breaking news
coffee gardens
-
Kerala Tour అరేబియా తీరం, హౌస్బోట్ విహారం
టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రామాయణ ఘట్టం ఉంది.అరేబియా తీరాన కొలువుదీరిన అతిపెద్ద గంగాధరుడున్నాడు.అనంత సంపన్నుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. భారతీయ మూర్తులకు పశ్చిమ రంగులద్దిన రవివర్మ ఉన్నాడు.కేరళ సిగ్నేచర్ హౌస్బోట్ విహారం ఉంది... కథకళి...కలరిపయట్టు విన్యాసాలూ ఉన్నాయి.టీ తోటలు... మట్టుపెట్టి డ్యామ్ బ్యాక్ వాటర్స్...ఇవే కాదు... ఇంకా చాలా చూపిస్తోంది ఐఆర్సీటీసీ. మొదటి రోజుత్రివేండ్రమ్ ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్, కొకువెలి రైల్వేస్టేషన్ల నుంచి పికప్ చేసుకుని బస చేయాల్సిన హోటల్కు తీసుకెళ్తారు. హోటల్ త్రివేండ్రమ్ లేదా కోవళమ్లలో ఉంటుంది. సాయంత్రం కోవళం బీచ్, అళిమల శివుని విగ్రహాన్ని దర్శించుకుని విశ్రాంతి తీసుకోవడమే. రెండో రోజుఉదయం త్రివేండ్రమ్లోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం. జటాయు ఎర్త్ సెంటర్ని చూసిన తర్వాత ప్రయాణం కుమర్కోమ్ వైపు సాగుతుంది. ఈ ప్యాకేజ్ పేరుతో ఉన్న హౌస్బోట్ విహారం ఇక్కడ మొదలవుతుంది. కుమర్కోమ్ లేదా అలెప్పీలో క్రూయిజ్లోకి మారాలి. రాత్రి భోజనం, బస, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అన్నీ హౌస్బోట్లోనే.తెరవని ఆరవ గదిత్రివేండ్రమ్... ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అనంత పద్మనాభ స్వామి వల్ల ఈ పేరు విశ్వవ్యాప్తంగా ప్రచారం సంతరించుకుంది. ఈ నగరానికి ఆ పేరు వచ్చింది కూడా అనంత పద్మనాభ స్వామి వల్లనే. తిరు అనంత పురం... క్రమంగా మలయాళీల వ్యవహారంలో తిరువనంతపురం అయింది. బ్రిటిష్ వారి వ్యవహారంలో త్రివేండ్రమ్గా మారింది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో తెరవని ఆరో గది ఇప్పటికీ ఆసక్తికరమే. నాగబంధంతో మూసిన ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పద్మనాభ స్వామి ఆలయ దర్శనంలో ఈ గదిని తప్పనిసరిగా చూడాలి. ఇక త్రివేండ్రమ్ అనగానే గుర్తొచ్చే మరో పేరు రాజా రవి వర్మ. భారతీయ దేవతల చిత్రాలకు కొత్తరంగులద్దిన ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన రవివర్మ నివాసాన్ని కూడా చూడవచ్చు.జటాయు ఎర్త్ సెంటర్... ఇది ఒక థీమ్ పార్క్. జటాయు పక్షి ఆకారంలో నిర్మించారు. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో రావణుడితో పోరాడి ప్రాణాలు వదిలిన పక్షి జటాయు. ఆ పక్షి రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పార్క్ను పశ్చిమ కనుమల్లో ఓ కొండ మీద 65 ఎకరాల్లో నిర్మించారు. ఈ కొండమీదకు వెళ్లడానికి ఎనిమిది వందలకు పైగా మెట్లెక్కాలి. కేబుల్కార్ కూడా ఉంది. ఆరోగ్యవంతులు ఎక్కగలిగిన కొండే అయినప్పటికీ బయటి ప్రదేశాల నుంచి పర్యటన కోసం వచ్చిన వాళ్లు టైమ్ వేస్ట్ చేసుకోకుండా పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షిస్తూ కేబుల్ కార్లో వెళ్లడమే మంచిది. వెకేషన్ కోసం వెళ్లి నాలుగైదు రోజులు బస చేసేవాళ్లు ఒక రోజు కొండ ఎక్కడాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్యాస్టిక్ని అనుమతించరు.