breaking news
burhanpur
-
తాజ్మహల్ను మైమరిపించే ఇల్లు.. ఆ మాటలకు ఫిదా కావాల్సిందే!
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థల ఓనర్ కమ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇక్కడో పెద్దాయన అట్లాంటి డైలాగులేవీ పేల్చడం లేదు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ను మోడల్గా తీసుకుని ఏకంగా ఇంటినే నిర్మించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించకపోవచ్చు. కానీ, ఆయన చెప్పిన విధానం మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటోంది.మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో తాజ్ మహల్ను తలపించేలా నాలుగు బెడ్రూమ్లో ఓ భవనం ఉంది. స్థానికంగా విద్యా సంస్థను నడిపించే ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ నివాసం అది. 2021లో ఈయనగారు ఈ ఇంటితో నేషన మీడియా దృష్టిని ఆకర్షించారు. నాలుగు బెడ్రూమ్లు, ఓ కిచెన్, ఓ మీడియేషన్ రూం.. ఇందులో ఉంటాయి. ఆ ఇంటిని ఆనుకునే ఆ హైటెక్ గురుకుల్ కూడా ఉంది. తాజ్మహల్ పరిమాణంలో మూడింట ఒకటో వంతు ఉందట ఆ ఇల్లు. ఓ వ్లోగర్ ఆ జంటను పరిచయం చేసుకుని ఆ ఇంటిని పరిశీలించడం ఆ వీడియోలో ఉంది.👉మా తాజ్ మహల్.. నాలుగు బెడ్రూమ్ల ఇల్లు. అసలైన తాజ్ మహల్ ప్రేమకు సమాధి. ఇదేమో నా భార్యకు ప్రేమతో కట్టించిన ఇల్లు.. అంతే తేడా👉చిన్నతనంలో ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాడిని. గర్వం తలకెక్కించుకోకు అని గుర్తు చేయడానికి గృహ ప్రవేశం సమయంలో ఈ ఇంటి మధ్యలో ఇలా గేదె బొమ్మను ఉంచాను. ఇది ఎప్పుడూ నా మూలాలను గుర్తు చేస్తుంటుంది👉నా భార్య మెడిసిన్ వదిలేయాల్సి వచ్చింది. నేను ఇంజినీరింగ్ చేయలేకపోయాను. అందుకే పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అలా దేశంలోనే మోస్ట్ హైటెక్ గురుకుల్ను నడిపిస్తున్నాం. 2200 మంది పిల్లలు. వాళ్లే మా కుటుంబం.👉దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్కటే.. ప్రేమ. అన్నట్లు ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ విద్యావేత్త మాత్రమే కాదు, తరచూ దాతృత్వ కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. మోటివేషనల్ స్పీకర్గానూ ఆయన వీడియోలు కొన్ని అక్కడ వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) -
పాక్ కోసం సంబరాలు: అడ్డంగా బుక్కయ్యారు!
భోపాల్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించడంతో కొందరు అత్యుత్సాహంతో దాయాది పట్ల ప్రేమతో సంబరాలు జరిపి.. అడ్డంగా బుక్కయ్యారు. ఫైనల్లో పాక్ విజయంతో పటాకులు కాల్చి.. పాక్ అనుకూల నినాదాలు చేసి కలకలం రేపిన 15మందిని మధ్యప్రదేశ్లో పోలీసులు అరెస్టు చేశారు. గత ఆదివారం రాత్రి పాక్ విజయం సాధించిన వెంటనే బుర్హాన్పూర్లో పలువురు వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో 15మందిని అరెస్టు చేశామని, సెక్షన్ 120బీ, 124ఏ కింద వారిని అదుపులోకి తీసుకున్నామని షాపూర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సంజయ్ పాఠక్ తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా విపరీత చర్యలకు పాల్పడే వారిని సెక్షన్ 124ఏ కింద అరెస్టు చేసే అధికారం ఉందని ఆయన తెలిపారు. -
ట్రక్కు-హార్వెస్టర్ ఢీ: నలుగురి మృతి
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హార్వెస్టర్ను ట్రక్కు ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నింబోల పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్సర్గర్ గ్రామ సమీపంలో ఇండోర్-ఇచ్చాపూర్ హైవేపై చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరిని వారి డాక్యుమెంట్ల ఆధారంగా ఇండోర్కు చెందిన జగదీశ్ అహిర్వార్, విడిషాకు చెందిన ధీరజ్ బల్ముకుంద్లుగా గుర్తించామని, మరో ఇద్దరి గురించి ఎలాంటి వివరాలు తేలియలేదని బుర్హాన్పూర్ ఎస్పీ పరిహార్ మీడియాకు తెలియజేశారు -
తపతి... కురు మాత!
