breaking news
Credit Cooperative Society
-
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్టాప్ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
కార్మికుల సొమ్ముతో వారికే జీతాలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులు పొదుపు చేసుకున్న సొమ్మును వారికే జీతాల కింద ఇవ్వడం.. పైగా వారికే అప్పులు పుట్టకుండా చేయడం.. ఇదీ.. నేడు ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పొదుపు సొమ్ముపై అవలంబిస్తోన్న తీరు. సీసీఎస్ వద్ద వడ్డీ లేని రుణాలకు అలవాటు పడిన ఆర్టీసీ యాజమాన్యం దాన్ని ఒక బంగారుబాతులా వాడుకుంటోంది. పరిధి మేరకు దాని ఫలితాలు పొందితే ఫరవాలేదు. మరింత అత్యాశకుపోతే.. సీసీఎస్ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే సీసీఎస్ వద్ద తీసుకున్న రుణం దాదాపు రూ.500 కోట్లకు చేరువలో ఉంది. నేపథ్యం ఏంటి? ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా పొదుపు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘క్రెడిట్ అండ్ కో–ఆపరేటివ్ సొసైటీ’(సీసీఎస్). ప్రతినెలా కార్మికుల వేతనం నుంచి కొంతమొత్తం మినహాయించుకుని ఈ సొమ్ముకు 10 శాతం వడ్డీతో రిటైర్మెంట్ తరువాత పొదుపు మొత్తాన్ని అందజేస్తారు. (ఇతర సొసైటీలు 6 నుంచి 7 శాతానికి మించి ఇవ్వడం లేదు). సీసీఎస్ వద్ద ఉన్న నిధులు దాదాపుగా రూ.1,500 కోట్లు. ఈ మొత్తం మధ్యతరహా బ్యాంకుల కన్నా అధికం కావడం గమనార్హం. ఇందులో కార్మికులు వేతనాల రూపంలో దాచుకున్న సొమ్మే రూ.900 కోట్లు కావడం గమనార్హం. నెలనెలా ఆర్టీసీ యాజమాన్యం రూ.40 కోట్లను కార్మికుల వేతనాల నుంచి కట్ చేసి సీసీఎస్కు జమచేయాలి. కానీ ఇలా ప్రతినెలా నిధుల మళ్లింపుతో బకాయిల మొత్తం రూ.380 కోట్లకు చేరింది. డిసెంబర్లో రూ.80 కోట్లు చెల్లించినా.. డిసెంబర్, జనవరి నెలలకు మరోసారి నిధులు మళ్లించడంతో అది మళ్లీ రూ.380 కోట్లకు చేరింది. ఆర్టీసీ విభజన తరువాత సీసీఎస్ నుంచి తెలంగాణ ఆర్టీసీ రూ.106 కోట్ల నిధులు అప్పుగా తీసుకుంది. దీంతో మొత్తం అప్పుల విలువ రూ.480 కోట్లు దాటడం గమనార్హం. కార్మికుల రికవరీ సొమ్ముతో వారికే జీతాలు.. కార్పొరేషన్ వద్ద సరైన నిధులు లేకపోవడంతో వారి జీతాలనుంచి కొన్నేళ్లుగా సీసీఎస్కు జమ చేయాల్సిన కార్మికుల ప్రీమియం డబ్బును ఆర్టీసీ యాజమాన్యం తిరిగి వారి వేతన చెల్లింపులకే మళ్లిస్తోంది. వాస్తవానికి సీసీఎస్ స్వతంత్రంగా వ్యవహరించే సహకార సంస్థ. కానీ, నిధులను ఇష్టానుసారంగా మళ్లిస్తూ సీసీఎస్ సంస్థను ఆర్టీసీ యాజమాన్యం తన జేబుసంస్థగా మార్చుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు 12 శాతం చొప్పున రూ.250 కోట్లు వడ్డీ కడుతున్న ఆర్టీసీ.. సీసీఎస్కు మాత్రం ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదు. ఒకవేళ వడ్డీ చెల్లించాల్సి వస్తే.. 2015 నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకున్నా దాదాపు రూ.30 కోట్లకుపైగా సీసీఎస్కు ఆర్టీసీ కట్టాల్సి ఉండేదని సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో సీసీఎస్ మనుగడ... కార్మికులను ఆపత్కాలంలో ఆదుకునే సీసీఎస్ నిధులను మళ్లించడం అన్యాయమని, ఇలాంటి చర్యలు కార్మికుల జేబులకు చిల్లులు పెట్టడమేనని కార్మిక సంఘాల నేతలు థామస్రెడ్డి (టీఎంయూ), నాగేశ్వరరావు (ఎన్ఎంయూ) హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) తదితరులు విమర్శిస్తున్నారు. ఆర్థికలోటు ఇలాగే కొనసాగితే సీసీఎస్ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అక్షింతలు వేసినా.. వాస్తవానికి ఇదేం కొత్త వివాదం కాదు. 