breaking news
Delhi Police Commissioner
-
ఢిల్లీ కొత్త పోలీస్ బాస్.. ఎవరీ అనురాగ్ కుమార్?
దేశ రాజధాని ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అనురాగ్ కుమార్ నియమితులయ్యారు. సాధారణ పోలీస్ అధికారి కాకుండా.. దేశ అత్యంత కీలక నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిన అధికారి ఇప్పుడు ఢిల్లీ భద్రతా వ్యవస్థకు నాయకత్వం వహించబోతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పోలీసింగ్, ఇంటెలిజెన్స్ అనుభవం ఉన్న ఆయన నియామకం ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ కుమార్ ఏజీఎంయూటీ కేడర్కు చెందినవారు. కేంద్ర నియామకాల కమిటీ ఆమోదంతో ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన సతీష్ గోల్చా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.దేశ రాజధాని పోలీస్ చీఫ్ పదవి అత్యంత సున్నితమైన బాధ్యతగా భావిస్తారు. ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, సుప్రీంకోర్టు, విదేశీ రాయబార కార్యాలయాలు, కీలక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇక్కడ శాంతిభద్రతల నిర్వహణతో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా సమర్థంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.ఐబీలో కీలక పాత్ర.. భద్రతా వ్యూహాల్లో అనుభవంఅనురాగ్ కుమార్ తన కెరీర్లో ఎక్కువ కాలం భద్రత, నిఘా రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్గా పనిచేసిన ఆయనకు దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలపై లోతైన అవగాహన ఉంది. ఐబీలో పనిచేసిన సమయంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సున్నితమైన భద్రతా అంశాలు, ఇంటెలిజెన్స్ సేకరణ, విశ్లేషణ వంటి కీలక విభాగాలను పర్యవేక్షించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించే విధానంలో ఆయనకు ప్రత్యేక అనుభవం ఉంది.ఇదే అనుభవం ఇప్పుడు ఢిల్లీ పోలీస్కు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. దేశ రాజధానిలో ఉగ్రవాద ముప్పు, అంతర్జాతీయ స్థాయి భద్రతా సవాళ్లు ఉన్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నేపథ్యం ఉన్న అధికారి నియామకానికి ప్రాధాన్యత ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.ఇంజినీర్ నుంచి ఐపీఎస్ అధికారి వరకుఅనురాగ్ కుమార్ విద్యాపరంగా ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత సివిల్ సర్వీసుల ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చారు. 1994లో ఐపీఎస్గా ఎంపికైన ఆయన మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో సేవలందించారు. పోలీసింగ్తో పాటు పరిపాలన, భద్రతా నిర్వహణ, దర్యాప్తు వ్యవస్థల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా 2010లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అందుకున్నారు.ముందున్న అతిపెద్ద సవాళ్లుఢిల్లీ పోలీస్ కమిషనర్గా అనురాగ్ కుమార్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడం ఆయనకు తొలి ప్రాధాన్యతగా మారనుంది. దేశ రాజధాని ఎప్పుడూ ఉగ్రవాద సంస్థల లక్ష్యంగా ఉండే అవకాశం ఉండటంతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సి ఉంటుంది. అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలు మరో పెద్ద సవాల్. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ నేరాలు కొత్త రూపాల్లో విస్తరిస్తున్న సమయంలో సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆధునిక వ్యూహాలు అవసరం కానున్నాయి. మహిళల భద్రత కూడా ఢిల్లీలో కీలక అంశమే. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పించడం, పోలీసుల స్పందన వేగాన్ని పెంచడం ఆయన ముందున్న మరో బాధ్యత.దేశ రాజధాని రీజియన్లో పెరుగుతున్న సంఘటిత నేరాలు, గ్యాంగ్స్టర్ నెట్వర్క్లు, మాదకద్రవ్యాల రవాణా వంటి అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో వీఐపీ భద్రత, కీలక ప్రాంతాల రక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది.‘ఇంటెలిజెన్స్ మైండ్’తో ఢిల్లీ పోలీస్లో మార్పులు వస్తాయా?