breaking news
danderous zone
-
అదుపు తప్పితే అంతే మరి
సీతారామాపురం(చాపాడు) : మండలంలోని అల్లాడుపల్లె దేవళాలు వద్దకు వెళ్లే సీతారామాపురం–అల్లాడుపల్లె మధ్యగల కుందూనదిపై ఉన్న పాత వంతెనకు ఇరువైపులా రక్షణ కరువైంది. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో వంతెనపై ప్రయాణించే వాహనంలోని వారు అదుపు తప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వంతెన ఇరువైపులా రక్షణగా చిన్నపాటి పోస్ట్లు(సిమెంట్ దిమ్మెలు) మాత్రం ఏర్పాటు చేశారు. ఒక దిమ్మెకు మరో దిమ్మెకు ఖాళీ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వీటిలో కూడా చాలా వరకు దిమ్మెలు దెబ్బతిన్నాయి. సైకిల్, ద్విచక్ర వాహనదారులకు, ఆటోల వారికి ఇవి ఏ విధంగాను రక్షణగా లేవనటంలో సందేహం లేదు. ఇప్పటికే పలు రకాలైన వాహనాలు ఢీ కొనటంతో దిమ్మెలు దెబ్బతిన్నాయి. ఈ వంతెనపై బస్సులు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మండలంలోని అల్లాడుపల్లె, సీతారామాపురం, చిన్నగురువళూరు, పెద్ద గురువళూరు, గ్రామాలతో పాటు ఖాజీపేట మండలంలోని సన్నుపల్లె, మిడుతూరు, ఏటూరు, కమలాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగా ఈ దారిన ప్రయాణిస్తుంటూరు. ఏ మాత్రం అదుపు తప్పినా వాహనం కుందూనదిలో పడిపోయే ప్రమాదం ఉంది. కుందూనదిలో ఏడాదిలో అధిక రోజులు నీటి ప్రవాహం ఉంటుంది. నీరు లేకపోయినా వంతెనపై 10 అడుగులకు పైగా లోతు ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంతెనపై రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
దేశంలో 38 నగరాలకు ముప్పు
న్యూఢిల్లీ: దేశంలో 60 శాతం భూభాగానికి భూకంపం ముప్పు పొంచి ఉందని, కనీసం 38 నగరాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ వంటి మహానగరంలో భూకంపం వస్తే నష్టం అపారంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ను విలవిల్లాడించిన భూకంప ప్రభావంతో భారత్లోనూ ఆగ్రా నుంచి సిలిగురి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. కాగా, హిమాలయ ప్రాంతంలో మరిన్ని భూకంపాలు వ చ్చే ముప్పు పొంచి ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆసియా, భారత ఉపఖండం ఉన్న భూ పలకల మధ్య తీవ్ర ఒత్తిడి ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. భూకంపాలను తట్టుకునేలా భారత్లో భవనాలను నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం 1962లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) రూపొందించిన నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు గుజరాత్లోని భుజ్ పట్టణంలో భారీ భూకంపం తర్వాత కట్టిన అనేక భవనాలు మాత్రం బీఐఎస్ ప్రమాణాలను పాటించాయి. అయితే భూకంపాలను తట్టుకునే భవన నిర్మాణ ప్రమాణాలపై ఎవరికీ అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. భూకంప ముప్పు పొంచి ఉన్న 38 నగరాల్లో సాధారణ స్థాయి ప్రకంపనలకే భవనాలన్నీ కూలిపోయే అవకాశముందని, ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ఓ నివేదికలో వెల్లడించిందని గుర్తుచేస్తున్నారు. ఢిల్లీతో పాటు శ్రీనగర్, గౌహతి, ముంబై, చెన్నై, కోల్కతా వంటి ప్రధాన నగరాలు ప్రమాదం అంచున ఉన్నందున ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జూన్లో ‘భూకంప’ ఉపగ్ర హ ప్రయోగం సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించే ఉపగ్రహాన్ని జూన్ 9వ తేదీన ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపం, సునామీ తీవ్రమైనవని, వీటి రాకను ముందుగానే పసిగట్టినట్లయితే ముందస్తు చర్యలు తీసుకునేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలవుతుందన్నారు. అదేవిధంగా భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటులో భాగంగా ఇటీవల అంతరిక్షానికి పంపిన నాలుగో ఉపగ్రహం బాగా పనిచేస్తోందని కిరణ్కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి ఐఆర్ఎన్ఎస్ఎస్ సేవల కోసం ఏడు ఉపగ్రహాలు అవసరమని, ఇందుకుగాను 5వ ఉపగ్రహాన్ని డిసెంబర్లో, 6, 7వ ఉపగ్రహాలను వచ్చే ఏడాది మార్చిలో ప్రయోగిస్తామన్నారు.