breaking news
Cardless Cash Withdrawal
-
ఎకానమీకి ‘యుద్ధం’ సెగ!
ముంబై: భారత్ ఎకానమీపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. ఇక పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనా పెరగడం కొంత ఆందోళనకరమైన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ వృద్ధికి ఊతం ఇవ్వడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని సమీక్షా సమావేశం నిర్ణయించింది. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. వృద్ధికి–ఎకానమీ సమతౌల్యతకు అనుగుణమైన (అకామిడేటివ్) పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని సమీక్షా సమావేశం పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు పరిశీలిస్తే... ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మార్జినల్ స్టాడింగ్ ఫెసిలిటీ రేటును (ఎంఎస్ఎఫ్) కూడా యథాపూర్వ 4.25 శాతం వద్ద కొనసాగనుంది. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బును అందించి వసూలు చేసే వడ్డీరేటు ఇది. స్వల్పకాలిక (ఓవర్నైట్) నిధుల అవసరాలకు బ్యాంకింగ్ ఈ విండోను వినియోగించుకుంటుంది. ► లిక్విడిటీ సమస్యల నివారణకు బ్యాంక్ రేటు కూడా యథాతథంగా 4.25%గా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెపో రేటు అనేది బాం డ్ల కొనుగోలు ప్రక్రియ ద్వారా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. అయితే బ్యాంక్ రేటు అనేది వాణిజ్య బ్యాం కులు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఆర్బీఐ నుండి రుణం పొంది, అందుకు చెల్లించే వడ్డీరేటు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనావేసింది. ఈ ప్రాతిపదికన వృద్ధి అంచనాలను కుదించింది. ► గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ రికవరీకి రబీ ఉత్పత్తి దోహదపడుతుంది. ► కాంటాక్ట్–ఇంటెన్సివ్ సేవలు పుంజుకునే అవ కాశాలు కనిపిస్తున్నాయి. హోటల్లు, రెస్టారెంట్లు, టూరిజం–ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్/హెరిటేజ్ సౌకర్యాలు, విమానయాన అనుబంధ సేవలు ఈ విభాగం కిందకు వస్తాయి. ► ప్రభుత్వ పెట్టుబడుల ప్రణాళిక, బ్యాంకింగ్ రుణ వృద్ధి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డంతో దేశంలో పెట్టుబడుల క్రియాశీలత పుంజుకుంటుంది. ► ఆర్బీఐ నియంత్రణలోని ఫైనాన్షియల్ మార్కెట్ల ప్రారంభ సమయం ఏప్రిల్ 18 నుండి ఉదయం 9. ఈ మేరకు మహమ్మారి ముందస్తు సమయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ► హేతుబద్ధీకరించబడిన గృహ రుణ నిబంధన లు 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు. ► వాతావరణానికి సంబంధించి సమస్యలు, నివారణకు తగిన నిధుల కల్పనపై త్వరలో ఒక చర్చా పత్రం విడుదల ► ఆర్బీఐ నియంత్రిత సంస్థల్లో వినియోగదారుల సేవల ప్రమాణాల సమీక్ష కోసం కమిటీ. ఇక కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయెల్స్... యూపీఐ వినియోగం ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌలభ్యతను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్వర్క్లకు విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మోసాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ, ఏటీఎంల ద్వారా కార్డ్–లెస్ నగదు ఉపసంహరణకు దేశంలోని కొన్ని బ్యాంకులకు అనుమతి ఉంది. అదనపు లిక్విడిటీకి ‘ఎస్డీఎఫ్’ మందు వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉపసంహరణ ప్రక్రియకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో క్రమంగా మహమ్మారి ముందస్తు సాధారణ స్థాయిలకు ద్రవ్యతను తీసుకువెళ్లాలన్న లక్ష్య సాధనకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) ఇన్స్ట్రమెంట్ను ప్రవేశపెట్టింది. తద్వారా లిక్విడిటీ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్)ను ప్రస్తుత 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ రేటు 3.75 శాతంగా ఉంటుంది. గృహ విక్రయాలకు ఊతం గృహ విక్రయాలు పెరగడానికి పాలసీ దోహదపడుతుంది. కోవి డ్–19 అనంతరం కీలక సమస్యల్లో ఉన్న పలు రంగాల పురోగతికి, ఆర్థికాభివృద్ధికి విధాన నిర్ణయాలు బలం చేకూర్చుతాయి. అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకునేందుకు చర్యలతోపాటు వ్యవస్థలో ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తీసుకున్న చర్యలు హర్షణీయం. – హర్ష వర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ ఆచరణాత్మక విధానం ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో ఆచరణాత్మక విధాన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సరిగ్గా మదింపు చేసింది. వృద్ధికి విఘాతం కలగని రీతిలో లిక్విడిటీ సర్దుబాటు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రుణ సమీకరణ విధానానికి మద్దతుగా పలు చర్యలు ఉన్నాయి. దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధికి దోహదపడే విధానమిది. –దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ చదవండి: చదవండి: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు లైన్ క్లియర్, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు! -
డెబిట్కార్డు లేకుండా డబ్బులను ఇలా విత్ డ్రా చేయండి..!
