breaking news
Bipin Chandra Pal
-
కంఠెవరం బాంబు కేసు: రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య
1905లో బెంగాల్ విభజన సందర్భంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ దేశవ్యాప్తంగా పర్యటించి బ్రిటిష్వారి చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాజకీయ స్పృహను కలిగించారు. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేసినా ఆ విప్లవ జ్వాల దేశమంతా పాకింది. సర్కారు జిల్లాల నుంచి ఎందరో స్వాతంత్య్ర పోరాటం దిశగా ఆలోచన ఆరంభించారు. అందులో తెనాలి ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ జాతీయోద్యమం ఊపందుకోకముందే గ్రామీణుల్లో రగులుతున్న విప్లవాగ్నిని సూచించే కొన్ని సంఘటనలు జరిగాయి. 1909లో సంచలనం కలిగించిన కఠెవరం బాంబు కేసు అందులో ఒకటి. విజృంభణకు ప్రేరణ ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఉద్యమం విజృంభించిన రోజులవి. కొన్ని దేశాల్లో ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకుల హత్యలు సర్వసాధారణమయ్యాయి. రష్యా, ఇటలీ చక్రవర్తుల్ని హతమార్చారు. ఆస్ట్రియా మహారాణి దారుణహత్యకు గురైంది. అలాగే స్పెయిన్ ప్రధాని, ఫిన్లాండ్ గవర్నర్ జనరల్ కూడా హంతకుల చేతుల్లో బలయ్యారు. ఉత్తరాదిన ఉగ్రవాదం విజృంభణకు ఇదే ప్రేరణ. స్థానిక యువకులు అప్పట్లో తెనాలికి సమీపంలోని కంచర్లపాలెం, కఠెవరం గ్రామాలకు చెందిన సాహస యువకులు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య తమ మిత్రులను కొందరిని కలుపుకుని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఉగ్రవాదుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద నాయకులు అత్యంత రహస్యంగా కొందరు అనుచరులను ఇక్కడకు పంపి ఈ ముగ్గురికి బాంబుల తయారీలో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తయ్యాక చెన్నై– న్యూఢిల్లీ రైలు మార్గాన్ని కఠెవరం వద్ద పేల్చివేసేందుకు వీరు పథకం పన్నారు. కొబ్బరికాయ (టెంకాయ)లో పేలుడు పదార్థాలు కూర్చి 1909 ఏప్రిల్ 2న బాంబుల్ని సిద్ధం చేశారు. చెన్నైకు వెళుతున్న వైస్రాయ్ రైలును పేల్చివేయాలని, రైలు మార్గం ధ్వంసం చేయాలని నిర్ణయించారు. దీనికి ముందుగా బాంబులు పనిచేస్తున్నాయో? లేదో? పరీక్షించాలని భావించారు. ఏప్రిల్ 3న కఠెవరం–కంచర్లపాలెం మధ్యగల కట్టపై ఒక కొబ్బరికాయ బాంబును వుంచి వెళ్లారు. అనూహ్యంగా అక్కడ వున్న కొబ్బరికాయ(బాంబు) ను చెన్ను అనే పశువుల కాపరి చూశాడు. దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించడంతో బాంబుపేలింది. చెన్ను ఖండఖండాలు 70గజాల దూరంలో పడ్డాయి. ద్వీపాంతరవాస జీవిత ఖైదు తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును బ్రిటిష్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య, చుక్కపల్లి రామయ్యలను కుట్రదార్లుగా నిర్ధారించింది. ఏప్రిల్ 6న ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోర్టులో నిందితులు బసవయ్య, బ్రహ్మయ్య తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, పి.