అనురాగ్ కుమార్ నియామకంలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఆయనకు ఉన్న ఇంటెలిజెన్స్ నేపథ్యం. సాధారణ పోలీసింగ్తో పాటు ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతికత వినియోగాన్ని పెంచడం, భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది.దేశ రాజధాని భద్రత కేవలం నేర నియంత్రణకు పరిమితం కాదు. అది దేశ ప్రతిష్ట, అంతర్గత భద్రతతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన అనురాగ్ కుమార్ ఢిల్లీ పోలీస్ను ఏ దిశగా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.మూడు దశాబ్దాల పోలీసింగ్ అనుభవం.. ఐబీలో పదునైన భద్రతా వ్యూహాలు.. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ పగ్గాలు. దేశ రాజధాని భద్రతకు అనురాగ్ కుమార్ నియామకం ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. -
ఢిల్లీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రాకేశ్ ఆస్తానాను నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఆయన నియామకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అధికార పక్షం ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. వివాదాస్పదుడైన ఓ అధికారిని దేశ రాజధానిలోని పోలీసు బలగాలకు అధిపతి కారాదని తీర్మానం పేర్కొంది. ఆస్తానా నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నా రు. నిబంధనలకు లోబడి కేంద్రం నియామకాలు చేపట్టాలన్నారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసున్న ఏ అధికారిని కూడా దేశంలో పోలీసు విభాగాధిపతిగా నియమించరాదంటూ 2019 మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాజాగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్గా ఆస్తానాను నియమిస్తున్నట్లు మంగళవారం తెలిపిన కేంద్రం..ఆయన సర్వీసును ఏడాది కాలం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 31వ తేదీన ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ‘పదవీకాలం రీత్యా ఆయన అనర్హుడు కాబట్టే సీబీఐ డైరెక్టర్గా పరిగణనలోకి తీసుకోలేదు. మరి అదే నిబంధన ఢిల్లీ పోలీసు కమిషనర్ నియామకానికి కూడా వర్తించాలి కదా.. అని కేజ్రీవాల్ అన్నారు. -
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రాకేశ్ ఆస్తానా
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్గా గుజరాత్ కేడర్కు చెందిన రాకేశ్ ఆస్తానా బుధవారం నియమితులయ్యారు. నియామకానికి సంబంధించిన ఆదేశాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను అదుపులో ఉంచడం, నేరలు జరకుండా చూడడం పోలీసుల ప్రాథమిక విధి అని, అది తనకు తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు పనులు చేస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. 1984 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆస్తానా గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పని చేశారు. అరుణాచల్ ప్రదేశ్– గోవా– మిజోరం– యూనియన్ టెర్రిటరీ కేడర్కు చెందని ఐపీఎస్ అధికారిని ఢిల్లీ కమిషనర్గా నియమించడం అత్యంత అరుదు కావడం గమనార్హం. -
ఎవరినీ వదలం: ఢిల్లీ పోలీస్ చీఫ్
‘ట్రాక్టర్ పరేడ్ను అనుమతించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో నిర్వహించలేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. దోషులెవరినీ వదలం’అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు అత్యంత సంయమనం పాటించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆందోళనకారులు పోలీసుల నుంచి టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించేందుకు వాడే తుపాకులను లాక్కున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ తరహా తుపాకీ ఎర్రకోటలో ఒక ఆందోళనకారుడి దగ్గర కనిపించిందన్నారు. ఎర్రకోటలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆందోళనకారుల్లో కొందరు మద్యం సేవించారని, కత్తులు, పదునైన ఆయుధాలతో తమపై దాడి చేశారని కేసు విచారిస్తున్న నార్త్ ఢిల్లీ డీసీపీ సందీప్ తెలిపారు. అక్కడ హింసకు పాల్పడుతున్న సమూహాన్ని నియంత్రించడం తమకు కష్టమైందన్నారు. అయితే, ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులను 3 గంటల్లో అక్కడి నుంచి పంపించివేశామన్నారు. కాగా, తాజాగా ఎర్రకోట వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ఇతర భద్రతా దళాలను బుధవారం భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీవార్తల కట్టడికి ట్విట్టర్ రంగంలోకి దిగింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయన్న అనుమానంతో సుమారు 550 ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రజా ఉద్యమంగా మారింది: బి. వెంకట్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ చట్టాలతో రైతులతో పాటు యావత్తు ప్రజానీకానికి నష్టం కలుగుతుందని ఆయన బుధవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వ్యాఖ్యానించారు. చట్టాల రద్దుకై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేస్తే కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులంతా ఈ చట్టాల రద్దు కోసం కృషి చేయడం రైతు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
'రికార్డు టైమ్ లో సెన్సేషనల్ కేసుల పరిష్కారం'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది నేరాలు 17 శాతం పెరిగాయి. 2015లో 182,644 కేసులు నమోదయినట్టు ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 27 శాతం(49,903) కేసులను పరిష్కరించారు. గతేడాది తమ పనితీరు పట్ల ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం తమ పట్ల ప్రజలకు పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకగా ఆయన వర్ణించారు. 'మేక అపహరణ నుంచి రూ. 20 చోరీ వరకు ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నందుకు సంతృప్తిగా ఉంది' అని విలేకరుల సమావేశంలో కమిషనర్ అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటివి బాగా తగ్గాయని చెప్పారు. తీవ్రమైన కేసుల పరిష్కారంలో 2014తో పోలిస్తే మెరుగయ్యామని వెల్లడించారు. సంచలనాత్మక కేసులన్నింటినీ రికార్డు టైమ్ లో పరిష్కరించామని చెప్పారు. -
'కేరళ హౌస్పై అసలు దాడి చేయలేదు'
అందరూ చెబుతున్నట్లుగా అసలు తమ పోలీసు సిబ్బంది కేరళ హౌస్ మీద దాడి చేయనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. అక్కడ బీఫ్ వండి వడ్డిస్తున్నట్లు పోలీసు కంట్రోల్ రూంకు తప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఇలాంటి సందర్భంలో మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నందున తమ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లిన మాట వాస్తవమే గానీ, వాళ్లు అక్కడ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మాత్రమే వెళ్లారన్నారు. విష్ణుగుప్తా, అతడి అనుచరులు అక్కడ ఏమైనా వివాదం సృష్టిస్తే అడ్డుకునేందుకు మాత్రమే వాళ్లు వెళ్లారన్నారు. కేరళ హౌస్పై అసలు పోలీసులు దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన విష్ణు గుప్తా అనే వ్యక్తి ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నాడని, కానీ ఈ ఘటన విషయంలో ఎవరూ అతడిపై ఫిర్యాదు చేయలేదని బస్సీ చెప్పారు. అయినా సెక్షన్ 182 (తప్పుడు సమాచారం) కింద అతడిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో పెరిగిన చైతన్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగింది. పోలీస్స్టేషన్ మెట్లెక్కి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండు నెలల కాలంలో ఢిల్లీ పోలీసు స్టేషన్లలో సుమారు 300 రేప్ కేసులు, 500కు పైగా వేధింపుల కేసులు నమోదయ్యాయి. ‘కేసుల సంఖ్య పెరగడం శుభ పరిణామం. నిర్భయ ఘటన తర్వాత మహిళల్లో ఉన్న స్తబ్ధత తొలగిపోయింది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రస్తుతం మహిళలు ధైర్యంగా స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ’ అని ఢిల్లీ పోలీసులు అభిప్రాయపడ్డారు. గత రెండు నెలల కాలంలో పోలీసుల రికార్డుల సమాచారం ప్రకారం ఐపీసీ 354, 509(వేధింపులు, బలవంతపు లైంగిక దాడి) సెక్షన్ల కింద 500 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 2014 డిసెంబర్ 15కు ముందు రాష్ట్రంలో 4,179 వేధింపుల కేసులు నమోదైతే 67.17 శాతం కేసులు పరిష్కారం అయ్యాయి. పరిచయమున్న వారే నిందితులు