మూడో రోజుఅలెప్పీ నుంచి మునార్కు ప్రయాణం. రోడ్డు మార్గాన మునార్కు చేరాలి. మధ్యలో పునర్జనిలో కేరళ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలి. రాత్రి బస మునార్లో.కలరిపయట్టు... కథకళి చూద్దాం!పునర్జని ట్రెడిషనల్ విలేజ్... కేరళ సంప్రదాయ కళల ప్రదర్శన వేదిక. అలాగే ఆయుర్వేద చికిత్సల నిలయం కూడా. మునార్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజూ సాయంత్రం ఆరు గంటలకు కథకళి నాట్యం, కలరిపయట్టు యుద్ధకళా విన్యాసాలను ప్రదర్శిస్తారు. రిలాక్సేషన్ థెరపీలు ఐదు నుంచి పదిహేను వేలు చార్జ్ చేస్తారు. అవి ఈ ప్యాకేజ్లో వర్తించవు. నాలుగో రోజురోజంతా మునార్లోనే. ఎరవికులమ్ నేషనల్ పార్క్ పర్యటన, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్, కుందల డ్యామ్ లేక్లో విహరించిన తర్వాత రాత్రి బస మునార్లోనే.మునార్ టీ తోటల మధ్య విహారం, ఝుమ్మనే వాటర్ ఫాల్స్ ను దూరం నుంచే చూస్తూ ముందుకు సాగిపోవడంతోపాటు టీ మ్యూజియం సందర్శన బాగుంటుంది. మట్టుపెట్టి డ్యామ్, రిజర్వాయర్ చుట్టూ విస్తరించిన టీ తోటల దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరవికులమ్ నేషనల్ పార్క్ విజిట్ మరిచిపోలేని అనుభూతి. నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వు దట్టంగా పూసేది ఇక్కడే. నీలకురింజి మళ్లీ పూసేది 2030లో. కానీ ఎక్కడో ఓ చోట ఒకటి రెండు గుత్తులు కనిపిస్తాయి. గైడ్లు వాటిని చూపించి కొండ మొత్తం పూసినప్పుడు దృశ్యం ఎలా ఉంటుందో ఫొటోలు చూపిస్తారు. అయిదో రోజుమునార్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొచ్చి వైపు సాగిపోవాలి. కొచ్చిలో హోటల్ చెక్ ఇన్. మెరైన్ డ్రైవ్ను ఎంజాయ్ చేసిన తర్వాత షాపింగ్ తర్వాత నైట్ స్టే.కొచ్చిలో షాపింగ్ చేయడం మొదలు పెడితే మన లగేజ్ పెరిగిపోతుంది. లవంగాలు, యాలకులు, మిరియాల వంటివి చక్కటి ఘాటు వాసనతో స్వచ్ఛంగా ఉంటాయి. టూర్ గుర్తుగా కేరళ చీర ఒక్కటైనా కొనుక్కోవాలి. అవి బాగా మన్నుతాయి కూడా! స్థానిక హస్తకళాకృతులకు కొదవే ఉండదు. కోకోనట్ కాయిర్తో చేసిన గృహోపకరణాలు కూడా బాగుంటాయి. కథకళి సావనీర్లు తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద తైలాల పేరుతో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు, నకిలీలు కూడా ఉంటాయి. వీటిని గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టోర్లలో మాత్రమే కొనాలి. షాపింగ్ చేసేటప్పుడు ఫ్లయిట్లో లగేజ్ బరువు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. వెళ్లేటప్పుడు ఫ్లయిట్, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తే లగేజ్ బరువు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఆరో రోజుకొచ్చిలో హోటల్ చెక్ అవుట్ చేసి, కొచ్చి లోని డచ్ ప్యాలెస్ సందర్శనం. యూదుల సినగోగ్ (ధార్మిక సమావేశ మందిరం), సర్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రాజ్ బాసిలికా పర్యటన తర్వాత కొచ్చి ఎయిర్ పోర్ట్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ పూర్తవుతుంది. కొచ్చి, ఎర్నాకుళం మన హైదరాబాద్– సికింద్రాబాద్ వంటి జంట నగరాలు. ఎయిర్΄ోర్టు కొచ్చిలో ఉంది, రైల్వే స్టేషన్ ఎర్నాకుళంలో ఉంది.వాస్కోడిగామా రాక ఫలితం!డచ్ ప్యాలెస్... అనగానే పాశ్చాత్య నిర్మాణశైలిని ఊహిస్తాం. కానీ ఇది పూర్తిగా కేరళ సంప్రదాయ నాలుకేట్టు నిర్మాణశైలిలో ఉంటుంది. పోర్చుగీసు వాళ్లు నిర్మించడం వల్ల డచ్ ప్యాలెస్గా అనే పేరు వచ్చింది. ఇది కొచ్చి నగరానికి సమీపంలోని మత్తన్ చెర్రి అనే ప్రదేశంలో ఉండడంతో స్థానికులు మత్తన్చెర్రి ప్యాలెస్ అనే పిలుస్తారు. వాస్కోడిగామా మనదేశంలో కేరళతీరం, కొచ్చి రాజ్యం, కప్పడ్ దగ్గర ప్రవేశించాడు. కొచ్చి రాజు అతడికి సాదర స్వాగతం పలికాడు. మనదేశం బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లడానికి దారులు వేసిన ఒక కారణం ఇది. ఈ ప్యాలెస్ భవనాల సముదాయం హెరిటేజ్ సైట్ల జాబితా కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ ప్యాలెస్ లోపల నాటి చిత్రరీతుల ప్రదర్శన ఉంది.యూదులు వచ్చారు!మత్తన్చెర్రిలో డచ్ ప్యాలెస్ పక్కనే యూదు మతస్థుల ధార్మిక సమావేశ మందిరం సినగోగ్ కూడా ఉంది. ఇది కూడా డచ్ ప్యాలెస్ నాటి 16వ శతాబ్దం నాటి నిర్మాణమే. పశ్చిమం నుంచి మనదేశానికి అరేబియా సముద్రం మీదుగా జలమార్గాన్ని కనుక్కున్న తర్వాత పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. వర్తకులు, నౌకాయాన ఉద్యోగులు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం మొదలైంది. అలా స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చిన వారిలో కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఆ కాలనీలు క్రమంగా వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి మందిరాలు కట్టుకున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ సినగోగ్ క్రిస్టల్ షాండ్లియర్లతో అందంగా ఉంటుంది. తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశంలో భారతీయులుగా మమేకమయ్యారు. ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్బోట్’... ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజ్. ఇందులో త్రివేండ్రమ్, అలెప్పీ, మునార్, కొచ్చి ప్రదేశాలు కవర్ అవుతాయి. నీలగిరి తార్కు ప్రసూతి సమయం కావడంతో మునార్లోని ఎరవికులమ్ నేషనల్ పార్క్ను ఏప్రిల్ 1 వరకు క్లోజ్ చేశారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాబట్టి ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్బోట్’ టూర్కి ఇది అనువైన సమయం.కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి దాదాపుగా 57 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30 వేలవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. పిల్లలకు విడిగా బెడ్ తీసుకుంటే తొమ్మిది వేలు, బెడ్ తీసుకోకపోతే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు. టూర్లో ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, మార్గమధ్యంలో టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, ప్యాకేజ్లో చెప్పిన ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, హోటల్ గది బస, హౌస్బోట్లో బస, నాలుగు బ్రేక్ఫాస్ట్లు, హౌస్బోట్లో లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజ్లో ఉంటాయి.ప్యాకేజ్లో మన ప్రదేశం నుంచి త్రివేండ్రమ్కు చేరడం, కొచ్చి లేదా ఎర్నాకుళం నుంచి ఇంటికి రావడానికి అయ్యే రైలు లేదా విమాన ఖర్చులు వర్తించవు. త్రివేండ్రమ్లో రిసీవ్ చేసుకోవడం నుంచి కొచ్చిలో వీడ్కోలు పలకడం వరకే ఈ ప్యాకేజ్. ఇటీవల పర్యాటకులు యూ ట్యూబ్ వీడియోల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా హౌస్బోట్ ప్రయాణంలో నిర్వహకుల సూచనలను విధిగా పాటించాలి.ఈ టూర్లోని పర్యాటక ప్రదేశాల్లో మునార్ టీ మ్యూజియానికి సోమవారం సెలవు, కొచ్చిలోని డచ్ ప్యాలెస్ శుక్రవారం, యూదుల సినగోగ్కి శనివారం సెలవు. వీటిలో ఒకటి – రెండు మిస్ కాక తప్పదు. విమానాశ్రయంలో దేవుని ఊరేగింపు!త్రివేండ్రమ్ చేరడానికి విమానంలో వెళ్లడం వల్ల బోనస్ థ్రిల్ ఉంటుంది. పద్మనాభస్వామి ఊరేగింపు కోసం విమానాలు ల్యాండింగ్ ఆపేస్తారు. ఏడాదికి రెండు దఫాలు ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో పైన్కుని పండుగ సందర్భంగా జరిగే పది రోజుల వేడుకలో చివరి రోజు ఆరట్టు (సముద్రస్నానం) కోసం పద్మనాభ స్వామి ఊరేగింపు ఆలయం నుంచి షంగుముగమ్ బీచ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సాగుతుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అల్పఱి పండుగ వేడుకల సందర్భంగా కూడా రన్వేని మూసివేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం రన్వే ఈ దారిలోనే ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించేటప్పుడే (1932 ) ప్రభుత్వం విధించిన నియమం ఇది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు ఇక్కడ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోవు. పండుగకు రెండు నెలల ముందే ఆలయ ట్రస్ట్ బోర్డు వేడుకల షెడ్యూల్ను ఎయిర్పోర్ట్ అథారిటీకి తెలియచేస్తుంది. ఆ మేరకు ఏ తేదీన ఏ సమయంలో ఎయిర్΄ోర్ట్ రన్వేను మూసివేయనున్నారనే సమాచారం అక్కడ రాకపోకలు సాగించే విమానాల సంస్థలకు అందుతుంది. ఇది ప్రపంచవింత కాదు కానీ విచిత్రం. -వాకా మంజులా రెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈ కాఫీకి గింజల అవసరం లేదు...