వి.శ్రీనివాస రావు, ఎ.లక్ష్మీ నరసింహం కేసు వాదించారు. చుక్కపల్లి రామయ్య న్యాయవాదిని తిరస్కరించారు. న్యాయస్థానం రామయ్యకు ద్వీపాంతరవాస జీవితఖైదు విధించింది. బసవయ్య, బ్రహ్మయ్యలకు పదేళ్ల వంతున శిక్ష విధించారు. ఈ ముగ్గురినీ అండమాన్ జైలులో వుంచారు. వీరు అక్కడే జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి (చదవండి: సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్) -
ముక్కుసూటి ఉక్కుమనిషి- బిపిన్ చంద్ర పాల్
బిపిన్ చంద్ర పాల్ గాంధీజీని విభేదించారు. అయితే ఆయన సాగించిన జాతీయోద్యమ పోరాటం గాంధీజీ లక్ష్యాలకు భిన్నమైనది మాత్రం కాదు. కాకపోతే గాంధీ మార్గాన్ని ఆయన నిస్పర్థగా అనుసరించలేకపోయారు. ఉద్యమాన్ని మతం, ఆధ్యాత్మికతలతో గాంధీజీ ముడిపెట్టడం ఉద్యమ శక్తిని పలుచన చేసి, దాన్నొక బలహీనతగా సామ్రాజ్యవాదికి చూపించే ప్రమాదం ఉందని పాల్ ఆందోళన చెందారు. ప్రతిఘటనకు పిడిగుద్దులు తప్ప సహాయ నిరాకరణ వంటి మధ్యేమార్గాలు ఉండకూడదన్నారు. అందుకే ఆయన ‘ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్’ గా ప్రఖ్యాతిగాంచారు. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్ భాగస్వామ్యం నిక్కచ్చిగా ఉండేది. సుప్రసిద్ధ తాత్విక చింతనాపరుడు శ్రీ అరబిందో ఆయన్ని మహాశక్తిమంతులైన జాతీయవాద ప్రవక్తలలో ఒకరిగా అభివర్ణించారు. అయితే పాల్ శక్తి ఆయన స్వభావంలో కాక, శాంతిని ప్రవచించే సైద్ధాంతిక ధోరణుల పట్ల అసహనంగా వ్యక్తం అయ్యేదని ఆయన వ్యతిరేకులు అనేవారు. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో 1905 నుండి 1918 వరకు బ్రిటిష్ ఇండియాలో జాతీయవాద త్రయంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన లాల్ బాల్ పాల్ (లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్) లలో ఒకరైన పాల్ తన ఇరవై ఎనిమిదవ యేట భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. తన జీవితకాలంలోని చివరి ఆరేళ్లు కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు. పాల్ స్థాపించిన జాతీయోద్యమ ఆంగ్ల వార్తాపత్రిక ‘బందే మాతరం’ ఆయన్ని ఆర్నెల్ల పాటు జైల్లో ఉంచింది. అందులో అరబిందో రాసిన ఒక వ్యాసానికి సంబంధించి వ్యతిరేకంగా సాక్షం ఇవ్వనందుకు బ్రిటిష్ పాలకులు పాల్కు విధించిన శిక్ష అది. బిపిన్ చంద్ర పాల్ హబీగంజ్లోని (ఇప్పటి బంగ్లాదేశ్లోని ప్రాంతం) సంపన్న హిందూ వైష్టవ కుటుంబంలో జన్మించారు. రాజా రామ్ మోహన్రాయ్ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’లో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఒక వితంతువును వివాహమాడారు. ప్రముఖ నాటక, సినీ రచయిత, దర్శకుడు, ‘బాంబే టాకీస్’ వ్యవస్థాపకులలో ఒకరైన నిరంజన్ పాల్ ఈయన కుమారుడే. గాంధీజీకి దూరం అయిన కొద్దిమంది ముక్కుసూటి ఉక్కుమనుషుల్లో పాల్ కూడా ఒకరు. విమర్శించవలసిన సందర్భంలో మృదువుగా మాట్లాడడం ఉద్యమస్ఫూర్తిగా విఘాతంగా పరిణమిస్తుందని పాల్ నమ్మారు. చివరి వరకు ఆ నమ్మకం మీదే ఆయన నిలబడ్డారు. -
గురు శిష్యులు ఒకే రోజు...
