breaking news
bus tracking
-
TSRTC Gamyam App: ఇక టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్
హైదరాబాద్: సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో ముందుడుగు వేసింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అందుకు అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను శనివారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రారంభించారు. యాప్ సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ టీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారికి కూడా సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తనకుందన్నారు. రెండేళ్లుగా ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని, ప్రతి రోజు 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న సంస్థ మార్కెట్ లోని పోటీని దీటుగా ఎదుర్కోనేందుకు ఈ మధ్యకాలంలో అత్యాధునిక హంగులతో కూడిన 776 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆపై యాప్ ప్రయోజనాలను వివరిస్తూ అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. “ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించబడింది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నాం. ‘గమ్యం’ యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్ లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తెలిపారు. మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఏ బస్’ ఫీచర్ మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న టీఎస్ఆర్టీసీ.. వారి సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేయడం జరిగింది. ఈ సదుపాయంతో యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. యాప్ను డౌన్లోడ్ చేసుకోండిలా.. 'TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గమ్యం యాప్ ను ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్ స్టాల్ చేసుకుంటే అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆదరించి, ప్రోత్సహించారు. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్ ను అలానే ఆదరించాలని సంస్థ కోరుతోంది. ఈ యాప్ పై ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. గమ్యం యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఇ.డి (హైదరాబాద్ జోన్) శ్రీ ఎ.పురుషోత్తం, ఇ.డి (ఎ) కె.కృష్ణకాంత్, ఇ.డి (గ్రేటర్ హైదరాబాద్) వి.వెంకటేశ్వర్లు, జెడి (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా (ఎం.ఎం.ఐ) హర్మన్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ శ్రీమతి విజయ పుష్ప, సి.ఇ (ఐటీ) శ్రీ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీధర్, తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఒక్క క్లిక్తో ఈజీగా బస్సు జాడ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయలుదేరి వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్ ఫోన్లో తెలుసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’యాప్ను వినియోగంలోకి తెచ్చింది. ప్రయాణికులు గూగుల్ ప్లే స్లోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని బస్సు జాడ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతోపాటు బస్ ట్రాకింగ్ లింక్ను కూడా అధికారులు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తున్నారు. ఆ లింక్పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్ యాప్ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. ‘‘ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్ చేసుకునే 1,800 బస్సు సర్వీస్లకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. సంక్రాంతి సందర్భంగా రిజర్వేషన్ సౌకర్యం ఉన్న 600 ప్రత్యేక బస్సులకు కూడా ట్రాకింగ్ సౌకర్యాన్ని అనుసంధానం చేశాం. త్వరలో హైదరాబాద్లోని మెట్రో ఎక్స్ప్రెస్లుసహా మిగిలిన సర్వీస్లకు ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తాం. ఒక్క క్లిక్తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు’’అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. ►గూగుల్ ప్లేస్టోర్ నుంచి, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్లో ప్రయాణికులు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ►హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా సర్వీస్లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా పొందుపర్చారు. ►ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతమున్న లొకేషన్ను తెలుసుకోవచ్చు. ►ప్రయాణికులు సమీపంలోని బస్టాప్, సర్వీస్, బస్సు నంబర్లను ఎంటర్ చేసి వివరాలను పొందవచ్చు. ►అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్ చేసే సదుపాయాన్ని ఈ యాప్లో కల్పించారు. ►బస్సు బ్రేక్డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. -
TSRTC: అరచేతిలో ఆర్టీసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లలో ‘టీఎస్ఆర్టీసీ బస్ట్రాకింగ్’ యాప్ ద్వారా బస్సుల కచ్చితమైన జాడను తెలియజేసే ట్రాకింగ్ సేవలను మంగళవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్టణం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 డిపోల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 4170 బస్సులను ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు ఎదురు చూసే బస్టాపునకు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలిసిపోతుంది. ప్రయాణికులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘టీఎస్ఆర్టీసీ బస్ట్రాకింగ్’ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులలో ట్రాకింగ్ సేవలను ప్రవేశపెట్టారు. అలాగే శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాక్ సేవలను ప్రవేశపెట్టారు. త్వరలో నగరంలోని అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్లో అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సేవలు సైతం... ఈ మొబైల్ యాప్లో బస్సుల ప్రస్తుత లొకేషన్, సమీప బస్ స్టాప్ను వీక్షించడంతో పాటు మహిళా హెల్ప్లైన్ సేవలను కూడా అందజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు ఈ హెల్ప్లైన్ సహాయం కోరవచ్చునని ఎండీ పేర్కొన్నారు. కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపైన కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. (చదవండి: కేసీఆర్ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు ) -
ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులకు జీపీఆర్ఎస్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1537 బస్సులలో విటి అండ్ పీఐఎస్ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు నగరాల బస్సులకు జీపీఆర్ఎస్ పరికరాలను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 6.78 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.