breaking news
cases withdrawal issue
-
కాంగ్రెస్కు మద్దతుపై పునరాలోచిస్తా
లక్నో: మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయవతి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోకుంటే మద్దతు విషయంలో పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. ‘2018 ఏప్రిల్ 2న చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా అమాయకులైన మా పార్టీ కార్యకర్తలపై అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే వెలుపలి నుంచి మద్దతు కొనసాగింపుపై పునరాలోచించాల్సి ఉంటుంది’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలు, ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన ఒకే మాదిరిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్కు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఏర్పడింది’ అని తెలిపారు. -
టీడీపీ సర్కారుకు నోటీసులు
- ‘కేసుల ఉపసంహరణ’ పై నోటీసులు జారీచేసిన హైకోర్టు - సంబంధిత జీవోలను కొట్టేయాలంటూ ఎమ్మెల్యే ఆర్కే దాఖలుచేసిన పిటిషన్పై విచారణ హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నమోదైన పలు కేసులను ఉపసంహరించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేసుల ఉపసంహరణ రాజ్యాంగ విరుద్ధమంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తోన్న కోర్టు.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నిర్ణీత గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు అంతా కలుపుకొని మొత్తం 251 మందిపై నమోదయిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం వివిధ తేదీల్లో 120 జీవోలను జారీచేసింది. వీరిపై నమోదైన కేసులకు సంబంధించి పలు కోర్టుల్లో సాగుతున్న ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవాలని ఆయా కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, వాటిలో అత్యాచారాలు, హత్యాయత్నాలు వంటి తీవ్రమైన కేసులు కూడా ఉండటంతో ఆ జీవోలపై వివాదం రాజుకుంది. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆక్షేపించారు. సంబంధిత జీవోలను కొట్టివేయాలని కోరుతూ జులై 30న ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. పిల్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్లో.. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పలు జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు సిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, టీవీ రామారావు, గొల్లపల్లి సూర్యారావు, దాట్ల సుబ్బరాజు, దాసరి బాలవర్ధన రావు, చింతమనేని ప్రభాకర్, ఎ.ఆనందరావు, ఎం.అశోక్రెడ్డి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, రెడ్డి సుబ్రహ్మణ్యంలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలను కలిపి మొత్తం 251 మందిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.