వేధింపులు, అత్యాచార కేసుల్లో 96 శాతం మంది బాధితులు తమకు, తమ తల్లిదండ్రులకు పరిచయం ఉన్న వారి చేతుల్లోనే మోసానికి గురవుతున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాస్సీ తెలిపారు. కేవలం 4 శాతం మంది మాత్రమే అపరిచితుల చేతుల్లో బలవుతున్నట్లు స్పష్టం చేశారు. పురుషుల వేధింపులను ఎదుర్కోవడానికి మహిళల్లో స్వీయ సంరక్షణకు మెలకవులు, భౌతిక సామర్థ్యం పెంచడానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బాల్య దశ నుంచే పాఠశాలల్లో స్వీయ రక్షణ కోసం బాలిక లకు శిక్షణను ఇస్తే వారికి 15 ఏళ్లు వచ్చే సరికి పోకిరీల భరతం పడతారని వివరించారు. ఈ ఏడాది ‘లక్ష మంది’ బాలికలకు వాటిపై శిక్షణను ఇవ్వాల్సిందిగా లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. మార్చి 8 ఆదివారం నాటికి 26 వేల మంది బాలికలకు శిక్షణను ఇచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ‘మహిళా’ పోలీసులకు పదోన్నతులు న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో 45 మంది మహిళా ఎస్ఐలకు ఇన్స్పెక్టర్ల ర్యాంకుతో పదోన్నతులిచ్చారు. దీంతో 20 ఏళ్ల ఎస్ఐల నిరీక్షణకు తెరపడింది. దీనిపై పోలీసు కమిషనర్ బీఎస్ బస్సి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. స్టేషన్లలో మహిళా పోలీసుల అవసరం చాలా ఉందని ఆయన తెలిపారు. వీరితో మహిళలపై నేరాలను నియంత్రించొచ్చన్నారు. త్వరలోనే మహిళా భద్రతకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -
2 నెలలు... 300 అత్యాచారాలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో నిర్భయ అత్యాచారం జరిగిన తర్వాత మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ న్యూఢిల్లీలో మాత్రం మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్టపడలేదు. సరికదా 2015 సంవత్సరం మొదటి రెండు నెలలో 300 అత్యాచారాల కేసులు నమోదు అయ్యాయి. ఈ గణాంకాలు చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తూ నగర పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆదివారం వెల్లడించారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఈ అత్యాచారాలపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు తెలిపారు. 2013 కంటే కొంత శాతం అధికంగా ఉన్నా... 2014 ఏడాది మొదటి రెండు నెలలో ఇదే సంఖ్యలో అత్యాచారాలు జరిగాయని ఆయన వివరించారు. గతేడాది 2,069 అత్యాచార కేసులు నమోదు కాగా వాటిలో 67.17 శాతం కేసులు ఛేదించినట్లు చెప్పారు. అయితే అత్యాచారం జరిగిన కేసుల్లో దాదాపు 96 శాతం మంది బాధితురాలు బంధువులు లేదా స్నేహితులు నిందితులుగా ఉంటున్నారని... మిగిలిన 4 శాతం మాత్రం ఆగంతకులు ఉంటున్నారని బస్సీ చెప్పారు. మహిళలు చిన్ననాటి నుంచి ఆత్మరక్షణ చేసుకునేందుకు శిక్షణ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో 15 ఏళ్లు వచ్చే నాటికి వారిని వారు రక్షించుకునే స్థితిలో ఉంటారన్నారు. అలాగే ఈ ఏడాది లక్ష మంది బాలికలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు... ఈ ఏడాది మార్చి 8 వరకు 26 వేల మంది బాలికలు అందులో శిక్షణ పొందటం ఆనందంగా ఉందని బుస్సీ తెలిపారు. -
ప్లేస్మెంట్ ఏజెన్సీలపై నివేదిక ఇవ్వండి
ఢిల్లీ పోలీస్ కమిషనర్ను కోరిన జాతీయ మానవ హక్కుల సంఘం సాక్షి, న్యూఢిల్లీ: మనుషుల అక్రమ రవాణాలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్లేస్మెంట్ ఏజెన్సీల పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులను జాతీయ మానవ హక్కుల సంఘం గురువారం ఆదేశించింది. గుర్తింపు పొందిన, పొందని ప్లేస్మెంట్ ఏజెన్సీల వివరాలు, వాటిపై పర్యవేక్షణ గురించి రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను ఢిల్లీ పోలీస్ కమిషనర్ తమకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనుమతి లేని ప్లేస్మెంట్ ఏజెన్సీల ద్వారా ఢిల్లీ కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని మీడియాలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో మానవ హక్కుల కమిషన్ దీనిని సుమోటా కేసుగా స్వీకరించింది. కాగా, ఇతర దేశాలకు అక్రమంగా కూలీలను రవాణా చేసే వ్యాపారంలో వందలాది కంపెనీల భాగస్వామ్యం ఉంది. గిరిజనులు, మహిళలు, పిల్లలను గ్రామీణ ప్రాంతాల నుంచి మాయ మాటలు చెప్పి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. -