మాంసం కావాలంటే పశువులు.. పాలు కావాలంటే ఆవులు కావాలన్నది మనకు తెలిసిన సత్యం. కానీ.. టెక్నాలజీ పుణ్యమా అని పరిశోధనశాలలోనే మాంసం కృత్రిమంగా తయారైపోతే.. పాలకు ప్రత్యామ్నాయాలు బోలెడున్నాయని కూడా ఇటీవలే స్పష్టమైంది. మరి మనలో చాలామంది రోజూ ఉదయాన్నే ఎంతో ఆస్వాదించే కాఫీ? దీనికీ ఓ ప్రత్యామ్నాయం తయారు చేసేశాం అంటోంది సియాటెల్ స్టార్టప్ అటోమో. కాఫీగింజలు ఏమాత్రం వాడకుండా తాము తయారు చేస్తున్న కాఫీలో పాలు, చక్కెర కూడా వాడాల్సిన అవసరం లేదని, పైగా మీకు నచ్చిన విధంగా రుచిని మార్చుకోనూవచ్చని అంటున్నారు అటోమో సీఈవో యాండీ క్లీస్టెక్. కాఫీ వాసన, అదిచ్చే ఫీలింగ్, రంగు వంటి అన్ని అంశాలకు సంబంధించి తాము 40 వరకూ పదార్థాలను గుర్తించామని... వాటిని కృత్రిమంగా కలిపేయడం ద్వారా తయారైన తమ కాఫీ అసలుదానికి ఏమాత్రం తీసిపోదని ఆయన వివరించారు. ప్రస్తుతం మనం పండిస్తున్న కాఫీ కారణంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని.. పైగా ఇప్పటికే 60 శాతం నాటు కాఫీ మొక్కలు కనిపించకుండాపోయాయని చెప్పారు. అంతేకాకుండా కాఫీ తోటలు ఎదుర్కొంటున్న కూలీల కొరత తదితర సమస్యల వల్ల కాఫీ పెంపకం పెద్దగా లాభదాయకం కాదని నెస్లే లాంటి కంపెనీలే ఒప్పుకుంటున్నాయని ఈ నేపథ్యంలోనే తాము కృత్రిమ కాఫీని తయారు చేశామని.. సహజసిద్ధమైన మొక్కల పదార్థాలతోనే దీన్ని తయారు చేసినప్పటికీ అందులో ఏమున్నాయో ప్రస్తుతానికి వెల్లడి చేయలేమని అన్నారు. -
క్వీన్ బీ
నాన్న కాఫీతోటలు పెంచారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చేదును వద్దనుకున్నారు ఛాయా నంజప్ప. కూర్గ్ కాఫీ గింజల వైపు చూడకుండా, ఆ ప్రాంతంలోని చెట్లకు కనిపించే తేనెతుట్టెల్ని ఉపాధిగా చేసుకున్నారు. ఆ తియ్యదనాన్ని ఆ ప్రాంతంలోని మహిళలకూ పంచుతున్నారు. క్వీన్ బీ అంటే.. తేనెటీగల్లో రాణి. ఆ రాణిగారు పని చేయరని అంటారు! కానీ.. ఛాయా నంజప్ప అనే ఈ క్వీన్ బీ... తను కష్టపడి, కష్ట జీవులకు మకరందాన్ని పంచుతున్నారు. ‘‘ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండే తేనెటీగలే మాకు స్ఫూర్తి. మేమంతా ఎంత శ్రమ పడినప్పటికీ ఆ శ్రమ.. ఐదు మిల్లీగ్రాముల మకరందాన్ని సేకరించడానికి ఒక తేనెటీగ పడే శ్రమకంటే తక్కువే’’ అంటారు ఛాయా నంజప్ప. ఆ స్ఫూర్తితోనే పని చేశారు కాబట్టే ఈ రోజు ఏడాదికి పది కోట్ల రూపాయల టర్నోవర్తో ‘నెక్టార్ ఫ్రెష్’ కంపెనీని నిర్వహిస్తున్నారామె. ‘నెక్టార్ఫ్రెష్’.. స్వచ్ఛమైన తేనె, జామ్లను దేశంలోని పెద్ద పెద్ద హోటళ్లకు సరఫరా చేస్తుంటుంది. ఛాయానంజప్ప గత పదేళ్ల శ్రమకు ఫలితమిది. ఎత్తుపల్లాల ప్రయాణం ఛాయాకు పారిశ్రామిక రంగంతో ఎటువంటి పరిచయమూ లేదు. ఇంట్లో కూడా ఎవరూ ఆ రంగంలో లేరు. వారి కుటుంబంలో తొలి తరం వ్యాపారి ఆమే. అవాంతరాలు అనుభవంలోకి వచ్చాక వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఆమె చేసింది. దాంతో కంపెనీ ’బ్రేక్ ఈవెన్’ కి రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ లోపు వచ్చిన ఆర్థిక నష్టం చాలా పెద్దదే. అయితే ఆ పాఠాలేవీ వృథాగా పోలేదంటారామె. కాలం కదులుతోంది కర్ణాటక రాష్ట్రం, కొడగు దగ్గర నల్కెరీ.. ఛాయా సొంతూరు. కాఫీ తోటల పెంపకంలో తండ్రి సంపాదన కుటుంబాన్ని నడిపిస్తోంది. హెడ్మాస్టర్గా తల్లి జీతం సౌకర్యవంతమైన జీవితాన్నిస్తోంది. ఇది ఆమె స్కూల్ ఫైనల్ వరకు సాగిన జీవితం. తర్వాత రెండేళ్లలో కుటుంబ చిత్రం పూర్తిగా మారిపోయింది. తండ్రి పోవడంతో ఆమె చదువు పన్నెండవ తరగతితో ఆగిపోయింది. కొన్నేళ్లు ఇంటి దగ్గరే ఉండిపోయిన ఛాయాకు కాలంతోపాటు మనిషి ఏదో ఒక వైపు సాగిపోతుండాలనీ, స్తబ్దుగా అయిపోకూడదనీ అనిపించింది. వెంటనే బెంగళూరు ప్రయాణ æమైంది. మొదట ఒక చిన్న ఆఫీస్లో రిసెప్షన్ ఉద్యోగం, తర్వాతి ఏడాదికి పెద్ద ఫైవ్స్టార్ హోటల్లో ఉద్యోగం. నెల తిరిగేసరికి జీతం వస్తోంది. అయితే సొంతంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నారు ఛాయ. కూర్గ్ కొండలు కనిపించాయి పరిశ్రమకు అవసరమైన శ్రమతత్వం తనలో ఉంది. మరి తాను నడిపించగలిగిన పరిశ్రమ ఏది? సొంతూరు కనిపించింది. కూర్గ్ కొండల్లో కాఫీ తోటలు, దట్టమైన చెట్లకు పెట్టిన తేనెపట్టులు కనిపించాయి. కాఫీ గింజలు తండ్రిని తీసుకెళ్లి చేదుని మిగిల్చాయి, అందుకేనేమో తన జీవితాన్ని తేనె తియ్యదనంతో నింపుకోవాలను కున్నారు. ప్రాక్టికల్గా కూడా తేనె పరిశ్రమ అయితేనే తనకు మంచిదనిపించిందామెకు. తేనె ప్రాసెసింగ్ స్కిల్స్ కోసం పుణె వెళ్లి సెంట్రల్ బీ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ కోర్సు చేశారు. అంతా ఓకే... కానీ పెట్టుబడి? పది లక్షలు బ్యాంకు నుంచి లోన్ వస్తుంది, పది లక్షల మార్జిన్ మనీ తన వైపు నుంచి పెట్టాలి. తల్లి సేవింగ్స్, తన బంగారం అమ్మేసి పది లక్షలు జమ చేసింది. అలా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సహకారంతో బొమ్మనహళ్లిలో ‘నెక్టార్ ఫ్రెష్’ యూనిట్ మొదలైంది. వయసును మించి పోటీ! ‘‘అప్పట్లో నాకు పోటీగా ఉన్న కంపెనీలన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్లే. వాటికంటే మెరుగ్గా ఇవ్వగలిగినప్పుడే నేను మార్కెట్లో నిలువగలుగుతాను. బీ రెన్బెర్గ్, దార్బో, బోన్నె మామన్ వంటి కంపెనీలు నేను పుట్టక ముందు నుంచి మార్కెట్ను ఏలుతున్నాయి. నేను కొత్త మార్కెట్ ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి అనుకున్నాను’’ అని చెప్తారు ఛాయానంజప్ప. అప్పుడు స్టార్ హోటల్లో ఉద్యోగానుభవం పని చేసింది. ఆతిథ్య పరిశ్రమల్లో ఆహార ఉత్పత్తుల వినియోగం రోజూ ఉంటుంది. తన ఉత్పత్తికి అదే అసలైన కేంద్రం అవుతుందనే అంచనాకు వచ్చారు ఛాయా నంజప్ప. ఆ ప్రయత్నం విజయవంతం అయింది. ఐటీసీ, లే మెరీడియన్ వంటి పెద్దపెద్ద హోటళ్లు ‘నెక్టార్ ఫ్రెష్’కు ఖాతాదారులయ్యారు. తప్పని అడ్డంకులు! వ్యాపారం సాగుతోంది, అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఫ్యాక్టరీని మూడేళ్లలోనే మూడు చోట్లకు మార్చాల్సి వచ్చింది. బొమ్మన