breaking news
BRAHMANAGUDEM
-
గొంతుకోసి చంపేశారు
చాగల్లు: చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో వృద్ధురాలిని దారుణంగా హతమార్చి బంగారు ఆభరణాలు దోచుకుపోవడంతో పాటు మృతదేహాన్ని మూటగట్టి స్టోర్ రూమ్లో ఉంచిన ఘటన సంచలనం కలిగించింది. గ్రామ నడిబొడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నూతలపాటి నాగరత్నం (68) అనే వృద్ధురాలిని దుండగులు దారుణంగా గొంతుకోసి హతమార్చడంతో పాటు ఆమె వంటిపై ఉన్న సుమారు 15 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన భగవతుల కృష్ణమూర్తి భార్య ఐదు నెలల క్రితం చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. కొంతకాలం క్రితం కృష్ణమూర్తి అక్క తాడేపల్లిగూడేనికి చెందిన నూతలపాటి నాగరత్నం అతడికి ఆసరాగా ఇక్కడకు వచ్చారు. కృష్ణమూర్తి ఇంటి ఆవరణలోని డాబాలో నాగరత్నం, పక్కనే ఉన్న పెంకుటింట్లో కృష్ణమూర్తి ఉంటున్నారు. మంగళవారం ఉదయం కృష్ణమూర్తి నిద్రలేచి నాగరత్నం ఉంటున్న గది వైపునకు వెళ్లి చూడగా ఆమె కనిపించలేదు. గదిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంది. దీంతో అక్క కోసం ఆయన బంధువుల సాయంతో గాలించారు. అయినా ఆమె కనిపించలేదు. సాయంత్రం ఆయన చాగల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఇంటికి వచ్చిన ఆయన ఆవరణలోని స్టోర్ రూమ్ తలుపుతీసి చూడగా పెద్ద మూట కనిపించింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాగల్లు ఏఎస్సై ఎం.ధనరాజు సిబ్బందితో వచ్చి మూటను విప్పి చూడగా నాగరత్నం మృతదేహం ఉంది. ఆమె గొంతు కోసిన గాయాలు కనిపించాయి. ఆమె వంటిపై ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు లేవని కృష్ణమూర్తి, నాగరత్నం కుమార్తె నిరుపమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, ఎస్సైలు ఎం.జయబాబు, భగవాన్ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే హత్య! దుండగులు ముందస్తు పథకం ప్రకారమే నాగరత్నాన్ని హతమార్చినట్టు హత్య జరిగిన తీరును బట్టి తెలుస్తుంది. సోమవారం రాత్రి నాగరత్నం నిద్రపోయిన గది నుంచి ఇంటి ఆవరణలోని స్టోర్ రూమ్ వరకూ ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా దుండగులు జాగ్రత్త పడ్డారు. ఆమె ఉపయోగిస్తున్న రెండు దుప్పట్లలోనే మృతదేహాన్ని మూటగట్టి స్టోర్ రూమ్కు తరలించారు. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ కారు ఎవరిదో !
బ్రాహ్మణగూడెంలో వారం రోజులుగా వదిలేసిన మారుతి కారు బ్రాహ్మణగూడెం(చాగల్లు): నిడదవోలు-పంగిడి రహదారిలోని బ్రాహ్మణగూడెం గ్రామం శివారులో ఒక కారు వారం రోజులుగా రోడ్డు పక్కనే నిలిపివేసి ఉండడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ 31 క్యూ 1155 నంబర్ కలిగిన ఈ మారుతి 800 కారును ఎవరో డోర్స్ లాక్చేసి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. కారు యజమాని గాని, సంబంధీకులు గానీ రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ విశాఖ జిల్లాకి చెందినది కావడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఎవరు ఎందుకు ఈ కారును వదిలేశారు? యజమాని క్షేమమేనా? ఏదైనా నేరఘటనకు దీనికీ సంబంధం ఉందా? ఇలా పలు విధాల చర్చించుకుంటున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఈ కారు మిస్టరీని ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ రోడ్
-
పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ రోడ్షో
బ్రాహ్మణగూడెం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'వైఎస్సార్ జనభేరి' పేరిట తలపెట్టిన ఎన్నికల శంఖారావం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆయన బ్రాహ్మణగూడెంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న తనయుడిని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. వారందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. కొవ్వూరులో రోడ్షో అనంతరం వైఎస్ జగన్ రాజమండ్రి చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి క్వారీ సెంటర్లో జనభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చాగల్లు, న్యూస్లైన్ : మండలంలోని బ్రాహ్మణగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన పూటికుక్కల కోట సత్యనారాయణ (24), అతని స్నేహితుడు పేకేటి భగవాన్లు నిడదవోలు నుంచి సైకిల్పై వస్తుండగా బ్రాహ్మణగూడెం పద్మా వైన్ షాపు సమీపంలో చాగల్లు నుంచి పంచదార లోడుతో వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో సైకిల్పై నుంచి పడిన కోట సత్యనారాయణ తలపై లారీ చక్రం ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భగవాన్ గాయపడ్డాడు. చాగల్లు ఎస్సై ఎం.ఆనందరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు సత్యనారాయణకు భార్య దుర్గ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, టీడీపీ నాయకులు గారపాటి కాశీవిశ్వనాథం పరిశీలించారు. సత్యనారాయణ వలస పనులకు వెళ్లి భార్యకు డెలివరీ కావడంతో వారం క్రితమే వచ్చాడని, లారీ మృత్యురూపంలో కభళించిందని తండ్రి పోలినాయుడు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. రోడ్డుపై గోతులే ప్రమాదానికి కారణమని ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కోలాటి కాంతారావు కోరారు.