ఓ వింధ్య కొండమ్మ... ఓ సాత్పూర కోనమ్మ... రెండు వేల అడుగుల ఎత్తులో అలవోకగా జాలువార్చిన కొన్ని నీటి చుక్కలే నా ప్రయాణానికి తొలి అడుగులు. భారతమాత హృదయం నుంచి ఉద్భవించాను. నేను పుట్టిన ప్రదేశాన్ని ముల్తాయ్, మూల్తాపి అనీ పిలుస్తారు. నన్ను మాత్రం తపతి, తపి, తప్తి, తాపి... రకరకాలుగా పిలుస్తారు. నేను ఎంతటి వేసవి తాపాన్నయినా ఇట్టే తీరుస్తాను. నా తండ్రి సూర్యభగవానుడు. నేను చంద్రవంశ రాజు శన్వరుణ్ణి వివాహమాడాను. నాకు, శన్వరుడికి పుట్టిన బిడ్డకు ‘కురు’ అని పేరు పెట్టుకున్నాను. కురువంశానికి ఆద్యుడు నా కొడుకు కురుడే. మహాభారతాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన రాజవంశం అది. దాయాదుల పోరుతో నిర్వంశం అయిన వంశం కూడా. అయినా పాండురాజు కుమారులు తాము వేరంటూ తమ తండ్రి పేరుతో కొనసాగారు కానీ, కౌరవులు, పాండవులు అందరూ నా తనయుడు కురుని పౌత్రులే. ఇంత గొప్ప రాజవంశానికి మూల మాతను కావడంతోనే హిందువులు నన్ను అంతగా ఆరాధిస్తారు. థాయ్ల్యాండ్ వాసులు కూడా ఓ నదికి నా పేరు పెట్టుకున్నారు. గంగా స్నానం, నర్మద దర్శనం వలన కలిగే పుణ్యం నన్ను స్మరించుకుంటేనే వస్తుందని నాకు మహోన్నతమైన స్థానాన్నిచ్చాయి మన పురాణాలు. పశ్చిమంగా సాగే ప్రయాణం! భరతమాత గుండెను స్పృశిస్తూ మొదలైన నేను పశ్చిమ ముఖంగా సాగిపోతుంటాను. భారతమ్మ ఒడి నుంచి ఎన్నో నదులు తూర్పు ముఖంగా సాగిపోతుంటాయి. గవిల్ఘర్ కొండల్లో పుట్టిన నేను నర్మదక్కయ్యతోపాటుగా పడమటి తీరాన్నే నా గమ్యం అనుకున్నాను. మా ఇద్దర్నీ చూసిన ‘మాహి’ కూడా మా మార్గాన్నే పట్టింది. నర్మదతోపాటుగా సాగుతున్న నా ప్రస్థానాన్ని సాత్పూర పర్వతాలు వేరు చేస్తుంటాయి. మధ్యప్రదేశానికి దక్షిణ ఆగ్నేయంగా నేను పుట్టిన ప్రదేశం దక్కన్కు ముఖద్వారం వంటిది. నా ప్రయాణం ఏడు వందల కిలోమీటర్లే. అయితే నలభైకి పైగా ఉపనదులు నాతో జతకట్టి నన్ను పరిపుష్టం చేస్తూ ఉంటాయి. దాంతో భారతదేశం భూభాగంలో రెండు శాతం మేర నేలను నా ప్రవాహమే ఆక్రమించుకుంటోంది. అబ్బో! నాకెన్ని ఉపనదులో!! మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ముల్తాయ్లో పుట్టిన నాకు అదే జిల్లాలో మచ్నా, సంపనా నదులు తోడవుతాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ పలుకరిస్తూ గుజరాత్ రాష్ట్రంలో సూరత్కి చేరేటప్పటికి ‘నేసు’ కలిసి అరేబియా సముద్రం ఇక ఎంతో దూరం లేదని చెబుతుంది. ఇక్కడ నేల నన్ను సునాయాసంగా సాగరంలో కలవనివ్వదు. ఎత్తుపల్లాలుగా ఉండి నా ప్రయాణాన్ని వెక్కిరిస్తుంటుంది. సాగర ఘోష వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పడెప్పుడు చేరుకుందామా అనే ఉబలాటంతో పాయలుగా చీలి పలుచబడుతూ పల్లానికి జారిపోతూంటాను. నా కోసం వెతికే వారి దాహార్తిని తీర్చడానికి అక్కడక్కడా చెలమలుగా నిలిచి పోతాను. ఏది ఏమైనా నీటిని వినియోగించుకోవడం పాశ్చాత్యులకు తెలిసినంతగా భారతీయులకు తెలియదు. నా పాయల మధ్యలో ఆంగ్లో - పోర్చుగీసు కాలనీలు వచ్చిన తర్వాతనే నాకూ ఆ సంగతి తెలిసింది. దక్షిణాదికి దారి... బుర్హాన్పూర్లో పురాతన కాలంలో పాళీ భాషలో రాసిన బౌద్ధ శాసనాలను చూశాను. బుర్హాన్పూర్ పట్టణానికి 20 కిమీల దూరంలో ఆసిర్గఢ్ కోట కోసం పునాదులు తీయడాన్ని