breaking news
Chile Team
-
భారత్ శుభారంభం
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్లో ఆతిథ్య భారత జట్టు 7–0 గోల్స్ తేడాతో చిలీ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రోషన్ కుజుర్ (16వ, 21వ నిమిషాల్లో), దిల్రాజ్ సింగ్ (25వ, 34వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... అజీత్ యాదవ్ (35వ నిమిషంలో), అన్మోల్ ఎక్కా (48వ నిమిషంలో), కెప్టెన్ రోహిత్ (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో ఒమన్ జట్టుతో భారత్ తలపడుతుంది. చిలీతో జరిగిన మ్యాచ్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న భారత్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. అయితే ఖాతా తెరవడానికి సమయం తీసుకుంది. తొలి క్వార్టర్లో గోల్స్ చేసేందుకు వచ్చిన అవకాశాలను భారత్ చేజార్చుకుంది. దాంతో తొలి క్వార్టర్లో రెండు జట్లు 0–0తో సమంగా నిలిచాయి. రెండో క్వార్టర్ మొదలైన తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. మన్మీత్ సింగ్ అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో అందుకున్న రోషన్ కుజుర్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత రోషన్, దిల్రాజ్ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేశారు. రెండో క్వార్టర్ ముగిసేసరికి భారత్ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో భారత్ మరో మూడు గోల్స్ చేసింది. నిమిషం వ్యవధిలో దిల్రాజ్, అజీత్ ఒక్కో గోల్ చేశారు. మూడో క్వార్టర్ ముగిసేసరికి భారత్ 6–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. చివరి క్వార్టర్లో చిలీ రక్షణపంక్తి అప్రమత్తంగా ఉండటంతో భారత్ ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ ఆఖరి నిమిషంలో కెపె్టన్ రోహిత్ గోల్తో భారత్ 7–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించగా... రెండింటిని గోల్స్గా మలిచింది. లభించిన ఒక్క పెనాల్టీ స్ట్రోక్ను రోహిత్ సది్వనియోగం చేసుకున్నాడు. టోర్నీ తొలి రోజు శుక్రవారం జరిగిన ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఫలితాలు రావడం విశేషం. మదురైలో జరిగిన పూల్ ‘ఎ’ మ్యాచ్ల్లో జర్మనీ 4–0తో దక్షిణాఫ్రికాపై, ఐర్లాండ్ 4–3తో కెనడాపై గెలిచాయి. పూల్ ‘బి’ మ్యాచ్లో స్విట్జర్లాండ్ 4–0తో ఒమన్ను ఓడించింది. పూల్ ‘డి’ మ్యాచ్ల్లో బెల్జియం 12–1తో నమీబియాపై, స్పెయిన్ 8–0తో ఈజిప్ట్పై విజయం సాధించాయి. పూల్ ‘సి’ మ్యాచ్ల్లో అర్జెంటీనా 4–1తో జపాన్పై, న్యూజిలాండ్ 5–3తో చైనాపై గెలిచి శుభారంభం చేశాయి. -
చాంపియన్ చిలీ
- తొలిసారి ‘కోపా అమెరికా కప్’ సొంతం - ఫైనల్లో అర్జెంటీనాపై విజయం - మెస్సీ బృందానికి మళ్లీ నిరాశ సాంటియాగో (చిలీ): ఒకటా... రెండా... ఏకంగా 99 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చిలీ జట్టు తొలిసారి ‘కోపా అమెరికా కప్’ టైటిల్ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో చిలీ ‘పెనాల్టీ షూటౌట్’లో 4-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టుపై సంచలన విజయం సాధించింది. ఈ ఓటమితో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరోసారి మెగా ఈవెంట్లో రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది ప్రపంచకప్లోనూ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్గా నిలిచింది. టైటిలే లక్ష్యంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన అర్జెంటీనా తుది మెట్టుపై బోల్తా పడింది. దూకుడుగా ఫైనల్ను ఆరంభించిన చిలీ ఆ తర్వాత జోరు తగ్గించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని నిలువరించడమే లక్ష్యంతో చిలీ ఆటతీరు సాగింది. మెస్సీ వెనుక ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను పెట్టి అతని కదలికలకు బ్రేక్ వేసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాత అదనంగా మరో అరగంట ఆడించినా ఫలితం లేకపోయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో చిలీ తరఫున వరుసగా ఫెర్నాండెజ్, విడాల్, అరాన్గుయెజ్, అలెక్సిస్ శాంచెజ్ గోల్స్ చేయగా... అర్జెంటీనాకు మెస్సీ మాత్రమే గోల్ సాధించగా.. హిగుయెన్, బనెగా విఫలమవ్వడంతో చిలీ విజయం ఖాయమైంది. హిగుయెన్ షాట్ గోల్పోస్ట్పై నుంచి బయటకు వెళ్లగా... బనెగా షాట్ను చిలీ గోల్కీపర్ క్లాడియో బ్రావో నిలువరించాడు. - కోపా అమెరికా కప్ చరిత్రలో అర్జెంటీనాపై చిలీకిదే తొలి విజయం. ఫైనల్కు ముందు గతంలో అర్జెంటీనాతో తలపడిన 24 మ్యాచ్ల్లో చిలీ ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మిగతా 19 మ్యాచ్ల్లో ఓడిపోయింది. - మూడో ప్రయత్నంలో చిలీ జట్టు కోపా అమెరికా కప్ విజేతగా అవతరించింది. గతంలో ఈ జట్టు 1979, 1987లలో ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకుంది. - విజేతగా చిలీ జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 25 కోట్ల 37 లక్షలు), రన్నరప్ అర్జెంటీనాకు 30 లక్షల డాలర్లు (రూ. 19 కోట్లు), మూడో స్థానం పొందిన పెరూ జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ.12 కోట్ల 68 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన పరాగ్వేకు 10 లక్షల డాలర్లు (రూ. 6కోట్ల34లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. - ఆతిథ్య దేశం హోదాలో ‘కోపా అమెరికా కప్’ నెగ్గిన ఏడో జట్టుగా చిలీ నిలిచింది. గతంలో ఉరుగ్వే, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బొలి వియా, కొలంబియా ఈ ఘనత సాధించాయి. - వచ్చే ఏడాదితో కోపా అమెరికా కప్కు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అమెరికాలో ‘సెంటినరీ టోర్నీ’ని నిర్వహిస్తారు. 2019 కోపా అమెరికా కప్కు బ్రెజిల్, 2023 టోర్నీకి ఈక్వెడార్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
28 ఏళ్ల తర్వాత...
♦ కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ ♦ సెమీస్లో పెరూపై 2-1తో గెలుపు సాంటియాగో : వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న చిలీ జట్టు... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా కప్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో చిలీ 2-1తో పెరూపై విజయం సాధించింది. ఎడ్యురాడో వెర్గాస్ (42వ, 64వ నిమిషాల్లో) చిలీకి రెండు గోల్స్ అందించగా, గ్యారీ మెడెల్ (60వ ని.) పెరూ తరఫున ఏకైక గోల్ చేశాడు. 1987 తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించడం చిలీకి ఇదే మొదటిసారి. గోల్స్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడినా... రెండో అర్ధభాగంలో చిలీ కౌంటర్ అటాకింగ్తో ఆకట్టుకుంది. 42వ నిమిషంలో గోల్ పోస్ట్ సమీపం నుంచి వెర్గాస్ కొట్టిన బంతి కాస్త ఆఫ్సైడ్ దిశగా వెళ్లినా... రిఫరీ గోల్గా ప్రకటించడం కాస్త వివాదాస్పదమైంది. మొరటుగా ఆడిన కార్లోస్ జాంబ్రానో ఆట మొదలైన 20 నిమిషాల తర్వాత మ్యాచ్కు దూరం కావడంతో పెరూ 10 మందితోనే ఆడింది. అయినప్పటికీ ఫార్వర్డ్స్ సమయోచితంగా దాడులు చేసి స్కోరును సమం చేశారు. అయితే 64వ నిమిషంలో ఓ మామూలు బంతిని మిడ్ఫీల్డ్ నుంచి అందుకున్న వెర్గాస్ డ్రిబ్లింగ్ చేస్తూ 30 గజాల నుంచి నేరుగా గోల్పోస్ట్లోకి పంపాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు పెరూ ఒకటి, రెండు షాట్లు కొట్టినా... లక్ష్యాన్ని చేరలేకపోయాయి.