భారత స్వాతంత్య్ర సమరంలో నిరుపమాన పోరాటాలు చేసిన యోధులు బిపిన్ చంద్ర పాల్, టంగుటూరి ప్రకాశం పంతులు గురుశిష్యులలాంటివారు. వారిరువురూ మే 20వ తేదీనే అసువులు బాయడం కాకతాళీయమే! 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లాలోని వినోదరాయ పాలెంలో జన్మించిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. బారిస్టర్ కోర్సు చదవడం కోసం 1907లో ఇంగ్లండ్ వెళ్లారు. ఇండియా వచ్చి న్యాయవాదిగా మంచి పేరూ, డబ్బూ సంపాదించారు. ఆ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు యువత స్వాతంత్య్ర సమరంలో దూకుతుండేవారు. ప్రకాశం పంతులు పాల్ ఉపన్యాసాలు విని... వేల రూపాయల ఆదాయం ఇచ్చే న్యాయ వాద వృత్తిని వదిలి స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టారు. కొన్ని రోజులు ‘స్వరాజ్య’ పత్రిక నడిపారు. గాంధీజీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహిం చారు. 1921 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, ఉపఖండంలో అనేక ప్రాంతాలు సందర్శించారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు మరణిస్తే పోలీసు వాళ్ళు అక్కడికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రకాశం పంతులు అది చూసి చలించి పోలీసు వలయాలను ఛేదించుకొని అమర వీరుని దగ్గరికి వెళ్తూ చొక్కా గుండీలు తీసి తెల్లోడి తుపాకీ గుండుకు తన గుండెను చూపించి ఇక్కడ కాల్చమని సవాల్ విసిరారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన రాష్ట్ర ప్రజలు ‘ఆంధ్రకేసరి’ బిరుదునిచ్చారు.స్వాతంత్య్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1953–1954 మధ్య పని చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటిస్తూ... వడదెబ్బకు గురై హైదరాబాదులో హాస్పిటల్లో చేరి 1957 మే 20న తుది శ్వాస విడిచారు. జాతీయోద్యమంలో ప్రసిద్ధ ‘లాల్, బాల్, పాల్’ త్రయంలో బిపిన్ చంద్రపాల్ ఒకరు. అస్సాంలోని టీ తోటల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంతో బిపిన్ చంద్రపాల్ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. ‘వందేమాతరం’ ఉద్యమంలో భాగంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. మచిలీపట్నంలో ‘ఆంధ్ర జాతీయ కళాశాల’ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు, కృషి ఫలితంగానే స్థాపితమైంది. భారత అతివాద ఉద్యమకారుల్లో గ్రగామిగా ప్రసిద్ధి చెందిన బిపిన్ చంద్రపాల్ 1932 మే 20న మరణించారు. ప్రకాశం పంతులు, బిపిన్ చంద్రపాల్ల పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం. – కొమ్మాల సంధ్య, హన్మకొండ (మే 20న టంగుటూరి ప్రకాశం పంతులు, బిపిన్ చంద్రపాల్ల వర్ధంతి) -
జాతీయవాద ప్రవక్త
