breaking news
District Govt Hospital
-
రెడీ.. మనకో వెల్నెస్ సెంటర్
సంగారెడ్డి టౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను సకల హంగులతో ప్రారంభానికి సిద్ధం చేశారు. దీన్ని ఈ నెల 8న (నేడు) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిçస్టుల ఆరోగ్య పథకం కింద దీన్ని ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంట్రవెన్షన్ సెంటర్ కింద ఉన్న గదులను ఆధునీకరించి ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందనున్నాయి. దీనికిగాను ప్రభుత్వం ప్రత్యేకంగా 25 మంది సిబ్బందిని నియమించింది. మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉన్నట్లు వెల్నెస్ సెంటర్ అధికారులు తెలిపారు. ముగ్గురు ఎంబీబీఎస్, ఆర్థో, కార్డియాలజిస్టు, ముగ్గురు స్పెషలిస్టులు, ఒక గైనకాలజిస్టు, ఒక జనరల్ మెడిసిన్, ఒక డెంటల్, ఒక పిల్లల వైద్య నిపుణుడి తోపాటు డెంటల్, ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ తదితర సేవలు అందనున్నాయి. జిల్లాలోని ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ఈ ఆరోగ్య పథకం కింద సేవలు పొందాలంటే మొన్నటి వరకు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న వెల్నెస్ సెంటర్కు వెళ్లి పరీక్షలు చేయించుకొని అక్కడి నుంచి ఇతర ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చేది. జిల్లా కేంద్రంలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో నిపుణులైన డాక్టర్ల సేవలు అందనున్నాయి. ఇక నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు. సర్జరీ అవసరమైన రోగులకు, ఇక్కడ అందుబాటులో లేని సేవల కోసం మాత్రమే హైదరాబాద్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్లోని వెల్నెస్ సెంటర్కు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. స్థానికంగానే జిల్లాలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఇక్కడి నుంచే నేరుగా పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లి వైద్య సేవలు నేరుగా పొందే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు దూరంగా ఉన్న కొన్ని కుటుంబాలు వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఉదయం 9 నుంచి ఓపీ సేవలు కార్పొరేట్ స్థాయిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు అవుతుండడంతో సంబంధిత ఆరోగ్య పథకం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉదయం 9 గంటల నుండి ఐదున్నర గంటల వరకు, ఉదయం 8 గంటల నుండి డయాగ్నస్టిక్ పరీక్షల సేవలు అందుబాటులో ఉంటాయి. రోగులు ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటే ఈ వెల్నెస్ సెంటర్ నుంచి రెఫర్ చేయించుకొని వెళ్లవచ్చు. ఇక్కడ ఔట్ పేషెంట్ సేవలు మాత్ర మే అందుబాటులో ఉంటాయి. నగదు రహిత వైద్యం ఇక్కడ లభించనుంది. రోగులకు అయ్యే ఖర్చు ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. వైద్యంతోపాటు పరీక్షలు, మందులు ఉచితంగా అందించనున్నారు. వెల్నెస్ సెంటర్తోపాటు రాష్ట్రంలోని 14 కార్పొరేట్ ఆస్పత్రులు, మరో 200 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా నగదు రహిత వైద్యం ఈ స్కీమ్ కింద చేయించుకోవచ్చు. సాధారణ జబ్బులకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లోనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ వైద్యం లభించని పక్షంలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లగా చేరవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్లు, కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందవచ్చు. అలా చేరిన 48 గంటల్లోగా ఈజేహెచ్ఎస్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 1899 రకాల వ్యాధులకు ఈజేహెచ్ఎస్ కింద చికిత్స అందిస్తారు. వెల్నెస్ సెంటర్ను పరిశీలించిన సీఈఓ సంగారెడ్డి టౌన్: జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంట ర్ను ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సీఈఓ కె.పద్మజ బుధవారం పరిశీ లించారు. ఈ నెల 8న (నేడు) వెల్నెస్ సెంటర్ను ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగు లు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో స్థానికంగానే మెరుగైన వైద్యం అందనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు ధన్యవాదాలు సంగారెడ్డి టౌన్: జిల్లాలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకుగాను మంత్రి హరీశ్రావు, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు ధన్యవాదా లు తెలుపుతున్నానని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వెల్నెస్ కేంద్రాన్ని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఆయనతోపాటు సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సభ్యులు మనోజ్, రఘు, రవి, విఠల్రెడ్డి, రవిశంకర్, జమ్లా ఉన్నారు. -
లారీ ఢీ కొని ముగ్గురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులో లారీ ఢీ కొన్న ఘటనలో టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరికి,, సైకిల్లో వెళ్తున్న మరొకరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు రూరల్ పరిధిలోని నంగనూరుపల్లెకు చెందిన బొంతల సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్యలు టీవీఎస్ ఎక్సెల్లో మంగళవారం ఉదయం ప్రొద్దుటూరుకు బయలుదేరారు. వారు పాలకేంద్రం సమీపంలోకి వెళ్లగానే ఎర్రగుంట్ల వైపు నుంచి వస్తున్న లారీ వారి టీవీఎస్ను ఢీ కొంది. ఈ ఘటనలో సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్యతో పాటు వారికి సమీపంలో సైకిల్పై వస్తున్న అయ్యప్ప మాలధారుడు కందుకూరి నాగరాజుకు కూడా గాయాలయ్యాయి. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నాగరాజు అయ్యప్ప ఆలయంలో పూజ చేసుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నిమజ్జనంలో గాయపడ్డ వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం: వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవ శాత్తు ట్రాక్టర్పై నుంచి కింద పడి గాయపడిన కొలిబోయిన వీరయ్య(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపల్లె పంచాయతీ పరిధిలోని ఎర్రగుంటపల్లెకు చెందిన వీరయ్య రైతు కూలి పని చేసుకుని జీవనం సాగించే వాడు. ఆయనకు భార్య నర్సమ్మతోపాటు శ్రావణి, స్రవంతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని గురువారం నిమజ్జనం చేయడానికి చాపాడు సమీపంలోని కుందూ వంతెన వద్దకు వెళ్లారు. నిమజ్జనం అనంతరం గ్రామస్తులందరూ ఇంటికి ట్రాక్టర్లో బయలుదేరే సమయంలో వీరయ్య ఆ వాహనాన్ని ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తీవ్రంగా గాయ పడిన అతన్ని సాయంత్రం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వచ్చారు. పరిశీలించిన వైద్యుడు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వెళ్లాలని సూచించారు. అంబులెన్స్లో తీసుకెళ్తుండగా కర్నూలు సమీపంలోకి వెళ్లగానే మృతి చెందాడు. చాపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.