కోల్డ్ స్టోరేజీలకు తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల వృథాను తగ్గించే దిశగా దేశవ్యాప్తంగా 112 కోల్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు కేంద్రం తోడ్పాటు అందిస్తోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ బాజ్పేయి తెలిపారు. వీటిలో 49 ప్రాజెక్టులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెరి మూడు ఉన్నాయన్నారు. వీటిలోనూ ఒక్కొక్కటి చొప్పున పూర్తయ్యాయని శనివారం ఇక్కడ జరిగిన కోల్డ్ చెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజయ్ చెప్పారు.
మొత్తం 112 ప్రాజెక్టులకు దాదాపు రూ. 2,607 కోట్లు పెట్టుబడి అవసరమని, ఇందులో సుమారు రూ. 874 కోట్లను గ్రాంటుగా అందిస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఏటా వృథా అవుతున్న పండ్లు, కూరగాయల విలువ సుమారు రూ. 13,309 కోట్ల మేర ఉంటుందన్నారు. మరోవైపు, ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని ప్రకటించనున్నట్లు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు.
ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రత్యేక విధానంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మెగా ఫుడ్ పార్క్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు విషయంలో ప్రధానంగా విద్యుత్ చార్జీలు, రుణాలపై అధిక వడ్డీ రేట్లు సమస్యలుగా ఉంటున్నాయని వీటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు.