breaking news
Child Prodigy
-
15 ఏళ్లకే ఇంజినీర్ అయ్యాడు!
వాషింగ్టన్ : ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు తనిష్క్ అబ్రహం.. చిన్నవయస్సులోనే అపారమైన మేధస్సుతో అబ్బురపరుస్తున్న ఈ బాలమేధావి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లకే ఇంజినీర్గా పట్టభద్రుడు అయ్యాడు. యూసీ డేవిస్ విద్యాసంస్థ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయస్సులోనే చదువులో అసాధారణ ప్రతిభ చాటుతూ.. మూడేళ్ల కిందటే మూడు డిగ్రీలు పొందాడు. ఇప్పుడు తాజాగా బయోమెడికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడైన తనిష్క పీహెచ్డీ చేసి.. డాక్టరేట్ పట్టా పొందాలని భావిస్తున్నాడు. 15వ ఏట అడుగుపెట్టడానికి కొన్నిరోజుల ముందే ఫాదర్స్ డే సందర్భంగా తనిష్క్ ఈ డిగ్రీ పట్టా పొందాడు. అక్కడితో అతను ఆగిపోలేదు. వెంటనే యూసీ డేవిస్ మెడికల్ సెంటర్లో తన సీనియర్ డిజైన్ ప్రాజెక్టును సమర్పించాడు. అనంతరం సదరన్ కాలిఫోర్నియాలో జరిగిన బయోమెడికల్ ఇంజినీరింగ్ సదస్సులో పాల్గొని.. తన పరిశోధన ప్రాజెక్టు డిజైన్ను సమర్పించాడు. అంతేకాకుండా యూసీడీ ఎంటర్ప్రిన్యూర్షిప్ అకాడెమీలో నిర్వహించిన 3రోజుల క్రాష్కోర్సులోనూ అతను చేరాడు. బాలమేధావి తనిష్క్ అబ్రహంకు సంబంధించి మరిన్ని కథనాలు.. అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి ఈ బుడ్డోడు సూపర్ ఫాస్ట్! 10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి! -
తొమ్మిదేళ్ళకే సీఈవో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..!
తొమ్మిదేళ్ళకే ఆ కుర్రోడు.. తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. స్వంత గేమ్ అభివృద్ధి సంస్థకు సీఈవోగా, నిష్ణాతుడైన హ్యాకర్గా, యాప్ డెవలపర్గా, సైబర్ క్రైం బస్టర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఢిల్లీలో జరిగిన గ్రౌండ్ జీరో సమ్మిట్ 2015 కు హాజరైన వారిలో అత్యంత పిన్న వయస్కుడైన రూబేను పాల్... సమాచార భద్రతపై ఆసియాలో జరిగిన మొట్టమొదటి సమావేశంలో అందరినీ ఆశ్చర్య పరచడమే కాక, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పరిశోధకులు, సైబర్ నిపుణులు.. మైక్రోఫోన్ పై ప్రసంగిస్తున్నసభలో... వెనుక ఉన్న కుర్చీపై నిలుచొని తొమ్మిదేళ్ళ చిన్నారి రూబేను ప్రత్యేకంగా కనిపించాడు. భారత సంతతికి చెందిన ఆ చిన్నారి గత ఏడాది నవంబర్ 14న జరిగిన సదస్సులో తన సొంత కీలకోపన్యాసం చేశాడు. అయితే ఈ ఏడాది అతడో స్పెషల్ గెస్ట్ గా మారిపోయాడు. పిల్లలకు సైబర్ భద్రతా బోధనలో తన జ్ఞానాన్ని పంచగలిగే రాయబారి అయిపోయాడు. హ్యాకింగ్ లో నైపుణ్యం పొందగల్గితే ఎంతో శక్తి వస్తుందని, ఆ శక్తి వల్ల ఎంతో బాధ్యత కూడ వస్తుందంటున్నాడు తన హీరోగా స్పైడర్ మ్యాన్ ను ఊహించుకునే రూబేను. టెక్సాస్ విద్యా వ్యవస్థ నిర్వహించే టెక్సాస్ లోని ఆస్టిన్ స్కూల్లో జరిగే గిఫ్టెడ్ ట్యాలెంటెడ్ కార్యక్రమానికి రూబేను ఎంపికయ్యాడని, ఓ గేమ్ ను తయారు చేయడానికి అవకాశం కూడ అతడికి వచ్చిందని రూబేను తల్లి సంగీత తెలిపారు. రూబేను కు వీడియో గేమ్స్ తయారు చేయడం అంటే ఎంతో ఇష్టమని ఇప్పుడు షూటింగ్ నింజా స్టార్స్ గేమ్ను చేయాలనుకుంటున్నాడని ఆమె అన్నారు. ఐదేళ్ళ ప్రాయంలోనే రూబేను ఫైర్ వాల్ వంటి పదాలు వాడుతుండటం చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళమని రూబేను తండ్రి తెలిపారు. అతడు యాప్ లు డెవలప్ చేసేందుకు ముందు కుంగ్ ఫూ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ నేర్చుకునేవాడని, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవాడని రూబేను తల్లిదండ్రులు చెప్తూ.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.