breaking news
celebrations clash
-
వేడుకలు లేకుండా బందీలను విడుదల చేయాలి
టెల్ అవీవ్: ఇకపై బందీల విడుదల సమయంలో ఎలాంటి వేడుకలు నిర్వహించబోమంటూ హామీ ఇస్తేనే వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లేకుంటే ఖైదీల విడుదల ఆలస్యమవుతుందని తెలిపింది. బందీల విడుదల సమయంలో చేపట్టే వేడుకలు అవమానకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు, ఒఫెర్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీలను తీసుకుని బయలుదేరిన వాహనాలు కొద్ది దూరమే వెళ్లి తిరిగి జైలుకు చేరుకున్నాయి. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. హమాస్ శనివారం ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం తెలిసిందే. బదులుగా ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న 620 మంది పాలస్తీనియన్లను విడుదల చేయాల్సి ఉంది. మాస్క్లు ధరించిన హమాస్ సాయుధులు బందీలను ప్రదర్శనగా వెంట తీసుకుని వేదికపైకి చేరుకోవడం, అక్కడ పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు గుమికూడటం వంటి వాటిపై ఐరాస, రెడ్క్రాస్లతోపాటు ఇతరులు కూడా అభ్యంతరం తెలిపారు. ‘ఇటువంటి వేడుకలు మా బందీల గౌరవాన్ని తక్కువ చేయడమే. సొంత ప్రచార ప్రయోజనం కోసం వారిని క్రూరంగా ఉపయోగించుకోవడమేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే, ఈ వ్యాఖ్యలను హమాస్ ఖండించింది. కాల్పుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ ప్రతినిధి అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ బెంజమిన్ నెతన్యాహూపై ఆయన మండిపడ్డారు. ఒప్పందం ప్రకారమే మొదటి దశ ఒప్పందం గడువు ముగిసేలోగా వచ్చే వారం నలుగురు బందీల మృతదేహాలను అందజేస్తామన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. మిగిలి ఉన్న బందీలను సజీవంగా లేదా నిర్జీవంగా తీసుకువచ్చే విషయమై ప్రధాని నెతన్యాహూ భద్రతా సలహాదారులతో చర్చించి, నిర్ణయించనున్నారని ఓ అధికారి తెలిపారు. -
వివాహ వేడుకల్లో ఘర్షణ
మలికిపురం, న్యూస్లైన్ : వివాహ వేడుకల్లో అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె బంధువుల ఆనందానికి అవధుల్లేవు. ఇంతలోనే స్వల్ప వివాదం ఘర్షణకు దారితీసింది. అది ఒకరి ఉసురు తీయగా, మరో మహిళను గాయాలపాల్జేసింది. మలికిపురం మండలం గూడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన వివాహ వేడుక ఈ విషాదానికి దారితీసింది. వేడు క నేపథ్యంలో తలెత్తిన ఘర్షణలో గ్రామానికి చెందిన కొల్లబత్తుల పెద్దిరాజు (45) అనే వ్యక్తి మరణించాడు. మామిడికుదు రు మండలం ఈదరాడ గ్రామానికి చెం దిన దాకే సుజాత అనే మహిళ తలకు గా యమైంది. సంఘటనకు సంబంధించిన స్థానికులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గూడపల్లి గ్రామానికి చెందిన గొల్లమందల పెద్దిరాజు కుమార్తె సునీతకు, మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన నంద నరేష్తో శుక్రవారం వివాహం జరిగింది. ఈదరాడలో పెళ్లి జరగ్గా, అనంతరం రాత్రి గూడపల్లి గ్రామంలో పెళ్లి కుమార్తె ఇంటి వద్ద విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈదరాడ గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడి బంధువులు వచ్చారు. ఈ సందర్భంగా సౌండ్ బా క్సుల మధ్య డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిం చారు. పెళ్లి కుమారుడి తరఫు వ్యక్తులు రాత్రి 10 గంటలైనా డ్యాన్సులు ఆపకపోవడంతో పెళ్లి కుమార్తె తరపు వ్యక్తులు దానిని నిలిపి వేయమని కోరారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది. గూడపల్లి గ్రామానికి చెందిన కొల్లాబత్తుల పెద్దిరాజును కొందరు కర్రలతో తలపై బలంగా మోదారు. తీవ్రంగా గాయపడిన పెద్దిరాజును స్థానికులు హుటాహుటిన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికి త్స కోసం పాలకొల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ఘర్షణలో ఈదరాడకు చెందిన దాకే సుజాత అనే మహిళ తలకు గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.సూర్యఅప్పారావు తెలిపారు. సంఘటన స్థలాన్ని శనివారం అమలాపురం డీఎస్పీ కె.రఘు, రాజోలు సీఐ బి.పెద్దిరాజు పరిశీలించారు. పెద్దిరాజు ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు. అతడి భార్య ఏసమ్మ కూడా గల్ఫ్లోనే పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దిరాజు మృతితో అతడి బంధువులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. పెద్దిరాజు మరణవార్త విని అతడి భార్య గల్ఫ్ నుంచి స్వదేశానికి బయలుదేరింది.