breaking news
cattle market
-
ఎద్దు ఖరీదు రూ.1.3 లక్షలు
న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఉర్సే షరీఫ్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా ఉత్సవాల్లో ఆదివారం భారీ పశువుల సంత నిర్వహించారు. ఝరాసంగం మండల పరిధిలోని ప్యాల వరం గ్రామానికి చెందిన రైతు తన ఎడ్ల జత ధర రూ.3 లక్షలని చెప్పగా.. అందులోని ఒక్క ఎద్దును మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన రైతు సంగమేశ్వర్ రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. మరో ఎడ్ల జత రూ.1.45 లక్షలు పలికింది. సదాశివపేట మండలం కొల్కూర్కు చెందిన శివకుమార్ అనే రైతు తన ఆవు ధర రూ.6 లక్షలుగా నిర్ణయించగా.. రూ.3 లక్షలకు ఇవ్వమని రైతులు కోరినా అంగీకరించలేదు. -
కరోనా తెచ్చిన మార్పు .. ఆన్లైన్లో ఆవులు, గేదెల ఫొటోలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారి వ్యాపారాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ పరిస్థితుల్లో కొందరు ఆధునిక సాంకేతికతను వినియోగించి గట్టెక్కుతున్నారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లకు రైతులు, వ్యాపారులు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పశువుల క్రయవిక్రయాలకు వారపు సంతలు జరిగేవి. ఈ సంతలకు ఎక్కువగా జెర్సీ, దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలు, దేశవాళీ గేదెలు, దుక్కి పశువులు, దున్నపోతులు, ఒంగోలు గిత్తలు తదితర రకాలకు చెందిన పశువులు వస్తుంటాయి. జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు పశువుల వ్యాపారం జరిగేది. కరోనా కారణంగా వారపు సంతలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యాపారులు ఆన్లైన్ ద్వారా పశువుల క్రయవిక్రయాలు చేపట్టారు. ఈ విధానం ఈ మధ్యే ప్రారంభం కాగా.. జిల్లాలో నెలకు రూ.3 కోట్ల విలువైన పశువుల అమ్మకాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని అలమండ, మానాపురం, పార్వతీపురం, అచ్యుతాపురం, బొద్దాం, సాలూరు, కూనేరు, కందివలసలో వారపు పశు సంతలు జరిగేవి. ఈ సంతల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి పశువులు కొనుగోలు చేసేవారు. సంతలు మూతపడటంతో ఈ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో సాగుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే అలమండ పశువుల సంత ఆన్లైన్లో ఇలా.. ఔత్సాహికులైన కొందరు పశువుల కొనుగోలుదారులు, అమ్మకందారులు, రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రైతుల వద్ద ఉన్న పశువులను వీడియో, ఫొటోలు తీసి వాటి ధర, ఇతర వివరాలను ఆ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తున్నారు. నచ్చిన వారు సంబంధిత రైతులు లేదా వ్యాపారులతో చాటింగ్ చేసి పశువుల్ని బేరమాడి కొంటున్నారు. కొందరైతే ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విక్రయిస్తున్నారు. దళారులు సైతం పశువుల్ని విక్రయించే రైతుల వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న పశువును వీడియో, ఫొటోలు తీసి ఆ పశువు వివరాలు, ధరను వ్యాపారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ఇలా పశువును కొనుగోలు చేసిన వ్యాపారులు లేదా వ్యక్తులు నగదును ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ యాప్ల ద్వారా చెల్లిస్తున్నారు. పశువుల్ని