‘ఇంకో ప్రభుత్వం ఏర్పడకుండానే ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించాలని ఈ గాంధీ భజనబృందం కోరుకుంటోంది. లేదా మహాత్ముడు ప్రవచిస్తున్న పురోహిత తత్వం కలిగిన ఏకవ్యక్తి పాలన రావాలని అది ఆశిస్తోంది.’1919 తరువాత భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వం గాంధీజీ చేతికి వచ్చింది. ఆయనకు తొలినాళ్లలో పాతతరం నాయకత్వం నుంచి గొప్ప మద్దతు లభించిన దాఖలాలు కనిపించవు. పైగా తీవ్ర ప్రతిఘటన కూడా ఉండేది. గాంధీజీతో విభేదించినవారు సా«మాన్యులు కారు. వారికి చరిత్ర రచనలో తగిన స్థానం లభించకపోయినా, వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడలేము. అన్నింటికంటే గాంధీజీ కంటే ముందు ఈ దేశంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని నడిపినవారు వారే కదా! అలా గాంధీయుగం తొలినాళ్లలో ఆయన ఉద్యమ పంథాను, ఎత్తుగడలను విమర్శించిన వారిలో బిపిన్చంద్ర పాల్ (నవంబర్ 7,1858–మే 20,1932) ప్రసిద్ధులు. పైన ఉదహరించిన మాటలు ఒక సందర్భంలో పాల్ అన్నవే. ‘గాంధీ ఆరాధన’ను ఎద్దేవా చేసినవారిలో ఆయన ఒకరు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం (1905)లో కీలక పాత్ర వహించిన ‘లాల్, పాల్, బాల్’ త్రయంలో ఒకరు బిపిన్చంద్ర ‘పాల్’. ‘మహా శక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త’ అని పాల్ను అరవిందులు కీర్తించారు. పాల్ నమ్మిన జాతీయవాదం భారత స్వాతంత్య్రోద్యమంలో ఒక గొప్ప చారిత్రక భూమికను నిర్వహించి, అంతే గొప్ప సందర్భాన్ని సృష్టించింది. బెంగాల్ విభజనను వ్యతిరేకించే ఒక బలీయమైన శక్తిగా భారతీయ సమాజాన్ని ఆవిష్కరించడానికి జాతీయవాదమే ఆయనకు తోడ్పడింది. వీటిని విశ్వసించిన నాటి ఉద్యమం విజయం సాధించిన మాట వాస్తవం. స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి అన్ని అంశాలను ప్రజానీకానికి చేరువగా తీసుకు వెళ్లడానికి పాల్కు ఉపకరించిన ఆయుధం కూడా ఆ వాదమే. విదేశీ విద్య, అంటే ఆంగ్లం మనకి జ్ఞాపకశక్తిని ఇవ్వవచ్చు. కానీ, విద్య అనే వ్యవస్థ ఇవ్వవలసిన నైతిక ప్రమాణాలని అది ఇవ్వడం లేదు. సమాజం పట్ల పౌరులు చూపించవలసిన బాధ్యతని అది గుర్తు చేయడం లేదు. మనదైన సృజన అడుగంటి పోవడానికి కారణం కూడా విదేశీ విద్యే అని చాటినవారు పాల్. విదేశీ వస్తు బహిష్కరణలో ప్రధానంగా కనిపించేది మాంచెస్టర్ నుంచి వచ్చే వస్త్రాలు. వాటిని బహిష్కరిస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం తగ్గుతాయని ఊహించినవారు పాల్. అసలు సహాయ నిరాకరణ వంటి సున్నితమైన నిరసన కార్యక్రమాలతో వలస పాలకులను దిగి వచ్చేటట్టు చేయగలమని అనుకోవడమే పెద్ద భ్రమ అని పాల్ నమ్మారు. పాల్ను ఆధునిక భారతదేశంలో ‘విప్లవ భావాలకు పితామహుడు’ అనే అంటారు. ఈ విప్లవ ఆలోచనల పితామహుని రాజకీయ, సాంఘిక జీవితం అస్సాం టీ తోటలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడం దగ్గర మొదలైంది. 