breaking news
chabutra mission
-
తెల్లవారితే పరీక్ష.. పోలీసులకు దొరికారు
హైదరాబాద్: పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు బుధవారం వేకువజామున నగరంలోని పాతబస్తీలో పోలీసులు చబుత్రా మిషన్ ఆపరేషన్ను చేపట్టారు. శాలిబండ, ఫలక్నుమా, చంద్రాయణగుట్ట పరిధిలో చేపట్టిన ఈ ఆపరేషన్లో 60 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండలో 30 మంది, చంద్రాయణగుట్టలో 22 మంది, ఫలక్నుమాలో 8 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వేకువజామున ఒంటి గంట నుంచి 3 గంటల వరకూ ఈ తనిఖీలు నిర్వహించారు. యువతుల్ని వెంబడించడం.. దాడులు చేయడం.. మద్యం తాగి అల్లరి చేయడం, కొట్లాటలకు దిగడం వంటి సంఘటనలు జరుగుతుండటంతో.. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు బృందాలు పాతబస్తీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తెల్లవారితే పరీక్ష ఉన్నప్పటికీ.. కొందరు విద్యార్థులు బైకులపై తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులను వెంటనే విడిచిపెట్టారు. పనీపాట లేకుండా తిరిగే యువకుల బైకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే పరీక్ష అయ్యాక... పట్టుబడ్డ 60 మంది కుర్రాళ్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఫలక్ నుమా మొగల్ ఫంక్షన్ హాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇవాళ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. నగరంలోని తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు. నార్త్జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డగుట్టలో సరైన పత్రాలు లేని 4 ఆటోలు, 26 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అడ్డగుట్టలో డీసీపీ సుమతి కేక్ కట్ చేశారు. మహిళా దినోత్సవం స్థానిక మహిళలతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని డీసీపీ సుమతి చెప్పారు. -
221 మంది రోమియోలకు కౌన్సెలింగ్
-నలుగురు మైనర్ బైక్ రైడర్ల తల్లిదండ్రులపై ఎంవీఐ యాక్ట్ చాంద్రాయణగుట్ట రాత్రి పూట బస్తీలలో లేట్ నైట్ రోమియోల సంచారం పూర్తిగా తగ్గేంత వరకు ఆపరేషన్ చబుత్రా మిషన్ను కొనసాగిస్తామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. దక్షిణ మండలంలోని 17 పోలీస్స్టేషన్ల పరిధిలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలలో చబుత్రాలపై కూర్చొని బాతాఖానీలు చేస్తున్న 221 మంది అవారాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బైక్లు నడుపుతున్న నలుగురు మైనర్ బాలలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని ఫంజెషాలోని గుల్జార్ ఫంక్షన్హాల్కు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ రోమియోలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రాత్రి పూట రోడ్లపై తిరగడం ద్వారా కలుగుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు. ముఖ్యంగా 18-25 ఏళ్ల వయసు గల యువకులే చబుత్రాలపై తిష్ట వేస్తున్నారన్నారు. ఇటీవల ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఆయన ఉదహరించారు. రాత్రి పూట బస్తీలలో ఒంటరిగా వెళ్లే మహిళలు, యువతల పట్ల వెకిలి చేష్టలకు దిగుతుండడం, రోడ్లపై మద్యం సేవించడం, తాగిన మైకంలో వాహనాలు నడపడం వంటి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి క్రమంలోనే ఇటీవల పంజగుట్టలో జరిగిన ప్రమాదంలో రమ్య కుటుంబం బలయ్యిందన్నారు. ఇటీవల రంజాన్, బోనాలు ఉండడంతో ఈ మిషన్ను కొన్నాళ్లుగా నిలిపి వేశామన్నారు. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా పోలీస్స్టేషన్ల పరిధిలో రోమియోల సంచారం అధికంగా ఉందన్నారు. రోమియోలలో మార్పు వచ్చేంత వరకు ఈ డ్రై వ్ను కొనసాగిస్తామన్నారు. ఇకపై వారంలో ఒక రోజు తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. బైక్ రైడింగ్లకు పాల్పడిన మైనర్ బాలల తల్లిదండ్రులపై మోటార్ వెహికల్ యాక్ట్ (181 సెక్షన్) కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మరోసారి మైనర్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులు ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఇకపై రాత్రి పూట బస్తీలలో తిరగబోమని వారితో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, ఇన్స్పెక్టర్లు శ్యాం సుందర్, వై.ప్రకాష్ రెడ్డి, పి.యాదగిరి, లింగయ్య, శ్రీనివాసారావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.