2015లోనూ సీసీఎస్ తన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్పందించిన హైకోర్టు సీసీఎస్ నిధులను 60 రోజుల కంటే ఎక్కువగా వాడుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఆ సమయం దాటితే మాత్రం ఉద్యోగుల నుంచి సీసీఎస్ రికవరీ డబ్బులు మళ్లించడం నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్టీసీ విభజన తరువాత ఏపీఎస్ ఆర్టీసీ ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా 10 రోజుల్లో రికవరీ మొత్తాన్ని సీసీఎస్కు జమచేస్తుండటం గమనార్హం. అధిక వడ్డీలతో నలిగిపోతున్న కార్మికులు సీసీఎస్ కార్మికులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. విద్య, వ్యక్తిగత అవసరాలు, పిల్లల వివాహం తదితర అవసరాలకు 11 శాతం చొప్పున వడ్డీతో అప్పులు ఇస్తుంది. గృహరుణాలు 8.5 శాతం తక్కువ వడ్డీకే మంజూరు చేçస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం తీరు కారణంగా సీసీఎస్ నుంచి కార్మికులకు రావాల్సిన లోన్లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో చేసేదిలేక కార్మికులు బయట అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఆర్థికంగా మరింతగా చితికిపోతున్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో పండుగ తరువాత చేపట్టనున్న సమ్మెను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. గత రెండు రోజుల నుంచి వాయిదా పడుతున్న చర్చలు బుధవారం ఓ కొలిక్కి రావటంతో ఈయూ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డీఏ బకాయిలు, సీసీఎస్ సొమ్ము చెల్లింపు తదితర అంశాలపై తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించడంతో సమ్మెకు వెళ్లరాదని నిర్ణయించారు. దీంతో సమ్మెను విరమించుకుంటున్నామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి దామోదరరావు మీడియాకు తెలిపారు. అంగీకరించిన ముఖ్య డిమాండ్లు ఇవే.. క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ (సీసీఎస్)కి యాజమాన్యం నుంచి ఏపీ వాటాగా రావాల్సిన రూ.వంద కోట్ల బకాయిల్లో గురువారం రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వచ్చే నెలాఖరు నాటికి మొత్తం డబ్బు చెల్లింపు. ఇకపై సీసీఎస్ డబ్బులు యాజమాన్యం వాడుకోకుండా ప్రతి నెలా 10న చెల్లిస్తారు. ఏడు నెలల డీఏ బకాయిల్లో ఈనెల 12న సగం ఇచ్చి మిగిలిన 50 శాతం మార్చి నెల జీతంలో కలుపుతారు. కొత్త డీఏ ప్రకటన రాగానే అదే నెలలో బకాయిలతో ఇస్తారు. ఎస్ఆర్బీసీ, ఎస్బీటీల్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫిబ్రవరి నెలాఖరులోగా మంజూరు. 2011 ఏప్రిల్ 1 నుంచి వర్క్షాపు కార్మికుల కు మ్యాన్ అవర్ రేటు బకాయిలను జనవరి, ఫిబ్రవరి ఇన్సెంటివ్లు రెండు విడతలుగా ఇస్తారు. ఆర్టీసీ విలీనంపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. విభజన ప్రక్రియ త్వరలో అమలు చేస్తారు. ఆ తర్వాత అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీ. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించిన సర్క్యులర్ జారీకి అంగీకారం. హైదరాబాద్లోని తార్నాక స్థాయి ఆస్పత్రి విజయవాడలో ఏర్పాటుకు ఈడీల కమిటీ పరిశీలనలో ఉంది. 2012 డిసెంబరు 31కి ముందు నియమించి న కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లలో మిగిలిన వారందరినీ రెగ్యులర్ చేస్తారు. 2013 జనవరి 1 తర్వాత నియమించిన కాంట్రాక్టు కార్మికులను త్వరలో రెగ్యులర్ చేస్తారు. డ్రైవర్లు టిమ్స్ మిషన్ల నిర్వహణకు సంబంధించి ఇచ్చే కమిషన్లో యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని సవరిస్తారు.