breaking news
Dama seshadhri naidu
-
న్యాయవాద వృత్తి మహోన్నతమైనది
తిరుపతి లీగల్, న్యూస్లైన్: న్యాయ వాద వృత్తి మహోన్నతమైనదని రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు అన్నారు. తిరుపతి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తిరుపతి న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పి.రమణ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ అభినందన సభలో జస్టిస్ దామా శేషాద్రి నాయుడు మాట్లాడుతూ కృషి, పట్టుదలతో యువ న్యాయవాదులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. జీవితంలో ఓ మనిషి ఓ వృత్తిని ఎంచుకుని దానిపైనే శ్రద్ధ పెడితే మహోన్నత స్థానాన్ని పొందవ చ్చని అన్నారు. తిరుపతి బార్ అసోసియేషన్ తనకు మాతృ సంస్థ అని దీనికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. తన ఉన్నతికి సహకరించిన సీనియర్ న్యాయవాదులను మరువలేనన్నారు. జిల్లా జడ్జి ఎల్. రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయకుటుంబంలో జన్మించి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ శేషాద్రినాయుడుకు జిల్లా న్యాయమూర్తుల తరపున అభినందనలు తెలిపారు. జస్టిస్ శేషాద్రినాయుడుకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆయన వృత్తిలో ఎలా పైకి వచ్చారనే విషయాలను స్క్రీన్ పై చిత్రాల రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం. దొరైరాజ్, చెన్నకేశవరెడ్డి, ఐ.గురుస్వామి, ముక్కు సత్యవంతుడు, కె.అజయ్కుమార్, ఎంఎన్. మణి, వజ్రాల చంద్రశేఖర్, మట్టా పురుషోత్తంరెడ్డి, టి. గోపీచంద్, నెల్లూరు యోగానంద్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలు
అద నపు న్యాయమూర్తులుగా రేపు రామలింగేశ్వరరావు, శేషాద్రి నాయుడు ప్రమాణం సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అసపు రామలింగేశ్వరరావు, దామా శేషాద్రి నాయుడులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన రోజునుంచి రెండేళ్లపాటు వీరిద్దరు అదనపు న్యాయమూర్తులుగా ఉంటారని కేంద్ర న్యాయశాఖ గురువారం రాత్రి ఢిల్లీలో విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. కాగా, శనివారం ఉదయం హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగే కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా వీరిద్దరి చేత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించనున్నారు. గురువారం ఉత్తర్వులు అందుకున్న వెంటనే వీరిద్దరూ ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. సాహిత్యాభిమాని రామలింగేశ్వరరావు రామలింగేశ్వరరావు 1956 మే 21న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు.చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు.ఇంటర్ వరకు తణుకులో చదివారు. భీమరంలోని డీఎన్ఆర్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం డిగ్రీలు సాధించారు.కొంతకాల ం పార్ట్టైమ్ లెక్చరర్గా పీజీ విద్యార్థులకు ‘ఇంటర్నేషనల్ లా’ లో పాఠాలు బోధించారు. 1982లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1984లో జస్టిస్ ఎ.వెంకటరామిరెడ్డి వద్ద జూనియర్గా చేరారు. వెంకటరామిరెడ్డి న్యాయమూర్తి అయిన తరువాత రామలింగేశ్వరరావు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేపట్టి,పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వాదించారు. మెడికల్ కాలేజీల్లో ఫీజులు, మద్య నిషేధం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేసులను ఆయన వాదించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయసలహాదారుగా వ్యవహరించారు. సాహిత్యం పట్ల ఎంతో మక్కువ ఉన్న రామలింగేశ్వరరావుకు, సాహిత్య వేదిక యువభారతితో ఎంతో అనుబంధం ఉంది. విజయవాడ నుంచి ప్రచురితమవుతున్న ‘నడుస్తున్న చరిత్ర’ మాస పత్రికకు కాలమిస్ట్గా వ్యవహరించారు. వ్యవసాయ కుటుంబం నుంచి శేషాద్రినాయుడు దామా శేషాద్రినాయుడు 1962 జూన్ 19న చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్ మండలం, గంగనగుంట గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య మొత్తం తిరుచానూర్లో సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. డిగ్రీ, ఎస్.వి.యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1997లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరుపతిలో సీనియర్ న్యాయవాది ఐ.గురుస్వామి వద్ద జూనియర్గా చేరారు. తరువాత తన ప్రాక్టీస్ను హైదరాబాద్కు మార్చారు. పలు కార్పొరేట్ సంస్థలకు, జాతీయ బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో గత ఐదేళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు బోధిస్తున్నారు.