breaking news
CEO Vijay Shekhar Sharma
-
పేటీఎమ్లో విజయ్కు అదనపు వాటా
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మకు అదనపు వాటా లభించింది. చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ఫిన్ విజయ్కు పేటీఎమ్లోగల 10.3 శాతం వాటాను బదిలీ చేసింది. అయితే ఈ వాటాకు సంబంధించిన ఆరి్థక హక్కులు(ఎకనమిక్ రైట్స్) యాంట్ఫిన్వద్దనే కొనసాగనున్నాయి. కంపెనీ వాటాదారుల్లో ఒకటైన యాంట్ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం 6,53,35,101 షేర్లను బదిలీ చేసినట్లు పేటీఎమ్ పేర్కొంది. దీంతో పేటీఎమ్లో యాంట్ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.49 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో విజయ్ వాటా 19.55 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. వెరసి పేటీఎమ్లో విజయ్ అతిపెద్ద వాటాదారుగా నిలిచినట్లు పేర్కొంది. వాటా బదిలీకిగాను యాంట్ఫిన్.. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఓసీడీలు)ను పొందనుంది. ఈ డీల్లో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపోగా.. షేరుకి రూ. 795 ధరలో వాటా బదిలీ చేపట్టింది. -
రూపాయికీ బంగారం..?
-
రూపాయికీ బంగారం..?
⇔ పసిడిలో పెట్టుబడులకు ‘పేటీఎం’ కొత్త ప్రచారం ⇔ ఎంఎంటీసీతో కలిసి ’డిజిటల్ గోల్డ్’ ప్లాన్ ⇔ ఆన్లైన్లోనే క్రయ, విక్రయాలు ⇔ కావాలనుకుంటే 1 గ్రాము నుంచి నాణేల రూపంలో డెలివరీ న్యూఢిల్లీ: డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం... ఆన్లైన్ పసిడి క్రయ, విక్రయాల్లోకి కూడా ప్రవేశించింది. పసిడి రిఫైనరీ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)తో కలిసి ’డిజిటల్ గోల్డ్’ ప్లాన్ను ప్రారంభించింది. తమ పేటీఎం మొబైల్ వాలెట్ ద్వారా కస్టమర్లు అత్యంత తక్కువగా రూ.1 పెట్టుబడితో కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలున్న బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 999.9 స్వచ్ఛత గల 24 క్యారట్ల బంగారాన్ని ఆన్లైన్లో కొన్నవారు... ఎంఎంటీసీ– పీఏఎంపీకి చెందిన సురక్షితమైన వాల్టులలో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చని ఆయన వివరించారు. నిజానికి ఎంఎంటీసీకి డిజిటల్ రూపంలో (సర్టిఫికెట్ల రూపంలో) బంగారాన్ని డెలివరీ చేసే సదుపాయం లేదు. అది భౌతిక బంగారాన్నే డెలివరీ చేస్తుంది. మరి రూపాయికెంత బంగారం వస్తుంది? దీనికి విజయ్ శేఖర్ శర్మ సమాధానమిస్తూ... పెట్టుబడి విలువ కనీసం 1 గ్రాము దాకా పోగుపడిన తర్వాత కావాలనుకుంటే డెలివరీ తీసుకోవచ్చని చెప్పారు. అంటే పెట్టుబడి కనీసం రూ.3వేల దాకా ఉంటేనే బంగారాన్ని డెలివరీ తీసుకోగలుగుతారు. కొనుగోలు చేసిన బంగారాన్ని 1, 2, 5, 10 ,20 గ్రాముల నాణేల రూపంలో ఇంటి వద్దకే డెలివరీ తీసుకోవచ్చని లేదా ఆన్లైన్లోనే ఎంఎంటీసీ–పీఏఎంపీకి విక్రయించవచ్చని శర్మ చెప్పారు. కస్టమర్లు విక్రయించదల్చుకున్న పక్షంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. డబ్బును యూజర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ‘భారతీయులు పసిడిలో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. వారు డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియను మేం సులభతరం చేస్తున్నాం‘ అని శర్మ చెప్పారు. ప్రస్తుతం పేటీఎం ద్వారా రూ.20,000 పైబడిన లావాదేవీలు జరిపే వారంతా కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటోంది. గోల్డ్ స్కీమ్కు కూడా ఇది వర్తిస్తుంది. పసిడి వినియోగదారులు బంగారం స్వచ్ఛత, సురక్షితంగా నిల్వ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎంఎంటీసీ–పీఏఎంపీ చైర్మన్ మెహ్దీ బర్ఖుర్దార్ చెప్పారు. తాజా స్కీమ్తో ఉత్తమ నాణ్యత గల బంగారంలో అత్యంత తక్కువ స్థాయి నుంచి ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభించగలదన్నారు. అత్యధిక వినియోగం భారత్లోనే... ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో పసిడి వినియోగం ఉంటోంది. దేశీయంగా ఇళ్లల్లో, బ్యాంకు లాకర్లలో సుమారు 900 బిలియన్ డాలర్ల విలువ చేసే 24,000 టన్నుల పైచిలుకు బంగారం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో కాయిన్లు, ఆభరణాలు ఇతరత్రా భౌతిక రూపంలో బంగారం కొనుగోలు కన్నా డిజిటల్ / పేపర్ రూపంలో పసిడి కొనుగోళ్లు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కార్యకలాపాలపై రూ. 10,000 కోట్లు.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంపై వచ్చే మూడేళ్లలో రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లుగా రూ. 3,200 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. తమ పేమెంట్స్ బ్యాంక్కు త్వరలోనే తుది అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతేడాది దీపావళికే కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అనుమతుల్లో జాప్యం కారణంగా వాయిదాపడింది. 150 కోట్ల స్థాయిలో ఉన్న పేటీఎం లావాదేవీల పరిమాణాన్ని ఈ ఏడాది 450 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు శర్మ చెప్పారు. విజయవాడ, వైజాగ్, జైపూర్, సోనేపట్ వంటి నగరాల్లో తమ కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.