కొనుగోలు చేసిన వారికి ట్రక్కులు, ఇతర రవాణా వాహనాల్లో వాటిని పంపిస్తున్నారు. ఆన్లైన్లో అమ్ముతున్నాం కరోనా వల్ల పశువుల సంతలు జరగడం లేదు. చాలా రోజులపాటు పశువుల అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఫోన్ల ద్వారా పశువుల అమ్మకాలు చేస్తున్నాం. రైతుల వద్ద ఉన్న పశువుల వివరాలు, ఫొటోలు, వీడియోలు తీసి గుంటూరు, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన సంతల్లో పాత పరిచయాలు ఉన్న వారికి పంపిస్తున్నాం. వారు వీటిని చూసి నచ్చితే డబ్బులను ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లిస్తున్నారు. – కె.బలరాం, పశువుల వ్యాపారి కొట్టాల వద్దే అమ్మకాలు సంతలు జరక్కపోవడంతో కొట్టాల వద్దే పశువుల అమ్మకాలు చేస్తున్నాం. మాకు తెలిసిన మధ్యవర్తులు వచ్చి మా దగ్గర ఉన్న పశువును ఫోన్లో ఫొటో తీసి పంపిస్తారు. మాకు నచ్చిన ధర వస్తే అమ్ముతాం. కొనుగోలు చేసిన వారు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపి పశువుల్ని తీసుకువెళ్తున్నారు. – బి.సూర్యనారాయణ, రైతు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం ఆన్లైన్ ద్వారా పశువుల అమ్మకాలకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. కొంతమందికి దీనిపై అవగాహన లేదు. అవగాహన ఉన్న వాళ్లు మాత్రం ఆన్లైన్ ద్వారా పశువుల అమ్మకాలు జరిపిస్తున్నారు. – పిల్లల సత్యం, పశువుల వ్యాపారి -
పినరాయ్ విజయన్పైనే వారి ఆశలు
తిరువనంతపురం: కబేళాలకు తరలించేవారికి పశువులను విక్రయించరాదంటూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల ప్రభావం కేరళ మార్కెట్పై అప్పుడే కనిపించింది. కేంద్రం ఆంక్షలు ఇంకా అమల్లోకి రానప్పటికీ కేరళలోని మల్లప్పురం జిల్లా చెలేరి పశువుల సంత మంగళవారం బోసి పోయింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రతి వారం చెలేరి సంతకు 50 ట్రక్కులకుపైగా పశువులను తరలించుకు వచ్చేవారు వ్యాపారులు. పశువుల్లో బర్రెలు, ఎద్దులే ఎక్కువగా ఉండేవి. నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఓ ప్రైవేటు మైదానంలో జరిగే ఈ సంతకు ఎప్పుడూ ఎంతో డిమాండ్ ఉండేది. మొన్న 20 ట్రక్కులు ఖాళీగా సంత స్థలంలోనే ఉండిపోయాయి. ఈ వాహనాలు ఊరూరా తిరిగి విక్రయించే పశువులను సంతకు తీసుకొచ్చేవి. ప్రతి వారం ఈ సంతలో వెయ్యి పశువులకు డిమాండ్ ఉంటుందట. మొన్న 300 పశువులకు కూడా డిమాండ్ లేదు. పరిస్థితులను ముందే ఊహించిన రైతులు పశువులను సంతకు తరలించలేదు. 'నేను ప్రతివారం 50 పశువులను సంతకు తీసుకొచ్చి అమ్ముతాను. ఈ సారి 20 పశువులను కూడా అమ్మలేక పోయాను' వెంగరలో గొడ్ల శాలను కలిగిన బవుట్టి తెలిపారు. ఈ వ్యాపారాన్ని ఇంతటితో ఆపేయాల్సి వస్తుందా ? అని పశువుల వ్యాపారులు ఒకరినొకరు పలకరించుకోవడం కనిపించింది. ఉపాధి కోసం మరే వ్యాపారం చేయాలో అంతుచిక్కడం లేదని కొంత మంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం దెబ్బతినకుండా తమ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న విశ్వాసం ఎక్కువ మందిలో కనిపించింది. కేంద్రం విధించిన ఆంక్షలను అమలు చేయమని, సుప్రీం కోర్టు వరకు వెళతానని విజయన్ హెచ్చరించిన విషయం తెల్సిందే. నాలుగు టన్నుల బర్రె లక్ష రూపాయలకు, టన్ను బరువుండే బర్రెలు 20వేలకు, ఎద్దులు 20 వేల రూపాయల నుంచి 60 వేలకు ఈ సంతలో అమ్ముడు పోయేవి.