breaking news
birendra singh
-
రాయితీలపై బండరాయి!
‘కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాయితీలు ఇచ్చే ప్రశ్నే లేదు. స్టీలు ప్లాంటు కోసం రాయితీలు కేంద్రానికి ఎందుకివ్వాలి? – మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి లోకేష్ ‘బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే సగం ఖర్చు భరిస్తాం. అక్కడ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ప్రైవేట్ సంస్థలకే అనేక రాయితీలిస్తున్నాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటే అవసరమైనవన్నీ సమకూరుస్తాం’ – ప్రధానితో భేటీ అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్ చూశారుగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను రప్పించేందుకు పొరుగు రాష్ట్రం ఎంత సన్నద్ధంగా ఉందో! ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు తీసే అవకాశాన్ని ఎవరు మాత్రం కాలదన్నుకుంటారు?.. ఒక్క టీడీపీ సర్కారు మినహా! తాజాగా స్టీల్ ప్లాంట్ నెలకొల్పే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు రాయితీలు కల్పించబోమంటూ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం పట్ల పారిశ్రామికవర్గాల్లో, ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీకి రావాల్సిన కేంద్ర సంస్థలను పట్టించుకోకుండా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామంటూ దావోస్ తదితర చోట్లకు విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై అధికార టీడీపీ అసలు బండారం బయటపడింది. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకుని కూడా ఉక్కు కర్మాగారాన్ని సాధించకుండా ఇప్పుడు నిరాహార దీక్షల పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకాలు కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో తేటతెల్లమయ్యాయి. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్థంగా ఉందని, కానీ ఈ ప్రాజెక్టుకు ఇచ్చే రాయితీల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడమే జాప్యానికి అసలు కారణమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ బుధవారం ఢిల్లీలో తనను కలసిన టీడీపీ ఎంపీలకు స్పష్టం చేయడం గమనార్హం. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చే రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చకపోవడమే కడప ఉక్కు కర్మాగారంపై ఆలస్యానికి కారణమని తేలిపోతోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళవారం చేసిన ప్రకటన కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. కడప ఉక్కు యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వదని, మొత్తం ఖర్చంతా కేంద్రమే భరించాల్సి ఉంటుందని లోకేష్ ప్రకటించారు. దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం భరించడానికి ముందుకు రావడం గమనార్హం. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా 15,000 మంది గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించే బయ్యారం ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చులో అవసరమైతే సగం భరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విలేకరులకు వెల్లడించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా... 2009లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా బీహెచ్ఈఎల్– ఎన్టీపీసీ యూనిట్ను రాష్ట్రంలో నెలకొల్పేందుకు భారీగా రాయితీలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్ ఏర్పాటుకు ఎకరం రూ.100 నామమాత్రపు ధరతో 750 ఎకరాలతో పాటు అనేక రాయితీలను వైఎస్ కల్పించారు. నాడు ప్రధాని మన్మోహన్సింగ్తో శంకుస్థాపన చేయించడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వేరే రాష్ట్రానికి తరలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనుకబడిన రాయలసీమ ప్రజల జీవితాన్ని మార్చే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. కనీసం యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఎక్కడ కేటాయిస్తుంది? కరెంట్, నీటి సరఫరా లాంటి కీలక అంశాలను కూడా వెల్లడించకుంటే ఫీజిబిలిటీ నివేదిక ఎలా ఇస్తామని మెకాన్ సంస్థ ప్రశ్నిస్తోంది. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్ధమైనా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు రంగ సంస్థలు పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. కానీ ప్రాజెక్టులు ఏర్పాటు కావడానికి అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇదే విషయాన్ని చమురు రంగ సంస్థల ప్రతినిధులు అనేకసార్లు స్పష్టం చేశారు. ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్ వంటి సంస్థలు ఏకంగా రాష్ట్రంలో రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. వైజాగ్–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు అయితే సుమారు రూ.3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఒక్క హెచ్పీసీఎల్ రూ.55,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. హెచ్పీసీఎల్, గెయిల్తో కలిసి కాకినాడలో మరో రూ.40,000 కోట్లతో క్రాకర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైవేట్కు పెద్దపీట.. పూర్తిగా వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేసే ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండటం గమనార్హం. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్కు ఉచితంగా భూములు కేటాయించడమే కాకుండా పలు రాయితీలను ప్రకటించింది. రాజధానిలోని మల్లవరం వద్ద అశోక్ లేలాండ్కు, ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు ఎంవీవీఎస్ మూర్తి కుటుంబానికి చెందిన వీబీసీ పెట్రో కెమికల్స్కు జగ్గయ్యపేటలో, నాచు కార్పొరేషన్కు కర్నూలు జిల్లాలో ప్రభుత్వం భూములు కేటాయించింది. విశాఖ నడిబొడ్డున దుబాయ్కి చెందిన లూలూ గ్రూపు వాణిజ్య భవన సముదాయం నిర్మాణానికి తక్కువ ధరకు భూములు కేటాయించడమే కాకుండా రూ.వేల కోట్లలో ప్రయోజనం కల్పించింది. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తే కమీషన్లు దండుకోవచ్చని, అదే కేంద్ర సంస్థలకు రాయితీలు ఇస్తే కమీషన్లు ఉండవనే ఉద్దేశంతోనే వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్కు కారుచౌకగా భూములు రాజధాని అమరావతిలో కూడా కేంద్ర సంస్థలకు భూములను రూ.కోట్ల ధరకు కేటాయిస్తూ ప్రైవేట్ సంస్థలకు మాత్రం చౌకగా రూ.లక్షల ధరకు అప్పగించడాన్ని తప్పుపడుతున్నారు. ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, ఎల్ఐసీ వంటి సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.4 కోట్ల ధరతో కేటాయిస్తే ఆర్బీఐ, నేవీ సంస్థలకు ఎకరం కోటి రూపాయలకు కేటాయించారు. మరోవైపు ప్రైవేట్ విద్య, వైద్య సంస్థలకు ఎకరం స్థలాన్ని రూ.10 లక్షలకే ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయితీలపై స్పష్టత ఇవ్వాల్సింది ఏపీనే సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన రాయితీల విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు కొణకళ్ల నారాయణ, మాగంటి బాబు, దివాకర్రెడ్డి, రవీంద్రబాబు, మాల్యాద్రి శ్రీరామ్, మురళీమోహన్ తదితరులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి, ముడిసరుకు సరఫరా (లింకేజ్)పై కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఈ వివరాలు ఇవ్వగానే మెకాన్ సంస్థ అధ్యయనం అనంతరం ప్లాంట్ ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని వెల్లడించగలుగుతామని స్పష్టం చేశారు. గడువు చెప్పమంటే ఎలా! కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు మధ్యలో కలుగజేసుకొని అసలు ఎప్పట్లోగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారో నిర్దిష్ట గడువును చెప్పాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ అసలు రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకుండానే ప్లాంట్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువు చెప్పమంటే ఎలా! అంటూ అసహనం వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పార్టీ ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
సహకరిస్తే పరిశీలిస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో్ల స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలను సాయమడిగామని.. వారు ఏ మేరకు సహకరిస్తారో పరిశీలించి వెంటనే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ చెప్పారు. బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, పార్టీ నేత వెదిరె శ్రీరాం తదితరులతో కూడిన బృందం సోమవారం మంత్రిని కలసి ఈ అంశాలపై చర్చించింది. సమావేశం అనంతరం బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఏపీల్లో స్టీలు ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత లేదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికిచ్చింది. తర్వాత ఓ ఏజెన్సీ ఏర్పాటు చేశాం. ఆ ఏజెన్సీ కూడా ముడిసరుకు ఐరన్ ఓర్లో నాణ్యత లేదని తేల్చింది. దీంతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాం. టాస్క్ఫోర్స్లో రాష్ట్రాల ప్రాతినిథ్యం ఉంది. డిసెంబర్లో చివరి భేటీ జరిగింది. 2 రాష్ట్రాలు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంబంధిత సమాచారం కోరాం. మెకాన్ అనే కన్సల్టెన్సీ సంస్థ సాంకేతిక నివేదిక ఇచ్చింది’ అని చెప్పారు తెలంగాణ నుంచి ప్రకటన.. ప్లాంట్లను ఏర్పాటు చేయబోమని తాము ఎక్కడా చెప్పలేదని బీరేంద్రసింగ్ అన్నారు. తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఒక కమిటీ ఏర్పాటు చేశామని, ఏ రకమైన సాయం చేస్తారో నెలరోజుల్లో ఒక నివేదిక ఇస్తామని తెలిపారు. ఆ నివేదిక వస్తే టాస్క్ఫోర్స్ పని పూర్తవుతుంది. తదుపరి మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. పాల్వంచలో ఒక పాత ప్లాంటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో త్వరలో దీన్నీ తెరుస్తాం. ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ప్లాంటు విషయంలో ఇదే ప్రక్రియ అమలవుతుంది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో సెయిల్ జేవీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది. ఆటోగ్రేడ్ స్టీలు తయారు చేసేందుకు విశాఖపట్నం సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ వారితో కూడా మాట్లాడాం. స్థలం ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. ఇంకా సమాచారం రావాల్సి ఉంది’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంటు పెడతామని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. ఏపీ ప్రభుత్వం తొందరపాటు రాజకీయం చేసిందని, అభివృద్ధి కోసం ముందుకు రావాలని ఆయన సూచించారు. -
ఉక్కు ఉత్పత్తిలో త్వరలో 2వ స్థానానికి భారత్
కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచంలో స్టీల్ ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ త్వరలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుందని కేంద్ర ఉక్కు వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ మంగళవారంనాడు ఇక్కడ తెలిపారు. తాను మంత్రిగా మూడేళ్లలో ఉక్కు శాఖ సాధించిన విషయాలను ఆయన వివరిస్తూ, ‘‘ప్రస్తుతం స్టీల్ రంగం గతంకన్నా ఎంతో పురోగతి సాధించింది. అప్పట్లో ఈ రంగంపై ఎంతో ఒత్తిడి ఉండేది. బ్యాంకింగ్, ఆర్బీఐకి తీవ్ర ఆందోళనకరమైనదిగా ఈ రంగం పనితీరు ఉండేది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మేము ఎన్నో చర్యలు తీసుకున్నాం’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 300 ఎంటీల లక్ష్యం...: 2030–31 సంవత్సరానికి 300 ఎంటీల ఉత్పత్తి లక్ష్యంగా కొత్త స్టీల్ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 2015లో అమెరికాను నాల్గవ స్థానానికి నెట్టి, భారత్ స్టీల్ ఉత్పత్తిలో మూడవ స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రస్తుతం స్టీల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండవ స్థానంలో జపాన్ ఉంది. గత ఏడాది భారత్ స్టీల్ ఉత్పత్తి 100 ఎంటీ (మిలియన్ మెట్రిక్ టన్నులు). జపాన్ విషయంలో ఈ పరిమాణం 104 ఎంటీలుగా ఉంది. చైనా ఉత్పత్తి దాదాపు 808 ఎంటీలయితే, అమెరికా విషయంలో దాదాపు 78 ఎంటీలుగా ఉంది. -
కేంద్ర మంత్రులతో దత్తాత్రేయ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బీరేంద్ర సింగ్ల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం దత్తాత్రేయ.. వీరిద్దరినీ కలసి తెలంగాణలో కరువు పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కోరారు. తాగునీరు, పశుగ్రాసానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు. కేంద్ర ప్రభుత్వం కరువు నిధులు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయలేదని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. 319 కోట్ల రూపాయల కరువు నిధులు ఖర్చు చేయలేదని వివరించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను కరువు ప్రాంతాల్లో యుద్ధప్రతిపాదకన నిధులు ఖర్చు చేయాలని, తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. -
స్వచ్ఛ సిరిసిల్లకు కేంద్రమంత్రి అభినందన
రాష్ట్రానికి సాయం చేస్తామన్న బీరేంద్ర సింగ్ కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: బహిర్భూమిలేని నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావును కేంద్ర తాగునీటి, పారిశుధ్య శాఖ మంత్రి బీరేంద్రసింగ్ అభినందించారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన ఆయన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా బీరేంద్ర మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ నినాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. సిరిసిల్ల స్ఫూర్తితో ఇతర ప్రాంతాలను కూడా బహిర్భూమిరహిత ప్రాంతాలుగా మార్చేందుకు ముందుకొస్తే ఎలాంటి పరిమితులు లేకుండా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే కృష్ణా, గోదావరి జీవనదుల నుంచి ప్రజలకు సురక్షిత తాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ను చేపట్డడం అభినందనీయమన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వివిధ పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా తెలంగాణకు తగినంత సాయం అందించేందుకు కృషిచేస్తానని బీరేంద్రసింగ్ హామీఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై ఆయన ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా గ్రామజ్యోతి, ఈ-పంచాయతీ, వాటర్గ్రిడ్, హరితహారం తదితర కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. -
కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ, వాటర్ గ్రిడ్ పథకాల అమలు తీరుపై చర్చించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని బీరేంద్రసింగ్ కేసీఆర్ కు హామీ ఇచ్చారు.