breaking news
Calling Bell
-
ప్లాంట్ మాన్ ప్రయోగం
‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హారర్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్ మాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్ స్థాపించి కె. సంతోష్బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు . పన్నా రాయల్. ‘‘సైంటిఫిక్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్. ఇక ప్రస్తుతం పన్నా రాయల్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్లాంట్ మాన్ పొస్టర్ -
రెండో బెల్కు రంగం సిద్ధం!
వ్రితి ఖన్నా, రవి వర్మ ముఖ్యతారలుగా గతేడాది రూపొందిన ‘కాలింగ్ బెల్’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ప్రీక్వెల్ను తెరకెక్కించిన పన్నా రాయల్ ఈ సీక్వెల్కు దర్శకుడు. అశోక్రాజ్, రాజ్ దలవాయి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ ‘కాలింగ్బెల్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన పన్నా రాయల్ ఈ సీక్వెల్ను హై టెక్నికల్ స్టాండర్డ్స్తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘దర్శకునిగా ‘కాలింగ్బెల్’ మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే, కొంత టైమ్ తీసుకుని సీక్వెల్ కోసం పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను’’ అని పన్నా రాయల్ తెలిపారు. -
థ్రిల్ చేస్తా!
‘‘నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నా మొదటి సినిమాకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా’’ అని చెప్పారు ‘కాలింగ్ బెల్’ దర్శకుడు పన్నా రాయల్. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితీ ఖన్నా ముఖ్య తారలుగా గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై అనూద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ -‘‘వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న నేను ఓ పెద్ద సినిమా తీద్దామని వచ్చా. కానీ ముందు ఓ చిన్న సినిమా తీయమని స్నేహితులు సలహా ఇచ్చారు. అందుకే ‘కాలింగ్ బెల్’ సినిమా తీశా. చిన్న సినిమా అయినా బాగా ఆదరిస్తున్నారు. ఇక నుంచి అడ్వెంచరస్, సస్పెన్స్ నేపథ్యంలో సినిమాలు తీసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తా’’ అన్నారు. -
ఆ సినిమాలు చూసి... కథక్ నేర్చుకున్నా!
రాఖీ, జల్సా, రెడీ, బొమ్మరిల్లు, నువ్వే, క్లాస్మేట్స్, నేనొక్కడినే చిత్రాలతో నటునిగా మంచి పేరు తెచ్చుకున్న రవివర్మ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని రవివర్మ అన్నారు. మరిన్ని విషయాలు పంచుకుంటూ, ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందు లోనూ కమల్హాసన్, చిరంజీవి అంటే ఇంకా ఇష్టం. కమల్ హాసన్ ‘సాగరసంగమం’, చిరంజీవి ‘అభిలాష’ చిత్రాలు చూసి స్కూల్లో ఉన్నప్పుడే కథక్ నేర్చుకున్నా. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశా. ఇప్పటిదాకా 26 చిత్రాలలో నటించా. ప్రస్తుతం మహేశ్బాబు ‘శ్రీమంతుడు’, నాగచైతన్య ‘దోచేయ్’ , నారా రోహిత్ ‘అసుర’, పీవీపీ బ్యానర్లో ‘క్షణం’, శ్రీకాంత్ ‘హోప్’ చిత్రాలలో నటిస్తున్నా. వీటిలో చేస్తున్నన్నీ విభిన్న తరహా పాత్రలే’’ అన్నారు. ‘‘పాత్ర బాగుంటే ప్రతినాయకుడిగా చేయడానికీ రెడీ’’ అని రవివర్మ తెలిపారు. -
పాటల బెల్ మోగింది...
హారర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, మమతా రహుత్ ముఖ్య తారలుగా షేక్ అన్వర్ బాషా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకుడు. సుకుమార్ స్వరాలు అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి. కల్యాణ్ బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుందంటే సినిమా బాగుంటుందేమో అనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని, ఇది ఒక మాస్ హారర్ అని పన్నా రాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్, మనోజ్ నందం, సునీల్కుమార్ రెడ్డి, మాదాల రవి, రవివర్మ, మమత తదితరులు పాల్గొన్నారు. -
హారర్ బెల్
వైవిధ్యమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని పన్నా రాయల్ దర్శకత్వంలో అనూద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 13న పాటలను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్.పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: షాని సోలోమన్. -
ఆ ద్రోహాన్ని క్షమించలేను!
