తల్లి ఒడిలో ప్రాణాలొదిలిన పసికందు
డబ్బులు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి
మరుసటి రోజు డబ్బులతో ఆస్పత్రికి వెళ్తుండగా ఘటన
జ్వరంతో పసికందు మృతి
కేసముద్రం,న్యూస్లైన్ : అప్పటిదాక చనుబాలు తాగుతూ.. బోసినవ్వులతో తల్లిని మురిపించిన ఆ బిడ్డ అమ్మఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. అప్పటి వరకు కన్నబిడ్డ నిద్రపోయాడని భావించిన ఆ తల్లికి కొంతసమయం తర్వాత బిడ్డ శాశ్వతంగా నిద్రపోయాడనే భరించలేని విషయాన్ని తెలుసుకుంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి గుండెలవిసేలా విలపించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... అమీనాపురం గ్రామ శివారు సప్పిడిగుట్ట తండాకు చెందిన బానోతు సక్రు, స్వప్న దంపతులకు కుమారుడు శివాజీ(4)తోపాటు మరో మూడు నెలల బాబు ఉన్నాడు. నిరుపేద కుటుం బం కావడంతో సక్రు కేసముద్రం విలేజ్లో ఓ రైతుకు వద్ద జీతం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం కుమారుడు జన్మించగా వారింట్లో ఆనందం వెల్లివిరిసింది.
ఆ బిడ్డకు జ్వరంతో ఫిట్స్ రావడంతో శుక్రవారం వరంగల్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పరీక్షలు నిర్వహించి, స్కానింగ్ తీయించాలని చెప్పాడు. దీంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. శనివారం మళ్లీ ఫిట్స్ వచ్చింది. ఆ తర్వాత కొడుకు తేరుకున్నాక ఎలాగైనా డాక్టర్కు చూపించాలనుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి *4 వేలు అప్పు తెచ్చి జమ చేసుకున్నారు. తిరిగి మళ్లీ వరంగల్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో స్వప్న, ఆమె అత్త, మరో బంధువుతో కలిసి తండా నుంచి కేసముద్రం స్టేషన్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. తల్లి ఒడిలో ఉన్న ఆ పసికందు పాలు పట్టించింది. మార్గమధ్యంలోనే ఆ పసికందు తుదిశ్వాస విడిచాడు. కాని ఆ తల్లి బిడ్డ నిద్రపోయాడనుకుని భావించింది. ఇంతలో వరంగల్కు వెళ్లే ప్యాసింజర్ వెళ్లిపోయిన విషయం తెలియడంతో బస్సుకు వెళ్దామని అంబేద్కర్ సెంటర్కు వచ్చారు. ఇంతలో పసి బిడ్డను స్వప్న అత్త ఎత్తుకోవడంతో ఆమెకు తన మనవడు చనిపోయాడని తెలుసుకుంది.
కన్నీళ్లు దిగమింగుకుంటూ కోడలితో చెబితే ఏమవుతుందోనని కొంతదూరంలో నిలిచింది. తన బిడ్డను ఇవ్వమని అడగడంతో ఆమె కళ్లల్లో నీళ్లు దుమికాయి. నీ బిడ్డ లేడమ్మా అంటూ రోదించడంతో ఆ తల్లి ఒక్కసారిగా అయోమయానికి గురైంది. నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయిన తల్లి కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. నవమాసాలు మోసిన ఆ తల్లి బిడ్డను తలుచుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిన కలచి వేసింది.