breaking news
cources
-
ఆసక్తి ఉన్నా... ప్రోత్సాహమేది!
స్టెమ్.. (STEM - Science, Technology, Engineering, Mathematics) కోర్సులు. ఇవి నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటున్న కోర్సులు! మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ నిపుణుల కొరత నెలకొంది. ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా... అందుకుతగ్గ ప్రోత్సాహం లభించట్లేదని తాజా సర్వే పేర్కొంది. అమెరికా మొదలు, అన్ని దేశాల్లోనూ ఇదే ధోరణి! మహిళా విద్యార్థుల్లో సైతం ‘స్టెమ్’ కోర్సులపై ఆసక్తి ఉన్నా.. లభించని తోడ్పాటు! తాజాగా అంతర్జాతీయంగా గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంస్థ ఎమర్సన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టెమ్ కోర్సుల పరిస్థితి.. స్టెమ్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, వాటి ద్వారా లభించే అవకాశాలపై ప్రత్యేక కథనం.. స్టెమ్.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. ఇండస్ట్రీ అవసరాల పరంగా అత్యంత కీలకమైనవి. సంస్థల్లో కార్యకలాపాలు సమర్థవంతంగా సాగడానికి, కొత్తకొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తేవడానికి స్టెమ్ నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే స్టెమ్ కోర్సుల్లో ప్రతిభ చూపిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. అదే సమయంలో ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య సైతం ఏటా పెరుగుతోంది. కానీ, స్టెమ్ కోర్సుల విద్యార్థులు రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించడం లేదని తాజా సర్వే పేర్కొంది. పర్యవ సానంగా ఈ విభాగంలో పరిశ్రమలు స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఆసక్తి ఇటీవల కాలంలో స్టెమ్ కోర్సుల్లో చేరాలనే ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో 60 శాతం మంది విద్యార్థులు స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కానీ, వీరిలో 40 శాతం మంది తమకు సరైన ప్రోత్సాహకాలు లేవని పేర్కొనడం గమనార్హం. మన దేశంలోనూ స్టెమ్ల్లోని ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి రెట్టింపు అవుతోంది. అదేవిధంగా సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సుల విషయంలో విద్యార్థులకు సరైన మార్గం నిర్దేశం లభించడంలేదు. జండర్ గ్యాప్ స్టెమ్ కోర్సుల అభ్యసనం పరంగా దేశంలో ఎదురవుతున్న మరో సమస్య.. జండర్ గ్యాప్(లింగ వివక్ష). మహిళా విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తాజా సర్వే ప్రకారం 41 శాతం మంది విద్యార్థినులు స్టెమ్ కెరీర్స్ పురుషుల కోసమే అనే అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడైంది. మరో 44 శాతం మంది మహిళలు సైతం ఈ రంగంలో తమకు రోల్ మోడల్స్ లేరని, దాంతో స్టెమ్ కోర్సుల్లో చేరేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా స్టెమ్ కోర్సుల్లో అమ్మాయిలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారు. ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులు కొంత ఫర్వాలేదు. కానీ సైన్స్, మ్యాథమెటిక్స్తో అమ్మాయిలకు పెద్దగా ఉపయోగంలేదనే భావన నేటికీ ఉంది. స్టెమ్తో ఉజ్వల భవిత వాస్తవానికి స్టెమ్లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. ఈ నాలుగింటిలో ఏ కోర్సు పూర్తిచేసుకున్నా.. ఉజ్వల భవిత ఖాయంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలనే పరిశీలిస్తే.. ఉత్పత్తి రంగం మొదలు ఐటీ, ఆటోమేషన్ వరకు.. అవకాశాలు పుష్కలం. సైన్స్, మ్యాథమెటిక్స్ల్లో పీహెచ్డీ స్థాయి కోర్సులు పూర్తిచేస్తే విస్తృత ఉపాధి వేదికలు అందుబాటులోకి రావడం ఖాయం. కానీ, ఈ సబ్జెక్ట్లలో ఈ స్థాయి నిపుణులు లేక పరిశ్రమ వర్గాలు, పరిశోధన కేంద్రాలు స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మార్గాలు అనేకం స్టెమ్ కోర్సులు అభ్యసించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కోర్సులు అభ్యసించే అవకాశముంది. సైన్స్ కోర్సుల అభ్యర్థులు.. ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే రీసెర్చ్ వైపు అడుగులు వేసే వీలుంది. స్కిల్ గ్యాప్.. ప్రధాన సమస్య స్టెమ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. జాబ్ మార్కెట్లో స్కిల్ గ్యాప్ అనేది ప్రధాన సమస్యగా మారింది. అకడమిక్ స్థాయిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఇండస్ట్రీ వర్గాలు ఇన్స్టిట్యూట్లతో కలిసి నడవకపోవడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగుల్లో స్టెమ్ నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని 87 శాతం మంది పేర్కొనడం స్కిల్ గ్యాప్ సమస్యకు నిదర్శనంగా చెప్పొచ్చు. అక్కడా భారతీయ నిపుణులు వాస్తవానికి మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న స్టెమ్ నిపుణుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికా మొదలు పలు దేశాల్లోని సంస్థల్లో పనిచేస్తున్న స్టెమ్ నిపుణుల్లో భారతీయుల సంఖ్య 20 నుంచి 30 శాతంగా ఉంది. ఈ నిపుణులు దేశంలోనే ఉండేలా ప్రోత్సాహకాలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మేధో వలసలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్తుకు స్టెమ్ నిపుణులే పునాది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా.. భవిష్యత్తులో స్టెమ్ నిపుణులుæ దేశ ప్రగతికి పునాదులుగా నిలవనున్నారు. అందుకు తగ్గట్టుగా స్టెమ్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని, స్కిల్ గ్యాప్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల్లో పరిశోధనలు చేసే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచాలంటున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి నూతన నైపుణ్యాలు అందించే విధంగా ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు, కోర్సులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీతో కలిసి స్టెమ్ విభాగాల్లో నెలకొన్న స్కిల్ గ్యాప్ సమస్య పరిష్కారానికి ఇన్స్టిట్యూట్లు, ఇండస్ట్రీ వర్గాలతో కలిసి పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్సు ప్రారంభించే సమయంలో ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదించి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను కరిక్యులంలో చేర్చాలి. అలాగే పరిశోధనల పరంగా జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేపట్టడం, వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా స్కిల్ గ్యాప్ సమస్యను అధిగమించే వీలుంది. ప్రోత్సాహకాలు అందించేలా స్టెమ్ కోర్సుల్లో చేరే మహిళా విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, ఆడ పిల్లలు సైతం స్టెమ్ విభాగాల్లో ముందంజలో నిలిచేలా చర్యలు తీసుకోవాలం టున్నారు. ఐఐటీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ కోటా పేరుతో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ.. ఇతర ఇన్స్టిట్యూట్లు, కోర్సులకు కూడా వీటిని వర్తించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్టెమ్ కోర్సులు.. సర్వే ముఖ్యాంశాలు ♦ దేశ అభివృద్ధిలో స్టెమ్ ఉద్యోగాలే కీలకమని చెప్పిన వారు– 84 శాతం. ♦ స్టెమ్ ఎడ్యుకేషన్ ముఖ్యం అన్నవారు–96% ♦ స్టెమ్ విభాగాల్లో మహిళా రోల్ మోడల్స్ లేకపోవడం కూడా సమస్యగా ఉందని చెప్పిన వారి సంఖ్య–44 శాతం. ♦ అమెరికాలో ప్రతి పది మందిలో ఆరుగురులో స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి. కానీ, ప్రతి పది మందిలో నలుగురు ఈ విభాగంలో సరైన ప్రోత్సాహం లేదని చెప్పారు. ఎలాంటి సందేహం లేదు స్టెమ్ కోర్సులతో అటు ఇండస్ట్రీకి, ఇటు విద్యా ర్థులకు ప్రయోజనాలు చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మ రింత పెరగాల్సిన అవ సరం ఉంది. ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ, మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది తక్కువనే చెప్పాలి. దీనికి పరిష్కారం ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ముందు నుంచే అవగాహన కల్పించడం.– ప్రొఫెసర్ ఎం.జె.స్వామి, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, హెచ్సీయూ. -
15లోపు..దరఖాస్తు చేసుకోండి...