1880 ప్రాంతంలోనే ఆయన ప్రజాజీవితం అడుగులు వేయడం నేర్చుకుంది. భారత స్వాతంత్య్రోద్యమం తొలిదశలో కనిపించే సురేంద్రనాథ్ బెనర్జీ పాల్గారి రాజకీయ గురువు. మొదట పాల్ మీద కేశవచంద్ర సేన్ (బ్రహ్మ సమాజ్ నేత), శివనాథ్ శాస్త్రి, బీకే గోస్వామి వంటివారి ప్రభావం ఉండేది. పాల్ అఖండ వంగదేశంలోని పొయిల్ అనే చోట పుట్టారు (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లో ఉంది). తండ్రి రామచంద్రపాల్, తల్లి నారాయణీదేవి. తండ్రి పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. అయితే ఆ కుటుంబం జమీందారీ కుటుంబం. పాల్ను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చినప్పటికీ చదువు పూర్తి చేయలేదు. తరువాత కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా, మరి కొంతకాలం కలకత్తా పబ్లిక్ లైబ్రరీ అధికారిగా కూడా పనిచేశారు. బిపిన్చంద్ర పాల్ స్వాతంత్య్రోద్యమానికి చేసిన సేవ అంచనాలకు మించినది. వందేమాతరం నినాదాన్ని దేశమంతా తిరిగి వినిపించారాయన. ఈ దేశంలో గాంధీజీ కంటే ముందే నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన ఘనత బిపిన్పాల్కు కూడా దక్కుతుంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన భారత జాతికి సంకెళ్లు ఉన్నాయన్న సంగతినీ, ఈ పురాతన భూమి వలస పాలనలో మగ్గిపోతున్న కఠోర వాస్తవాన్నీ సాధారణ భారతీయుడికి అర్థమయ్యేటట్టు తెలియచెప్పినవారు పాల్. ఇందుకు బెంగాల్ విభజన సందర్భాన్ని పాల్ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అరబిందొ ఘోష్, రవీంద్రనాథ్ టాగోర్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, చిత్తరంజన్దాస్, అనీబిసెంట్ వంటి మహనీయులతో కలసి నడిచారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన మరుసటి సంవత్సరమే పాల్ ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1886 నాటి కలకత్తా సభలకీ, 1887 నాటి మద్రాస్ సభలకి కూడా ఆయన హాజరయ్యారు. భారతీయుల పట్ల ఎంతో వివక్షాపూరితంగా ఉన్న ఆయుధ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన మద్రాస్ సభల వేదిక మీద నుంచి పిలుపునిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. కాంగ్రెస్ తొలినాటి నాయకత్వం మితవాదులదే. కానీ వారి ధోరణి, పంథా జాతీయవాదులకి సరిపడేది కాదు. విన్నపాలతో వలసపాలకులు లొంగి వస్తారని అనుకోవడం అమాయకత్వమేనని అప్పటికే గట్టిగా విశ్వసించిన వారు లేకపోలేదు. మితవాదుల విన్నపాలు వ్యర్థమనీ, జాతీయవాదుల ఆలోచనలే సరైనవనీ భావించేందుకు వీలు కల్పించినదే బెంగాల్ విభజన. దీనితో బ్రిటిష్ జాతి పట్ల ఉన్న భ్రమల నుంచి చాలామంది బయటపడ్డారు. స్వరాజ్, స్వదేశీ, జాతీయ విద్య వంటివి ప్రజలను కదిలించాయి. ఇవే కొత్త ఉద్యమానికి బీజాలు వేశాయి. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మేరునగధీరుని వలే కనిపించే విప్లవనేత పాల్. బిపి¯Œ బాబు కలం ఎంతో పదునైనది. పత్రికా రచయితగా, గ్రంథకర్తగా ఆయన స్థానం అసాధారణమైనది. నేషనాలిటీ అండ్ ఎంపైర్, ఇండియన్ నేషనలిజం, స్వరాజ్ అండ్ ది ప్రజెంట్ సిట్యుయేషన్, ది సోల్ ఆఫ్ ఇండియా, ది బేసిస్ ఆఫ్ సోషల్ రిఫార్మ్, ది హిందూయిజం, ది న్యూ స్పిరిట్ ఆయన గ్రంథాలు. డెమోక్రాట్, ఇండిపెండెంట్ పత్రికలకు ఆయన సంపాదకుడు. పరిదర్శక్, న్యూ ఇండియా, వందేమాతరం, స్వరాజ్ పాల్ ప్రారంభించిన పత్రికలు. ట్రిబ్యూన్ (లాహోర్) పత్రికకు కొంతకాలం ఆయన సంపాదకుడు. బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్ పత్రిక సంపాదక మండలి సభ్యుడు. ఇవి కాకుండా మోడరన్ రివ్యూ, అమృతబజార్ పత్రిక, ది స్టేట్స్మన్ పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాస్తూ ఉండేవారు. వక్తగా బిపిన్ పాల్ అంటే వంద ప్రభంజనాలతో సమానం. ఆయన పలుకు విన్న ప్రాంతంలో చైతన్యం తొణికిసలాడింది. జాతీయ భావాల తుపాను వీచింది. బెంగాల్ విభజనను రద్దు చేయాలని కోరే ఒక సందేశాన్ని పట్టుకుని పాల్ దక్షిణ భారతదేశం వచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, బందరు, మద్రాస్లలో సభలు జరిగాయి. ఇవి కూడా చరిత్రాత్మక ఘట్టాలుగానే మిగిలాయి. రాజమండ్రి గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సభలోనే చిలకమర్తి లక్ష్మీనరసింహం నోటి నుంచి ‘భరతఖండమ్ము చక్కని పాడియావు’ అన్న పద్యం వచ్చింది. ముట్నూరి కృష్ణారావుగారు పాల్ గారిని ఆ ప్రదేశాలన్నీ తిప్పారు. రాజమండ్రి సభలో పాల్గారిని ఆయనే జనానికి పరిచయం చేశారు. నాడు పాల్ విశాఖ నుంచి రాజమండ్రి చేరుకోగానే ఆయన గౌరవార్థం జరిగిన స్వాగతోత్సవం చిరస్మరణీయమైనది. పాల్ అక్కడ అయిదారు ఉపన్యాసాలు ఇచ్చారు. అవి రాజమండ్రి సామాజిక, రాజకీయ వాతావరణాన్నే మార్చేశాయి. తెలిసిన వారు ఎదురైతే ‘వందేమాతరం’ అని పలకరించుకోవడం మొదలైంది. అందరి గుండెల మీద వందేమాతరం బ్యాడ్జీలు వెలిశాయి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ‘వందేమాతరం’ అని విద్యార్థులు నినదించినందుకు బహిష్కరణకు గురయ్యారు. నాడు అక్కడే ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు వారిలో ఒకరు. హరిసర్వోత్తమరావు కూడా పాల్గారి వెంట తిరుగుతూ సభలలో పాల్గొన్నారు. ఇది ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్కు రుచించలేదు. ఆనాటి సభలో పాల్గొన్న, వందేమాతరమని తరగతి గదులలో నినదించిన 111 మందిని కళాశాల నుంచి బహిష్కరించారు. కాకినాడలో కెంప్ అనే ఆంగ్ల వైద్యాధికారి ఎదుట కోపల్లె కృష్ణారావు అనే పాఠశాల విద్యార్థి అదే నినాదం పలికినందుకు చావు దెబ్బలు తిన్నాడు. కెంప్ నిత్య వ్యాయామం చేసే పహిల్వాన్. కృష్ణారావు బాలుడు. కెంప్ అతడిని స్పృహ పోయేటట్టు కొట్టడమే కాదు, అదే స్థితిలో ఉండగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్లో పడేసి వెళ్లిపోయాడు. కృష్ణారావు చనిపోయాడని పట్టణంలో వదంతి వ్యాపించింది. దీనికి ఆగ్రహించిన కాకినాడ వాసులు ఆంగ్లేయుల క్లబ్బును దగ్ధం చేశారు. కెంప్ రహస్యంగా పట్టణం విడిచి పారిపోయాడు. మద్రాస్ మెరీనా బీచ్లో ఏర్పాటు చేసిన పాల్ సభలకు అధ్యక్షత వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో టంగుటూరి ప్రకాశం ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఈ దేశంలో ఉన్నత వర్గాలు చేవ చచ్చి ఉన్నాయని, ఇక ప్రజా బాహుళ్యమే ఉద్యమించాలని పాల్ పిలుపునిచ్చారు. దేశమాతను దుర్గామాతగా దర్శించుకుంటున్న ఈ తరానిదే భవిష్యత్తు అంతానని పాల్ చేసిన ప్రసంగాలు సహజంగానే ప్రజలను ఆకట్టుకున్నాయి. 