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. ఆ సమయంలో ఎవరొచ్చారో అర్థం కాలేదు. వంట పనికి బ్రేక్ ఇచ్చి, చేతిలో ఉన్న గిన్నెని గట్టుమీద పెట్టి పరుగుదీశాను. తలుపు తీసి.. ఎదురుగా ఉన్న మావారిని చూసి ఆశ్చర్యపోయాను. ‘శ్రీధర్... నువ్వా?’ అన్నాను విస్మయంగా చూస్తూ. శ్రీధర్ మాట్లాడలేదు. విసురుగా లోనికి వచ్చాడు. ల్యాప్టాప్ని సోఫాలోకి గిరాటేసి, విసవిసా బెడ్ రూమ్లోకి వెళ్లిపోయాడు. తన ప్రవర్తన వింతగా అనిపించింది. టైమ్ గాని టైములో ఆఫీసు నుంచి వచ్చేశాడు. పైగా అదోలా ఉన్నాడు. ఏం జరిగివుంటుందో అనుకుంటూ లోనికి వెళ్లాను. పక్కన కూర్చుని, ‘అలా ఉన్నావేంటి శ్రీ? ఏదైనా సమస్యా?’’ అన్నాను అనునయంగా. అంతే... అంతెత్తున లేచాడు. ‘ఆపుతావా నీ ప్రశ్నలు? అసలే చిరాగ్గా ఉంది. ఇంకా నా బుర్ర తినకు’... నా మనసు చివుక్కుమంది. కళ్లలో నీళ్లూరాయి. ‘నిన్ను విసిగించాలని కాదు శ్రీ. నువ్వలా ఉంటే చూడలేక అడిగాను. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే’ అంటూ లేచాను. దుఃఖపూరితమైన నా స్వరం విని శ్రీధర్ కాస్త తగ్గాడు. ‘ఏం జరిగిందో తెలియాలి అంతే కదా’ అంటూ గబగబా సెల్ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ‘ఇదిగో చూడు’ అంటూ ఫోన్ని నా చేతిలో పెట్టాడు. ఏముందోనని ఆతృతగా చూసిన నేను అదిరిపడ్డాను. ‘ఏంటిది శ్రీ?’ అన్నాను విస్తుపోతూ. ‘నా కొలీగ్ ఒకతను రాత్రి వాటిని చూశాడట. ఇవాళ నా దగ్గరకు వచ్చి మరీ చూపించాడు. నా తల కొట్టేసినట్టయ్యింది. అందరూ ఆఫీసులో దీని గురించే డిస్కషన్. సిగ్గేసి ఇంటికొచ్చేశాను. ఈపాటికి అందరూ వాటిని చూసేసి ఉంటారు. నేను బయటికెలా వెళ్లాలి, అందరినీ ఎలా ఫేస్ చేయాలి? ఛ...’ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సిగ్గుతో మనసు చితికిపోతోంది. అవమానంతో గుండె రగిలి పోతోంది. ఎవరు చేశారీ పని? ఎందుకు చేశారు? నేనేం చేశానని? ఆలోచనలు మెదడును రంపపు కోత కోస్తుంటే... అక్కడ నిలబడలేక వంటింట్లోకి వెళ్లి పోయాను. దుఃఖం పొంగుకొస్తోంది. ఫేస్బుక్లో నా గురించి రాసిన పిచ్చి రాతలు, మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు కళ్లముందే కదులుతున్నాయి. నేను మంచిదాన్ని కాదని, పెళ్లికి ముందే గర్భం దాల్చి అబార్షన్ చేయించుకున్నానని, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కూడా నా భర్త కాదని... భగవంతుడా, ఏ ఆడపిల్లా భరించలేని నిందలవి! ఎవరో పన్నిన ఉచ్చులో నా కాపురం చిక్కు కుంది. ఉన్నట్టుండి నా జీవితం పూర్తిగా మారి పోయింది. నా ముఖం చూడ్డానికి కూడా శ్రీధర్ ఇష ్టపడట్లేదు. నాతో మాట్లాడట్లేదు. ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. తలుపులు మూసుకుని గదిలోనే ఉంటు న్నాడు. తనలో తనే కుమిలిపోతున్నాడు. చేయని తప్పుకు మా జీవితాలు బలైపోతున్నాయి. ఎవరో పెట్టిన చిచ్చుకి నా కలలు కాలి బూడిదవుతున్నాయి. దీనికి ఫుల్స్టాప్ పెట్టి తీరాలి. అనుకున్నదే తడవుగా కంప్యూ టర్ ముందు కూర్చున్నాను. జరిగినదంతా వివరిస్తూ హైదరాబాద్ క్రైమ్బ్రాంచ్ డీసీపీకి మెయిల్ పెట్టాను. వారం తర్వాత, డీసీపీ గారి నుంచి ఫోన్. ‘ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేస్తున్నవారెవరో తెలిసింది సుధా... మీరు ఓసారి ఇండియా వస్తే మంచిది.’... డీసీపీ అలా అనగానే శ్రీధర్ని తీసుకుని ఆఘమేఘాల మీద యూకే నుండి ఇండియా బయలుదేరాను. నా బతుకును నరకప్రాయం చేసిన వ్యక్తిని చూడాలని ఆతృతగా హైదరాబాద్ డీసీపీ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి షాకైపోయాను. ‘రజితా... నువ్వా?’ అన్నాను నమ్మలేనట్టుగా. రజిత మాట్లాడలేదు. డీసీపీ సమాధానమిచ్చారు. ‘ఇదంతా చేసింది తనే మిసెస్ సుధా. ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేస్తోన్న కంప్యూటర్ ఐపీ అడ్రస్ను ట్రేస్ చేశాం. పోస్టింగ్స్ మైసూర్లో జరుగుతున్నట్టు తేలింది. ఒకసారి నేను మీ ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు, మీ బెస్ట్ ఫ్రెండ్ రజిత బెంగళూరులో పని చేస్తోందని చెప్పారు కదా. తనకి మైసూర్ వెళ్లే చాన్సెస్ ఎక్కువ ఉండటంతో, తన ఫొటో తీసుకెళ్లి కేఫ్ యజమానికి చూపించాం. గుర్తు పట్టాడు. తను ఆ కేఫ్కి వెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజులు చెప్తున్నాయి. తను వెళ్లిన తేదీలు, వేళలు... ఫేస్బుక్లో పోస్టింగ్స జరిగిన తేదీలు, వేళలతో సరిపోయాయి. దాంతో తనని అరెస్ట్ చేశాం.’