారు. కాగా, ఈ నిర్ణయాన్ని జీఎం భారత్లోని తన ఉద్యోగులకు కూడా తెలియజేసింది. అయితే, ఎంత మందిపై ఇది ప్రభావం చూపేది కంపెనీ స్పష్టం చేయలేదు. కనీసం 200 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇకపై ఎగుమతులే తమకు ముఖ్యమని జీఎం ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కహెర్ కాజెమ్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన షవర్లే బీట్ హచ్బ్యాక్ను మెక్సికో, సెంట్రల్, దక్షిణా్రíఫికా మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నామని... ఈ మార్కెట్ల కోసం షవర్లే బీట్ సెడాన్ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. -
దేశీ మార్కెట్లో చిన్న కార్ల జోరు
న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటూ వచ్చిన దేశీ కార్ల మార్కెట్కు ప్రస్తుతం చిన్న కార్లు ఊతమిస్తున్నాయి. ఇరుకు రోడ్లు, పార్కింగ్ సమస్యల కారణంగా కొనుగోలుదారులు ఎక్కువగా వీటివైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. దీంతో పరిమాణంలో చిన్నగా ఉన్నా, కొనుగోలుదారు పెట్టే ధరకు గరిష్ట స్థాయిలో లగ్జరీ సదుపాయాలను కూడా ఆటోమొబైల్ కంపెనీలు వీటిలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ. 5,00,000- రూ. 9,00,000 శ్రేణిలో మినీ సెడాన్లు, రూ. 6,00,000 నుంచి రూ. 12,00,000 దాకా ఖరీదు చేసే స్పోర్ట్స్ యుటి లిటీ వాహనాలు(ఎస్యూవీ), మల్టీ యుటిలిటీ వాహనాలు(ఎంయూవీ) మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్ మెరుగ్గా 15-16 శాతం స్థాయిలో వృద్ధి చెందుతోందని అంచనా. నాలుగు మీటర్ల లోపు పొడవుండే కార్లపై తక్కువ స్థాయిలో ఎనిమిది శాతం ఎక్సైజ్ సుంకం విధించాలన్న గత యూపీఏ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. చిన్న కార్ల ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. సెడాన్లపై 20 శాతం, ఎస్యూవీలపై 24 శాతం ఎక్సైజ్ సుంకాలు ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించడం చిన్న కార్ల మార్కెట్కు తోడ్పడుతోంది. లగ్జరీ ఫీచర్లు.. లోపల విశాలంగా ఉండటం, లగ్జరీ ఫీచర్లు, తక్కువ ధర, చూడముచ్చటి ఆకారం, అన్నింటికన్నా ముఖ్యంగా మెరుగైన మైలేజీ, ట్రాఫిక్లో సైతం సులువుగా వెళ్లేందుకు అనువుగా ఉండటం చిన్న కార్లకు ప్లస్ పాయింటు. టచ్స్క్రీన్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, పార్కింగ్ సెన్సార్లు, డే-టైమ్ ల్యాంప్లు, సీడీ ప్లేయర్లు మొదలైన ఫీచర్లు కొన్నాళ్ల క్రితం దాకా కాస్త పై స్థాయి కార్లకు మాత్రమే పరిమితం అయ్యేవి. ప్రస్తుతం టెక్నాలజీ అభిరుచి కలిగిన యువ కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండటంతో కంపెనీలు చిన్న కార్లలో కూడా ఇలాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నాయి. స్టీరింగ్ వీల్పైనే బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో కంట్రోల్స్ కూడా ఉండాలని చాలా మంది కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుడు టుటు ధవన్ తెలిపారు. ఇతరులను అనుకరించడం కాకుండా తమ అవసరాలకు అనుగుణమైన కార్లను ఎంచుకోవడంలో దేశీ కొనుగోలుదారులు ప్రస్తుతం వాస్తవిక దృక్ప థంతో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 4 మీటర్ల లోపు పొడవుండే కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా అమేజ్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ వాహనాలు పాపులర్గా ఉన్నాయి. అలాగే రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మారుతీ సుజుకీ ఎర్టిగా, హోండా మొబీలియో కార్లు మార్కెట్లో పెను మార్పులు తెచ్చాయి. ఈ సెగ్మెంట్ ఊతంతోనే రెనో, ఫోర్డ్ వంటి కంపెనీలు నిలదొక్కుకున్నాయి. భారత మార్కెట్లో లేటుగా ప్రవేశించినప్పటికీ 2012 జూలైలో ప్రవేశపెట్టిన డస్టర్ ఎస్యూవీతో రెనో సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక, రెండు దశాబ్దాల పైగా భారత్లో ఉన్న పెద్దగా విజయవంతం కాలేకపోయిన ఫోర్డ్ సైతం.. ఎకోస్పోర్ట్ మినీ ఎస్యూవీని ప్రవేశపెట్టడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. 17 రోజుల వ్యవధిలో ఏకంగా 40,000 బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికీ వీటికోసం నాలుగు నుంచి ఎనిమిది నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ విభాగం కార్లు ఇంత ప్రజాదరణ పొందుతుండటంతో రాబోయే ఆరు నెలల్లో మారుతీ, టాటా, హ్యుందాయ్, మహీంద్రా, ఫియట్, షెవర్లె, ఫోక్స్వ్యాగన్ తదితర కంపెనీలు మరిన్ని మినీ-సెడాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి.