breaking news
chekpost
-
యథేచ్ఛగా గంజాయి రవాణ.. అడ్డుకునేది ఎవరు?
కోదాడ: తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి రవాణాకు రాచమార్గంగా మారిన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు నామమాత్రంగా మారాయి. దీంతో పాటు నిఘా లేక పోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏఓబీ) నుంచి హైదరాబాద్, ముంబయిలకు చెందిన కొన్ని ముఠాలు ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో ప్రయాణిస్తూ గంజాయి రవాణా చేస్తున్నారు. దీనిని అరికట్టడానికి తెలంగాణ–ఆంధ్రా సరిహద్దుగా ఉన్న కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద గత సంవత్సరం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడింది. వందల కొద్ది కేసులు నమోదు చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమోకానీ ఈ తనిఖీలను అధికారులు ఎత్తి వేశారు. తాజాగా ప్రభుత్వం గంజాయి రవాణా, డ్రగ్స్ వినియోగంపై సీరియస్గా ఉండడంతో మరోసారి రామాపురం క్రాస్ రోడ్డు చెక్పోస్టు వద్ద నిఘా పెంచడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏడాది కాలంలో.. కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 2022 జూన్ నుంచి 2023 జూన్ వరకు గంజాయి రవాణా చేస్తూ వంద మందికిపైగా నిందితులు పట్టుబడ్డారు. 24/7 నిఘా ఉండడంతో వందల క్వింటాళ్ల గంజాయి 10కి పైగా కార్లు, ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 120 కేసులు నమోదయ్యాయి. ఈ చెక్పోస్టు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండడంతో పట్టుబడిన కేసులన్నింటినీ నమోదు చేయలేక రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడిన గంజాయిని నడిగూడెం, కోదాడ టౌన్, అనంతగిరి, నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడనట్లు కేసులు నమోదు చేసేవారంటే గంజాయి ఏ స్థాయిలో రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల చర్యలతో గంజాయి రవాణాకు చాలా వరకు బ్రేక్ పడింది. తరువాత అధికారులు పట్టించుకోకపోవడం, ఎన్నికలు రావడంతో గంజాయి రవాణా మళ్లీ పుంజుకుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గంజాయి విక్రయిస్తూ ముగ్గురు పోలీసులకు పట్టుబడడంతో దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సంచలన కేసును నీరుగార్చారా..? కోదాడ చెక్పోస్టు వద్ద పోలీసులు గంజాయిని పట్టుకోవడంతో వారు స్థానిక నాయకులతో పైరవీలు చేయించడం మొదలు పెట్టారు. దీనిలో వస్తున్న ఆదాయాన్ని చూసిన కొందరు తామే గంజాయి రవాణా చేయడం షురూ చేశారు. వీరు తెలివిగా గ్యాస్ సిలిండర్లలో గంజాయి పెట్టి రవాణా చేస్తున్నారనే సమాచారంతో నల్లగొండ సీసీఎస్ పోలీసులు 2022 జూలై 29న నకిరేకల్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ ఉన్నతాధికారి గతంలో కోదాడలో పనిచేశారు. ఈ కేసులో అప్పట్లో కోదాడలో అధికార పార్టీకి చెందిన వారు కొందరు ఉడడంతో సదరు సీసీఎస్ అధికారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఈ కేసులో కోదాడకు చెందిన ముఖ్యులను తప్పించారు. దీంతోపాటు సంచలనంగా మారుతుందని గ్యాస్ సిలిండర్లలో గంజాయి రవాణా విషయాన్ని కూడా నాడు పోలీసులు వెల్లడించకుండా కొందరు యువకులపై కేసు నమోదు చేసి వదిలేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. గంజాయి రవాణాతో సంబంధం ఉన్నవారు నాటి అధికారపార్టీ నేతల అండతో కోదాడలో చెలరేగిపోయారని, కోదాడలో యువతను గంజాయికి బానిసలుగా మార్చారని వీరందరిపై చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. కోదాడలో గంజాయి లేకుండా చేస్తా.. కోదాడ పట్టణంలో గంజాయి లేకుండా చేయడమే నా మొదటి ప్రాధాన్యత. పోలీసులతో మాట్లాడాను. త్వరలోనే దీనిపై కార్యాచరణ రూపొందిస్తాం. ఈ వ్యవహారంలో ఎవరున్నా వదిలేది లేదు. కోదాడ యువతను కాపాడేందుకు ఎంత వరకైనా వెళతాను. గంజాయి అమ్మేవారు, రవాణా చేసేవారు వెంటనే మానుకోవాలి. – నలమాద పద్మావతి, కోదాడ ఎమ్మెల్యే 24 గంటల నిఘా ఏర్పాటు చేశాం కోదాడ రూరల్ పరిధిలో ఉన్న రామాపురం అంతరాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్ పోస్టు వద్ద నిఘా పెంచాము. ముగ్గురు ఎస్ఐలతో 24 గంటలు నిఘా, తనిఖీలు చేయనున్నాం. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. ప్రజలు కూడా సమాచారం ఉంటే పోలీసులకు నేరుగా చెప్పవచ్చు. – రామకృష్ణారెడ్డి, కోదాడ రూరల్ సీఐ -
