breaking news
Consultancy Office
-
కన్సల్టెన్సీ ఆఫీస్లో లా విద్యార్థిని ఆత్మహత్య
మలక్పేట: ఎల్ఎల్బీ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం తక్రాజ్గూడ తండాకు చెందిన ఇస్లావత్ రమేశ్– కంసీ దంపతులకు శ్రావ్య(20), శ్రుతి, సాయికిరణ్ సంతానం. శ్రావ్య ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఎన్టీఆర్నగర్ మహాత్మాగాంధీ లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. మలక్పేటలోని నందిని రెసిడెన్సీలో నవీన్, విజయ్లు జయదుర్గా ఎడ్యుకేషన్స్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శ్రావ్య మూడు నెలలుగా నవీన్ వద్ద పనిచేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీకి వెళ్లిన శ్రావ్య సాయంత్రం తన తమ్ముడు సాయికిరణ్కు ఫోన్ చేసి రూ.20 వేలు ఫోన్ పే చేయాలని కోరింది. సాయికిరణ్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత శ్రావ్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.దీంతో అతను హాస్టల్లో శ్రావ్యతోపాటు ఉంటున్న శిరీషకు ఫోన్ చేశాడు. దీంతో శిరీష తన స్నేహితురాలైన సోనికి విషయం చెప్పింది. దీంతో సోనీ తన స్నేహితుడైన కార్తీక్తో కలిసి కన్సల్టెన్సీకి వెళ్లింది. పక్క ఫ్లాట్లో ఉన్న రవీందర్, గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న మరో మహిళతో కలిసి ఆఫీస్రూమ్ వద్దకు వెళ్లారు. ఆఫీసురూమ్ బయట శ్రావ్య చెప్పులు ఉండటం గమనించారు. వారు తలుపులు తీసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో అది సాధ్యం కాలేదు. కిటికీలో నుంచి చూడగా శ్రావ్య సీలింగ్ ఫ్యాన్కు స్కార్ఫ్తో ఉరేసుకొని కనిపించింది.దీంతో తలుపులు పగులగొట్టి శ్రావ్యను కిందకు దించారు. రవీందర్ కారులో మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, శ్రావ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎస్సై సురేశ్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆందోళనకు దిగిన గిరిజన సంఘాలు శ్రావ్య మరణవార్త తెలుసుకున్న గిరిజన సంఘాలు, మృతురాలి బంధువులు సోమవారం పెద్ద సంఖ్యలో మలక్పేట పీఎస్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అనంతరం కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివారం సెలవురోజు కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్ కార్యాలయానికి శ్రావ్యను ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. శ్రావ్యపై అత్యాచారం చేసి హత్య చేశారని, చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారన్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కొనసాగుతోంది గిరిజన విద్యార్థి మృతి చెందిన విషయంపై ఆదివారం రాత్రి మలక్పేట పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ నరేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు నవీన్, విజయ్ని అదుపులోకి తీసుకున్నాం. శ్రావ్యను ఆస్పత్రికి తరలించిన కార్తీక్, సోనిలను కూడా విచారిస్తాం. క్లూస్ టీమ్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.నిçష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది. – శ్యామ్సుందర్, మలక్పేట ఏసీపీ -
ఉద్యోగం పేరుతో అంధుడికి టోకరా
జీడిమెట్ల, న్యూస్లైన్: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కన్సల్టెన్సీలను మనం చూశాం... అయితే, ఉద్యోగం పేరుతో ఓ అంధుడినీ మోసం చేశారు కొందరు ఘనులు. న్యాయం చేయమని బాధితుడు ఐదు రోజుల క్రితం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయిస్తే ఇదిగో.. అదిగో.. అంటూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో బాధితుడు ఆదివారం ‘న్యూస్లైన్’ ను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కమలానగర్కు చెందిన శేఖర్, సుబ్బలక్ష్మిల కుమారుడు లక్ష్మణ్ (18) పుట్టుకతోనే అంధుడు. అనంతపురంలోని ఆర్డీటీ అంధుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం బళ్లారికి వెళ్లగా, ఇతను స్వగ్రామంలో నానమ్మతో కలిసి ఉంటున్నాడు. చిత్తు కాగితాలు ఏరి నానమ్మ పోషిస్తుండటంతో తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసి నాన్నమ్మకు ఆసరాగా ఉంటానని స్నేహితులకు చెప్పాడు. ‘చాక్లెట్ కంపెనీలో ఉద్యోగం, 18 వేల జీతం, భోజన వసతి కూడా కల్పిస్తాం’ అంటూ ఈనెల 10న ఓ పత్రికలో వచ్చిన ప్రకటను చూసి స్నేహితులు లక్ష్మణ్కు తెలిపారు. ప్రకటనలో ఉన్న నెంబర్కు లక్ష్మణ్ ఫోన్ చేసి.. ‘నేను అంధుడిని.. ఉద్యోగం ఇస్తారా?’ అని అడిగాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ‘మీలాంటి వారికి కూడా ఉద్యోగాలున్నాయి. రూ.1000 కన్సల్టేషన్ ఫీజు నిమిత్తం ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ (నెం 044410100074130)లో జమ చేసి.. తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చి కలవండి’ అని చెప్పాడు. డబ్బు చెల్లించిన లక్ష్మణ్.. 15న నాంపల్లికి వచ్చి ఫోన్ చేయగా మరుసటి రోజు రమ్మని చెప్పారు. 16న సికింద్రాబాద్.. ఆపై జీడిమెట్లకు రమ్మని చెప్పారు. చివరకు కన్సల్టెన్సీ ఆఫీస్కు వెళ్లగా నువ్వు అంధుడివి నీకు ఉద్యోగం లేదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మణ్ స్థానికుల సహాయంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంత ఊరుకు వెళ్లలేక ఐదు రోజులుగా తనకు న్యాయం చేయండంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తూ.. రాత్రి ఎక్కడో ఒక చోట తలదాచుకుంటున్నాడు. పోలీసుల తీరుతో విసుగు చెందిన బాధితుడు ఆదివారం ఉదయం ‘న్యూస్లైన్’ను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. పోలీసులు ఇతనికి న్యాయం చేస్తారని ఆశిద్దాం.