హళ్లి నుంచి మైసూరు దగ్గరలోనే నంజన్గాడ్కు, అక్కడి నుంచి శ్రీరంగపట్నం తాలూకా బ్రహ్మపురాకి. మార్చిన ప్రతిసారీ లక్షల్లో నష్టం! యంత్ర పరికరాలు పాడయ్యేవి. వెళ్లిన చోట కొత్తగా ఉద్యోగులను చేర్చుకుని వాళ్లకు శిక్షణ ఇవ్వాలి. ‘ఇన్ని చోట్లకు మార్చడం వల్ల ఇప్పుడు వందకు పైగా కుటుంబాలు మా కంపెనీతో కలిసి పని చేస్తున్నాయి’ అని సానుకూల దృక్పథంతో అంటారు ఛాయా. ఆహారమూ చేరింది! నెక్టార్ ఫ్రెష్ వ్యాపారం ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్లోకి కూడా అడుగుపెట్టింది. మొదట్లో వద్దనుకున్న కాఫీని కూడా చేర్చుకుంది. ఇప్పుడు టమాటా కెచప్ తయారీకి సిద్ధమవుతోంది. దేశమంతటా విస్తరించడంతోనే ఛాయా సంతృప్తి చెందలేదు, ఏ వ్యాపారానికైనా తీరని దాహం ఉండాలి. ఆ దాహంతోనే ఇప్పుడు ఛాయా నంజప్ప కంపెనీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అంచెల ఉపాధి! తేనె సేకరణలో గ్రామీణ మహిళల సహకారం తీసుకున్నాను. ఆదివాసీ మహిళలకు అదొక మంచి అవకాశమైంది. తమంతట తాము తేనె సేకరించి సంతకు తీసుకెళ్లి అమ్మడంలో ఎదురయ్యే ఇబ్బందులు వారికి తొలగిపోయాయి. తమ గూడేలకే వచ్చి చేతిలో డబ్బు పెట్టి తేనె పట్టుకెళ్లే అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఒక నెట్వర్క్గా కూడా ఏర్పాటయ్యారు! మొత్తం రెండువేల మంది మహిళల్ని కలిసి మాట్లాడాను. తేనె సేకరించడంలో పట్టు వచ్చింది. ప్రాసెస్ చేయడంలో మెళకువ తెలిసింది. – ఛాయా నంజప్ప రకరకాల తేనెలు! ఛాయా సరఫరా చేస్తున్న తేనెకు డిమాండ్ పెరిగింది. అడవుల్లో సేకరించే తేనెతోపాటు హనీ కల్చర్ కూడా ప్రారంభించింది నెక్టా్టర్ ఫ్రెష్. రైతుల దగ్గర పంటకు అనువుగా లేని నేలను అద్దెకు తీసుకుని తేనెటీగల సేద్యాన్ని రకరకాలుగా అభివృద్ధి చేసింది. వీటితోపాటు మరో ఇరవై మొబైల్ అపియరీలు (తేనెటీగలను పెంచే స్థలం) కూడా ఉన్నాయి. అలా కూర్గ్ హనీతో మొదలైన ఛాయా వ్యాపారం హిమాచల్ హనీ వరకు విస్తరించింది. మొదట్లో నెలకు ఒక టన్ను తేనె ప్రాసెస్ చేసేవారు, ఇప్పుడది రెండు వందల టన్నులకు చేరింది. ఛాయా నంజప్ప ‘నెక్టార్ ఫ్రెష్’ అధినేత, మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య సభ్యురాలు. 2014 నేషనల్ బెస్ట్ ఆంట్రప్రెన్యూర్ అవార్డు గ్రహీత. కర్ణాటక, కూర్గ్ పర్వత ప్రాంతంలోని అల్పాదాయ వర్గాల మహిళలకు ఉపాధి కల్పించారు. యాభై మిల్లీగ్రాముల మకరందాన్ని సేకరించడానికి ఒక తేనెటీగ ఇరవై లక్షల పూల మీద వాలుతుంది. వాటి శ్రమతో పోలిస్తే మనం పడే శ్రమ అసలు శ్రమే కాదు. సంతోషంగా ఉండండి, ఆ స్ఫూర్తితో పనిచేయండి – ‘నెక్టార్ ఫ్రెష్’ స్లోగన్ యూనిట్ సభ్యులతో -
కాఫీ తోటలు నాశనమైపోయాయి: అశోక్
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇచ్చేందుకు రాష్ట్రానికి ఓ బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోడానికి కేంద్రం నుంచి వీలైనంత సాయం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.