breaking news
CERN
-
భారత విద్యార్థుల కోసం విశ్వ రహస్యాలు
న్యూఢిల్లీ: బిగ్బ్యాంగ్, హిగ్స్ బోసన్ వంటి విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు భారతీయ విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇందుకు లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నొయిడాకు చెందిన శివ్ నాడర్ స్కూల్... స్విట్జర్లాండ్– జెనివాలోని ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (సెర్న్) సంస్థతో కలసి పని చేస్తోంది. ‘హై ఎనర్జీ ఫిజిక్స్’లో చేసిన పరిశోధనలకుగాను అర్చనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘విశ్వ రహస్యాలు’అనే అంశంపై 2 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెర్న్ శాస్త్రవేత్త అర్చనాశర్మ మాట్లాడుతూ.. సీఈఆర్ఎన్లో భారత్ అసోసియేట్ మెంబర్ కావడం వల్ల ఇక్కడ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. సమావేశాల్లో మరో ప్రధానాంశం సీనియర్ శాస్త్రవేత్త, హిగ్స్ కన్వీనర్ డాక్టర్ అల్బెర్ట్ డీ రాక్తో విద్యార్థుల ఇంటరాక్టివ్ సేషన్. విశ్వం, ఫిజిక్స్ గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు సాయపడతాయని శివ్ నాడర్ స్కూల్లో 12వ గ్రేడ్ విద్యార్థి ఆర్యాన్ శంకర్మిశ్రా చెప్పారు. -
పాకిస్తాన్కు సెర్న్లో సభ్యత్వం
ఇస్లామాబాద్: భౌతికశాస్త్రంలో కీలక పరిశోధనలు చేస్తున్న యూరప్ అణు పరిశోధన సంస్థ(యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్-సెర్న్)లో పాకిస్తాన్ శుక్రవారం అసోసియేట్ సభ్యదేశంగా చేరింది. సెర్న్లో అసోసియేట్ సభ్యత్వ హోదా పొందిన మొదటి యూరపేతర దేశంగా పాక్ నిలిచింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో భాగస్వామ్యం, శాంతియుత ప్రయోజనాలకు అణు ఇంధన వినియోగం వంటి అంశాలకు గుర్తింపుగా పాక్కు ఈ హోదా లభించినట్లు సెర్న్ ప్రకటించింది. దైవకణం ఉనికిని కనుగొనేందుకు సెర్న్ చేపట్టిన లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రాజెక్టులో పాకిస్తాన్ కీలక తోడ్పాటునందించిందని ప్రశంసించింది. అంకితభావంతో పనిచేసిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకే ఈ ఘనత దక్కుతుందని పేర్కొంది. కాగా, అసోసియేట్ సభ్యత్వం కోసం సెర్న్తో పాక్కు గత డిసెంబరులో ఒప్పందం కుదిరింది. దీనిపై అంతర్గత ప్రక్రియను పూర్తిచేయడంతో అసోసియేట్ సభ్య దేశంగా హోదాను పొందింది. అసోసియేట్ సభ్యదేశంగా పాకిస్తాన్కు సెర్న్ పాలనావ్యవహారాల్లో భాగస్వామ్యం లభిస్తుంది. పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాల్లో మరిన్ని అవకాశాలు, ఎక్కువ మంది శాస్త్రవేత్తలు పాల్గొనేందుకు అవకాశం లభిస్తాయి. పాకిస్తాన్ కంపెనీలు కూడా సెర్న్ కాంట్రాక్టులు దక్కించుకోవచ్చు. అయితే, సెర్న్ పరిశోధనల్లో వంద మందికిపైగా శాస్త్రవేత్తలతో అత్యంత కీలక తోడ్పాటునందిస్తున్న భారత్ను వెనక్కినెట్టి మరీ పాకిస్తాన్ ఈ హోదాను సాధించడం గమనార్హం. హోదా పొందేందుకు అలసత్వంతో భారత్ సరైన ప్రక్రియను పూర్తి చేయకపోవడమే రేసులో వెనకపడటానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.