... ఆయనలా చెప్తుంటే నా బుర్ర తిరిగిపోయింది. రజిత దగ్గరకు వెళ్లాను. తన చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను. ‘పక్కపక్క ఇళ్లవాళ్లం. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగాం. కలిసే చదువుకున్నాం. స్నేహితులమే అయినా అక్కాచెల్లెళ్లంత అనురాగంతో మెలిగాం. నువ్వు ఇలా చేశావంటే నమ్మలేకపోతున్నాను. చెప్పు రజితా... నామీద నీకెందుకంత కసి? నేనేం చేశాను?’ నా చేతుల్ని విదిలించికొట్టి, చివ్వున లేచింది రజిత. ‘ప్రాణంగా ప్రేమించిన శ్రీధర్ని తన్నుకు పోయావ్. నా మనసును ముక్కలు చేశావ్. ఇంతకంటే ఏం చేయాలి?’... అదిరిపడ్డాను. ‘శ్రీధర్ని తన్నుకుపోయానా? తను నీ ప్రాణమా? ఏమంటున్నావే?’ అన్నాను అయోమయంగా. ‘శ్రీధర్ని నేను పిచ్చిగా ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పాలనుకునేలోపు నువ్వు తనని వలలో వేసుకున్నావ్. నీవాణ్ని చేసేసుకున్నావ్. అందుకే నిన్ను తన నుంచి దూరం చేయాలనుకున్నాను. ఫేస్బుక్లో నీ గురించి చేతికొచ్చినట్టు రాసి పారేశాను. మార్ఫ్ చేసిన ఫొటోలను అప్లోడ్ చేశాను. శ్రీధర్ నిన్ను వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలి. అదే నాకు కావాలి’... పిచ్చిదానిలా అరుస్తోన్న రజిత వైపు కొయ్యబొమ్మలా చూస్తూండి పోయాను. నా కళ్లు అప్రయత్నంగానే వర్షించడం మొదలుపెట్టాయి. శ్రీధర్ మీద రజిత ఆశలు పెంచుకున్న విషయం నాకు తెలియదు. ముగ్గురం కాలేజీలో ఫ్రెండ్స్. శ్రీధర్ నాకు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను. ఇవన్నీ రజిత స్వయంగా చూసింది. మా పెళ్లిలో దగ్గరుండి తనే అన్నీ చేసింది. అలాంటిది ఈ రోజు ఇలా... ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దాన్ని ఏం అనడానికీ నోరు రాలేదు. ‘అది స్నేహితురాలికి ద్రోహం చేయగలదేమో, తన బెస్ట్ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయగలదేమో. కానీ నేనలా చేయలేను. కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. తెలియక చేసిన తప్పు అనుకుని మీరు కూడా తనని వదిలేయండి’ అని డీసీపీతో చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత చాన్నాళ్లపాటు నా మనసు రజిత చుట్టూనే తిరిగింది. శిక్ష పడనీయకుండా కేసు విత్డ్రా చేసేకున్నాను కానీ... స్వార్థంతో, అసూయతో తను మా స్నేహానికి తల పెట్టిన ద్రోహాన్ని మాత్రం క్షమించలేకపోయాను. బహుశా నా స్థానంలో ఎవరున్నా క్షమించగలిగే వారు కాదేమో! - సుధ (గోప్యత కోసం పేర్లు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఫేస్బుక్ అనేది బంధాలను కలుపుకోవడానికి రూపొందింది. కానీ దానివల్ల బాంధవ్యాలు చెడిపోవడం చాలాసార్లు జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ ఉదంతమే. స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేయడానికి ఫేస్బుక్ను వాడుకుందా అమ్మాయి. పోస్టింగ్స చేసిన ఐపీ అడ్రస్ ద్వారా తనని పట్టుకున్నాం. అయితే బాధితురాలు కేసు విత్డ్రా చేసుకోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశాం. మనం ఎవరో అవతలి వారికి తెలియదు కదా అని ఫేస్బుక్ ద్వారా పలువురు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే నేను ఫేస్బుక్ని ఫేస్లెస్ బుక్ అంటుం టాను. ఫేస్బుక్ విషయంలో అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పాస్వర్డ్ ఎవరికీ చెప్పకూడదు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు అందరికీ షేర్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అసభ్యకరమైన రాతలు రాస్తున్నా, ఫొటోలు అప్లోడ్ చేస్తున్నా, ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు విషయం చెప్పడం మంచిది. జి.పాలరాజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్