సాధారణంగా ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సిందే. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు సురక్షితంగా డెబిట్ కార్డు లేకుండానే ఎటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చును. తన ఖాతాదారులకు కార్డ్లెస్ క్యాష్ను అన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి 24/7 సేవలను అందిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్వీటర్లో పేర్కొంది. ఏటీఎమ్లో కార్డ్లెస్ క్యాష్ను ఇలా విత్ డ్రా చేయండి..! మీకు దగ్గరలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎమ్ దగ్గరకు వెళ్లండి. మీకు ఏటీఎమ్ మిషన్పై చూపిస్తోన్న కార్డ్లెస్ క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. మీ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ పంపినట్లు మెసేజ్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. మీకు తొమ్మిది అంకెల ఆర్డర్ ఐడీ వస్తుంది. తరువాత ట్రాన్సక్షన్ అమౌంట్ను ఎంటర్చేయాలి. వివరాలను ధృవీకరించిన తర్వాత ఏటీఎమ్ నుంచి నగదు చెల్లించబడుతుంది. Forgot your ATM Card? Don’t worry, HDFC Bank Cardless Cash is #DigitallyYours with 24X7 service to withdraw cash at all HDFC Bank ATMs. Enjoy instant and secure mode of cash withdrawals without ATM / Debit Card. To know more, visit: https://t.co/foq6Uq144f pic.twitter.com/xIJK6YI7do — HDFC Bank (@HDFC_Bank) July 29, 2021 -
కస్టమర్లకు ఊరట : ఎస్బీఐ కొత్త ఫీచర్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ ఫీచర్. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్ఫామ్ యోనోపై ‘యోనో క్యాష్’ను లాంచ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా16,500కు పైగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలలో డెబిట్ కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. ప్రధానంగా కార్డు ద్వారా నగదు ఉపసంహరణ, వినియోగంలో చోటుచేసుకుంటున్నమోసాలకు చెక్ చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్ తమదేనని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం కలిగిన ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరిస్తారు. కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం ద్వారా స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్బీఐ భావిస్తోంది. యోనో యాప్లో యోనో క్యాష్ ద్వారా కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ సాధ్యమవుతుంది. 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యోనో యాప్పై ఎస్బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. నగదు తీసుకునే విధానం యాప్లో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ నెంబర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. సమీపంలోని యోనో క్యాష్ పాయింట్కు వెళ్లాలి ఎస్ఎంఎస్లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. యాప్లో ఎంటర్ చేసిన అమౌంట్ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. తరువాత యాప్లో క్రియేట్ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ వినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చడమే తమ లక్ష్యమని ఎస్బీఐ ఛైర్మన్ రజినీష్ కుమార్ చెప్పారు. Say YO to YONO Cash! Go cardless with #YONOSBI and withdraw cash safely and securely, dono. For cardless ATM transactions look for the YONO Cash sign. Download: https://t.co/yjDSsj2O4L#SBI #StateBankofIndia #YONOSBI #YONOCash #EasyBanking #Convenience #Withdrawals #ATM pic.twitter.com/2ELLY0T2NF — State Bank of India (@TheOfficialSBI) March 16, 2019 -
అకౌంట్ లేకపోయినా నగదు బదిలీ
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ స్కీమ్ను బుధవారం ప్రారంభించింది. ఈ స్కీమ్లో అవతలి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సొమ్ములను పంపించవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వ్యక్తి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇతర వ్యక్తులకు డబ్బులు పంపించవచ్చు. డబ్బులు స్వీకరించే వ్యక్తికి ఏ బ్యాంక్లోనూ ఖాతా ఉండవలసిన అవసరం లేదు. మొబైల్ నంబర్, అడ్రస్ ఉంటే చాలు. డబ్బులు స్వీకరించే వ్యక్తి మొబైల్ నంబర్కు ఆరు అంకెల రహస్య కోడ్ను పంపిస్తారు. ఈ నంబర్తో సదరు వ్యక్తి ఏ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. డబ్బులు పంపించిన రెండు రోజుల్లోగా వాటిని విత్డ్రా చేసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ చెల్లింపులు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి వినూత్నమైన సర్వీస్ను అందిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ పేర్కొన్నారు. ఈ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ కారణంగా తమ ఖాతాదారుల కుటుంబ సభ్యులు, మిత్రులు సులభంగా డబ్బులను పొందవచ్చని వివరించారు.