చూశాను. హూణుల దాడులను, ఆశా ఆహిర్ పాలనను చూశాను. గుజరాత్ను ఆక్రమించుకున్న తర్వాత హుమాయూన్ ఆసిర్గఢ్ కోటను సందర్శించడం నా కళ్ల ముందే జరిగింది. దక్షిణాదికి ముఖద్వారం ఇదేనంటూ దక్కను మీద దృష్టి పెట్టడం వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలకు, వ్యూహాలకు ప్రత్యక్ష సాక్షిని. మరికొంత ముందుకెళ్తే కేదారేశ్వర్లో పురాతన శివాలయం, జల్గావ్లో ఛంగ్దేవ్లో ఛంగ్దేవ్ మహారాజ్ ఆలయాలను చూస్తుంటే నాటి గిరిజన సంస్కృతి, అడవి తల్లిని ఆశ్రయించిన వారి జీవనశైలి కళ్ల ముందు మెదులుతుంటాయి. గోండులు, కోర్కులు, కుర్మీలు, బోయలు, మెహరులు, కుంబిలు, చామరులు, బాణుల వంటి అడవిపుత్రులతోపాటు రాజపుత్రులు కూడా నా తీరాన్నే సంతోషంగా జీవించేవారు. మధ్యప్రదేశ్ దాటి మహారాష్ట్రలోకి అడుగుపెడుతుంటే అమరావతి జిల్లాలో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ పలకరిస్తుంది. మూడో నంబరు జాతీయ రహదారికి అడ్డుగా ప్రయాణిస్తున్నానని నా మీద ‘ధులే’ దగ్గర ‘సావాల్దే’ వంతెన కట్టారు. అలాగే భుస్వాల్ దగ్గర ‘భుస్వాల్ - ఖాండ్వా’ రైల్వే వంతెన కూడా కట్టేశారు. ‘హమ్మయ్య! ఇక నేనెవరి ప్రయాణానికీ అడ్డుగా లేను’ అనుకునే లోపు హత్నూర్ డ్యామ్, ఉకై డ్యామ్లు... నాకు దాహార్తిని తీర్చి, పంటలను సస్యశ్యామలం చేయడంతోపాటు జలవిద్యుత్తుతో వెలుగునిచ్చే శక్తి కూడా ఉందని చెప్పాయి. సూరత్లో అడుగుపెడితే పరిశ్రమలే పరిశ్రమలు. ఎస్సార్ స్టీల్, రిలయెన్స్, ఓఎన్జిసి, ఎల్ అండ్ టి, గెయిల్, క్రిభ్కో, షెల్, ఎన్టిపిసి, జిఎస్పిసి, టొరంట్ పవర్ యూనిట్లు... ప్రపంచం అంతా నా కళ్ల ముందే ఉందన్నంత భరోసానిస్తుంటాయి. వజ్రాలు, దుస్తుల దుకాణాలైతే 60 వేలు... ఇంతటి భాగ్యాన్ని చూసి నా కళ్లు మిరుమిట్లు గొలుపుతాయో ఏమో వర్షాకాలంలో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఆరు లక్షల క్యూసెక్కుల నీటితో నగరాన్ని ముంచెత్తుతుంటాను. నా అల్లరిని అదుపు చేయడానికి వరదల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు మొదలవుతున్నాయి. నా పేరుతో ఓ రైలు నడుస్తోంది తెలుసా? ఆ రైలు ప్రయాణం నిడివి 1726 కి.మీ.లు. నాకంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తోంది. నేను మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్రను పలకరించి గుజరాత్ వరకు ప్రయాణిస్తుంటే నా పేరుతో నడిచే రైలు బీహార్లోని సూరాన్ జిల్లాలో మొదలై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా గుజరాత్ వరకు ప్రయాణిస్తుంది. నాలాగే ఆ రైలు ప్రయాణం కూడా సూరత్ వరకే. అదిగో... మాటల్లోనే గల్ఫ్ ఆఫ్ కాంబాత్ వచ్చింది. సముద్రపు ఆటుపోట్లకు డాల్ఫిన్లు ఎదురొస్తున్నాయి. అలలు ఆత్మీయంగా వచ్చి పాదాలు తాకుతున్నాయి. అరబిక్ కడలి తీరం ఎంత అందంగా ఉంటుందో వర్ణించడానికి మాటలు చాలవు. నేను ఇంతగా పరుగులు తీసింది ఈ సౌందర్యాన్ని చూడడానికే. ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి జన్మస్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రం, బేతుల్ జిల్లాలోని ముల్తాని. సాత్పూర పర్వత శ్రేణులు సంగమస్థానం గుజరాత్ రాష్ట్రం, సూరత్ జిల్లా, గల్ఫ్ ఆఫ్ కాంబాత్ (దుమాస్) ప్రవాహదూరం 724 కి.మీ.లు