1907లో తిలక్ అరెస్టు తరువాత జాతీయవాదుల మీద బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగించింది. ఏదో విధంగా పాల్ను కటకటాల పాల్జేయాన్నదే బ్రిటిష్ జాతి ఆశయం. అదే సమయంలో అరవిందుల మీద దేశద్రోహం కేసు నమోదైంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వడానికి బిపిన్పాల్ నిరాకరించారు. దీనితో ఆయనకు ఆరు మాసాల జైలు శిక్ష పడింది. బెంగాల్ విభజన నేపథ్యంలో పాల్ వందేమాతరం పత్రిక నెలకొల్పారు. దీనికి అరవిందులు సంపాదకుడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత బిపిన్బాబు ఇంగ్లండ్ వెళ్లారు. కొన్ని అంశాల మీద తులనాత్మక అధ్యయనం చేయడం ఆయన ఉద్దేశం. అక్కడ ఉన్న మూడేళ్ల కాలంలో ఇండియా హౌస్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇండియా హౌస్ అంటే విదేశీ గడ్డ మీద నుంచి భారత స్వాతంత్య్ర సమరానికి సహకరిస్తున్న భారతీయ యువకుల అడ్డా. వీరంతా హింసాత్మక పంథాను స్వాగతించినవారే. అక్కడ ఉండగానే పాల్ స్వరాజ్ పత్రికను ప్రారంభించారు. కానీ ఇండియాలో 1909 కర్సన్ వైలీ హత్య జరిగింది. మదన్లాల్ థింగ్రా ఈ సాహసం చేశారు. కానీ దీని ప్రభావం ఇంగ్లండ్ నుంచి వెలువడుతున్న స్వరాజ్ పత్రిక మీద తీవ్రంగా పనిచేసింది. పత్రిక మూత పడింది. పాల్ ఆర్థికంగా చితికిపోయారు. కొద్దికాలం మనశ్శాంతి కోల్పోయారు. భారతదేశానికి వచ్చిన తరువాత కూడా ఆయన గాంధీజీ నాయకత్వాన్ని సమర్థించలేకపోయారు. నిజానికి గాంధీ నాయకత్వం వహించే నాటికి పాతతరం నాయకులు తక్కువే ఉన్నారు. వారు కూడా గాంధీ ఆకర్షణలో పడిపోయారు. కానీ పాల్ మాత్రం చివరికంటా తనదైన పంథాలోనే నడిచారు. బిపిన్పాల్ ఉద్యమ జీవితంలో చివరి అంకం నిండా ఏకాంతమే కనిపిస్తుంది. ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించారు. అది ఆయన ఉద్యమ జీవితాన్నే తెరమరుగయ్యేటట్టు చేసింది. 1921లో పాల్ గాంధీ మీద చేసిన విమర్శ అసాధారణమైనది. ‘మీరు మ్యాజిక్ చే శారు. కానీ నేను మీకు లాజిక్ను అందివ్వాలని అనుకున్నాను. ప్రజాసమూహాలు సంభ్రమాశ్చర్యాలలో తలమునకలైతే తర్కం (లాజిక్) రుచించదు. మీరు మంత్రించారు. నేను రుషిని కాను. కాబట్టి మంత్రం ఇవ్వలేను. సత్యమేమిటో నాకు తెలిసినప్పుడు నేను అర్థసత్యాలను పలకలేను. ప్రజలకి విశ్వాసాలనే గంతలు కట్టి నడిపించాలని నేను ఏనాడూ ప్రయత్నించలేదు.’ బిపిన్బాబు రెండు వివాహాల గురించి కూడా చెప్పుకోవాలి. 1881లో ఆయనకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. కానీ ఆమె అనతికాలంలోనే మరణించారు. తరువాత 1891లో మరొకరిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు నృత్యకాళీదేవి, వితంతువు. రెండు విషయాలను స్పష్టం చేయడానికి పాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి సంస్కరణ కోసం. రెండు వయో పరిమితి బిల్లుకు (బాల్య వివాహాలను నిషేధించినది) తన పూర్తి మద్దతు ఉందని చెప్పడం. కానీ వితంతువును వివాహం చేసుకున్నందుకు పాల్ తన కుటుంబానికి దూరమయ్యారు. బిపిన్బాబు ఆలోచనలలోనివే కాదు, అడుగులలో కనిపించినవీ విప్లవ భావాలే. - ∙డా. గోపరాజు నారాయణరావు -