చెక్పోస్ట్పై ఏసీబీ దాడి
- రూ.22,170 నగదు స్వాధీనం - వరుస దాడులు చేస్తున్నా మారని సిబ్బంది తీరు పొందుగల (దాచేపల్లి) : మండలంలోని పొందుగల గ్రామ సమీపంలోని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్పై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. చెక్పోస్ట్లో అనధికారికంగా ఉన్న రూ.22,170 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ చంద్రవంశ దేవనాంద్ శాంతో, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ - ఆంధ్ర మధ్య రాకపోకలు సాగిస్తున్న లారీల నుంచి చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారని ఏసీబీ దృష్టికి వచ్చింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ దందా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన ఏసీబీ అధికారులు చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్న ఏసీటీవోలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ప్రశ్నించారు. కొన్ని గంటల పాటు చెక్పోస్ట్లో ఉండి లారీ డ్రైవర్ల నుంచి నగదును తీసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ చెక్పోస్ట్ వద్ద ఆగి ముద్ర వేయించుకున్నందుకు లారీ డ్రైవర్ల నుంచి రూ.100 చొప్పున లంచాలు వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అక్రమంగా లంచాలు తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు లంచాల కోసం డిమాండ్ చేస్తే 94913 05638 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. వరుస దాడులు చేస్తున్నా... పొందుగల చెక్పోస్ట్లో అక్రమ వసూళ్లు తారస్థాయికి చేరటంతో ఏసీబీ దృష్టికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రత్యేక దృష్టిసారించిన ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. అయినా వసూళ్లు ఆగకపోవడం గమనార్హం. ఈ చెక్పోస్ట్ మీదుగా గ్రానైట్, సిమెంట్, ఇనుము, స్టీల్, మిర్చి, ఫర్నిచర్, శనగలతో పాటు పలు రకాల వస్తువులను లారీల ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తుంటారు. రాష్ట్రం దాటి వచ్చేటప్పుడు తప్పనిసరిగా చెక్పోస్ట్లో ఆగి ముద్ర వేయించుకోవాలి. ఈ క్రమంలో లారీ డ్రైవర్ల నుంచి విధులు నిర్వహించే అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తున్నారు. గతంలో చేసిన దాడుల వివరాలివీ... - 2015 నవంబర్ 27న దాడిచేసి అనధికారికంగా ఉన్న రూ.68 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కేవలం రూ.7200 అని గుర్తించి విస్తుపోయారు. - 2016 జనవరిలో చెక్పోస్ట్లో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్ మందడపు మల్లిఖార్జునరావు, జూనియర్ అసిస్టెంట్ పగడాల శ్రీనివాసరావు గుంటూరులో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. - 2016 మార్చి 15న చెక్పోస్ట్పై మరోసారి దాడిచేసి అక్రమంగా ఉంచిన రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
కొడికొండ చెక్పోస్ట్లో ఏసీబీ దాడులు
చిలమత్తూరు: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సరిహద్దులోని కొడికొండ వాణిజ్యపన్నుల చెక్పోస్టులో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా లెక్క చూపని రూ11.150 లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.