breaking news
Dakshinamurthy
-
వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ
సాక్షి, వరంగల్: కరోనా మహమ్మారి మరో పోలీసు ఉన్నతాధికారిని బలిగొంది. జగిత్యాల ఏఎస్పీ కుంబాల దక్షిణామూర్తి(58) వైరస్ బారిన పడి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ వరకు వివిధ స్థాయిల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన ఆయన జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మరణించారు. వారం క్రితం ఆయన వైరస్ బారిన పడగా, కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి) మొదట రెవెన్యూశాఖలో... కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అల్గునూర్కు దక్షిణామూర్తి చిన్ననాటి నుంచే పోలీసు ఉద్యోగంలో చేరాలనే లక్ష్యంతో చదువులో ప్రతిభ కనబరిచేవారు. 1986లో మొదట రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్గా చేరిన ఆయన కోరుట్ల, మెట్పల్లిల్లో విధులు నిర్వర్తించాక 16–01–1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలో మొదటి పోస్టింగ్ దక్కించుకున్న ఆయన సీఐగా, డీఎస్పీగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో చేశాక తెలంగాణ ఆవిర్భావం అనంతరం పదోన్నతిపై నిర్మల్ ఏఎస్పీగా విధుల్లో చేరాడు. అక్కడి నుంచి గత ఏడాది నవంబర్ 1న జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భేష్ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనే దక్షిణామూర్తి సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి వరంగల్లోని ఏటూరునాగారం, కేయూసీ, మట్టెవాడ, మిల్స్కాలనీ, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొందాక కొద్దిరోజులు కాజీపేట రైల్వే డీఎస్పీగానే కాకుండా ములుగు డీఎస్పీగా, హన్మకొండ ఏసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. భూపాలపల్లి డీఎస్పీగా విధులు నిర్వరిస్తున్న సమయంలో నిర్మల్ ఏఎస్పీగా వెళ్లారు. వరంగల్ జిల్లాలో పనిచేసిన సమయంలో యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్, 2007లో చిన్నారి మనీషా కిడ్నాప్, హత్య కేసుతో పాటు పలు కిడ్నాప్ కేసుల పరిశోధనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మేడారం జాతరలో అన్నీ తానై... ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర భద్రత ఏర్పాట్లలో దక్షిణామూర్తే అన్నీతానై పర్యవేక్షించి ఉన్నతాధికారులతో మెప్పు పొందేవారు. ఈ ఏడాది ఫిభ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ‘18 జాతరలు చూశాను.. అమ్మవార్ల సేవలో తరించే అవకాశం వచ్చింది... వచ్చే జాతరకు ఉంటామో, లేదో.. నా రిటైర్మెంట్ కూడా ఉంది.. ఈసారి ఇంకా బాగా చేశాం.. నా జన్మ ధన్యమైంది’ అంటూ మీడియా ప్రతినిధులతో ఆయన తన మనోభావాలు పంచుకున్నారు. కాగా, కరోనా బారిన పడిన పోలీసు సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపిన ఆయనే కరోనా కాటుకు బలి కావడం గమనార్హం. ఇక ఈనెల 31న ఏఎస్పీ దక్షిణామూర్తి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఇంతలోనే కరోనా ఆయనను బలిగొంది. ఆయన ఉద్యోగ విరమణ రోజు ఘనంగా సన్మానించేందుకు పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందడంతో వారు దిగ్బ్రాంతికి లోనయ్యారు. -
ఏఎస్పీ దక్షిణ మూర్తి మృతి బాధాకరం: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రంతీ వ్యక్తం చేశారు. దక్షిణమూర్తి మృతి చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణమూర్తి ఎస్సై స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి ఎదిగారని కొనియాడారు. అంకితభావంతో పనిచేస్తూ.. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషిచేశారని ప్రశంసించారు. మేడారం స్పెషల్ ఆఫీసర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారని తెలిపారు. ఏఎస్సీ ఆకస్మిక మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి) కాగా, ఇటీవల కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్పీ దక్షిణమూర్తి.. బుధవారం తెల్లవారుజామున కన్నమూసిన సంగతి తెలిసిందే.1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. -
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, జగిత్యాల : జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి కరోనాతో మృతి చెందారు. వారం రోజుల కిత్రం కోవిడ్ బారిన పడిన ఆయన.. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దక్షిణామూర్తి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (చదవండి :10 లక్షలు దాటిన కరోనా టెస్టులు) 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా పని చేశారు.ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.దక్షిణ మూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.