రాజంపేట టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (ఏఓయూ) ద్వారా బీఈడీ అభ్యసించే విద్యార్థులు మే 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో శుక్రవారం ఎల్వీకే విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదువందల బీఈడీ సీట్లు ఉన్నాయన్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో మరో ఐదువందల సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో యాబైశాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కలిగిన విద్యార్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ 6వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. బీఈడీలో ప్రవేశం పొందే విద్యార్థులు నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎన్సీటీఈ) గుర్తింపు పొందిన డీఎడ్, టీటీసీ, ఈఎల్ఈడీ, తెలుగుపండిట్, హిందీపండిట్ వంటి డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన డిప్లొమా సర్టిఫికెట్లు లేని వారు బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా అడ్మిషన్ పొందేందుకు అనర్హులన్నారు. బీఈడీ స్పెషల్æ ఎడ్యుకేషన్లో చేరే విద్యార్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉంటే చాలన్నారు. అయితే ప్రవేశ పరీక్షలో ర్యాంకు తప్పని సరి అన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో అంగవైకల్యం ఉన్నవారికి, అంగవైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఎల్వీకే తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఉపాధికోర్సుల్లో ఉచిత శిక్షణ
తాడేపల్లిగూడెం : నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ జె.షణ్ముఖరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18–35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు బ్యూటీషియన్, మెహందీ, మగ్గం, గ్లిట్టరింగ్ వర్క్స్ నేర్పిస్తామన్నారు. బ్యూటీషియన్, మెహందీ కోర్సు నేర్చుకునే వారు పదో తరగతి చదివి ఉండాలని, వీరికి వచ్చేనెల 3వ తేదీ నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. మగ్గం, గ్లిట్టరింగ్ వర్క్స్ నేర్చుకునేవారు ఐదో తరగతి చదివి ఉండాలని, వచ్చేనెల 3వ తేదీ నుంచి 21 రోజులపాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 18–35 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతకు బేసిక్ ఫొటోగ్రఫీ, మొబైల్ ఫోన్స్ రిపేరింగ్లో శిక్షణ ఉంటుందన్నారు. ఫొటోగ్రఫీలో 21 రోజులు, మొబైల్ ఫోన్ రిపేరింగ్పై నెల రోజులు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కోర్సులు నేర్చుకునే వారు పదో తరగతి చదివి ఉండాలన్నారు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయంతోపాటు శిక్షణ కేంద్రానికి వెళ్లేందుకు అయ్యే చార్జీలు కూడా చెల్లిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్క్స్ లిస్ట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలు, 2 పాస్పోర్ట్ సైజు ఫొటోలతో ఆంధ్రాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, బమ్మెర పోతన వీధి, అశోక్ నగర్, ఏలూరు చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08812–253975, 98660 94383, 94909 98882 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఎల్ఎండీలో బీసీ బాలికల గురుకుల కళాశాలకు అనుమతి
తిమ్మాపూర్: ఎల్ఎండీలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 16 బీసీ గురుకుల పాఠశాలలను అప్గ్రేడ్ చేయగా.. జిల్లాలో ఎల్ఎండీలోని బాలికల గురుకుల పాఠశాల ఒకటి. 2016–17 విద్యా సంవత్సరంలోనే జూనియర్ కళాశాల ప్రారంభమవుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. తిమ్మాపూర్లోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కళాశాలగా అప్గ్రేడ్ చేయడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నట్లు ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. ఒక్కో కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తామని, వీటికి ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టులో జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం తరగతుల నిర్వహించాల్సి ఉందని చెప్పారు. పక్కా భవనంలో గదులు లేని కారణంగా భవనం అద్దెకు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.