boxing association
-
పంచ్ కొడితే..పతకాలే..
బాక్సింగ్.. ఈ పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి! బాక్సర్లు విసిరే పవర్ పంచ్లు కళ్లముందు కదలాడతాయి. అలాంటి ఎందరో బాక్సర్లను తయారు చేస్తోంది హైదరాబాద్లోని గోల్కొండ బాక్సింగ్ అసోసియేషన్. గత ఐదు దశాబ్దాలుగా ఎందరో జాతీయ స్థాయి బాక్సర్లను తయారు చేసింది. తొమ్మిది సార్లు సర్వీసెస్ ఛాంపియన్, ఐదు సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన దివంగత ఘణీచాంద్ గోల్కొండ బాక్సింగ్ క్లబ్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ క్లబ్ను ఏజాజ్ అహ్మద్ నిర్వహిస్తున్నాడు. ఈయన సమక్షంలో పలువురు చిన్నారు, ఔత్సాహికులు బాక్సింగ్ నేర్చుకుంటూ వివిధ వయసుల్లోని గ్రూప్లలో పాల్గొని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో బాక్సింగ్ క్రీడకు రాను రాను క్రేజ్ పెరుగుతోంది. కాగా బాక్సింగ్లో స్వయంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చాపియన్గా నిలిచిన ఏజాజ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఆయన వద్ద ఎనిమిది సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలలోపు బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. అత్యుత్తమ స్థాయి బాక్సింగ్ పరికరాలతో ఇప్పటి వరకూ ఏజాజ్ పలువురు రాష్ట్రస్థాయి ఛాంపియన్లను తీర్చిదిద్దారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అండర్–19, అండర్–15, అండర్–12 విభాగాల బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటారు. కఠోర శ్రమతో పాటు, మంచి శారీరక ధృడత్వం బాక్సింగ్కు కోటలు లాంటివి. నియంత్రిత ఆహారం, క్రమశిక్షణతో మెలిగేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యర్థి కదలికలు గమనిస్తూ.. ప్రత్యర్థి వేసే పంచ్లు ఏవైపు నుంచి వస్తాయో గమనించి మరుక్షణమే పిడుగులాంటి పంచ్తో కూల్చగలిగిన వారే బాక్సింగ్లో ముందుకు సాగుతారు. కాగా శిక్షణ సమయంలో బాక్సింగ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. తూత్ సేవర్, హెల్మట్తోపాటు అనుమతించిన డ్రెస్ కోడ్, నిబంధనలకు లోబడి వాడే గ్లౌజ్ తప్పనిసరి. ఎందరో ఛాంపియన్లు.. వరుసగా తొమ్మిదేళ్లు సర్వీసెస్ చాంపియన్ బాక్సింగ్గా నిలిచిన ఘణీచాంద్ను ఇక్కడి బాక్సర్లు తమ ఐడియల్గా భావిస్తారు. బలమైన పంచ్లు విసరడం, కనుసన్నలతోనే ప్రత్యర్థి కదలికలను గమనించడం వంటటి అంశాలపై శిక్షణ అనంతరం జరిగే కౌన్సిలింగ్ కార్యక్రమంలో బాక్సర్లకు వివరిస్తారు. అంతేకాక వయసు కేటగిరిలో బరువు ఎంత ఉండాలి అనే విషయంపై కూడా నిరి్థష్ట అవగాహన కల్పిస్తారు. వర్థమాన బాక్సర్ నిఖత్జరీన్ను అమ్మాయిలు తమ ఐడియల్గా భావిస్తున్నారని కోచ్ ఏజాజ్ అంటున్నారు. బాలికలను మరింత ప్రోత్సహించేందుకు నిఖత్జరీన్తో పాటు రాష్ట్రస్థాయి మహిళా బాక్సర్లను తమ బాక్సింగ్ క్లబ్కు రప్పించామని చెబుతున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన నేహా, రమ్య, రుబీనా, అహ్మదీ తదితరులు అండర్–15 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్రస్థాయి బాక్సర్లుగా ఎదిగారని తెలిపారు. అండర్–19 విభాగంలో గత నెల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో షేక్ అబ్దుల్ రెహమాన్ రన్నరప్గా నిలిచారు. జూనియర్ విభాగంలో పలువురు క్రీడాకారులు గోల్కొండ బాక్సింగ్ క్లబ్ నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. -
Paris Olympics: పర్వీన్ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం
Parveen Hooda suspended- భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కోల్పోయింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ వల్లే ఆమె పారిస్ విశ్వక్రీడలకు దూరం కానుంది.‘వాడా’ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పరీ్వన్ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వివరణ ఇచ్చింది.దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. శుక్రవారంతో మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇక పర్వీన్పై నిషేధం నేపథ్యంలో ఇప్పుడు 57 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. ఈ క్రమంలో.. పర్వీన్ స్థానంలో జాస్మిన్ లాంబోరియాను బీఎఫ్ఐ.. వరల్డ్ క్వాలిఫయర్-2 బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్లో మహిళల, పురుషుల విభాగాలలో ఏడు చొప్పున ఒలింపిక్ వెయిట్ కేటగిరీలు ఉండగా... భారత్ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్ జరీన్–50 కేజీలు; ప్రీతి–54 కేజీలు; లవ్లీనా బొర్గొహైన్–75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. పర్వీన్పై నిషేధం కారణంగా... ఈనెల 23 నుంచి జూన్ 3 వరకు బ్యాంకాక్లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ మహిళల విభాగంలో మూడు వెయిట్ కేటగిరీల్లో (57, 60, 66 కేజీలు), పురుషుల విభాగంలో ఏడు వెయిట్ కేటగిరీల్లో పోటీపడుతుంది. -
బతుకమ్మ కవిత.. బాక్సింగ్ నేత!!
తెలంగాణ జాగృతి.. బతుకమ్మ పండుగలు.. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పోరాటం.. ఇన్ని రకాల పాత్రలలో ఒదిగిపోయిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరో సరికొత్త పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్కు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా సంఘాలలో జరిగిన మార్పులలో ఇదే మొదటిది. తెలంగాణ ఉద్యమానికి స్థానిక సంస్కృతిని జోడించడంలో కవిత ఒకరకంగా విజయం సాధించారనే చెప్పుకోవచ్చు. అంతకుముందు కూడా బతుకమ్మ పండుగను ఎవరికి వారుగా తెలంగాణ ప్రాంతంలో చేసుకునే అలవాటు ఉన్నా, ఉద్యమంలో భాగంగా ఆ పండుగకు కూడా ఒక సామూహిక ఉనికిని తీసుకొచ్చి, బహిరంగ ప్రదేశాలలో బతుకమ్మలు ఆడటం, పూర్ణకుంభ స్వాగతాలకు బదులు బతుకమ్మలతో స్వాగతం పలకడం లాంటి వాటిని ప్రవేశపెట్టి, 'తెలంగాణ సంస్కృతి'ని కవిత బాగా ప్రమోట్ చేశారు. ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి మంచి ఊపునిచ్చింది. అలాంటి కవిత.. ఇప్పుడు తెలంగాణ బాక్సింగ్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఎంపీగా లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, శుక్రవారం జరిగిన బాక్సింగ్ సంఘ ఎన్నికలలో విజయం సాధించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం ధనుంజయ్ గౌడ్ వ్యవహరిస్తారు. దీంతో బతుకమ్మ పండుగ నుంచి బాక్సింగ్ రింగ్ వరకు కవిత ప్రస్థానం సాగినట్లయింది.