breaking news
Delhi Police Crime Branch
-
Sub-Inspector Priyanka Sharma: గన్ లేడీ
ఎన్కౌంటర్ టీమ్లో గ్యాంగ్స్టర్తో తలపడిన తొలి మహిళా పోలీస్గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్కు తగిలింది. గ్యాంగ్స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్స్టర్ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్స్టర్ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు. ప్రగతి మైదాన్లోకి పోలీస్లు వచ్చారని తెలియగానే గ్యాగ్స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు. గ్యాంగ్స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్స్టర్తో ఎన్కౌంటర్కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్కు, ప్రవీణ్కు నచ్చకపోవచ్చు. ∙ -
నగరంలో ‘ఆపరేషన్ మిలాప్’
న్యూఢిల్లీ : నగరంలో అమ్మాయిల అక్రమ రవాణాను అరికట్టడంలో ఢిల్లీ పోలీస్ క్రైంబ్రాంచ్ విభాగం శెభాస్ అనిపించుకొంటోంది. నగరంలో అమ్మాయిల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి ‘మానవుల అక్రమ రవాణా వ్యతిరేక యూనిట్(ఏహెచ్టీయూ)ను ప్రారంభించింది. ఈ యూనిట్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ మిలాప్’ నిర్వహిస్తున్నారు. అక్రమార్కుల చెర నుంచి అమ్మాయిలను, తప్పిపోయిన చిన్నారులను రక్షించి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించడేమే ఈ ఆపరేషన్ ధ్యేయం. తాజాగా 17 ఏళ్ల బాలికను కాపాడారు. ఆమెను దక్షిణ ఢిల్లీ మాదన్పూర్ దాబాస్ ప్రాంతంలోని ఆశ్రయ ఫ్యామిలీ హోంలో ఉంచారు. ఈ మేరకు క్రైంబ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించారు. పలు విషయాలను ఆమె పోలీసులకు వివరించింది. ‘తాను పంజాబ్లోని లూథియాకు చెందినట్లు, తమది పేద కుటుంబమని బాధిత బాలిక పోలీసులకు వివరించింది. బెలూన్లను విక్రయిస్తానని చెప్పింది. సెప్టెంబర్లో రింకూ అనే వ్యక్తి ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చి పశ్చిమ ఢిఈల్లోని భావనా ప్రాంతంలో ఉంచారు. రింకూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదిరోజులుగా కనిపించకుండా పోయాడు. తర్వాత బాధితురాలును పోలీసులు గుర్తించి సెప్టెంబర్ 17న చిల్డ్రన్స్హోం కు తరలించారు.‘ ప్రస్తుతం భయాందోళనలో ఉన్న బాలిక క్రైంబ్రాంచ్ పోలీసు బృందానికి ప్రాథమిక సమాచారం మాత్రమే చెప్పింది. ఇంకాపూర్తి వివరాలు తెలియజేయలేదు. ఈ మేరకు బాలిక వెంట తీసుకొని లూథియానుకు వెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు క్రైంబ్రాంచ్ అధికారులు చెప్పారు. ఆపరేషన్ మిలాప్ లో ఇంతకు ముందు ఇద్దరు చిన్నారులను రక్షించారు. వారిని పశ్చిమ ఢిల్లీలోని ప్రహ్లాదపూర్ బంగర్లోని చిల్డ్రన్స్హోంలో ఉంచారు. చిల్డ్రన్స్ హోమ్స్ పరిశీలన డిసెంబర్ 18వ తేదీన ‘ఆపరేషన్ మిలాప్’ను ఢిల్లీ పోలీసులు ప్రారంభించారు. నగరంలో అన్ని చిల్డ్రన్స్హోంలను సందర్శించి రికార్డులను పరిశీలిస్తున్నారు. కిడ్నాప్నకు గురైన, తప్పిపోయిన వారి జాబితాలను ఆయా హోంల్లో పరిశీలిస్తున్నారు. ఈ ఏహెచ్టీయూలో ఐదు పోలీసుల బృందాలున్నాయి. ప్రభుత్వ చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నగరంలోని 96 చిల్డ్రన్స్ హోంలను పరిశీలిస్తుంది. అక్కడ ఉంటున్న చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఏ మాత్రం క్లూ దొరికినా వారిని చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తోందని జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైంబ్రాంచ్) రవీంద్ర యాదవ్ చెప్పారు. అదేవిధంగా నగరంలోని ప్రార్థనా స్థలాలు, పార్కింగ్లు, రైలే ్వస్టేషన్లు, రోడ్లపై ఉండే చిన్నారుల ఫోటోలతో సహా, వివరాలను పోలీసులు సేకరిస్తారు. ఇందుకు సంబంధించిన లఘుసమాచారాన్నిపూర్తి చేస్తారు. తప్పిపోయిన చిన్నారుల సమాచారాన్ని పోల్చి చూసి, ఆధారాలు లభిస్తే, వారి కుటుంబ సభ్యులకు అందజేయడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారు. ఉన్నతాధికారులు, బాధిత కుటుంబ సభ్యుల ప్రశంసలను ‘ఆపరేషన్ మిలాప్’ అందుకోంటుంది.