మరింత శ్రద్ధ వహిస్తున్నాం
న్యూఢిల్లీ: డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంరతం మహిళలపై నేరాల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి పేర్కొన్నారు. మహిళా సాధికారత అంశంపై స్థానిక ఫిక్కి హౌస్లో ఫిక్కి మహిళా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార కేసు నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామన్నారు. అంతకుముందు బాధితురాలు అయిష్టత వ్యక్తం చేస్తే తమ సిబ్బంది కేసులు నమోదు చేసేవారు కాదని, అయితే 2013లో చట్టంలో చేసిన సవరణల కారణంగా ఇప్పుడు విధిగా కేసు నమోదు చేయాల్సిందేనన్నారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించకూడదని అన్నారు. దీంతో కేసుల నమోదు దాదాపు 500 శాతం మేర పెరిగిందన్నారు. 2012లో నగరంలో మొత్తం 706 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. 2013లో వీటి సంఖ్య 1,636కు చేరుకుందన్నారు. 2014 సంవత్సరంలో ఇప్పటిదాకా దాదాపు 984 కేసులు నమోదయ్యాయన్నారు. జూన్ నాటికి ఇందులో 759 కేసులను పరిష్కరించామన్నారు. అనేక కేసులపై తాను కూడా స్వయంగా దృష్టి సారిస్తూనే ఉన్నానన్నారు. బాధితురాలు, నిందితుడి మధ్య పరిచయమున్న కేసులు కూడా తమ వద్దకు వస్తున్నాయని, వీటి సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందన్నారు. మరింత మంది మహిళా సిబ్బంది అవసరం తమ శాఖలో మహిళా సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉందని బస్సి పేర్కొన్నారు. డిసెంబర్, 16 నాటి సామూహిక అత్యాచార ఘటన అనంతరం మహిళా సిబ్బంది ప్రాధాన్యం తెలిసొచ్చిందన్నారు. అందువల్లనే వివిధ ర్యాంకుల్లో మొత్తం రెండు వేల మంది మహిళా సిబ్బందిని నియమించుకున్నామన్నారు. -
సోమనాథ్ మంత్రి పదవి నుంచి దిగాల్సిందే
ఉగాండ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన న్యూఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి వెంటనే మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ డిమాండ్ చేశారు. భారతీని వెంటనే అరెస్ట్ చేయాలని బిన్నీ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ కమిషనర్ బి.ఎస్. బస్సీని కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిన్నీ మాట్లాడుతూ... విదేశీ మహిళలతో భారతీ వ్యవహరించిన తీరు సిగ్గు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. మంత్రి అని కోణంలో కాకుండా భారతి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ బస్సీ తెలిపారని బిన్నీ వెల్లడించారు.మంత్రి వర్గం నుంచి భారతిని వెంటనే తొలగించాలని ఆయన న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 36 గంటల ఆందోళన సందర్భంగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో సామాన్యులు సమిధులయ్యారని అన్నారు. ఆ ఘటనపై అరవింద్ కేజ్రీవాల్పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నిర్భయ కేసు పాఠాలు అందరితో పంచుకుంటాం
గతేడాది డిసెంబర్16న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచార ఘటన కేసుకు సంబంధించిన దర్యాప్తు ద్వారా నేర్చుకున్న పాఠాలను మిగతా ఉన్నతాధికారులతో పంచుకుంటామని న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ వెల్లడించారు. నిర్భయ కేసులో నిందితులకు ఈ రోజు సాకేత్లోని న్యాయస్థానంలో నిందితులకు శిక్ష ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఉదయం కోర్టుకు విచ్చేశారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇటువంటి కేసులపై విచారణకు నిర్భయ దర్యాప్తు చేసిన విధానం ఉపకరిస్తుందన్నారు. నిర్భయ కేసు దర్యాప్తునకు సంబంధించి అన్ని శాస్త్రీయ విధానాలు పాటించామన్నారు. అలాగే తమ శక్తి మేరకు సాక్ష్యాలను సంపాదించామన్నారు. అత్యాచార కేసులో నలుగురు నిందితులను పోలీసులు సాకేత్ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే నిందితులను కోర్టు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విచారించి శిక్ష ఖరారు చేయనుంది.