పట్టువిడుపుల్లేని ప్రవక్త
సంక్షిప్తంగా : బిపిన్ చంద్ర పాల్ (నేడు జయంతి) గాంధీజీతో విభేదించడం అన్న మాట వచ్చినప్పుడు ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించడంగా కాక, ఆ సిద్ధాంతాలలోని సామరస్యక సుతిమెత్తని లక్షణాన్ని అంగీకరించలేకపోవడంగా ఎవరైనా అర్థంచేసుకోవాలి. అలాగే ఆయనను విభేదించిన వారిలోని స్వతంత్రభావాలను తొందరపడి ‘అతివాదం’ అనే వర్గీకరణలోకి చేర్చేముందు అది పూర్తిస్థాయి అతివాదమా లేక ఉమ్మడి లక్ష్యం వైపు సాగుతున్న వైయక్తిక మార్గమా అని జాగ్రత్తగా ఆలోచించాలి. బిపిన్ చంద్ర పాల్ గాంధీజీతో విభేదించారు. గాంధీజీకి దూరం అయిన కొద్దిమంది ముక్కుసూటి ఉక్కుమనుషుల్లో పాల్ కూడా ఒకరు. విమర్శించవలసిన సందర్భంలో మృదువుగా మాట్లాడడం లేదా మౌనం వహించడం ఉద్యమస్ఫూర్తిగా విఘాతంగా పరిణమిస్తుందని పాల్ నమ్మారు. అయితే ఆయన సాగించిన జాతీయోద్యమ పోరాటం గాంధీజీ లక్ష్యాలకు భిన్నమైనది మాత్రం కాదు. ప్రతిఘటనకు పిడిగుద్దులు తప్ప సహాయ నిరాకరణ వంటి మధ్యేమార్గాలు ఉండకూడదన్నారు. అందుకే ఆయన ‘ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్’ గా ప్రఖ్యాతిగాంచారు. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్ భాగస్వామ్యం నిక్కచ్చిగా ఉండేది. సుప్రసిద్ధ తాత్విక చింతనాపరుడు శ్రీ అరబిందో ఆయన్ని మహాశక్తివంతులైన జాతీయవాద ప్రవక్తలలో ఒకరిగా అభివర్ణించారు. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో 1905 నుండి 1918 వరకు బ్రిటిష్ ఇండియాలో జాతీయవాద త్రయంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన లాల్ బాల్ పాల్ లలో ఒకరే బిపిన్ చంద్ర పాల్. ఆయన స్థాపించిన జాతీయోద్యమ ఆంగ్ల వార్తాపత్రిక ‘బందే మాతరం’ ఆయన్ని ఆర్నెల్ల పాటు జైల్లో ఉంచింది. అందులో అరబిందో రాసిన ఒక వ్యాసానికి సంబంధించి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందుకు బ్రిటిష్ పాలకులు పాల్కు విధించిన శిక్ష అది. బిపిన్ చంద్ర పాల్ 1858 నవంబర్ 7న హబీగంజ్లోని (ఇప్పటి బంగ్లాదేశ్లోని ప్రాంతం) సంపన్న హిందూ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. కలకత్తాలోని చర్చి మిషన్ సొసైటీ కాలేజీలో చదివారు. అక్కడే కొన్నాళ్లు అధ్యాపకునిగా పనిచేశారు. రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’లో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఒక వితంతువును వివాహమాడారు. ప్రముఖ నాటక, సినీ రచయిత, దర్శకుడు, ‘బాంబే టాకీస్’ వ్యవస్థాపకులలో ఒకరైన నిరంజన్ పాల్ ఈయన కుమారుడే.